ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు
హనుమకొండలో గుండెపోటు
మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు
5రోజులు మృత్యువుతో పోరాటం
కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం
ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు
మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు
యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం
వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ సాన్నిహిత్యం
3 దఫాలు నర్సంపేట బ్లాక్ అధ్యక్షుడు
బియ్యాల, కెప్టెన్ సలహాతో ఉద్యమంలోకి
కేసీఆర్ తో ఎడతెగని అనుబంధం
2001 నుంచి బీఆర్ఎస్ తోనే ప్రయాణం
వేం నరేందర్ రెడ్డిని ఓడించి జెడ్పీటీసీ..
కీలక ఘట్టాల్లో వరంగల్ జిల్లా అధ్యక్షుడు
ఫిరాయింపుల టైమ్ లోనూ కేసీఆర్ తోనే
మలి ఉద్యమ మేలిమి నేత సుదర్శన్ రెడ్డి
జై తెలంగాణ! అని నినదించిన ఓ గొంతు మూగబోయింది. తెలంగాణ మలి ఉద్యమ ఓ మేలిమి యోధుడిని కోల్పోయింది. అలుపెరుగని ఉద్యమం ముగిసిపోయింది. అంతరాలకతీతంగా ప్రగతికే పరితపించిన నిరంతర పోరాటం ఆగిపోయింది. ఆయన సేవలతో పులకించిన నల్లబెల్లి సహా, నర్సంపేట నియోజకవర్గం నివ్వెర పోయింది. ఆయన చేసిన అభివృద్ధి, ఆయన చావును చూసి లిప్తకాలం లుప్తమై ఆగిపోయింది. తెలంగాణ ఉద్యమానికి వెన్ను, దన్నైన ‘పెద్ద’న్న పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ ఘడియల్లో ‘అడుగు’ నివాళులర్పిస్తూ, ఆయన పుట్టుక, చదువు, రాజకీయ ప్రస్థానం-జీవితంపై ప్రత్యేక కథనాన్ని ప్రచురిస్తోంది.
బీఆర్ఎస్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని గుండెపోటు వెంటాడితే, మృత్యువు వేటాడింది. తెలంగాణ కోసం అనేక ఉద్యమాల్లో కీలకంగా వ్యవహరించి, నిలిచి, గెలిచిన ఆయన మృత్యువుతోనూ పోరాడారు. చివరకు ఓడిపోయారు. మృత్యువుతో ఆయన 5 రోజుల సుదీర్ఘ పోరాటం ముగిసింది. గురువారం అర్థరాత్రి దాటాక శుక్రవారం తెల్లవారు జామున ఉదయం 12.50 గంటలకు మరణించినట్లుగా ఆయనకు హైదరాబాద్ లో చికిత్స చేస్తున్న హాస్పిటల్ వైద్యులు ప్రకటించారు.
అంతకుముందు గత ఆదివారం హనుమకొండలోని తన నివాసంలో గుండెపోటుకు గురయ్యారు. సుదర్శన్ రెడ్డిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఓ ప్రైవేటు హాస్పిటల్ కి తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు వైద్యులతో ఫోన్లో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఆయనకు 9సార్లు సీపీఆర్ చేసి, ప్రాణాపాయం నుంచి కాపాడామని వైద్యులు ప్రకటించారు. అయితే, మెరుగైన వైద్యం కోసం ఆయన్ను హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించి, ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. ఆయనను, ఆయన కుటుంబాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావులు పరామర్శించి, వైద్య సేలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేకంగా ఇండియాకు వచ్చారు. ఆయన కుటుంబాన్ని ఓదార్చారు. పెద్దిని చూడ్డానికి, ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు వేలాదిగా అటు వరంగల్, ఇటు హైదరాబాద్ హాస్పిటల్స్ కు పోటెత్తారు.
