క్రీ.పూ.650 నుండి క్రీ.పూ.250 మధ్య ఉన్న కాలాన్ని మౌర్యుల పూర్వయుగం లేదా బుద్ధుని యుగం లేదా షోడశ మహాజనపాదాల యుగం అని అంటారు. ఈ కాలంలో గౌతమ బుద్ధుడు ముఖ్య పురుషుడు కాబట్టి ఈ కాలాన్ని బుద్ధుని యుగమని మరియు ఈ కాలంలోనే 16 అత్యంత గొప్ప రాజ్యాలు ఆవిర్భవించడం వల్ల చరిత్రకారులు ఈ యుగాన్ని షోడశ మహాజనపాదాల యుగం అని అంటున్నారు.
బౌద్ధ గ్రంథమైన అంగుత్తరానికయ ఈ 16 రాజ్యాల గురించి సమాచారాన్ని అందిస్తుంది. ఈ గ్రంథం పాళీ భాషలో రాయబడింది. 16 రాజ్యాలలో 10 రాజ్యాలు గంగా మైదానంలోనూ, 2 రాజ్యాలు వాయువ్య భారతదేశంలోనూ, 1 పశ్చిమ భారతదేశంలోనూ, 2 మధ్య భారతదేశంలోనూ, దక్షిణాన ఒక రాజ్యం వెలిసాయి.

16 రాజ్యాలు
మగధ, అంగ, కాశీ, కోసల, వత్స, కురు, పాంచాల, శౌరసేన, మల్ల, వజ్జి, అవంతి, ఛేది, మత్స్య, గాంధార, కాంభోజ, అస్మక
వీటిలో కొన్ని గణతంత్ర రాజ్యాలు, కొన్ని రాచరిక రాజ్యాలుగా ఉండడం గమనార్హం.
గణతంత్ర రాజ్యాలు:
క్రీ.పూ. ఆరవ శతాబ్దంలో గణతంత్ర రాజ్యాల్లో ప్రజాస్వామ్యయుతమైన ప్రజల ద్వారా ఎన్నుకోబడే వ్యక్తి పాలనను కొనసాగించేవాడు. పాళీ గ్రంథాల్లో పది గణతంత్ర రాజ్యాల ప్రస్తావన ఉంది.
రాచరిక రాజ్యాలు:
పాలకులు వంశ పారపర్యంగా అధికారాన్ని కొనసాగిస్తూ నిరంకుశ పాలన ద్వారా ప్రజలను శాశిస్తూ ఉండేవారు. వీటిలో కోసల, వత్సా, అవంతి ముఖ్యమైనవి.
క్రీ.పూ. ఆరవ శతాబ్దంలో అత్యంత గొప్ప రాజ్యాలలో మగధ ఒకటి. క్రీ.పూ. నాలుగవ శతాబ్దం కల్లా 15 రాజ్యాలను జయించి మగధ భారతదేశంలో తొలి సామ్రాజ్యంగా అవతరించింది. ఇది ప్రస్తుత బీహార్ లోని పాట్నా ప్రాంతం.
మగధ సామ్రాజ్యం విస్తరించడానికి అనుకూలించిన పరిస్థితులు
- మగధ సామ్రాజ్యంలో ముడి ఇనుము అధికంగా లభించడం వలన వ్యవసాయ పనిముట్లు మరియు ఆయుధాల తయారీ సులభతరమైంది.
- ఈ ప్రాంతం గంగా మైదాన తీరంలో ఉండడం వలన వ్యవసాయ, ఆర్ధిక వ్యవస్థ బలపడి సుసంపన్నమైన రాజ్యంగా ఏర్పడింది.
- మగధ రాజధాని పాటలీపుత్రం నదుల మధ్య ఉండడం వల్ల శత్రుదుర్భేద్యంగా ఉండేది.
- గంగా మైదాన ప్రాంతంలో ఉన్న అడవులలో విస్తారమైన కలప లభించడంతో రథాల తయారీ, ఏనుగులు అధిక సంఖ్యలో ఉండడం వలన గజ దళం బలపడి యుద్ధ విజయాల్లో కీలక పాత్ర పోషించాయి.
మగధ సామ్రాజ్య చక్రవర్తులు
మగధ సామ్రాజ్యాన్ని విస్తరించడంలో భౌగోళిక అంశాలు ఏ విధంగా సహకరించాయో సమర్ధవంతులైన చక్రవర్తులు కూడా అదేవిధంగా సహకరించారు. మగధ సామ్రాజ్యాన్ని ఈ కాలంలో ముక్యంగా 3 వంశాలు పాలించాయి. ఆ వంశాలు హర్యాంక, శిశునాగ, నంద వంశాలు.
హర్యాంక వంశం:
బింబిసారుడు- ఈ వంశ స్థాపకుడు బింబిసారుడు. మగధ సామ్రాజ్యాన్ని అత్యంత శక్తివంతంగా తీర్చిదిద్దడంలో ఇతనిది కీలక పాత్ర. మగధను బలోపేతం చేయడానికి ఇతను బహుముఖ వ్యూహాన్ని పాటించాడు. ఇతని మొదటి వ్యూహం యుద్ధం. మొదటి వ్యూహంలో భాగంగా అంగ రాజ్యాన్ని జయించి మగధలో విలీనం చేశాడు. ఇతని రెండవ వ్యూహం వైవాహిక సంబంధాలు. ఆనాటి ప్రధాన రాజ్యాలతో వైవాహిక సంబంధాలను ఏర్పరుచుకొని వారి మద్దతును కూడగట్టుకున్నాడు. ఉదాహరణకు కోసల యువరాణి మహాదేవిని వివాహం చేసుకొని కాశీ రాజ్యాన్ని వరకట్నంగా పొందాడు. బింబిసారుడి చివరి వ్యూహమైన దౌత్యనీతి ద్వారా అవంతి రాజు మహాసేనుడికి కామెర్ల వ్యాధి వచ్చిందని తెలిసి తన ఆస్థాన వైద్యుడైన జీవకుడిని పంపించి చికిత్స చేయించాడు. ఈ విధంగా అవంతి రాజ్యాన్ని మగధలో విలీనం చేసుకున్నాడు.
