జెన్జీతో పాటు ప్రతి ఓటరు ఇప్పుడు తన ఎంపీ పనితీరును ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. ఎన్ని ప్రశ్నలు అడిగారు? ఎన్ని చర్చల్లో పాల్గొన్నారు? ప్రజా సమస్యలను ఎన్నిసార్లు లేవనెత్తారు? సభ స్తంభించినప్పుడు వారి వైఖరి ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానాలు కోరాలి. పార్లమెంట్ రాజకీయ బలప్రదర్శనకు వేదికగా కాకుండా ప్రజా సమస్యలకు పరిష్కార వేదికగా జరిగినప్పుడే ప్రజాస్వామ్య గౌరవం నిలుస్తుంది. లేదంటే సభా భవనం పవిత్రంగా ఉన్నా, అందులో జరిగే వ్యవహారాలు మాత్రం ప్రజల విశ్వాసాన్ని అపవిత్రం చేస్తూనే ఉంటాయి.
డా.మార్గం-అడుగు, ఎడిటోరియల్
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రాజకీయ రణరంగంగా మారడం దురదృష్టకరం. దేవాలయంగా భావించే పార్లమెంట్లో అధికార, ప్రతిపక్షాలు పరస్పరం నిందారోపణలతో 19 రోజుల విలువైన సమయాన్ని వృథా చేశాయి. ప్రజలు ఎంతో నమ్మకంతో ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు తమ బాధ్యతను విస్మరించి, నినాదాలు, నిరసనలు, వాయిదాలతో కాలం వృథా చేయడం అత్యంత దారుణం.
2026 వర్షాకాల సమావేశాలు జూలై 20 నుంచి ఆగస్టు 13 వరకు 25 రోజుల వ్యవధిలో 19 సిట్టింగ్లతో నిర్వహించేందుకు నిర్ణయించారు. కానీ నిరంతర అంతరాయాల కారణంగా లోక్సభ పనితనం కేవలం 19 శాతానికి, రాజ్యసభది 39 శాతానికి పరిమితమైంది. ప్రశ్నోత్తరాల సమయం పరిస్థితి మరింత దారుణం. లోక్సభలో అది కేవలం 1 శాతం, రాజ్యసభలో 12 శాతం మాత్రమే పనిచేసింది. ఇంత తక్కువ స్థాయిలో సభా కార్యకలాపాలు సాగడం పార్లమెంటరీ చరిత్రలోనే అత్యంత ఆందోళనకరం.
ఈ వైఫల్యానికి బాధ్యత ఎవరిది? అధికార పక్షానిదా? ప్రతిపక్షానిదా? సమాధానం సుస్పష్టం. ఇద్దరిదీ. ప్రతిపక్షాలకు ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ఉంది. ప్రజా సమస్యలను బలంగా ప్రస్తావించే బాధ్యత ఉంది. ప్రభుత్వం సమాధానం చెప్పేలా ఒత్తిడి చేయడం కూడా అవసరమైన ప్రక్రియే. కానీ వెల్లోకి దూసుకెళ్లడం, నినాదాలతో సభను స్తంభింపజేయడం, చర్చకు అవకాశమే లేకుండా చేయడం పార్లమెంటరీ నిరసనకు ప్రత్యామ్నాయం కాదు. అదే సమయంలో ప్రతిపక్షం ఆందోళన చేస్తోందనే కారణంతో అధికార పక్షం కూడా ప్రతిగా నినాదాలు చేయడం, రాజకీయ ప్రత్యారోపణలకు సభను వేదికగా మార్చడం బాధ్యతాయుతమైన పాలనకు నిదర్శనం కాదు.
విద్యార్థుల ఆందోళన, పోలీసుల చర్యలపై చర్చ జరగాలన్న ప్రతిపక్ష డిమాండ్ ఈ సమావేశాలకు ప్రధాన అడ్డంకిగా మారింది. చివరకు ఆ అంశంపై సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ప్రతిపక్షాలు స్పీకర్కు లేఖ ఇస్తే ప్రశ్నలకు సమాధానమిస్తానని, చర్చలో పాల్గొంటానని ఆయన వెల్లడించారు. అయితే ప్రతిపక్షం ఆయన ప్రసంగాన్ని ‘లెక్చర్’గా అభివర్ణిస్తూ తిరస్కరించింది. ప్రభుత్వం చెప్పేది వినకుండా, తమ ప్రశ్నలకు సమాధానాలు కోరడం ఎలా సాధ్యం? చర్చ కోరినప్పుడు చర్చకు కూర్చోవడమే ఉత్తమ మార్గం. ప్రభుత్వ సమాధానం నచ్చకపోతే దానిని సభలోనే ప్రశ్నించవచ్చు.
అలాగే అధికార పక్షం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రతిపక్షం సభను అడ్డుకుంటే వారిని విమర్శించడం సులభం. కానీ సభ సజావుగా సాగేందుకు అవసరమైన రాజకీయ చొరవ, సంప్రదింపులు, రాజీ ప్రయత్నాలు ఎంతవరకు జరిగాయన్నది కూడా పరిశీలించాలి. ప్రభుత్వం వద్ద సంఖ్యాబలం ఉందని భావించి ప్రతిపక్షాన్ని పూర్తిగా పక్కన పెట్టడం కూడా సరైన పార్లమెంటరీ సంస్కృతి కాదు. పార్లమెంట్లో మెజారిటీకి పాలించే హక్కు ఉంటే, మైనారిటీకి ప్రశ్నించే హక్కు ఉంటుంది. ఈ రెండింటి మధ్య సమన్వయమే ప్రజాస్వామ్యానికి ప్రాణం.
