ప్రజలు ఇప్పుడు రాజకీయ పార్టీల ప్రకటనలను కాకుండా వాటి పనితీరును కొలుస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కాలపరిమితి నిర్ణయించి, వాటి అమలుపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయడం ప్రజలకు మేలు చేస్తుంది. హామీలను మరచిపోయే రాజకీయ సంస్కృతికి ముగింపు పలికి, బాధ్యతాయుత పాలనకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉన్నది. అధికారంలో ఎవరు ఉన్నా, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే ప్రభుత్వాల అసలైన విజయానికి కొలమానం.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
ఎన్నికల హామీలు కేవలం రాజకీయ ప్రకటనలు ఎంతమాత్రమూ కావు. అవి ప్రజలతో కుదుర్చుకున్న సామాజిక ఒప్పందం. అధికారంలోకి రావడానికి పార్టీలు ఇచ్చిన హామీలను అమలు చేయడమే ప్రభుత్వాల విశ్వసనీయతకు కొలమానం. కానీ, ప్రస్తుత రాజకీయాలను పరిశీలిస్తే, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత మరుగునపడుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ప్రభుత్వం పనితీరుపై కూడా ఇలాంటి ప్రశ్నలే వినిపిస్తున్నాయి.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు దాటినా, ఎన్నికల ముందు అత్యంత ప్రాధాన్యాలుగా ప్రస్తావించిన ధరణి సమస్య, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, యూత్ డిక్లరేషన్ అమలు వంటి అంశాల్లో ఆశించిన పురోగతి కనిపించడం లేదు. ధరణి పోర్టల్ వల్ల జరిగిన భూ వివాదాలపై సమగ్ర విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటివరకు పూర్తి స్థాయి శ్వేతపత్రాన్ని విడుదల చేయలేదు. దేవాదాయ శాఖకు చెందిన వేల ఎకరాల భూములు అన్యాక్రాంతంలో ఉన్నాయని ఆరోపణలు వస్తున్నా, వాటి రక్షణలో గణనీయమైన ఫలితాలు కనిపించడం లేదు.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో కూడా ప్రభుత్వాలు ఒకే ధోరణిని ప్రదర్శిస్తున్నాయి. అక్రెడిటేషన్ కార్డుల జారీ ఆలస్యం, ఆరోగ్య కార్డులు, ఇంటి స్థలాల పంపిణీ, సంక్షేమ పథకాల అమలులో స్పష్టత లేకపోవడంతో అసంతృప్తి పెరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టుల కోసం కేటాయించిన 70 ఎకరాల భూమిపై కొనసాగుతున్న వివాదాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి.
అయితే ప్రస్తుతం అత్యంత కీలకంగా మారిన అంశం నిరుద్యోగమే. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన యూత్ డిక్లరేషన్లో రెండు లక్షల ఉద్యోగాలు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్, ఉద్యోగం వచ్చేవరకు నెలకు రూ.4 వేల నిరుద్యోగ భృతి, మహిళలకు ఎలక్ట్రిక్ స్కూటీలు, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, రూ.10 లక్షల వరకు వడ్డీ లేని విద్యారుణాలు వంటి పలు హామీలు ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల తర్వాత కూడా వీటిలో అధిక భాగం అమలు కానేలేదు.
ప్రభుత్వం ఇటీవల 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని ప్రకటించింది. ఇది స్వాగతించదగిన విషయమే అయినప్పటికీ, ఎన్నికల హామీ ఉద్యోగాలతో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువ. అంతేకాకుండా అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న నోటిఫికేషన్లు పూర్తిస్థాయిలో విడుదల కాకపోవడం నిరుద్యోగుల్లో అసంతృప్తిని పెంచుతోంది.
గణాంకాలు కూడా ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి. రాష్ట్రంలోని పాఠశాల విద్యాశాఖలో 14 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులు, విశ్వవిద్యాలయాల్లో 2 వేలకుపైగా బోధన పోస్టులు, 2,800కు పైగా బోధనేతర పోస్టులు, గురుకులాల్లో 6 వేల పోస్టులు, ఆర్టీసీలో 3 వేలకుపైగా ఖాళీలు, పోలీసు శాఖలో 17 వేలకుపైగా పోస్టులు, అంగన్వాడీల్లో 15 వేలకుపైగా ఖాళీలు, మైనారిటీ సంక్షేమ శాఖలో 3 వేలకుపైగా పోస్టులు, ఎక్సైజ్ శాఖలో వెయ్యి పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వివిధ ప్రభుత్వ, ఉద్యోగ సంఘాల అంచనాలు చెబుతున్నాయి. మరోవైపు ప్రతి ఏడాది 9 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ పొందుతున్నారు. అయినప్పటికీ ఖాళీల భర్తీ ప్రక్రియ వేగవంతం కాకపోవడం నిరుద్యోగ యువతలో నిరాశకు కారణమవుతోంది.
మరో ఆందోళనకర అంశం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ వ్యవస్థ విస్తరణ. రాష్ట్రంలో మూడు లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులుండగా, ఈ సంఖ్యకు సమానంగా దాదాపు అంతమంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు వివిధ శాఖల్లో పనిచేస్తున్నట్లు అంచనాలు ఉన్నాయి. దీర్ఘకాలికంగా ఇది పరిపాలనా సామర్థ్యాన్ని ప్రభావితం చేయడంతో పాటు ఉద్యోగ భద్రతను కూడా ప్రశ్నార్థకంగా మారుస్తోంది. ఈ పరిస్థితికి గత ప్రభుత్వాల విధానాలే ప్రధాన కారణమన్న విమర్శలు ఉన్నాయి.
ఇక ఆంధ్రప్రదేశ్లోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ కనిపించడం లేదు. దేవాదాయ భూముల పరిరక్షణ, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, సంక్షేమ హామీల అమలు వంటి అంశాల్లో ప్రభుత్వంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారాలు మారుతున్నా, ప్రజా సమస్యల పరిష్కారంలో మాత్రం పెద్దగా మార్పు కనిపించడం లేదనే అభిప్రాయం బలపడుతోంది.
వాస్తవానికి ఈ విమర్శలు ఒక్క ప్రభుత్వానికే పరిమితం కావు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు “ఇంటికో ఉద్యోగం” వంటి హామీలు వివాదాస్పదమయ్యాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తన హామీల అమలుపై విమర్శలు ఎదుర్కొంటోంది. ఆంధ్రప్రదేశ్లోనూ గత వైసీపీ ప్రభుత్వం, ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా ఎన్నికల హామీల అమలుపై ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రజలు ఇప్పుడు రాజకీయ పార్టీల ప్రకటనలను కాకుండా వాటి పనితీరును కొలుస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కాలపరిమితి నిర్ణయించి, వాటి అమలుపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయడం ప్రజలకు మేలు చేస్తుంది. హామీలను మరచిపోయే రాజకీయ సంస్కృతికి ముగింపు పలికి, బాధ్యతాయుత పాలనకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉన్నది. అధికారంలో ఎవరు ఉన్నా, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే ప్రభుత్వాల అసలైన విజయానికి కొలమానం.