పెద్ది మరణ వార్తతో హాస్పిటల్, ఆయన నివాసం, ఆయన ఊరు నల్లబెల్లి, నియోజకవర్గం నర్సంపేట, ఆయన అభిమానులు, పార్టీ శ్రేణుల్లోనూ విషాదం అలుముకుంది. ఉద్యమకాలంలో ఆయన తెలంగాణ పోరాట పటిమను, అనాటి నుంచి నేట దాకా పెద్దితో ఉన్న తమ అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకుని విలపిస్తున్నారు.
కాగా, పెద్ది సుదర్శన్ రెడ్డి, తెలంగాణ ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడు. పెద్ది 1974, ఆగస్టు 6న రాజిరెడ్డి, అమృతమ్మ దంపతులకు ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుతం వరంగల్ రూరల్ జిల్లా, నల్లబెల్లిలో జన్మించారు. 1991లో వరంగల్ లోని మహబూబియా పంజేథన్ కాలేజీ నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేశారు.
అబాల వెంకట్ రెడ్డి వద్ద ఓనమాలు దిద్ది…
ఆరంగేట్రంలోనే నల్లబెల్లి మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి వద్ద రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ సాన్నిహిత్యం పెంచుకున్నారు. 3 దఫాలు నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేశారు. దివంగత ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్ రావు, మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంత రావుల ప్రోత్బలంతో ఆదిలోనే తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారు.
వేంపై జెడ్పీటీసీగా గెలుపొంది…
కేసీఆర్ 2001లో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. అప్పట్లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే టీఆర్ఎస్ పార్టీ బీ ఫాం తీసుకుని ఎన్నికల బరిలో దిగి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిపై అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఉమ్మడి వరంగల్ జెడ్పీలో ఆ పార్టీకి ఫ్లోర్ లీడర్ గా కొనసాగారు. 2004 డిసెంబర్ లో జిల్లా పార్టీ కన్వీనర్ గా ఎన్నికయ్యారు. 2005 చివర్లో రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా ఎనిమిది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీకి, వరంగల్ జిల్లా ఉద్యమానికి సారథ్యం వహించాడు. ఆ తర్వాత 2006 నుండి 2014 వరకు పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యునిగా (పొలిటికల్ బ్యూరో ప్రారంభం నుండి రద్దయ్యే వరకు) పనిచేస్తూ.. కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా, ఉద్యమ నేతగా అనతి కాలంలోనే రాష్ట్ర స్థాయిలో రాజకీయ గుర్తింపును పొందారు.
గిన్నీస్ రికార్డుల్లోకి…
ప్రపంచంలోనే ప్రాంతీయ ఉద్యమానికి అత్యధిక జనసమీకరణతో వరంగల్ సింహగర్జనకు సారథ్యం వహించి, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ లో నిలిచారు.
నర్సంపేట ఎమ్మెల్యేగా…
2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప స్వతంత్ర అభ్యర్థి దొంతి మాధవ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2015లో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ నుండే పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అదే దొంతి మాధవ రెడ్డిపై గెలుపొందారు. తర్వాత ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సభ్యుడిగా ఉన్నారు. సుదర్శన్ రెడ్డి 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయారు.
జగన్ ను అడ్డుకుని…
పల్లె నుండి పట్టాల మీదికి అనే కార్యక్రమం ద్వారా ఏపీ సీఎం జగన్ ను తెలంగాణలో అడుగు పెట్టకుండా మహబూబాబాద్ లో అడ్డుకున్నారు. అలాగే తెలంగాణ ఉద్యమానికి అడ్డుపడొద్దని చంద్రబాబుకే నేరుగా హితవు పలికిన ఫణికర మల్లయ్య కాళ్ళు కడిగారు.
