Tuesday, September 15, 2026
25.2 C
Hyderabad

సైన్యానికి సెల్యూట్! కబర్దార్ పాక్!

యుద్ధం మిగిలే ఉంది!!
ఉగ్రవాదాన్ని ఉసిగొల్పితే చావు దెబ్బే!
– ఇక చర్చలు ఉగ్రవాదం, పీవోకే మీద మాత్రమే!
– న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ కు భయపడం
– పాక్ ‘ఉగ్ర’ స్థావరాలు గ్లోబల్ టెర్రరిజానికి మూలం
– నీరు, రక్తం కలిసి ప్రవహించలేవు
– పాక్ మనుగడ దాని ‘ఉగ్ర’ నిర్మూలనపైనే ఆదారపడి ఉంది
– పాక్ పెంచిపోషిస్తున్న ఉగ్రవాదం ఆ దేశాన్ని నాశనం చేస్తుంది
– ఇది యుద్ధ యుగం కాదు. ఉగ్రవాదానికి తావులేదు
– ప్రపమంచమంతా మానవత్వం, శాంతి సౌభాగ్యం నిండాలి
– యుద్ధభూమిలో ప్రతిసారీ పాక్ ను ఓడించాం
– మేడ్ ఇన్ ఇండియా ఆయుధాల ప్రామాణికత రుజువైంది
– ఆపరేషన్ సిందూర్ ప్రతి భారత మహిళకు అంకితం
– మన ఐక్యతే మనకున్న గొప్ప బలం
– పాక్ ప్రాణాల కోసం ప్రపంచాన్ని అడుక్కుంది
– వాయిదా వేసింది యుద్ధాన్ని కాదు ప్రతీకార చర్యను మాత్రమే
– జాతినుద్దేశించి భారత ప్రధాని మోడీ భావోద్వేగంగా ప్రసంగం

‘యుద్ధం ముగియలేదు. వాయిదా వేసింది యుద్ధాన్ని కాదు ప్రతీకార చర్యను మాత్రమే’ అంటూ భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ‘మేము మా స్వంత పద్ధతిలో, మా స్వంత నిబంధనలపై మాత్రమే దీటుగా స్పందిస్తాం. పాక్ తో చర్చలంటూ జరిగితే, ఉగ్రవాదం, పీఓకే మీద మాత్రమే’నని తేల్చిచెప్పారు. ‘ఉగ్రవాదులు, ఉగ్రవాదులను పోషిస్తున్న దేశం వేరుకాదు. న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ కు భయపడం. పాక్ ఉగ్రవాద స్థావరాలు గ్లోబల్ టెర్రరిజానికి మూలం. భారత్ ప్రతి దాడుల తర్వాత పాక్ ప్రాణాల కోసం ప్రపంచాన్ని అడుక్కుంది. పాక్ మనుగడ దాని ‘ఉగ్ర’ నిర్మూలనపైనే ఆదారపడి ఉంది.’ అంటూ సూటిగా, గట్టిగానే హెచ్చరించారు. ‘యుద్ధభూమిలో ప్రతిసారీ పాక్ ను ఓడించాం.ఈసారి ఆపరేషన్ సిందూర్ కొత్త కోణాన్ని జోడించింది. మేడ్ ఇన్ ఇండియా ఆయుధాల ప్రామాణికత రుజువైంది. మన ఐక్యతే మనకున్న గొప్ప బలం.’ అన్నారు. ‘ఆపరేషన్ సిందూర్ దేశ ప్రజల భావోద్వేగం. ప్రతి భారత మహిళకు అంకితం’ ఇచ్చారు. ‘నీరు, రక్తం కలిసి ప్రవహించలేవు.రచ్చ, చర్చలు కలిసి ప్రయాణించలేవు. ఇది యుద్ధ యుగం కాదు. ఉగ్రవాదానికి తావులేదు. ప్రపమంచమంతా మానవత్వం, శాంతి సౌభాగ్యం వెల్లి విరియాలి’ అని మోడీ ప్రపంచ శాంతిని చాటారు. జాతినుద్దేశించి భారత ప్రధాని మోడీ ప్రసంగించారు.

