అసెంబ్లీలో సిఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రసంగిస్తూ, భూమి యజమానుల హక్కులను కాపాడేందుకు పలు చట్టాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. “అర్హులైన ప్రతీ భూ యజమానులు తమ హక్కులను కాపాడుకునేందుకు, మా ప్రభుత్వం చట్టాలను ప్రవేశపెడుతున్నాం అన్నారు. తెలంగాణ రైతులకు ఉపయోగపడే చట్టాలు తీసుకురావాలని ఈ రోజు అసెంబ్లీలో చర్చ జరిపే ప్రయత్నం చేశాం. అయితే ప్రతిపక్ష పార్టీ వారు అహంకారంతో చర్చను అడ్డుకోవాలని ప్రయత్నించారు. మీరు సహనంతో వ్యవహరించి, చర్చను పక్కదారి పట్టించకుండా కొనసాగించారు. మీకు అభినందనలు” తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రైతుల పోరాటాలను గుర్తు చేసుకున్నారు. “రావి నారాయణ రెడ్డి, అరుట్ల కమలాదేవి, అరుట్ల రాంచంద్రా రెడ్డి, మల్లు స్వరాజ్యం, భీం రెడ్డి నర్సింహారెడ్డి, చాకలి ఐలమ్మ లాంటి వారు భూమి కోసమే పోరాటాలు చేశారు. వారు భూమిని ఆత్మగౌరవంగా భావించారు, సాయుధ రైతాంగ పోరాటాలు జరిపారు. భూమి కాపాడుకోవడంలో వారు విజయం సాధించారన్నారు. తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దుకు, యజమానుల హక్కులను కాపాడేందుకు అప్పటి ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి అని వెల్లడించారు. “ఇందిరాగాంధీ గారు భూమిలేని పేదలకు అసైన్డ్ పట్టాలు ఇచ్చి, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు. నిజమైన భూ యజమాని హక్కులను కాపాడుకుందాం అన్నారు. చదువు లేని వారి భూములు అన్యాక్రాంతం అయ్యే ప్రమాదం ఉందని, ఈ పరిస్థితి నివారించేందుకు చట్టాలు సవరించామన్నారు.
ఈ సందర్భంగా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి కూడా విమర్శలు చేశారు. “కేసీఆర్ ఇచ్చిన ధరణి పోర్టల్ 2010లో ఒడిస్సాలో ప్రారంభించిన e-ధరణి ఆధారంగా నిర్మించబడింది. ఈ-ధరణి పోర్టల్కు అనుభవం లేని సంస్థ IL&FS ఇచ్చారు. 2018లో IL&FS తో పాటు గాదె శ్రీధర్ కు చెందిన e-Centric, Wissen Infotech సంస్థలు కాంట్రాక్టు సాధించాయి. ఈ సంస్థలు అనేక క్రిమినల్ నేపథ్యాలు కలిగిన సంస్థలు. కేసీఆర్ వాటిని ఎందుకు తీసుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. “ఫిలిప్పిన్స్కు చెందిన Falcon SG సంస్థ 2021లో టెరాసిస్ షేర్లను కొనుగోలు చేసింది. దీనిలో 99% వాటాలు ఎవరూ కొనుగోలు చేశారో, 1% వాటాతో గాదె శ్రీధర్ రాజు CEO అయ్యాడు. ఈ దేశీయ, విదేశీ కంపెనీలలోని వారు తెలంగాణ రైతుల భూముల సమాచారాన్ని తమ చేతుల్లో పెట్టడం ఇది ఎంత తీవ్రమైన నేరమో ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది అన్నారు.
“భూ రిజిస్ట్రేషన్ల కోసం జరిగిన మార్పులు, అర్ధరాత్రి జరిగే రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ ఆఫీసుల లేకుండా ఇతర ప్రాంతాల్లో నిర్వహించడం, విదేశీ కంపెనీల చేతుల్లో డేటా పెట్టడం చాలా తీవ్రమైన తప్పిదమని ఆయన అన్నారు. వీటిని సవరించడం కోసమే భూ భారతి-2024 చట్టం తీసుకువచ్చినట్లు సీఎం రేవంత్ తెలిపారు. ఈ చట్టం పేదల భూ హక్కులను కాపాడేందుకు తీసుకున్న చట్టం అని పేర్కొన్నారు. “ప్రభుత్వం ఈ చట్టాన్ని ప్రవేశపెట్టడం వల్ల 600 కోట్ల నష్టం రాకుండా కాపాడగలిగాం” అని పేర్కొన్నారు.
“మా ప్రభుత్వం వచ్చిన తర్వాత భూ కబ్జాలు చేసిన వారిపై కేసులు నమోదు చేసాం. కొన్ని ప్రాంతాల్లో వేల ఎకరాల భూములు బదిలీ చేయబడ్డాయి. ఇలాంటి పరిస్థితులను చక్కదిద్దేందుకే, భూమి యజమానుల హక్కులను కాపాడేందుకే భూ భారతి-2024 చట్టం తీసుకువచ్చాం” అని ఆయన తెలిపారు. “ఈ చట్టం ద్వారా 55 కోట్ల రూపాయలతో 600 కోట్ల నష్టం లెక్కించడమంటే అలా మనం రైతుల భూములు కాపాడే పనిలో ఉన్నాం. భూ హక్కులను కాపాడేందుకే భూ భారతి చట్టం తీసుకొచ్చామని సీఎం రేవంత్ తెలిపారు.

