– శాస్త్ర సాంకేతిక రంగాల సమగ్ర భాండాగారం ఖురాన్
– మాతృభాషణలో ఖురాన్ అనువాదాన్ని చదవాలి
– మౌలానా ఖాజి హఫీజ్ అల్షా అమీర్ శర్ఫీ
పవిత్ర ఖురాన్ ప్రపంచ మానవాళికి మార్గదర్శకమని, శాస్త్ర సాంకేతిక రంగాల భాండాగారం ఖురాన్ అని జామే నిజామియ అరబీ యూనివర్సిటీ మౌలానా ఖాజి హఫీజ్ అల్షా అమీర్ శర్ఫీ అన్నారు. ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని మదరస ఇస్లామియా ఫజల్ -ఉల్- ఉలూమ్ అరబీ పాఠశాల 30వ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఆధ్యాత్మిక బోధన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన సమగ్ర సమాచారం పవిత్ర ఖురాన్ లో ఉంది అన్నారు. నేడు ప్రపంచంలోని శాస్త్రవేత్తలు అందరూ ఖురాన్ లో ఉన్న అంశాలను సమగ్రంగా అధ్యయనం చేస్తూ విజయం సాధిస్తున్నారని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ తమ తమ మాతృ భాషలలో అనువదించబడిన పవిత్ర ఖురాన్ ను విధిగా చదవాలని పిలుపునిచ్చారు. భూమి మీద నివసించే ప్రతి ప్రాణి గురించి ఖురాన్ లో ఉంది అన్నారు. సర్వ మానవాళికి అవసరమైన సమాచారంతోపాటు మనిషి నడవడిక ఎలా ఉండాలి అన్నది అందులో పొందుపరచడం జరిగిందన్నారు. ఇస్లాం ధర్మంలో ఖురాన్ ను అనుసరించి ముందుకు సాగిన వారు అల్లా కృపతో అన్ని రంగాలలో రాణిస్తున్నారని అన్నారు. తమ పిల్లలను మదర్సాలలో చేర్పించి ఖురాన్ కంఠస్థం చేపించి హఫీజ్ లు గా ఆలీం లు గా ఎదిగే విధంగా చేయాలన్నారు. మహమ్మద్ ప్రవక్త చూపిన మార్గంలో అల్లాను ప్రార్థించి ముందుకు పోయినట్లయితే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందన్నారు. అల్లా ఈ భూమి మీద ఉన్న ప్రాణికోటి కంటే మానవుడికి ఆశ్రాఫుల్ మౌమిన్ గా పుట్టించాడన్నారు. పశుపక్షాదులకు ఒక జీవన విధానం ఇస్తే మానవుడికి మేధస్సుతోపాటు సమాజంలో నడవడిక ఎలా ఉండాలన్న ఆలోచనతో మనిషిని పుట్టించాడని ఆయన అభివర్ణించారు. మదరస ఇస్లామియా ఫజల్ ఉల్ ఉలూం స్థాపించి 30 ఏళ్లు పూర్తి చేసుకుని వార్షికోత్సవం జరుపుకోవడం అభినందనీయమన్నారు. ఇప్పటివరకు 86 మంది హఫీజ్ లను తీర్చి దిద్దరని, మరో ఇద్దరు ఆలిం కోర్స్ పరీక్షలు రాయడం ఈ పాఠశాలలో చదివిన పిల్లలు అందరూ సమ సమాజ స్థాపన కోసం ఇస్లాం ధర్మ పరిరక్షణ కోసం తద్వారా వీరి కోసం శ్రమపడిన ప్రతి ఒక్కరికి అల్లా కృప ప్రధానంగా వీరి తల్లిదండ్రులకు స్వర్గలోక ప్రాప్తి కలగడానికి హఫీజ్ లు బాటలు వేస్తారని ఆయన వివరించారు.ఈ పాఠశాలల స్థాపించిన ఫౌండర్ సభ్యులను ఆయన పేరుపేరునా గుర్తుచేస్తూ వారి సేవలను కొనియాడుతూ వారికోసం ప్రత్యేక ప్రార్థన చేశారు. ప్రస్తుతం పాఠశాలను నడిపిస్తున్న నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ అరబ్బీ పాఠశాల ను మరింత అభివృద్ధి చేసే విధంగా కమిటీ ముందుకు సాగాలని అందుకు అల్లా పూర్తి మద్దతు ఉండాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఆయన అభినందించారు. ఖురాన్ కంఠస్థం చేసిన హఫీజ్ లను ఆయన అభినందించారు. పాఠశాల వార్షికోత్సవం అబ్దుల్లా ఖాన్ అధ్యక్షతన పాఠశాల ప్రధాన కార్యదర్శి సయ్యద్ రఫీయోద్దీన్ పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముషా విరత్ కమిటీ ఉపాధ్యక్షుడు, మీలాద్ కమిటీ అధ్యక్షుడు షేక్ యాకుబ్ బావజీర్,హఫీజ్ మొహమ్మద్ ఇర్షాద్ ఆలం,కమిటీ సభ్యులు ముస్తాఖ్ అహ్మద్,అబ్దుల్ అలీం,మహమ్మద్ యూసుఫ్,సయ్యద్ అహ్మద్,ఇస్మాయిల్ ఖాన్,మహమ్మద్ ఖాజా, అరిఫ్ హుస్సేన్,సమద్,మునవ్వర్, తాహేర్ లతో పాటు విద్యార్థుల తల్లి దండ్రులు,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