ఈ సమావేశాల్లో మరో విరుద్ధ విదృశ్యాలు కూడా విస్పష్టంగా కనిపించాయి. ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తుంటే, అధికార పక్ష సభ్యులు కూడా ప్రతినినాదాలతో ఎదురుదాడికి దిగారు. ఒకరిని ఒకరు నిలదీయడంలో చూపిన ఉత్సాహం ప్రజా సమస్యలపై చర్చలో కనిపించకపోవడం బాధాకరం. పార్లమెంట్ బయట రాజకీయ ప్రచారం చేయడానికి ఎన్నో వేదికలున్నాయి. కానీ చట్టాలపై లోతైన చర్చ, బడ్జెట్పై పరిశీలన, ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు, ప్రజా సమస్యలపై సమాధానాలు రాబట్టడానికి పార్లమెంట్కు ప్రత్యామ్నాయం లేదు.
గ
ణాంకాలు పరిస్థితి తీవ్రతను స్పష్టంగా చెబుతున్నాయి. గత బడ్జెట్ సమావేశంలో లోక్సభ పనితీరు 93 శాతం ఉండగా, ఇప్పుడు అది 19 శాతానికి పడిపోయింది. అంటే ప్రజల తరఫున చట్టసభలో పనిచేయాల్సిన సమయం అత్యధికంగా వృథా అయిందన్నమాట. కొన్ని బిల్లులు చర్చ లేకుండానే ఆమోదం పొందడం కూడా మరో ఆందోళన. ఒక బిల్లును ఆమోదించడం మాత్రమే పార్లమెంట్ పని కాదు; దాని ప్రభావం ఏమిటి, ప్రజలకు ప్రయోజనం ఎంత, లోపాలేమిటి అనే అంశాలపై సభ్యులు చర్చించాలి.
ఇక పార్లమెంట్ సమయానికి ఆర్థిక విలువను కూడా ప్రజలు ప్రశ్నించాలి. ఎంపీలకు జీతభత్యాలు చెల్లించడం సహ, పార్లమెంట్ నిర్వహణకు ప్రజాధనం ఖర్చవుతుంది. అలాంటి వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా స్తంభింపజేయడం ప్రతి పౌరుడి పట్ల అన్యాయం. అయితే సభ్యుల జీతాలను ఆటోమేటిక్గా కోత విధించడం కంటే, సభా నియమాలను ఉల్లంఘించే సభ్యులపై ఇప్పటికే ఉన్న చర్యలను మరింత కఠినతరం చేయడం, నిర్దిష్ట జవాబుదారీతన వ్యవస్థను ఏర్పాటు చేయడం సముచితం.
పార్లమెంట్ ప్రజలది. పార్టీలు తాత్కాలికం. ప్రజాస్వామ్య సంస్థలు శాశ్వతం. ఎన్నికల్లో గెలిచినవారు అధికారాన్ని ఆస్వాదించడానికి, ఓడినవారు కేవలం అడ్డుకోవడానికి ప్రజలు ఎంపీలను ఎన్నుకోలేదు. ప్రజల సమస్యలను చర్చించి పరిష్కార మార్గాలు చూపాలని, దేశ భవిష్యత్తుకు అవసరమైన చట్టాలను రూపొందించాలని, ప్రభుత్వాన్ని జవాబుదారీగా నిలపాలని ఎన్నుకున్నారు.
అందుకే ఈ 19 రోజుల వైఫల్యంపై అధికార, ప్రతిపక్షాలు రెండూ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇకపై ప్రతి సమావేశానికి ముందు అన్ని పార్టీలతో తప్పనిసరి సంప్రదింపులు జరగాలి. సభను స్తంభింపజేసే సభ్యులపై క్రమశిక్షణ చర్యలు ఉండాలి. చర్చకు సిద్ధమైన ప్రభుత్వాన్ని ప్రతిపక్షం వినాలి. ప్రశ్నించే ప్రతిపక్షాన్ని ప్రభుత్వం గౌరవించాలి. ప్రజాస్వామ్యంలో నిరసనకు స్థానం ఉంది.. కానీ నిరసన పేరుతో ప్రజాస్వామ్యాన్నే నిర్వీర్యం చేసే హక్కు ఎవరికీ లేదు.
జెన్జీతో పాటు ప్రతి ఓటరు ఇప్పుడు తన ఎంపీ పనితీరును ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. ఎన్ని ప్రశ్నలు అడిగారు? ఎన్ని చర్చల్లో పాల్గొన్నారు? ప్రజా సమస్యలను ఎన్నిసార్లు లేవనెత్తారు? సభ స్తంభించినప్పుడు వారి వైఖరి ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానాలు కోరాలి. పార్లమెంట్ను రాజకీయ బలప్రదర్శన వేదికగా కాకుండా ప్రజా సమస్యలకు పరిష్కార వేదికగా మార్చినప్పుడే ప్రజాస్వామ్యానికి గౌరవం నిలుస్తుంది. లేదంటే సభ భవనం పవిత్రంగా ఉన్నా.. అందులో జరిగే వ్యవహారాలు మాత్రం ప్రజల విశ్వాసాన్ని అపవిత్రం చేస్తూనే ఉంటాయి.

