సంక్షేమం పేరుతో ఉచిత పథకాలు అమలు చేయమని అడిగిందెవరు? చెప్పిందెవరు? ఉచిత బియ్యం, 58ఏళ్లకే పెన్షన్లు, రాజకీయ నాయకులకు జీతభత్యాలు, వాటి పెంపులు, పలు రకాల పందేరాలు ఎవరి కోసం? ప్రజలు కట్టే పన్నులతో పరిపాలన చేయాల్సిన నేతలు రాష్ట్రాలను దివాళా తీయిస్తున్నారు. అభివృద్ధి అంటే పెన్షన్లు పెంచడం, సన్నబియ్యం పంచడమేనా? ఇలాంటి పథకాలని నిలదీయడానికి ప్రజలంతా సిద్ధం కావాలి. ఎపి, తెలంగాణ రాష్ట్రమేదైనా, ధరల గురించి మాట్లాడరు. అభివృద్ధి గురించి మాట్లాడరు. నాయకులు వారి సెక్యూరిటీ, వారి ఆస్తులను కూడబెట్టుకోవడం, ఆకాశ హర్మ్యాలను నిర్మించుకోవడం, ప్రజా ధనంతో సోకులు చేసుకోవడం ఇదేనా పాలన అంటే? ప్రజలంతా ఆలోచించాలి. జగన్ తన హయాంలో రాజధాని, పోలవరం నిర్మాణాలను పక్కన పెట్టారు. విశాఖ భీమిలి దగ్గర మాత్రం అద్భుత సౌధాలను నిర్మించుకున్నారు. కేసీఆర్ హయాంలో ప్రగతి భవన్ కట్టారు. పైగా వీటిని నేటికీ సమర్థించు కుంటున్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యం మరోటి ఉండదు. ఇలాంటి పాలకులు ప్రజలకు అవసరమా? ఆలోచించాలి. రాష్ట్రాలను అప్పుల కుప్ప చేసి…దివాళా తీయించిన నేతలు నీతి వాక్యాలు పలుకుతుండటం విడ్డూరమే. పైగా అప్పులు చేసి, సంపద పెంచామని గొప్పలు చెప్పుకుంటున్నారు. సకాలంలో ధాన్యం, మిర్చీ కొనుగోళ్లు చేయరు. విద్యుత్, విద్యా, వైద్య రంగాలను పట్టించుకోరు. ఇలాంటివాళ్ళు మన పాలకులు అయినందుకు సిగ్గు పడాలి. ఇక తాజాగా హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని నిస్సిగ్గుగా అమ్మాలనుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ దివాళాకోరు విధానం కాక మరోటి కాదు. పెన్షన్లు, ఉచిత బస్సు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలు ఎవరు అడిగారు? ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయో లేదో ఆలోచించకుండా ఇష్టారీతిన హావిూలు ఇచ్చి ఇప్పుడు భూములు, ఆస్తులు తెగనమ్మితే ఎలా? నీతులు వళ్ళిస్తున్న గత బిఆర్ఎస్ పాలకులు కూడా ఇంతకన్నా భిన్నంగా ఏమీ చేయలేదు. వారి హయాంలోనూ భూములు అమ్ముకున్నారు. పేదలు ఇళ్లు కొనగలిగేలా పరిస్థితులు ఉంటే మూసీ మురికిలో ఎందుకు నివసిస్తారు? మూసీ సుందరీకరణ పేరుతో వారిని నిర్వాసితులను చేయడం ఎంతవరకు సమంజసం? లగచర్లలో ఫార్మాసిటీ అభివృద్ధి పేరుతో గిరిజన తండాలపైకి వెళ్లారు. పాలకులు పక్కా రియల్ ఏజెంట్లలాగా మారితే, ఇక రక్షించేదెవరు? చెప్పిన పథకాల అమలుకు, ఖజానా నింపుకోవడమే కాంగ్రెస్ నాయకులు హెచ్సియూ భూములను అమ్ముకుంటామంటే ఎలా!? హెచ్సియూ భూములు అమ్మకాన్ని ఎవ్వరైనా తీవ్రంగా తప్పు పట్టాల్సిందే. 