పెహల్గాం ఉగ్రదాడి తర్వాత దాయాది దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ మన దేశ ఉక్కు సంకల్పాన్ని, అకుంఠిత దీక్షా దక్షతలను సూటిగా, స్పష్టంగా పాకిస్తాన్ కు, ప్రపంచ దేశాలకు వివరించారు. దేనికీ భయపడబోమంటూనే, పాకిస్తాన్ ను అన్ని విధాలుగా హెచ్చరించారు. మన శక్తి యుక్తులను, ఐక్యతా బలాన్ని చాటారు. యుద్ధం ఆగలేదు. ఉగ్రవాద ప్రతీకార చర్యలకు విరామం మాత్రమే ఇచ్చామని తేల్చేశారు. ఈసారి ఆపరేషన్ సిందూర్ కొత్త కోణాన్ని జోడించింది. మేడ్ ఇన్ ఇండియా ఆయుధాల ప్రామాణికత రుజువైంది. మన ఐక్యతే మనకున్న గొప్ప బలం. అంటూ జాతినుద్దేశించి ప్రసంగించిన భారత ప్రధాని మోడీ పూర్తి ప్రసంగ పాఠం.

భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగ పాఠం

ప్రియమైన దేశవాసులారా, నమస్కారం!

మనమందరం గతంలో మన దేశ బలాన్ని, సంయమనం రెండింటినీ చూశాం. అన్నింటి కంటే మొదటగా, నేను భారత దేశంలోని శక్తివంతమైన సైన్యాలకు, సాయుధ బలగాలకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను.

మన నిఘా సంస్థలకు, మన శాస్త్రవేత్తలకు ప్రతి భారతీయుని తరపున నమస్కరిస్తున్నాను. ‘ఆపరేషన్ సిందూర్’ లక్ష్యాలను సాధించడానికి మన వీర సైనికులు అపారమైన ధైర్యాన్ని ప్రదర్శించారు. వారి ధైర్యసాహసాలకు ఈ రోజు అంకితమిస్తున్నాను.బమన దేశంలోని ప్రతి తల్లికి, దేశంలోని ప్రతి సోదరికి, ఈ ధైర్యాన్ని దేశంలోని ప్రతి కుమార్తెకు అంకితం చేస్తున్నాను.

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాదులు ప్రదర్శించిన అనాగరికత దేశాన్ని, ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. సెలవులు జరుపుకునే అమాయక పౌరుల మతాన్ని అడగుతూ, వారి కుటుంబాల ముందే, వారి పిల్లల ముందే, కిరాతకంగా చంపారు. ఇది చాలా భయంకరమైన భీభత్సం. క్రూరత్వం. దేశ సామరస్యాన్ని విచ్ఛిన్నం చేసే నీచమైన ప్రయత్నం కూడా. ఈ బాధ నాకు వ్యక్తిగతంగా చాలా గొప్పది. ఈ ఉగ్రదాడి తర్వాత దేశం మొత్తం, ప్రతి పౌరుడు, ప్రతి సమాజం, ప్రతి వర్గం, ప్రతి రాజకీయ పార్టీ… ఉగ్రవాదంపై కఠిన చర్యల కోసం ఒకే గొంతుకగా నిలబడి… ఉగ్రవాదులను నాశనం చేసేందుకు భారత బలగాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చాం.

మరి ఈ రోజు మన సోదరీమణులు, కూతుళ్ల నుదుటిపై నుంచి సిందూరాన్ని తొలగిస్తే, ఎలాంటి తీవ్ర పరిణామాలు ఎదురవుతాయో ప్రతి ఉగ్రవాదికి, ప్రతి ఉగ్రవాద సంస్థకు తెలిసివచ్చింది.

‘ఆపరేషన్ సిందూర్’ ఇది కేవలం పేరు మాత్రమే కాదు, దేశంలోని కోట్లాది ప్రజల మనోభావాలకు ప్రతిబింబం. ఆపరేషన్ ‘సిందూర్’… న్యాయానికి తిరుగులేని ప్రతిజ్ఞ.

