ఉపాధి హామీ పథకం విజయాన్ని పనిదినాల సంఖ్యతో కాకుండా, గ్రామాల్లో ఏర్పడిన శాశ్వత ఆస్తులతో కొలవాలి. చెరువులు నిండాలి. భూగర్భ జలాలు పెరగాలి. సాగునీరు అందాలి. ప్రతి కుటుంబానికి ఉపాధితో పాటు స్థిరమైన జీవనోపాధి లభించాలి. అప్పుడే ఉపాధి హామీ పథకం ఖర్చు చేసిన ప్రతి రూపాయి దేశ నిర్మాణానికి పెట్టుబడిగా మారుతుంది. గ్రామీణాభివృద్ధి అంటే కేవలం కూలి చెల్లించడం కాదు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడే సంపదను సృష్టించడం. అదే కొత్త ఉపాధి విధానానికి అసలైన లక్ష్యంగా మారితేనే గ్రామాలకు నిజమైన మహర్దశ.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
గ్రామీణ భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక అయితే, ఉపాధి హామీ పథకం ఆ వెన్నెముకకు బలం. గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించడం, వలసలను అరికట్టడం, గ్రామాల్లో శాశ్వత ఆస్తులను సృష్టించడం అనే మూడు ప్రధాన లక్ష్యాలతో 2006లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) అమల్లోకి వచ్చింది. రెండు దశాబ్దాలుగా కోట్లాది గ్రామీణ కుటుంబాలకు ఈ పథకం అండగా నిలిచింది. అయితే కాలానుగుణంగా గ్రామీణ అవసరాలు మారుతున్నాయి. వాతావరణ మార్పులు, నీటి కొరత, వ్యవసాయ సంక్షోభం, కూలీల లభ్యత వంటి కొత్త సవాళ్ల నేపథ్యంలో ఉపాధి పథకం లక్ష్యాలు కూడా మారాల్సిన అవసరం ఏర్పడింది. నిజానికి ఈ పథకం పేరు మార్చడం కంటే లక్ష్యాలను మార్చడమే గ్రామాలకు నిజమైన మహర్దశను తీసుకొస్తుంది.
కేంద్ర ప్రభుత్వం ఈ పథకంలో పలు మార్పులు తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. పనిదినాలను 100 నుంచి 125 రోజులకు పెంచడం, వేతనాలను 15 రోజుల్లోగా చెల్లించడం, ఆలస్యమైతే పరిహారం ఇవ్వడం, పనుల్లో పారదర్శకత పెంచేందుకు సామాజిక తనిఖీలను బలోపేతం చేయడం వంటి ప్రతిపాదనలు స్వాగతించదగినవే. గతంలో నెలల తరబడి వేతనాలు అందక కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు అనేకం. సమయానికి వేతనాలు చెల్లించడం కూలీలకు భరోసాను కల్పిస్తుంది. అయితే ఈ మార్పులతోనే గ్రామీణాభివృద్ధి సాధ్యమవుతుందని భావించడం పొరపాటు.
దేశంలో ఎంజీఎన్ఆర్ఈజీఏ కింద ప్రతి ఏడాది కోట్లాది కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. 2024–25 ఆర్థిక ఏడాదిలో 7 కోట్ల కుటుంబాలు ఈ పథకం ద్వారా ఉపాధి పొందగా, 250 కోట్లకు పైగా పనిదినాలు నమోదయ్యాయి. కేంద్ర బడ్జెట్లో ఈ పథకానికి రూ.86 వేల కోట్లకు పైగా కేటాయింపులు కొనసాగుతున్నాయి. ఇంత భారీ ప్రజాధనం వెచ్చిస్తున్నప్పటికీ గ్రామాల్లో నీటి వనరులు, భూగర్భ జలాల పెరుగుదల, శాశ్వత మౌలిక వసతుల కల్పనలో ఆశించిన స్థాయి ఫలితాలు కనిపించడం లేదు. దీనిపై సమగ్ర సమీక్ష అవసరం.
