బీజేపీ తన రాజకీయ ఆధిపత్యాన్ని నిలుపుకోవాలంటే ప్రచార వ్యూహాలకంటే పాలనా ఫలితాలపై దృష్టి పెట్టాలి. ధరల నియంత్రణ, ఉపాధి సృష్టి, విద్యా, వైద్య రంగాల బలోపేతం, విమాన ప్రయాణాన్ని సామాన్యులకు అందుబాటులోకి తేవడం, యువతలో నమ్మకాన్ని పెంచడం వంటి అంశాలపై స్పష్టమైన కార్యాచరణ అవసరం.
ప్రజలు కోరుతున్న మార్పును గుర్తించడం నాయకత్వ లక్షణం. రాజకీయంగా ఎంత బలమైన పార్టీ అయినా, ప్రజా తీర్పునకు అతీతం కాదు. బీజేపీకిప్పుడు పార్టీ విస్తరణే కాదు. ఆత్మపరిశీలన, ప్రజలతో మమేకం, సమస్యలపై స్పందన, ఫలితాలను అందించే పాలన. సవాళ్లను ఎదుర్కొని, తప్పులను అంగీకరించి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మారగలిగే లక్షణాలు. ఏ రాజకీయ పార్టీకైనా దీర్ఘకాలిక ప్రజాదరణ సాధ్యమవుతుంది.
అధికారంలో ఉండటం ఎంత ముఖ్యమో, ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకోవడం అంతకంటే ముఖ్యం. సవాళ్లను స్వీకరించకుండా, సమస్యలకు పరిష్కారాలు చూపకుండా ఎల్లకాలం పాలన సాగించడం అసాధ్యం. భారతీయ జనతా పార్టీ గత పన్నెండేళ్లలో దేశ రాజకీయాల్లో అపూర్వమైన ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. అయితే, 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలు ఒక ముఖ్యమైన హెచ్చరికను ఇచ్చాయి. 543 స్థానాలున్న లోక్సభలో బీజేపీ 240 స్థానాలకే పరిమితమై, సొంతంగా మెజారిటీకి దూరమైంది. మిత్రపక్షాల సహకారంతోనే మూడోసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఈ ఫలితాన్ని కేవలం ఎన్నికల లెక్కగా కాకుండా, ప్రజా తీర్పు సందేశంగా చూడాల్సిన అవసరం ఉంది.
మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాల విషయంలోనూ ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలి. మహిళలకు లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించే ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ 2023లోనే పార్లమెంట్ ఆమోదం పొందింది. అయితే ఇది రాజ్యాంగం ప్రకారం జనగణన, డీలిమిటేషన్ ప్రక్రియల అనంతరం అమల్లోకి రావాల్సి ఉంది. అందువల్ల ఇప్పటికే చట్టబద్ధమైన అంశాన్ని పదేపదే రాజకీయ ప్రచార అంశంగా ప్రస్తావించడం కంటే, అది ఎప్పుడు, ఎలా అమలవుతుందో ప్రజలకు స్పష్టత ఇవ్వడం అవసరం. డీలిమిటేషన్ విషయంలోనూ దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలు, జనాభా నియంత్రణలో సాధించిన విజయాలు, సమాఖ్య స్ఫూర్తి, సమతౌల్యం వంటి అంశాలపై విస్తృత చర్చ జరగాలి.
బీజేపీ సంస్థాగతం మార్పులు చేపట్టింది. కొత్త కార్యవర్గం ఏర్పాటు, కొత్త నాయకులకు బాధ్యతలు అప్పగించింది. ఇతర పార్టీల నుంచి చేరికలు వంటివన్నీ పార్టీని మరింత బలోపేతంగా విస్తరించాలనే వ్యూహంలో భాగమే. కానీ, సంస్థాగత బలం ఒక్కటే ప్రజాదరణకు సరిపోదు. ఎన్నికల యంత్రాంగం ఎంత బలంగా ఉన్నా, ప్రజల రోజువారీ జీవితంలో ఎదురవుతున్న సమస్యలకు సమాధానాలు ఇవ్వలేకపోతే ఆ బలం క్రమంగా రాజకీయంగా దిగజారే ప్రమాదం ఉంది.
దేశంలో మౌలిక వసతుల అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వాన్ని తక్కువ అంచనా వేయలేం. రహదారులు, రైల్వేలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, విద్యుత్ కనెక్టివిటీ వంటి రంగాల్లో గణనీయమైన విస్తరణ జరిగింది. జాతీయ రహదారుల నెట్వర్క్ కూడా 2014లో 91వేల కిలోమీటర్ల నుంచి ఇటీవలి సంవత్సరాల్లో 1.46 లక్షల కిలోమీటర్లకు పైగా పెరిగింది. రైల్వే విద్యుదీకరణ, వందే భారత్ రైళ్లు, స్టేషన్ల ఆధునీకరణ వంటి కార్యక్రమాలు కూడా మౌలిక రంగంలో మార్పును చూపిస్తున్నాయి.
