చిన్న మోసగాళ్లనే కాదు, పెద్ద కార్పొరేట్ సంస్థలు, ప్రభావశీల వ్యక్తులు చేసిన అక్రమాలపై కూడా సమానంగా చర్యలు తీసుకోవాలి. చట్టం ముందు అందరూ సమానమనే నమ్మకం ఏర్పడినప్పుడే ఆర్థిక క్రమశిక్షణ బలపడుతుంది. లేకపోతే ఒక కుంభకోణం ముగిసేలోపే మరో కుంభకోణం వెలుగులోకి వస్తూనే ఉంటాయి. ఆర్థిక మోసాలకు నిజమైన అడ్డుకట్ట కఠిన చట్టాలు మాత్రమే కాదు. వాటి నిష్పాక్షిక అమలే ముఖ్యం.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
దేశంలో ఆర్థిక నేరాలు, కార్పొరేట్ కుంభకోణాలు, బ్యాంకింగ్ మోసాలు, పెట్టుబడిదారుల మోసాలు రాను రాను మితిమీరుతున్నాయి. వాటి కట్టడికి తీసుకుంటున్న చర్యలెన్నీ తీసుకున్నా, అంతకు మించి ఆర్థిక నేరాలు అనేక కొత్త కోణాల్లో వెలుగు చూస్తున్నాయి. ఇటీవలి ఘటనలు చూస్తే వ్యవస్థలోని లోపాలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నవారి అవినీతి ఒకవైపు, కార్పొరేట్ సంస్థల ఆర్థిక అక్రమాలు మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయి. మోసాలు జరిగిన తర్వాత దర్యాప్తులు ప్రారంభమవుతున్నప్పటికీ, వాటిని ముందుగానే గుర్తించి అడ్డుకునే వ్యవస్థ మాత్రం ఇంకా బలపడలేదు.
దేశంలో గత రెండు దశాబ్దాలుగా అనేక భారీ ఆర్థిక కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి. విజయ్ మాల్యా కేసులో బ్యాంకులకు రూ.9 వేల కోట్లకు పైగా బకాయిలు మిగిలాయి. నీరవ్ మోడీ–పంజాబ్ నేషనల్ బ్యాంకు మోసం రూ.13 వేల కోట్ల మేర జరిగింది. ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడీపై ఆర్థిక అక్రమాల ఆరోపణలు వచ్చాయి. సహారా ఇండియా కేసులో లక్షలాది మంది చిన్న పెట్టుబడిదారులు తమ పొదుపులను కోల్పోయారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ కుంభకోణం లక్షలాది కుటుంబాలను ఆర్థికంగా దెబ్బతీసింది. ఇటీవల మైక్రో ఫైనాన్స్ సంస్థల అక్రమాలు, చిట్ఫండ్ మోసాలు, ఆన్లైన్ పెట్టుబడి మోసాలు కూడా పెరుగుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో బెంగళూరుకు చెందిన బంగారం, ఆభరణాల దిగ్గజ సంస్థ రాజేష్ ఎక్స్ పోర్ట్స్ లిమిటెడ్ వ్యవహారం దేశ కార్పొరేట్ రంగాన్ని కుదిపేసింది. సంస్థ తన ఆదాయాన్ని భారీగా అధికంగా చూపించి, పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించిందనే ఆరోపణలపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ దర్యాప్తు చేపట్టింది. ఒక సాధారణ పెట్టుబడిదారుడి ఫిర్యాదుతో ప్రారంభమైన ఈ విచారణలో కంపెనీ ఆర్థిక లెక్కల్లో తీవ్ర వ్యత్యాసాలు ఉన్నట్లు బయటపడింది. కంపెనీ యాజమాన్యం పలుమార్లు నోటీసులు ఇచ్చినా పూర్తి సహకారం అందించకపోవడం అనుమానాలను మరింత పెంచింది.