ప్రస్తుతం వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అనేక ప్రాంతాల్లో వ్యవసాయ కూలీల కొరత రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. మరోవైపు వర్షపాతం అనిశ్చితంగా మారుతోంది. భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నైరుతి రుతుపవనాల ప్రారంభ దశలో పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతోంది. వర్షాలు ఆలస్యమవడం వల్ల సాగు షెడ్యూల్లు మారుతున్నాయి. నీటి అవసరాలు పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధి పథకం వ్యవసాయానికి తోడ్పడే విధంగా రూపాంతరం చెందాల్సిన అవసరం ఉంది.
చెరువుల పునరుద్ధరణ, కాలువల పూడికతీత, చెక్డ్యాంల నిర్మాణం, వాననీటి సంరక్షణ, భూగర్భ జలాల రీఛార్జ్, పచ్చదనం విస్తరణ, పాడుబడిన భూముల అభివృద్ధి, గ్రామ అటవీ సంపద పెంపకం వంటి పనులను ఉపాధి పథకానికి కేంద్రబిందువుగా మార్చాలి. ఈ పనులు ఒకవైపు కూలీలకు ఉపాధి కల్పిస్తే, మరోవైపు వ్యవసాయ ఉత్పాదకతను పెంచి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. శాశ్వత ఆస్తుల సృష్టి ద్వారానే ప్రభుత్వ వ్యయం దీర్ఘకాలిక ప్రయోజనాన్ని అందిస్తుంది.
పర్యావరణ మార్పులు కూడా ఉపాధి పథకానికి కొత్త దిశను సూచిస్తున్నాయి. ఉష్ణోగ్రతల పెరుగుదల, భూగర్భ జలాల క్షీణత, అడవుల తగ్గుదల, వర్షాల అస్థిరత గ్రామీణ జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి గ్రామంలో నీటి సంరక్షణ నిర్మాణాలు, విస్తృత మొక్కల పెంపకం, మట్టి సంరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణ కార్యక్రమాలను ఉపాధి పథకంతో అనుసంధానించాలి. ఇది భవిష్యత్ తరాలకు కూడా పెట్టుబడిగా నిలుస్తుంది.
అదేవిధంగా వ్యవసాయంలో కూలీల కొరత సమస్యను కూడా ప్రభుత్వం విస్మరించకూడదు. పంటల సాగు, కోతల సమయంలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఉపాధి పనుల షెడ్యూల్ను రూపొందిస్తే రైతులకు, కూలీలకు రెండింటికీ ప్రయోజనం కలుగుతుంది. వ్యవసాయానికి ఆటంకం కలగకుండా, వ్యవసాయానికే తోడ్పడే పనులకే ప్రాధాన్యం ఇవ్వాలి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలకు మరింత స్వేచ్ఛ కల్పించాల్సిన అవసరం ఉంది.
ఈ పథకం మార్పులపై కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. నిధుల భాగస్వామ్యం, పనుల ఎంపిక, అమలు విధానం వంటి అంశాల్లో రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం సమాఖ్య స్ఫూర్తికి అనుగుణం. గ్రామాల అవసరాలు రాష్ట్రానికొకలా, ప్రాంతానికొకలా ఉంటాయి. అందుకే స్థానిక అవసరాలకు అనుగుణంగా పనులను ఎంపిక చేసే వెసులుబాటు తప్పనిసరి.
ఉపాధి హామీ పథకం విజయాన్ని పనిదినాల సంఖ్యతో కాదు, గ్రామాల్లో ఏర్పడిన శాశ్వత ఆస్తులతో కొలవాలి. ప్రతి చెరువు నిండాలి. ప్రతి గ్రామంలో భూగర్భ జలాలు పెరగాలి. ప్రతి ఎకరాకు సాగునీరు అందాలి. ప్రతి కుటుంబానికి ఉపాధితో పాటు స్థిరమైన జీవనోపాధి లభించాలి. అప్పుడు మాత్రమే ఉపాధి పథకం ఖర్చు చేసిన ప్రతి రూపాయి దేశ నిర్మాణానికి పెట్టుబడిగా మారుతుంది. గ్రామీణాభివృద్ధి అంటే కేవలం కూలి చెల్లించడం కాదు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడే సంపదను సృష్టించడం. అదే కొత్త ఉపాధి విధానానికి అసలైన లక్ష్యంగా మారితేనే గ్రామాలకు నిజమైన మహర్దశ దక్కుతుంది.