మే 6వ తేదీ అర్థరాత్రి… మే 7వ తేదీ ఉదయం… ఈ ప్రతిజ్ఞ ఫలితాలుగా మారడాన్ని ప్రపంచం మొత్తం తమ కళ్ళతో చూసింది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత బలగాలు దాడి చేసి, వారి శిక్షణా కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నారు. భారత్ ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటుందని ఉగ్రవాదులు కలలో ఊహించలేదు.

కానీ దేశం ఐక్యంగా ఉన్నప్పుడు… ‘నేషన్ ఫస్ట్’ అనే సర్వోన్నత స్ఫూర్తితో నిండి ఉంటుంది. అలా ఉక్కు నిర్ణయాలు తీసుకుంటారు… ఫలితాలు తెచ్చి చూపిస్తారు. తద్వారా ఉగ్రవాద సంస్థల భవనాలే కాదు వారి మనోధైర్యం కూడా చిన్నాభిన్నమైంది.

బహవల్‌పూర్, మురిడ్కే వంటి టెర్రరిస్ట్ స్థావరాలు ఒక విధంగా గ్లోబల్ టెర్రరిజం యొక్క విశ్వవిద్యాలయాలు. ప్రపంచంలో ఎక్కడ భారీ ఉగ్రవాద దాడులు జరిగినా, నైన్ ఎలెవెన్ కావచ్చు… లేదా లండన్ ట్యూబ్ బాంబింగ్స్ కావచ్చు… లేదా గత కొన్ని దశాబ్దాలుగా భారత్‌లో జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడులు కావచ్చు.. వాటి తీగలు ఎక్కడో ఈ ఉగ్రవాద లక్ష్యాలతో అనుసంధానించబడి ఉన్నాయి. ఉగ్రవాదులు మన సోదరీమణుల జీవితాలను ధ్వంసం చేశారు. అందుకే భారత్ ఉగ్రవాద ప్రధాన కార్యాలయాలను ధ్వంసం చేసింది. భారత్ జరిపిన ఈ దాడుల్లో 100 మందికి పైగా భయంకరమైన ఉగ్రవాదులు హతమయ్యారు. గత రెండున్నర మూడు దశాబ్దాలుగా పాక్ లో స్వేచ్ఛగా తిరుగుతూ, భారత్‌పై కుట్ర పన్నిన వారిని… భారత్‌ ఒక్క దెబ్బతో అంతమొందించింది.

మిత్రులారా,
భారత్ ఈ చర్యతో పాక్ తీవ్ర నిరాశకు గురైంది. ఉలిక్కిపడింది. ఈ గందరగోళంలోనే పాక్ మరొక దుస్సాహసానికి పాల్పడింది. ఉగ్రవాదంపై భారత్‌ చర్యకు మద్దతివ్వడానికి బదులు పాకిస్తాన్‌ భారత్‌పైనే దాడి చేసింది. పాకిస్తాన్ మన పాఠశాలలను, కళాశాలలను, గురుద్వారాలను, దేవాలయాలను, సామాన్య పౌరుల ఇళ్లను. టార్గెట్ చేసింది. మన సైనిక స్థావరాలను టార్గెట్ చేసింది. కానీ ఇందులో కూడా పాక్ బట్టబయలైంది. పాక్ డ్రోన్లు, క్షిపణులు భారత్ ముందు గడ్డిపోచలా ఎలా చెల్లాచెదురుగా ఉన్నాయో ప్రపంచం చూసింది. భారతదేశం యొక్క శక్తివంతమైన వైమానిక రక్షణ వ్యవస్థ వాటిని గాలిలోనే నాశనం చేసింది. సరిహద్దుల్లో పాక్ దాడులు చేస్తే, భారత్ మాత్రం పాక్ గుండెలపై దాడి చేసింది. భారత్‌ డ్రోన్‌లు, భారత్‌ క్షిపణులు కచ్చితత్వంతో దాడి చేశాయి. పాకిస్తానీ వైమానిక దళానికి చెందిన ఆ ఎయిర్‌బేస్‌లను దెబ్బతీసింది… దానిపై పాక్ చాలా గర్వంగా ఉంది. తొలి మూడు రోజుల్లోనే పాక్ ను భారత్ ఊహించలేని విధంగా నాశనం చేసింది.

