‘అడుగు’ ఎక్స్క్లూజివ్
ఈ మౌనం ఇంకెన్నాళ్ళు.. !?
పదవులు పొంది.. పెదవులు విప్పరా?
అజంజాహీ అంటే అంత అలుసా?
కార్మికులపై కనికరమే లేదా?
కబ్జాపై కనువిప్పు కలగదా?
వంద రోజులు దాటినా, సమస్యను బొంద పెట్టినట్లేనా!?
ఆ స్థలంలో కార్మిక భవన నిర్మాణం కోసం ఎదరుచూస్తూన్న కార్మిక లోకం
కార్మికుల కన్నీటికి ‘కొండ’ కరుగుతుందా? వారి ఆర్తనాదాలకు ‘మురళి’ రవళిస్తుందా? అన్యాక్రాంతమై, అరణ్యరోదనై, రణ స్థలమైన అజంజాహీ కార్మిక భవన స్థలం సలుపుతున్న వ్రణాన్ని సు‘రేఖ’ నయం చేస్తుందా? అంటే ఇవేవీ జరగేవి కావని తేలిపోతున్నది. పదవులు పొంది, పెదవులు విప్పని వారి ఈ మౌనం, అజంజాహీ అంటే వారికి ఎంత అలుసో తెలిసేట్లు చేస్తున్నది. కార్మికులపై కనికరం లేని, కబ్జాపై కనువిప్పు కలగని ‘కొండా’ దంపతుల ప్రతిస్పందన కోసం, ఈ మౌనం ఇంకెన్నాళ్ళంటూ అజంజాహీ మిల్లు కార్మిక లోకం కుటుంబాలు కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని మరీ ఎదురు చూస్తున్నాయి. వంద రోజులు దాటిన ఈ సమస్యను ఇక బొంద పెట్టినట్లేనా? అని వాపోతున్నాయి.
చారిత్రాత్మక అజంజాహీ మిల్లు కార్మిక భవనాన్ని కూల్చి, ఆ స్థలంలో ఓ వ్యాపారి బహుళ అంతస్తుల భవనానికి శంకుస్థాపన కోసం రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ, అటవీశాఖల మంత్రి కొండా సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కొబ్బరి కాయ కొట్టి వంద రోజులు దాటిపోయింది. 2024, డిసెంబర్ 16న కొండా కొబ్బరికాయ కొట్టారు. ఒక్కసారిగా ఆ మిల్లు స్థల వివాదం ఉవ్వెత్తున లేవడంతో, తర్వాత మూడు రోజులకు ప్రెస్ మీట్ పెట్టి మరీ, ఆ స్థలం మిల్లు కార్మికులదన్న సంగతే తనకు తెలియదని చెప్పారు. ఈ సమస్య అక్కడితో సద్దుమణుగుతుందని కొండా దంపతులు భావించి ఉంటారు.
స్థల పరిరక్షణ కోసం ప్రజా ఉద్యమాలు
కానీ, ఆ స్థలంలోబహుళ అంతస్థుల భవన నిర్మాణపు పనులను ఆ బడా వ్యాపారి మొదలు పెట్టడంతో, కార్మికుల కుటుంబాలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, పలు పార్టీలు అఖిల పక్షమై ఆందోళనకు దిగాయి. లక్ష సంతకాల సేకరణకు, సీఎంకు పోస్టు కార్డు ఉద్యమానికి నడుం బిగించాయి. కార్మిక సంఘాల ఐక్యవేదిక ఏర్పడింది. కార్మికుల కుటుంబాలు సంఘటితం అయ్యాయి. బీజేపీ ఈ ఇష్యూని ముందుండి నడిపించింది.