అజాతశత్రువు- ఈ వంశంలో ఇతను రెండవవాడు. తండ్రిని చంపి రాజ్యాన్ని పొంది పదహారు సంవత్సరాలు వజ్జి రాజ్యంతో పోరాడి మగధలో విలీనం చేసాడు. కోసల, మల్ల రాజ్యాలను కూడా జయించి మగధలో విలీనం చేసాడు.
ఉదయనుడు- ఈ వంశంలో ఇతను చివరివాడు. శిశునాగ వంశానికి చెందిన సేనాపతి ఇతనిని చంపి శిశునాగ వంశాన్ని స్థాపించాడు.
శిశునాగ వంశం:
శిశునాగుడు- ఈ వంశ స్థాపకుడు శిశునాగుడు. ఇతను అవంతి రాజ్యాన్ని జయించి మగధలో విలీనం చేసాడు.
కాలాశోకుడు- ఈ వంశంలో ఇతను రెండవవాడు మరియు చివరివాడు. ఇతడు రాజధానిని పాటలీపుటానికి మార్చాడు. ఇతని సేనాపతి అయిన మహాపద్మనందుడు ఇతనిని అంశం చేసి నంద వంశాన్ని స్థాపించాడు.
నంద వంశం:
మహాపద్మనందుడు- మగధ సామ్రాజ్యాన్ని పాలించిన చక్రవర్తుల్లో ఇతను గొప్పవాడు. వాయువ్య భారతదేశంలోని గాంధార మరియు కాంభోజ తప్ప మిగతా 13 రాజ్యాలను జయించి మగధలో విలీనం చేసాడు. వింధ్య పర్వతాలను దాటి దక్షిణ భారతదేశాన్ని జయించిన తొలి చక్రవర్తి ఇతనే. ఇతను శూద్ర కులానికి చెందినవాడు. ఇతను జైన మతాన్ని ఆదరించాడు.
ధననందుడు- నంద వంశంలో ఇతను చివరివాడు. క్రీ.పూ. 321వ సంవత్సరంలో చంద్రగుప్తమౌర్యుడు ఇతనిని ఓడించి మగధను హస్తగతం చేసుకున్నాడు. దీనితో నంద వంశం అంతమై మౌర్య వంశ పాలన ప్రారంభమైంది.
మగధ చక్రవర్తులు భారతదేశంలో ఇతర రాజ్యాలను జయిస్తున్న సమయంలో విదేశీ దాడులు జరిగి వాయువ్య భారతదేశం విదేశీ పాలనలోకి వెళ్లిపోయింది. వాయువ్య భారతదేశాన్ని పర్షియన్లు మరియు గ్రీకులు పాలించారు.
మౌర్యుల పూర్వయుగం ఆర్ధిక వ్యవస్థ
- మౌర్యుల పూర్వయుగ కాలంలో ఆర్ధిక వ్యవస్థలో, వ్యవసాయం మరియు పరిశ్రమలలో బాగా అభివృద్ధి చెందాయి.
- మగధ సామ్రాజ్యం సారవంతమైన గంగా మైదాన ప్రాంతంలో ఉండడం వలన వ్యవసాయ అభివృద్ధి బాగా జరిగింది. ఇక్కడ ఇనుము ఖనిజ నిక్షేపాలు ఉండడం వల్ల సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించి పనిముట్లను, ఆయుధాలను తయారుచేసుకునేవారు. పాణిని రాసిన అష్టాధ్యాయి గ్రంథంలో ఇక్కడి ప్రజలు వరిని పండించారని తెలుస్తుంది.
- అంగుత్తరనికయ గ్రంథం ప్రకారం 24 రకాల పరిశ్రమలు ఉండేవని వాటిలో వస్త్ర పరిశ్రమ, లోహ పరిశ్రమ, చర్మ పరిశ్రమ, కుండల పరిశ్రమ బాగా అభివృద్ధి చెందాయి.
- క్రీ.పూ. ఆరవ శతాబ్దంలో భారతదేశంలో లోహపు నాణాలు ప్రవేశపెట్టబడ్డాయి. ఇది ఆర్ధిక వ్యవస్థలో అత్యంత ముఖ్యమైన పరిణామం. పండితులు ఈ నాణెములను విద్ధాంక నాణెములు (punchmarked coins) అని పిలిచారు. వీటిని వెండి మరియు రాగితో తయారుచేశారు. వీటిపైన కొన్ని బొమ్మలను ముద్రించారు. ఎటువంటి లిపిని వినియోగించలేదు. పాణిని తన అష్టాధ్యాయి గ్రంథంలో ఈ నాణాలను రుపయా, నిష్క, కర్షపణ అనే పేర్లతో పిలిచాడు.

