“స్వస్తి శ్రీమచ్చాళుక్య విక్రమ వర్షద 49 నెయ క్రోధి సంవత్సరద పుష్య బహుళ 1 బుధవారదందు …” అనగా స్వస్తి శ్రీమచ్చాళుక్య విక్రమ వర్షం 49, క్రోధి సంవత్సరం, పుష్య బహుళ పాడ్యమి, బుధవారం సరియగు తేది క్రీస్తు శకం 1124 డిసెంబర్ 24 నాడు గూడూరు స్తంభ శాసనం ఆవిష్కరించ బడింది. ఈ కన్నడ తెలుగు శాసనానికి 2024 డిసెంబర్ 24 తో తొమ్మిది శతాబ్దులు నిండి పదవ శతాబ్ది లోనికి అడుగు పడింది. తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా పాలకుర్తి మండలం నేటి గూడూరు నాటి గుముడూరు గ్రామంలో ఉన్నది ఈ శాసనం.
అయితే ఏమిటి? ఎన్నో శాసనాలలో ఇది ఒకటి అనుకోవచ్చు. కాదు; ఎన్నో విశేషాలు, ఎన్నో ప్రత్యేకతలు ఉన్న శాసనం; ఉద్దండుల నుంచి ఔత్సాహికుల దాకా అనుశీలించిన శాసనం; చరిత్రకారులు, సాహితీవేత్తలచే విస్తృతంగ చర్చించ బడిన శాసనం; చరిత్రకు, సాహిత్యానికి గొప్ప కూర్పును, చేర్పును అందించిన శాసనం గూడూరు శాసనం.
ఈ శాసనం కళ్యాణి చాళుక్య చక్రవర్తి త్రిభువన మల్ల 6 వ విక్రమాదిత్య (క్రీ శ 1074-1127) కాలానికి చెందినది. విరియాల మల్ల అనే మాండలికుడు ప్రభువుల పక్షాన ఉత్తరాయణ సంక్రాంతి నిమిత్తం గుముడూరు గ్రామంలో మల్లేశ్వర దేవుని రంగ భోగం కోసం బమ్మరి గ్రామాన్ని ధారా పూర్వకం చేయుట, ఇతర వితరణలు చేసిన సందర్భంగా వేయించిన దాన శాసనం. కాని, ఇది అంతటికే పరిమితం కాలేదు. పై ప్రభువుల చరిత్ర, ప్రశస్తి, గెలిచిన రాజ్యాలు, వారి అనుయాయుల పరిచయం, తన వంశ పరంపర, పరాక్రమం, చేసిన యుద్ధాలు, నిలబెట్టిన దేశాలు, పొందిన బిరుదులు, బహుమతులు, ఇచ్చిన దానాలు వంటి శాసన కాలానికి సుమారు శతాబ్దిన్నర ముందు నాటి నుంచి సవిస్తర సమాచారం స్పష్టమైన భాషలో మనకు అందిస్తుంది ఈ శాసనం.
ముఖ్యంగా కాకతీయ రాజ్య స్థాపనలో కీలక ఘట్టం ఈ శాసనంలో లభిస్తున్నది. అందుకే ఈ శాసనానికి ఇంత ప్రత్యేకత. మల్లని తాతకు తల్లి అయిన కామవసాని ప్రస్తావన ఇందులో కీలకం. కామవసాని విరియాల ఎర్ర నరేంద్రుని భార్య, కాకతి గుండ రాజు సోదరి. కాకతీయులు మొదట స్వతంత్ర పాలకులు కాదు. కొరవి పాలకుల ఫిర్యాదు మేరకు చాళుక్య చక్రవర్తి కాకతీయుల పైకి యుద్ధానికి ఎర్ర నరేంద్రుని పంపుతడు. ఎర్ర నరేంద్రుడు గుండ రాజును చంపి బొట్టు బేత రాజును కొరివి అధిపతిగా నిలుపుతడు. కామవసాని మేనల్లుడు గరుడ బేతరాజును చేపట్టి చక్రవర్తిని మెప్పించి అనుమకొండ విషయాధిపత్యం ఇప్పిస్తది. గరుడ బేతరాజు కాలాన్ని క్రీ శ 992-1052 గ నిర్ణయం చేసిండ్రు చరిత్ర కారులు. ఆ తరువాత కాకతీయుల పాలన క్రమంగా విస్తరిస్తది.
