దేశ భవిష్యత్తు యువతే. ఆ యువత ప్రశ్నిస్తే వినాలి, సూచిస్తే ఆలోచించాలి, సమస్యలు చెబితే పరిష్కరించాలి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే అధికారానికి సమాంతరంగా జవాబుదారీతనాన్ని పెంపొందించే స్వతంత్ర ప్రజా వేదికలు అవసరం. ప్రజల పక్షాన నిలిచే ‘ప్రెషర్ గ్రూపు’లు బలపడినప్పుడే అధికార అహంకారానికి అడ్డుకట్ట పడుతుంది. అదే అసలై ప్రజాస్వామ్యానికి నిజమైన మార్గం.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
ప్రజాస్వామ్యం అంటే కేవలం ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికలకే పరిమితం కాదు. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే పరిపాలన, అధికారాన్ని ప్రశ్నించే స్వేచ్ఛ, ప్రభుత్వాన్ని జవాబుదారీగా నిలబెట్టే వ్యవస్థల సమాహారమే నిజమైన ప్రజాస్వామ్యం. పాలకులు ప్రజల అభిప్రాయాలను, ప్రతిపక్షాల సూచనలను, సామాజిక వర్గాల ఆందోళనలను పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయాలతో పరిపాలన సాగిస్తే, ప్రజాస్వామ్యానికి దుష్ట చీడ పట్టినట్లే. అలాంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేసే బలమైన ‘ప్రెషర్ గ్రూపులు’ ప్రజాస్వామ్యానికి రక్షణ కవచాలుగా నిలుస్తాయి.
ఇటీవల దేశవ్యాప్తంగా పరీక్షా పేపర్ల లీకేజీలపై విద్యార్థులు చేపట్టిన ఉద్యమం దీనికి తాజా ఉదాహరణ. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన పరీక్షల విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారడంతో యువత దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగింది. ఈ ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం స్పందించి, దిగిరాక తప్పలేదు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, పరీక్షల వ్యవస్థను సాంకేతికంగా మరింత పారదర్శకంగా మార్చేందుకు నందన్ నీలేకని నేతృత్వంలో ఉన్నతస్థాయి టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయడం వంటి నిర్ణయాలు ప్రజా ఒత్తిడి ఫలితంగానే వెలువడ్డాయి.
ఈ ఉద్యమంలో కీలకంగా నిలిచిన కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే చేసిన ప్రకటన మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల్లో పోటీ చేయడం తమ లక్ష్యం కాదని, ప్రజల తరపున ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చే ‘ప్రెషర్ గ్రూప్’గా కొనసాగుతామని దీప్కే ప్రకటించడం ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరమైన సంకేతం. అయితే ఈ ఉద్యమం రాజకీయ ప్రయోజనాలకు వేదిక కాకుండా స్వతంత్ర ప్రజా ఉద్యమంగా కొనసాగినప్పుడే దాని విశ్వసనీయత నిలుస్తుంది.
‘క్యా బోల్తీ పబ్లిక్’ పేరుతో దేశవ్యాప్తంగా ప్రజల అభిప్రాయాలను సేకరించే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు సీజేపీ ప్రకటించింది. నిరుద్యోగం, విద్యా సంస్కరణలు, ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల భారం, ప్రభుత్వ పాఠశాలల నాణ్యత, సామాజిక న్యాయం వంటి అంశాలపై ప్రజలతో నేరుగా మమేకమవుతామని తెలిపింది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చైతన్య కార్యక్రమాలు ప్రభుత్వానికి అద్దం పట్టే సాధనాలుగా ఉపయోగపడతాయి.
