అన్ని జెండాలది ఒకటే ఎజెండా!
కార్మిక భవనం ‘కీ‘లకంగా కార్పొరేషన్ సమావేశం
వరంగల్ బల్దియా ఎదుట అజంజాహి కార్మికుల నిరసన
కార్మిక భవన్ కూల్చిన వారిపై కఠిన చర్యలకు ఎమ్మెల్సీ సారయ్య పట్టు
రూ.10 కోట్లతో కార్మిక భవన్ కట్టాలని మంత్రి సురేఖకు కార్మికుల వినతి
అజం జాహీ మిల్లు కార్మిక భవన స్థల కబ్జాదారులు ఎవరి బలంతో హైకోర్టుకు వెళ్లారు? కబ్జాల కాసం యాజమాన్యాన్ని నిలువరించే శక్తి ఏ ‘కొండ’కు, ఏ ‘ బండ ‘ కు, ఏ ‘గుండు’ కు లేదా? కావాలనే అక్రమ నిర్మాణానికి అంతా మద్దతిస్తున్నారా? అసలు మీరు కార్మికుల పక్షమా? కాసం పక్షమా? అంటూ ఆక్రోశం వెళ్లగక్కారు. మొత్తం వరంగల్ మహా నగరానికి ప్రాతినిధ్యం వహించే అన్ని పార్టీల కార్పోరేటర్ల, ప్రజాప్రతినిధులతో మంత్రి కొండా సురేఖ ముఖ్యఅతిథిగా బల్దియా సర్వ సభ్య సమావేశం జరిగితే, అందులో అంతా ఏకతాటిపై నిలిచారు. అన్ని పార్టీలు తమ జండాలను మరిచి ఒకే జెండా కిందకు వచ్చారు అదే అజం జాహి మిల్లు కార్మిక భవన స్థల కబ్జా వివాదం. ఇక ఇప్పుడు నాయకులు ఎవరి పక్షమో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఆసన్నమైంది.
వరంగల్ మహా నగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశం అజంజాహి కార్మిక భవనం చుట్టూనే తిరిగింది. లోపలా, బయటా అంతా అదే చర్చగా, రచ్చ రచ్చగా సాగింది. కార్మికులు, కార్పొరేటర్లు, ప్రజాప్రతిందులు అంతా అదే అంశంపై అల్లరి అల్లరి చేశారు.
బయట కార్మికుల కలకలం

కార్పొరేషన్ సమావేశం ప్రారంభం కానున్న కొద్దిసేపటి ముందే బల్దియా కార్యాలయానికి పెద్ద ఎత్తున అజంజాహి కార్మికులు చేరుకొని నిరసనకు దిగారు. ఫ్లెక్సీలు, నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. కార్పొరేషన్ కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి నినాదాలతో నిరసన తెలిపారు. కాసం పుల్లయ్య డౌన్ డౌన్.. ! కాసం నమశ్శివాయ డౌన్ డౌన్ !! అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నేతలు ఇనుముల శ్రీనివాస్, గంగుల దయాకర్ మాట్లాడారు. కార్మిక భవనాన్ని కూల్చిన వారిపై చర్యలు తీసుకొని సొంత డబ్బులతో కార్మిక భవన్ కట్టిస్తానని గత నెలలో విలేకరుల సమావేశంలో మాటిచ్చిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు నెల రోజులు గడిచినా, ఇప్పటి వరకు పెదవి విప్పలేదని, పత్తా లేకుండా పోయారని కార్మికులు ఆరోపించారు. కొండా మురళి మద్దతు లేకుండానే కాసం నమశివాయ హైకోర్టుకు వెళ్లారా? కాసం యాజమాన్యాన్ని నిలువరించే శక్తి కొండా మురళికి లేదా? కావాలనే అక్రమ నిర్మాణానికి కొండా దంపతులు మద్దతిస్తున్నారా? అని ప్రశ్నించారు. కొండా దంపతులు కార్మికుల పక్షమా? కాసం పక్షమా? తేల్చుకోవాలన్నారు.
లోపల వాడివేడిగా…

మరోవైపు కార్పొరేషన్ ప్రధాన ద్వారం బయట కార్మికుల ఆందోళనల మధ్య సమావేశ మందిరం లోపల ప్రారంభమైన సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య కార్మిక భవన్ కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని, కాసం కాంప్లెక్స్ కు అనుమతులు ఇచ్చిన అధికారులపై వేటువేయాలని డిమాండ్ చేశారు. గత ఎమ్మెల్యే అజంజాహి కార్మిక భవనం అమ్మితే, అందుకు కొందరు కార్పొరేషన్ అధికారులు సహకరించారని ఆరోపించారు. తప్పుడు దస్తావేజులతో, నిబంధనలను తుంగలో తొక్కి కాంప్లెక్స్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని సారయ్య మండిపడ్డారు. వెంటనే కాసం కాంప్లెక్స్ కి ఇచ్చిన అనుమతులు రద్దుచేసి ప్రభుత్వానికి చెడ్డ పేరును రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు అన్ని పార్టీలు మద్దతు తెలపడం విశేషం.
కబ్జాదారులపై నిప్పులు చెరిగిన సారయ్య

కౌన్సిల్ సమావేశం నుంచి బయటికి వచ్చిన మాజీ మంత్రి సారయ్య మీడియా సమావేశంలోనూ కార్మిక భవన్ కబ్జాదారులపై నిప్పులు చెరిగారు. కొందరు కబ్జాలు చేసిన పని వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ధ్వజమెత్తారు. కబ్జాదారులను వదిలిపెట్టేది లేదని కార్మిక భవన్ కట్టించే వరకు విశ్రమించేది లేదన్నారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి కార్మిక భవన నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
మంత్రి సురేఖకు వినతిపత్రం

అజం జాహి కార్మిక భవనాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని, కార్మిక భవన్ ను కూల్చిన వారిని అరెస్టు చేయాలని కార్పొరేషన్ సమావేశానికి హాజరైన మంత్రి కొండా సురేఖకు అజం జాహీ కార్మిక సంఘ నాయకులు డిమాండ్ చేస్తూ వినతి పత్రం సమర్పించారు. రూ 10 కోట్లతో కార్మిక భవన్ కూల్చిన చోట అన్ని హంగులతో కొత్త కార్మిక భవనం నిర్మించాలని వినతి పత్రంలో కోరారు.