కబ్జాను నిరూపిస్తూ అనేక ఆధారాల సేకరణ
ఆందోళనలు జరుగుతున్న దశలోనే ఆ స్థల కబ్జాదారు కోర్టుకు వెళ్ళారు. దీంతో కార్మికులు ఒకవైపు ప్రజా ఉద్యమాలు చేస్తూనే, కోర్టులో లీగల్ గా కొట్లాడటం మొదలు పెట్టారు. మరోవైపు ఆ కార్మిక భవనం కార్మిక సంఘానిదేనని నిరూపించేందుకు ఆర్టీఐ చట్టం కింద అనేక అధారాలు సేకరించారు. కూపీ లాగారు. దీంతో వరంగల్ తూర్పు నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ప్రమేయంతో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యేకు లేని కొడుకుగా పుట్టుకు వచ్చిన నరేశ్ రెడ్డి తప్పుడు దస్తావేజులు సృష్టించి, బడా బట్టల వ్యాపారి కాసం బ్రదర్స్ ఓం నమ: శివాయకు అమ్మారు. దానికి ఇంటి స్థలంగా, వ్యవసాయ భూమిగా రెండు రిజిస్ట్రేషన్లు చేశారని తేల్చారు. ఆ కబ్జా స్థలంలో బహుళ అంతస్తుల వ్యాపార భవనానికి, వరంగల్ మున్సిపల్ మహానగర కార్పొరేషన్ కు అప్పట్లో కమిషనర్ గా ఉన్న ఇప్పటి హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అనుమతులిచ్చారని గుర్తించారు. అలాగే అది ముమ్మాటికీ కార్మిక భవన స్థలమేనని కార్పొరేషన్ లో అప్పటి మున్సిపాలిటీ విధించిన పన్ను చెల్లింపు ఆధారాలను సైతం సేకరించారు. ఇప్పటి శాసన మండలి డిప్యూటీ చైర్మన్, అప్పటి రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్ తన ఎంపీ నిధులను కార్మిక భవన నిర్మాణానికి ఇచ్చిన నిధుల ప్రొసీడింగ్స్ ని సైతం బయటకు తీశారు. కోర్టు కేసులో ఇంప్లీడ్ అయిన కార్మికులు ఈ ఆధారాలన్నింటినీ కోర్టుకు సమర్పించారు.
స్పందించిన నేతలు
ఇదే ఇష్యూపై పూర్వాపరాలు కావాలని బండా ప్రకాశ్ అధికారులను ఆదేశించారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ న్యాయపరమైన సాయం అందించారు. మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తనకు సంబంధం లేదని చెప్పారు. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఈ విషయమై జిల్లా కలెక్టర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, ఇతర అధికారులతోపాటు సీ.ఎం.ని కలవడమే కాదు, శాసన మండలిలో ప్రస్థావించి సంచలనం చేశారు. కొండా దంపతుల వల్ల పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తున్నదని, జరిగిన తప్పిదాలను సరిదిద్ది, ఆ స్థలాన్ని కార్మికులకే అప్పగించాలని డిమాండ్ చేశారు. మరోవైపు పార్టీలో, బయటా కొండా వ్యతిరేకులంతా ఏకమవుతూ వచ్చారు.
మౌనమెందుకు!?
గత ప్రభుత్వ కాలంలోనే అజంజాహీ మిల్లు కార్మిక భవన స్థలం కబ్జాకు గురైనప్పటికీ.. ఇంత రాద్ధాంతం జరుగుతున్నప్పటికీ, మౌనముద్ర దాల్చిన కొండా దంపతులు మాత్రం ఇప్పటికీ పెదవి విప్పడంలేదు. దీంతో కొండా దంపతుల ప్రమేయంపై అనేక ఆరోపణలు, వదంతులు వ్యాపించాయి. పైగా మంత్రి కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గం పరిధిలోనే వివాదాస్పదమైన మిల్లు కార్మిక భవన స్థలం ఉంది. తన నియోజకవర్గంలోని సమస్యపై కూడా కొండా దంపతులు స్పందించకపోవడం పట్ల వారికి ఏమైనా ప్రమేయం ఉందా? అన్న పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. కార్మిక పక్షపాతులుగా పేరున్న కొండా దంపతులు, ఒక దశలో ఆ స్థల వివాదాన్ని సింపుల్ గా పరిష్కరించాలని భావించారని ప్రచారం జరిగింది. కొబ్బరి కాయ కొట్టి వివాదానికి దారి తీసిన చోటే తిరిగి కొబ్బరికాయ కొట్టి కార్మిక భవనానికి శంకుస్థాపన చేసి ఆ వివాదానికి ముగింపు పలుకుతారని కొండా అనుచరులే ప్రచారం చేశారు. ఎందుకో? అది అక్కడితోనే ఆగిపోయింది. కొండా మురళి కొబ్బరికాయ కొట్టి వంద రోజులు దాటిన ఈ ఇష్యూని బొంద పెట్టారన్న అపవాదు ప్రజల్లో బలంగా పాదుకోక ముందే మరో కొబ్బరి కాయ కొడితే బాగుంటుందన్న అభిప్రాయాన్నే పార్టీ శ్రేణులు కూడా వ్యక్తం చేస్తున్నాయి. మరి ఆ దంపతులు ‘కొండ’ దిగి వస్తారా? కొండెక్కి కూర్చుంటారా? చూడాలి!

