సీఎం రేవంత్ వర్సెస్ కొండా కుటుంబం!|CM|KONDA SUSMITHA
ఒకవైపు జెన్ జీ వాళ్లకు టిక్కెట్లు ఇవ్వాలి అంటావ్
మరోవైపు డైపర్లు వేసుకొని తిరుగుతున్న రేవూరి ప్రకాశ్ రెడ్డికి టికెట్ ఇస్తా అంటావ్
– మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇటీవల పరకాలలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో రేవూరి ప్రకాశ్ రెడ్డి మళ్లీ పోటీ చేస్తారని ప్రకటించి, ఆయనను ఆశీర్వదించాలని కోరారు. ఈ ప్రకటన కొండా కుటుంబానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది.
కళ్ళు నెత్తికెక్కాయంటూ ఘాటు విమర్శలు
మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల సందర్భంగా పరకాలలో కొండా సుస్మిత భారీ కాన్వాయ్తో బలప్రదర్శన నిర్వహించారు. ఈ వేదికపై ఆమె మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఐదారు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవడానికి తన తండ్రి కొండా మురళి ఎంతో శ్రమించారని గుర్తు చేశారు. అధికారం చేపట్టి ముఖ్యమంత్రి కాగానే రేవంత్ రెడ్డికి కొండా మురళి కష్టాలు కనిపించడం లేదని, ఆయన కళ్ళు నెత్తికెక్కాయని తీవ్ర పదజాలంతో విమర్శించారు.
స్కాములు బయటపెడతానని హెచ్చరిక
రేవంత్.. నన్ను గెలికితే మీ అన్నదమ్ముల స్కాములు అన్నీ బయటపెడతా
ఈరోజు నీ తమ్ముడి 200 కోట్ల భూ కుంభకోణం గురించి మాత్రమే మాట్లాడాను.. నాకు కౌంటర్ ఇస్తే మీ స్కాములు అన్నీ బయటపెడతా
డైపర్లు వేసుకుని నడవలేని స్థితిలో ఉన్న 80 ఏళ్ల వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తాననడం హాస్యాస్పదం
తన వ్యాఖ్యలపై ఎవరైనా ఎదురుదాడి లేదా కౌంటర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తే సహించేది లేదని సుస్మిత హెచ్చరించారు. ఇప్పటివరకు రేవంత్ రెడ్డి సోదరుడికి సంబంధించిన ₹200 కోట్ల భూ కుంభకోణం గురించే మాట్లాడానని, అనవసరంగా స్పందిస్తే సీఎం సోదరుల మిగతా అక్రమాలు, స్కాములన్నింటినీ ఆధారాలతో సహా ప్రజల ముందు పెడతానని హెచ్చరించారు.
పరకాల గడ్డ మా అడ్డా – రాజీనామా సవాల్
రేవంత్ రెడ్డి నువ్వొచ్చినా, నీ అయ్యొచ్చినా, నీ తాతొచ్చినా పరకాల ఎమ్మెల్యేను నేనే
కచ్చితంగా నేనే నిల్చుంటా.. నేనే గెలుస్తా అర్థమైందా
రేవూరి ప్రకాశ్ రెడ్డిని ఇప్పుడు రాజీనామా చేయించి నువ్వు ప్రచారం చేయి రేవంత్ రెడ్డి
నేను ఇండిపెండెంట్గా నిల్చుంటా.. నీ మీద నేను గెలుస్తా – కొండా సుస్మిత
పరకాల నియోజకవర్గం కొండా కుటుంబానికి కంచుకోట అని సుస్మిత స్పష్టం చేశారు. రేవూరి ప్రకాశ్ రెడ్డి ఎవరో పరకాల ప్రజలకు తెలియదని, గత ఎన్నికల్లో కొండా మురళి అండదండలతో ప్రచారం చేయడం వల్లే ఆయన విజయం సాధించారని పేర్కొన్నారు. ఇంకా ఎన్నికలకు రెండేళ్లకు పైగా సమయం ఉండగానే, రేవూరి అభ్యర్థిత్వాన్ని ఇప్పుడే ప్రకటించడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
దమ్ముంటే రేవూరి ప్రకాశ్ రెడ్డి తక్షణమే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని సుస్మిత సవాల్ విసిరారు. వంచనగిరిలోని తమ ఇంట్లోనే ఉండి రేవంత్ రెడ్డి స్వయంగా రేవూరి కోసం ప్రచారం చేయాలని, అప్పుడు ప్రజలు ఎవరి వైపు ఉన్నారో తేలిపోతుందని తేల్చిచెప్పారు.
ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు
రేవంత్ రెడ్డి నీతో పాటు ఉన్న పొంగు ఎక్కువ సేపు పొంగదు
నువ్వు ముఖ్యమంత్రివా లేదా ఆయన ముఖ్యమంత్రో తెలియడం లేదు
మొన్న హైదరాబాద్లో ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంటే ముఖ్యమంత్రి ఫోటో, రేవంత్ రెడ్డి ఫోటో వేసుకున్నారు కానీ అక్కడ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోటో వేయలేదు
బీసీలు అంటే అంత చులకననా మీకు
మా అమ్మ సహాయంతోనే రేవంత్ రెడ్డి ఆనాడు పీసీసీ అధ్యక్షుడు అయ్యాడు
నువ్వు పీసీసీ ప్రెసిడెంట్ కావాలని మొదట కోరుకున్నది కొండా సురేఖ అవునా? కాదా? సమాధానం చెప్పు రేవంత్ రెడ్డి
పీసీసీ అధ్యక్షుడు అయ్యాక మా ఇంటికి వచ్చి, మనకు 36 సీట్లు వచ్చినా నీకు ఎమ్మెల్సీ ఇస్తాను అని మా నాన్నకు చెప్పలేదా?
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే నీకు కళ్ళు నెత్తికి ఎక్కినయా
మా దయతోనే రేవూరి ప్రకాష్ రెడ్డి పరకాలలో గెలిచాడు
ఆరోజు నీకు సహాయం చేసిన మా నాన్న ఈరోజు నీకు కనిపించడంలేదా?
రెండేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల గురించి ఎందుకు..రేవూరి ప్రకాష్ రెడ్డిని ఇప్పుడే రాజీనామా చేయమను
రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేసినా రేవూరి ప్రకాష్ రెడ్డి గెలవడు
– కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత
ప్రభుత్వంలో వేం నరేందర్ రెడ్డికి సలహాదారు పదవి ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ, గత మూడేళ్లలో ఆయన ఎలాంటి విలువైన సలహాలు ఇచ్చారో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. తన తల్లిదండ్రులు కొండా సురేఖ, కొండా మురళి సౌమ్యులు కాబట్టే సంయమనం పాటిస్తున్నారని, కానీ తాను ఎవరికీ భయపడేది లేదని కుండబద్దలు కొట్టారు. స్వంత పార్టీకి చెందిన మంత్రి కుమార్తె నుంచే ముఖ్యమంత్రిపై ఇంతటి తీవ్ర విమర్శలు, హెచ్చరికలు రావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
పదేండ్లు సీఎంగా ఉంటానని రేవంత్ స్టేట్మెంట్పై ఆమె ఘాటుగా స్పందించారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి కూడా అలా చెప్పుకోలేదని పేర్కొన్నారు. కొడంగల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయావ్. ఆ విషయం మరిచిపోవద్దని సూచించారు. కాంగ్రెస్ పార్టీకి సీతాదయాకర్ ఏమి చేశారని, ఆమె ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. హైదరాబాద్ ఇండ్ల పంపిణీలో బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫొటోను ఎందుకు పెట్టలేదని, బీసీలు అంటే అంత చులకనా? అంటూ నిలదీశారు. బీసీలకు అన్యాయం జరుగుతుంటే పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ బీసీగా ఉండి ఏం చేస్తున్నారని, కొండా మురళీకి ఎందుకు పదవులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ అనేది బయపెట్టాలని డిమాండ్ చేశారు.