మలి ఉద్యమంలో మేలిమి యోధుడు
తెలంగాణ మలి ఉద్యమాలన్నింటిలోనూ తనదైన ముద్ర వేస్తూ కీలకంగా పని చేశారు. మహాగర్జన లాంటి చారిత్రాత్మకమైన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సభలు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలోనే జరిగాయి. తెలంగాణ ఉద్యమ కాలంలో వరంగల్ జిల్లా కేంద్రంగా జరిగిన అన్ని సభలకు పెద్ది సుదర్శన్ రెడ్డి అధ్యక్షత వహించారు.
తెలంగాణ వచ్చాకే పెళ్ళి
కాగా, తెలంగాణ వచ్చాకే పెళ్ళి చేసుకుంటానని ప్రతిన బూనిన పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆ తర్వాతే స్వప్నను వివాహం చేసుకున్నారు. తర్వాత ఆమెను నల్లబెల్లి జెడ్పీటీసీగా గెలిపించుకున్నారు. ఆయనకు ఒక బాబు, ఒక పాప ఉన్నారు.
బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే నల్లబెల్లి మండలంలోనే 863 మందికి రాజకీయాలకతీతంగా పై కప్పు పెంకలను పంపిణీ చేశారు. అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా అప్పటి ఎంపీ రామ సహాయం సురేందర్ రెడ్డి సహకారంతో పంపిణీ చేశారు. సివిల్ సప్లైస్ చైర్మన్ గా ఇది రబరింగ్ సిస్టర్స్ సిస్టమ్ ద్వారా గోదావరి జలాలు రామప్పకు తెప్పించి, రంగాయ చెరువుకు అక్కడి నుండి పాఖాల చెరువుకు నీళ్ళను తెచ్చి రైతుల కాళ్ళు కడిగారు. ఈ సంద్భంగా రైతుల ఒక ఎకరం భూమిని కూడా ముంపుకు గురికాకుండా ఈ పని చేశారు. ఇది దేశంలోనే రెండో అతి పెద్ద కార్యక్రమం.
తెలంగాణకు మొదటి వాటర్ షెడ్ నల్లబెల్లికే
జెడ్పీటీసీగా ఉన్న సమయంలోనే అప్పట్లో కుప్పంలో మాత్రమే ఉన్న వాటర్ షెడ్ పథకాన్ని, తెలంగాణకు తెప్పించి, నల్లబెల్లిలో ఏర్పాటు చేసిన ఘనత కూడా పెద్ది చెల్లింది.
మంకీ ఫుడ్ కోర్టులకు ఆద్యుడు
దేశంలోనే మొదటి సారిగా నర్సంపేటలో మంకీ ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేసిన ఘనత కూడా పెద్దికే దక్కుతుంది. నేటికీ అవి నర్సంపేటలో పని చేస్తున్నాయి.
పైపులైన్ల ద్వారా ఇంటింటికీ గ్యాస్..
పైపులైన్ల ద్వారా ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్లు ఇప్పించి, సరఫరా చేసే ఓ పథకాన్ని నర్సంపేటలో ప్రారంభించి, 90శాతం పూర్తి చేసిన ఘనత కూడా పెద్ది సుదర్శన్ రెడ్డికే దక్కుతుంది.
నర్సంపేటకు మెడికల్ కాలేజీ…
అలాగే నర్సంపేటకు మెడికల్ కాలేజీని స్థాపించడంలో కీలకంగా వ్యవహరించారు. స్వయంగా ఆ కాలేజీని ప్రారంభించే వరకు పట్టువదలని విక్రమార్కుడిలా పని చేశారు.
నర్సంపేటకు డయాలసిస్ సెంటర్
పెద్ది సుదర్శన్ రెడ్డి, నర్సంపేటకు డయాలసిస్ సెంటర్ ను తీసుకువచ్చారు. అప్పటి మంత్రి హరీశ్ రావును ఒప్పించి,19 మిషన్లను అమర్చారు. ఆ సేవలు అందుతున్నాయి.