అయితే, అభివృద్ధి ఫలాలు ప్రజల జీవన ప్రమాణాల్లో ఎంత మేరకు ప్రతిఫలించాయన్నదే అసలు ప్రశ్న. విద్య, వైద్యం, ఉపాధి, ధరల పెరుగుదల వంటి అంశాలు సామాన్యుడి ఆందోళనలకు కేంద్రంగా ఉన్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఉన్నత విద్యలో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో లేదు. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, కుటుంబాలపై పెరుగుతున్న వైద్య ఖర్చులను తగ్గించాల్సిన అవసరం ఉంది.
యువత పరిస్థితి మరింత సున్నితమైంది. దేశం జనాభాలో 15–29 ఏళ్ల వయసు గల యువత గణనీయంగా పెరిగింది. ఉద్యోగం, నైపుణ్యాభివృద్ధి, నాణ్యమైన విద్య, పోటీ పరీక్షల్లో పారదర్శకత, స్టార్టప్ అవకాశాలు, పరిశోధన ఇవన్నీ వారి భవిష్యత్తును నిర్ణయించే అంశాలు. యువతలో ఉద్భవించే ప్రతి నిరసనను ప్రత్యర్థి పార్టీల కుట్రగా కొట్టిపారేయడం సమస్యకు పరిష్కారం కాదు. వారు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? వారి ఆశలు ఏమిటి? పాలనపై వారి అసంతృప్తి ఎందుకు? ఎక్కడ ఉంది? ప్రభుత్వం సమాధానాలు వెతకాలి.
బీజేపీకి భారీ కార్యకర్తల బలం, విస్తృత సంస్థాగత నిర్మాణం, ఎన్నికల నిర్వహణలో అనుభవం ఉన్న మాట వాస్తవమే. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీలలో ఒకటిగా ఎదిగిన బీజేపీని ప్రత్యర్థులు తేలికగా ఎదుర్కోలేరు. కానీ, 2024 ఫలితాలు ఒక విషయాన్ని గుర్తుచేశాయి. ప్రత్యర్థులను బలహీనపరచడం కంటే ప్రజల విశ్వాసాన్ని పొందుతూ సొంతంగా బలపడటం శాశ్వత రాజకీయ విజయానికి కీలకం.
అధికార కేంద్రీకరణపై కూడా ఆత్మపరిశీలన అవసరం. ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పార్టీ పదవుల విషయంలో అగ్ర నాయకత్వం ప్రభావం పెరగడం సహజమే అయినప్పటికీ, పార్టీలో అంతర్గత చర్చ, భిన్నాభిప్రాయాలకు స్థానం, నాయకత్వ వికేంద్రీకరణ పార్టీ మనుగడకి అవసరం. మిత్రపక్షాల విషయంలోనూ అదే వర్తిస్తుంది. బలమైన ప్రభుత్వం అంటే ప్రశ్నించేవారు లేకుండా ఉండే ప్రభుత్వం కాదు. ప్రశ్నలను స్వీకరించి, సమాధానాలు ఇచ్చే ప్రభుత్వం.
బీజేపీ తన రాజకీయ ఆధిపత్యాన్ని నిలుపుకోవాలంటే ప్రచార వ్యూహాలకంటే పాలనా ఫలితాలపై దృష్టి పెట్టాలి. ధరల నియంత్రణ, ఉపాధి సృష్టి, విద్యా, వైద్య రంగాల బలోపేతం, విమాన ప్రయాణాన్ని సామాన్యులకు అందుబాటులోకి తేవడం, యువతలో నమ్మకాన్ని పెంచడం వంటి అంశాలపై స్పష్టమైన కార్యాచరణ అవసరం.
ప్రజలు కోరుతున్న మార్పును గుర్తించడం నాయకత్వ లక్షణం. రాజకీయంగా ఎంత బలమైన పార్టీ అయినా, ప్రజా తీర్పునకు అతీతం కాదు. బీజేపీకిప్పుడు పార్టీ విస్తరణే కాదు. ఆత్మపరిశీలన, ప్రజలతో మమేకం, సమస్యలపై స్పందన, ఫలితాలను అందించే పాలన. సవాళ్లను ఎదుర్కొని, తప్పులను అంగీకరించి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మారగలిగే లక్షణాలు. ఏ రాజకీయ పార్టీకైనా దీర్ఘకాలిక ప్రజాదరణ సాధ్యమవుతుంది.