ఇది దేశంలో జరిగిన తొలి కార్పొరేట్ స్కాం కాదు. 2009లో సత్యం కంప్యూటర్స్ కుంభకోణం దేశాన్ని కుదిపేసింది. కంపెనీ ఖాతాల్లో రూ.7,800 కోట్ల మేర తప్పుడు లెక్కలు చూపించినట్లు బయటపడింది. చివరకు సంస్థ వ్యవస్థాపకుడు బి. రామలింగరాజుకు శిక్ష పడింది. ఆ ఘటన తర్వాత కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలు మెరుగుపడతాయని భావించినా, ఇప్పటికీ ఇటువంటి ఘటనలు పునరావృతమవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
కార్పొరేట్ రంగంలో మోసాలలో కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. ఆదాయాన్ని అధికంగా చూపించడం, అప్పులను దాచిపెట్టడం, అనుబంధ షెల్ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపు, తప్పుడు ఆడిట్ నివేదికలు, షేర్ విలువలను కృత్రిమంగా పెంచడం వంటి పద్ధతులు తరచూ కనిపిస్తున్నాయి. విదేశాల్లో ఏర్పాటు చేసిన షెల్ కంపెనీలు ఈ అక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. నియంత్రణ వ్యవస్థల కళ్లుగప్పి నిధులను తరలించడం, లెక్కలను మార్చడం ద్వారా వేల కోట్ల రూపాయల మోసాలు జరుగుతున్నాయి.
అయితే, ఈ అక్రమాలను ముందుగానే ఎందుకు గుర్తించలేకపోతున్నారు? దేశంలో సెబీ, రిజర్వ్ బ్యాంక్, ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ వంటి పలు సంస్థలు ఉన్నప్పటికీ, అనేక సందర్భాల్లో అవి స్పందించేది మోసం బయటపడిన తర్వాతే. పర్యవేక్షణ వ్యవస్థలు ముందస్తు హెచ్చరికలను గుర్తించడంలో విఫలమవుతున్నాయి. ఫలితంగా చిన్న పెట్టుబడిదారులు, బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి.
భారతదేశంలో నమోదవుతున్న ఆర్థిక నేరాల సంఖ్య కూడా పెరుగుతోంది. జాతీయ నేర గణాంకాల ప్రకారం ప్రతి ఏడాది వేలాది ఆర్థిక మోసాల కేసులు నమోదవుతున్నాయి. సైబర్ మోసాలతో పాటు పెట్టుబడి మోసాలు, బ్యాంకు రుణాల ఎగవేతలు, చిట్ఫండ్ మోసాలు పెరుగుతున్నాయి. అయితే నేరస్థులకు త్వరితగతిన శిక్షలు పడకపోవడం వల్ల నిరోధక ప్రభావం కనిపించడం లేదు.
ఆర్థిక మోసాలకు అడ్డుకట్ట వేయాలంటే కొన్ని కీలక చర్యలు తప్పనిసరి. నియంత్రణ సంస్థలకు పూర్తి స్వతంత్రత, సాంకేతిక సామర్థ్యాలు కల్పించాలి. కార్పొరేట్ సంస్థల ఆడిటింగ్ వ్యవస్థను మరింత కఠినతరం చేయాలి. పెట్టుబడిదారుల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించే వ్యవస్థ ఉండాలి. షెల్ కంపెనీలపై కఠిన నిఘా అవసరం. భారీ ఆర్థిక నేరాలకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి త్వరితగతిన తీర్పులు ఇవ్వాలి.
దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రజల విశ్వాసం నిలబడాలంటే కేవలం చిన్న మోసగాళ్లనే కాదు, పెద్ద కార్పొరేట్ సంస్థలు, ప్రభావశీల వ్యక్తులు చేసిన అక్రమాలపై కూడా సమానంగా చర్యలు తీసుకోవాలి. చట్టం ముందు అందరూ సమానమనే నమ్మకం ఏర్పడినప్పుడే ఆర్థిక క్రమశిక్షణ బలపడుతుంది. లేకపోతే ఒక కుంభకోణం ముగిసేలోపే మరో కుంభకోణం వెలుగులోకి వచ్చే పరిస్థితి కొనసాగుతూనే ఉంటుంది. ఆర్థిక మోసాలకు నిజమైన అడ్డుకట్ట కఠిన చట్టాలు మాత్రమే కాదు. వాటి నిష్పాక్షిక అమలే ముఖ్యం.