కరోనా సమయంలో వైద్య సేవలు
కరోనా సమయంలో… ఇంటింటికీ పండ్లు పంపిణీ చేసి చరిత్రను తిరగ రాశారు. కరోనా బాధితులను నర్సంపేట క్యాంపు కార్యాలయం ఎదురుగా ఉన్న డిగ్రీ కాలేజీలో అపొలుఫర: షెల్టర్ ఏర్పాటు చేసి, వందలాది మందికి అన్ని వసతులు కల్పించి, భోజనాలు, డ్రై ఫ్రూట్స్, వైద్య సేవలు అందించారు.
దేశంలోనే 3 మిర్చీ విత్తన పరిశోధన కేంద్రానికి అంకురార్పణ
నర్సంపేటకు దేశంలోనే 3వ మిర్చీ విత్తన పరిశోధన కేంద్రానికి అంకురార్పణ చేశారు. మంజూరు, నిధులను కూడా తెప్పించారు. అలాగే వరంగల్ చపాతా మిర్చీ రకం విత్తనాలను రైతులే పండించడాన్ని గమనించి, దాని పరిశోధనా కేంద్రానికి 54 ఎకరాలు సేకరించి, రూ.54 కోట్లు విడుదల చేయించారు.
పార్టీలకతీతంగా రైతాంగానికి పరిహారాలు
పార్టీలకతీతంగా గతంలో ఎన్నడూ లేని విధంగా నర్సంపేటలోనే ప్రతి రైతుకు పంటల నష్ట పరిహారం అందించిన ఘనత కూడా పెద్ద సుదర్శన్ రెడ్డికి చెందుతుంది.
అన్ని రంగాల్లో నర్సంపేట రికార్డు పురోగతి
నర్సంపేటను విద్యా, వైద్య, ఆరోగ్య, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యమిచ్చి, అంతర్జాతీయ ప్రమాణాలతో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చే విధంగా తనవంతుగా పెద్ది సుదర్శన్ రెడ్డి పని చేశారు.
పార్టీ శ్రేణులన్నీ వరంగల్ వైపే
తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్ర, అంత్య క్రియలకు భారీ ఎత్తున పార్టీ అన్ని శ్రేణులు వరంగల్ కు పయనమయ్యాయి. సమాచారం అందుకున్న తెలంగాణ, ఉద్యమకారులు, పార్టీ నాయకులు వరంగల్ కు తరలి వస్తున్నారు.
స్వగ్రామంలో అంత్యక్రియలు
పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు ఆయన స్వగ్రామం నల్లబెల్లిలో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆయన కుటుంబం ఏర్పాట్లు చేస్తున్నది.
అంత్యక్రియలకు కేసీఆర్?
పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలకు కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కేటీఆర్, హరీశ్ రావు వంటి నేతలంతా వరంగల్ కు వస్తుండగా, కేసీఆర్ మాత్రం అంత్యక్రియలకు హాజరవుతారని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, పలు పార్టీల, పలువురు నేతలు పెద్ది సుదర్శన్ రెడ్డికి సంతాపాలు తెలియ చేస్తున్నారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమక్రియల బాధ్యతను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిర్వర్తిస్తున్నారు.
పెద్ది అంతిమయాత్ర, అంత్యక్రియలు ఇలా..
- హనుమకొండ అమర వీరుల స్థూపం దగ్గర కొద్దిసేపు ఉంచి నివాళులర్పిస్తారు.
- అక్కడ నుండి నర్సంపేటకు తీసుకు వస్తారు. నర్సంపేటలో శవయాత్ర ఊరేగింపు జరుగుతుంది.
- అనంతరం నర్సంపేట నుండి నల్లబెల్లిలోని ఆయన ఇంటికి తీసుకెళ్తారు. అనంతరం అక్కడి నుంచి అంత్యక్రియలు మదలవుతాయి. నల్లబెల్లిలోని పెద్ది వ్యవసాయ క్షేత్రం లో తన తండ్రి అంత్యక్రియలు జరిగినచోటే పెద్ది అంత్యక్రియలు జరుపుతారు.