నిరుద్యోగం నేడు దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి. అధికారిక గణాంకాల ప్రకారం 15-29 ఏళ్ల యువతలో నిరుద్యోగ రేటు 2017-18లో 17.8 శాతం ఉండగా, 2023-24లో 10.2 శాతానికి తగ్గిందని ప్రభుత్వం చెబుతోంది. అయినప్పటికీ విద్యావంతులైన యువతలో ఉద్యోగాల కొరత కొనసాగుతుండటం ఆందోళనకరమే. ప్రభుత్వ తాజా గణాంకాల ప్రకారం 2025లో సెకండరీ విద్య లేదా అంతకంటే ఎక్కువ చదువుకున్న వారి నిరుద్యోగ రేటు 6.5 శాతంగా నమోదైంది.
అయితే గణాంకాలు ఇలావుంటే, వాస్తవ పరిస్థితి వేరే కథ చెబుతోంది. ఇటీవల వెలువడిన విశ్లేషణల ప్రకారం యువతలో ఉద్యోగ అవకాశాల కొరత, నాణ్యమైన ఉపాధి లభించకపోవడం, పరీక్షల వ్యవస్థపై విశ్వాసం దెబ్బతినడం వంటి అంశాలే దేశవ్యాప్త నిరసనలకు ప్రధాన కారణాలుగా మారాయి.
విద్య కూడా నేడు మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారింది. ఒకటో తరగతి నుంచే లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలు పెరుగుతున్నాయి. పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే తల్లిదండ్రుల ఆకాంక్షను వ్యాపార అవకాశంగా మార్చుకోవడం విచారకరం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విద్యను ప్రాథమిక హక్కుగా భావించారు. కానీ నేడు అది హక్కు కంటే వ్యాపార వస్తువుగా మారడం సమాజానికి మేలు చేసే పరిణామం కాదు. ఈ అంశంపై ఉద్యమం చేయాలన్న సీజేపీ సంకల్పం స్వాగతించదగినదే.
ఇదిలా ఉండగా, విద్యార్థుల ఉద్యమానికి వివిధ వర్గాల నుంచి లభిస్తున్న మద్దతు కూడా గమనించదగ్గది. యువత ప్రశ్నించడం, తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం, నిరసనలు తెలపడం ప్రజాస్వామ్య హక్కులేనని ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్చాలక్ మోహన్ భాగవత్ వ్యాఖ్యానించడం ఈ చర్చకు మరింత ప్రాధాన్యం తీసుకొచ్చింది. ప్రజాస్వామ్యంలో చర్చకు ప్రత్యామ్నాయం లేదని ఆయన చేసిన వ్యాఖ్య ప్రతి పాలకుడు గుర్తుంచుకోవాల్సిన అంశమే.
ప్రజాస్వామ్యంలో ఎన్నికల సంఘం, విద్యా సంస్థలు, నియామక వ్యవస్థలు, న్యాయ వ్యవస్థ వంటి సంస్థలపై ప్రజలకు నమ్మకం ఉండాలి. ఆ విశ్వాసం దెబ్బతింటే ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది. కాబట్టి ప్రభుత్వాలు విమర్శలను శత్రుత్వంగా కాకుండా సవరణకు అవకాశంగా స్వీకరించాలి. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పే సంస్కృతి పెంపొందించాలి. ప్రజలే యజమానులు, ప్రభుత్వాలు సేవకులనే రాజ్యాంగ స్ఫూర్తిని ఆచరణలో చూపాలి.
దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది. ఆ యువత ప్రశ్నిస్తే వినాలి, సూచిస్తే ఆలోచించాలి, సమస్యలు చెబితే పరిష్కరించాలి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే అధికారానికి సమాంతరంగా జవాబుదారీతనాన్ని పెంపొందించే స్వతంత్ర ప్రజా వేదికలు అవసరం. ప్రజల పక్షాన నిలిచే ‘ప్రెషర్ గ్రూపు’లు బలపడినప్పుడే అధికార అహంకారానికి అడ్డుకట్ట పడుతుంది. అదే ప్రజాస్వామ్యానికి పట్టిన చీడను వదిలించే నిజమైన మార్గం.