ఇంక, శాసన భాష విషయానికి వొస్తే సంస్కృత భూయిష్టమైన కన్నడ, తెలుగు భాషలు. మూడు వైపుల కన్నడ, ఒక వైపు తెలుగు ఉన్నయి. తెలుగు శాసనం ఉత్పల మాల, చంపక మాల పద్యాలలో ఉంది. ఇది తెలుగు శాసనాలలో తొలి వృత్త శాసనం. శాసన లేఖకుడు కొమ్మోజ సంస్కృత, కన్నడ, తెలుగు భాషలలో పండితుడు, పద్యకవి.
నేలటూరి వెంకటరమణయ్య, పి వి పరబ్రహ్మ శాస్త్రి, బి ఎన్ శాస్త్రి, జి ఆర్ వర్మ వంటి పెద్దలు ఎందరో ఈ శాసనాన్ని పరిశోధన చేసిండ్రు. గూడూరు సందర్శనలో జి ఆర్ వర్మ గారికి తోడుగా పేర్వారం జగన్నాథం గారి పనుపున విద్యార్థి లింగంపల్లి రామచంద్ర ఉన్నరు. ఈమని శివనాగి రెడ్డి, ద్యావనపల్లి సత్యనారాయణ, శ్రీరామోజు హరగోపాల్, రెడ్డి రత్నాకర్ రెడ్డి వంటి పరిశోధకులు ఈ శాసనాన్ని విశ్లేషణ చేసిండ్రు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పురావస్తు శాఖ 1996 శాసన పాఠాన్ని, క్లుప్త వివరణ ను వార్షిక నివేదికలో ప్రచురించింది. 1974లో శాసనాన్ని ముద్రలతో సహా అచ్చు వేసింది. ఆ తరువాత చాలా గ్రంథాలు వచ్చినయి. ఆర్తి పరాంకుశం ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం ఇంగ్లీష్ లో పాఠ్యాంశం వ్రాసిండ్రు. లింగంపల్లి రామచంద్ర తన “జనగామ జిల్లా సాహిత్య చరిత్ర”, పాలడుగు రత్నాకర్ రావు “గూడూరు చరిత్ర” గ్రంథాల ముఖ చిత్రం పై ఈ శాసనాన్ని వేసుకొన్నరు.
గ్రామంలోని శ్రీ పోతన చైతన్య వేదిక పూనుకొని 2018 లో నామ ఫలకాలు ఏర్పాటు చేసింది, చిరు పుస్తకం వేసింది. సర్పంచ్ మాచర్ల పుల్లయ్య సహకారంతో శాసనానికి పీఠం నిర్మించి గ్రామ పంచాయతి ఆవరణలో పొందుబాటు చేసిండ్రు. ఇప్పుడు తొమ్మిది వందల సంవత్సరాలు నిండిన సందర్భంగా “గూడూరు శిలా శాసన స్మృతి” అనే పుస్తకాన్ని తెస్తున్నరు.
పాలకుర్తి పర్యాటకానికి వచ్చే వారు గూడూరు శాసనాన్ని కూడా చూసి పోతున్నరు. ప్రభుత్వం శ్రద్ధ వహిస్తే గూడూరు లోని మల్లేశ్వర మందిరం, కోమటోల్ల బొమ్మలు, పాటి గడ్డ వస్తువులతో మ్యూజియం నిర్మాణం వంటివి చేపట్టి మరింత అభివృద్ధి చేయవచ్చు.
(నేడు గూడూరు శిలా శాసనం నవమ శతాబ్ది వేడుకలు)

డాక్టర్ రాపోలు సత్యనారాయణ
ఫోన్: 9440163211