400 ఎకరాలు అమ్మి.. రూ.30వేల కోట్లు రాబట్టుకోవాలని అధికార పార్టీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు మానుకోవాలి. హెచ్సీయూ విద్యార్థుల పోరాటానికి అందరూ అండగా నిలవడం ద్వారా విలువైన భూములను కాపాడాలి. విద్యార్థులపైన ప్రభుత్వం అణచివేతకు పాల్పడడం తగదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దేశంలో పేరు ప్రఖ్యాతలు సాధించుకుంది. అక్కడ చదివిన విద్యార్థులు దేశ విదేశాల్లో గొప్పగా రాణిస్తున్నారు. దేశానికి తలమానికంగా ఉన్న విద్యాసంస్థల్లో ఒకటిగా ఉంది. హైదరాబాద్ నగర భవిష్యత్తు కోసం విశ్వవిద్యాలయ భవిష్యత్తు కోసం భూముల వేలం తగదని ప్రభుత్వం పెద్దలు గుర్తించాలి. భూములు ప్రభుత్వానివే అని చెబుతున్న సిఎం, మంత్రులు వాటిని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలి. వాటిని అన్యాక్రాంతం కాకుండా చూడాలి. యూనివర్సిటీ భూములపైన రాజకీయం చేస్తున్న తీరు మంచిది కాదు. బుల్డోజర్లను పెట్టి అక్కడున్న చెట్లను తొలగించి చదును చయడం సరికాదు. హైదరాబాద్కి ఊపిరినిచ్చే కొన్ని గ్రీన్ ప్రాంతాలలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, దాని చుట్టూ ఉన్న పరిసరాలే. ఇప్పటికే కొండలు, గుట్టలను మాయం చేస్తున్నారు. హైదరాబాద్ లో ఇప్పటికే కొండలు గుట్టలు మాయం అయ్యాయి.ఇలా చేస్తూ పోతే భవిష్యత్తులో ఢిల్లీ మాదిరిగా ఊపిరి పీల్చుకోవడమే కష్టం అవుతుంది. పర్యావరణ నష్టం ప్రభావంపై అధ్యయనం చేయాలి. ఇప్పటికే హైదరాబాద్లో వేల ఎకరాలు మాయం అయ్యాయి. పర్యావరణ విధ్వంసాన్ని వెంటనే ఆపాలని రేవంత్ ప్రభుత్వానికి రాజకీయ పార్టీలు కూడా సూచించాయి. పచ్చదనం, జీవవైవిధ్యాన్ని నాశనం చేయడం సరికాదని పాలకులు గుర్తించాలి. నిధుల సవిూకరణ కోసం ఈ తరహా చర్యలు చేపట్టడం కూడా మంచిది కాదు. ముందుగా ఉచిత పథకాలను సవిూక్షించాలి. నష్టాలను తెచ్చే పథకాల్లో కోతలు విధించుకోవాలి. గొప్పలకు, అప్పులకు, భేషజాలకు పోకుండా ఉన్న ఆదాయంతోనే ప్రభుత్వాన్ని నడపాలి. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోంచి బయటపడేయాలంటే అమ్మకాలు.. కాదు ఆస్తులు సృష్టించాలి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం భూముల అమ్మకం ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలి. విద్యార్థులు, అధ్యాపకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్ళడం సరికాదు. ఇప్పటికే హైదరాబాద్లో శ్మశానవాటికలకు కూడా జాగా దొరకని పరిస్థితి వచ్చింది. పార్కులకు సైతం స్థలం లేక కాంక్రీట్ జంగల్గా మారుతోంది. హైదరాబాద్ లో కబ్జాలను గుర్తించి ముందుగా వాటిని విముక్తం చేయాలి. చెరువులు కబ్జాలను గుర్తించాలి. అందుకు హైడ్రా చేస్తున్న కృషిని మరింతగా ప్రోత్సహించాలి. హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల కబ్జాలను గుర్తించి, ఆ భూములను స్వాధీనం చేసుకోవాలి. డబ్బులను వృథా చేసే ఓట్ల పథకాలకు పాతరేసినప్పుడే రాష్ట్రం అప్పుల ఊబి నుంచి బయటపడగలదు. మోడీకైనా, బోడీకైనా, బాబుకైనా, రేవంత్ కైనా, మరెవ్వరికైనా ఇదే వర్తిస్తుంది.