కాబట్టి…
భారత్ దూకుడు చర్య తర్వాత…పాకిస్తాన్ తప్పించుకునే మార్గాలను అన్వేషించడం ప్రారంభించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్తతలను తగ్గించాలని విజ్ఞప్తి చేస్తోంది. భారత్ తీవ్ర దాడుల తర్వాత, ఈ బలవంతం మీద, మే 10 మధ్యాహ్నం, పాకిస్తాన్ సైన్యం మా DGMOని సంప్రదించింది.

అప్పటేకే తీవ్రవాద మౌలిక సదుపాయాలను పెద్ద ఎత్తున ధ్వంసం చేశాం. ఉగ్రవాదులు హతమయ్యారు… పాకిస్తాన్ నడిబొడ్డున ఏర్పాటైన ఉగ్రవాద స్థావరాలు శిథిలావస్థకు చేర్చాం. పాకిస్థాన్ పక్షాన…దాని వైపు నుండి ఎటువంటి తీవ్రవాద కార్యకలాపాలు, సైనిక చర్యలుండవని వచ్చిన హామీ మేరకే భారతదేశం కూడా దీనిని పరిగణించింది. అయితే నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను. మేం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద, సైనిక లక్ష్యాలపై మా ప్రతీకార చర్యను మాత్రమే వాయిదా వేసుకున్నాం.

రానున్న రోజుల్లో…
పాకిస్తాన్ ఎలాంటి వైఖరి అవలంబిస్తుందో దాని ఆధారంగా, అందుకు తగినట్లుగా మేం ప్రతి అడుగును వేస్తాం.

మిత్రులారా!
మన త్రివిధ సైన్యాలు… మన వైమానిక దళం, మన సైన్యం, మన నౌకాదళం, మన సరిహద్దు భద్రతా దళం, భారత పారామిలిటరీ బలగాలు, నిరంతరం అప్రమత్తంగా ఉంటాయి. సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడుల తర్వాత… ఇప్పుడు ఉగ్రవాదంపై పోరులో ఆపరేషన్ సిందూర్ కొత్త రేఖ గీసి… కొత్త స్థాయిని, కొత్త సాధారణతను సృష్టించింది.

మొదటిది- భారత్‌పై ఉగ్రదాడి జరిగితే తగిన సమాధానం ఇస్తాం.మేము మా స్వంత పద్ధతిలో, మా స్వంత నిబంధనలపై స్పందిస్తాం. ఉగ్రవాద మూలాలు బయటపడిన ప్రతి చోటా కఠిన చర్యలు తీసుకుంటాం.
రెండవది- భారతదేశం ఎలాంటి అణు బ్లాక్‌మెయిల్‌ను సహించదు. అణు బ్లాక్‌మెయిల్ ముసుగులో పెరుగుతున్న ఉగ్రవాద లక్ష్యాలపై భారత్ ఖచ్చితమైన మరియు నిర్ణయాత్మక దాడిని ప్రారంభిస్తుంది.
మూడవది- టెర్రరిజానికి మద్దతిచ్చే ప్రభుత్వాన్ని, టెర్రరిస్టులను వేర్వేరుగా చూడం.

ఆపరేషన్ సిందూర్ సమయంలో… హతమైన ఉగ్రవాదులకు వీడ్కోలు పలికేందుకు పాక్ ఆర్మీ సీనియర్ అధికారులు గుమిగూడిన వేళ.. పాకిస్తాన్‌లోని అసహ్యకరమైన నిజాన్ని ప్రపంచం మళ్లీ చూసింది. అక్కడి ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదానికి ఇదో పెద్ద నిదర్శనం.

యుద్ధభూమిలో ప్రతిసారీ పాక్ ను ఓడించాం. ఇక ఈసారి ఆపరేషన్ సిందూర్ కొత్త కోణాన్ని జోడించింది. న్యూ ఏజ్ వార్‌ఫేర్‌లో కూడా తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. మన మేడ్ ఇన్ ఇండియా ఆయుధాల ప్రామాణికత రుజువైంది. మన ఐక్యతే మనకున్న గొప్ప బలం. ఇది ఖచ్చితంగా యుద్ధ యుగం కాదు. ఉగ్రవాద యుగం కూడా కాదు. టెర్రరిజంపై జీరో టాలరెన్స్. ఇదే మెరుగైన ప్రపంచానికి హామీ.
పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ప్రభుత్వం… ఉగ్రవాదానికి ఆజ్యం పోస్తున్న తీరు… ఏదో ఒకరోజు పాకిస్తాన్‌నే నాశనం చేస్తుంది. పాకిస్తాన్ మనుగడ సాగించాలనుకుంటే, అది తన ఉగ్రవాద అనుకూల వైఖరిని విడనాడాలి. శాంతికి మరో మార్గం లేదు. భారత్ దృక్పథం చాలా స్పష్టం టెర్రర్-చర్చ కలిసి పోలేవు. టెర్రర్-వాణిజ్యం కలిసి వెళ్లలేవు. నీరు-రక్తం కూడా కలిసి ప్రవహించలేవు. పాకిస్తాన్‌తో చర్చలు జరిపితే అది ఉగ్రవాదంపై మాత్రమే. పాక్ ఆక్రమిత కశ్మీర్‌పైనే, పీఓకేపైనే.

ప్రియమైన దేశప్రజలారా! ఈ రోజు బుద్ధ పూర్ణిమ. బుద్ధ భగవానుడు మనకు శాంతి మార్గాన్ని చూపాడు. శాంతి మార్గం కూడా అధికారం ద్వారానే సాగుతుంది. ప్రపంచాన్ని మానవత్వం, శాంతి సౌభాగ్యాల వైపు పయనించనివ్వండి. అభివృద్ధి చెందిన భారత్ కలను నెరవేర్చుకోవాలంటే, భారత్ శక్తివంతంగా ఉండటం చాలా ముఖ్యం. అవసరమైనప్పుడు ఈ శక్తిని వినియోగించుకోవడం కూడా అవసరం. గత కొన్ని రోజులుగా, దేశం ఆ పని చేసింది. భారత సైన్యానికి, సాయుధ బలగాలకు మరోసారి సెల్యూట్ చేస్తున్నాను. భారతదేశ ప్రజల ధైర్యానికి, ఐక్యతకు నేను వందనం చేస్తున్నాను.

ధన్యవాదాలు!
భారతమాత చిరకాలం జీవించు! భారతమాత చిరకాలం జీవించు!! భారతమాత చిరకాలం జీవించు!!!

Latest News

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 19 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం...

గీ బూచోడు, ఎంత మంచోడో!?|ADUGU TRENDS

మనుసుల్లో మంచి మనుసులున్నట్లే.. దొంగల్ల కూడ మంచి దొంగలుంటారని నిరూపించాడో దొంగ. తను దోసుకున్న దేవుడి నగలే కాదు, వాటిని మరమ్మతు సేయడానికి కొంత నగదు కూడా పెట్టి, దేవుడా శమించు... తప్పైందని...

వానల్లేక అన్నదాతల విలవిల!?|EDITORIAL

వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత...

సెప్టెంబర్ 12, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.35 వరకు ఉపరి విదియ నక్షత్రం ఉత్తర పగలు 01.54 వరకు ఉపరి హస్త యోగం శుభ సాయంత్రం 05.12 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 07.35...

కోవా యినాయకుడు! లడ్డూ మండపం!?|ADUGU TRENDS

ఇగ యినాయక చవితి రానే వచ్చే! ఇగిప్పుడు యినాయకుల సీజన్ ఒచ్చింది. రకరకాల ఆకారాలల్ల యిగ్రహాలను తయారు శేసుడు. గవాటిని ఈధుల్ల పెట్టుడు. నవరాత్రులు పూజలు శేసుడు మామూలేనాయె. అయితే, గా యినాయకులను...

భారత అంతరిక్ష ఇరుసు ఇస్రో ప్రైవేటుపరమేనా!?|EDITORIAL

ఇస్రోను “ప్రైవేటు కంపెనీలతో పోటీ పడే సంస్థ”గా కాకుండా, దేశ అంతరిక్ష వ్యవస్థకు మూల స్తంభంగా చూడాలి. పరిశోధన, వ్యూహాత్మక మిషన్లు, కీలక సాంకేతికతలు, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన కార్యకలాపాలు ఇస్రో ఆధ్వర్యంలోనే...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News