గాంధీ భవన్ లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజహరుద్దీన్ సమక్షంలో చేరిన బిల్లా సుధీర్, సురేందర్ తదితరులు
పాలకుర్తి నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కి చెందిన జెడ్పీ కో ఆప్షన్ మాజీ సభ్యుడు మహమ్మద్ మదార్ కాంగ్రెస్ లో చేరి రెండు రోజులు గడవకముందే ఇదే నియోజకవర్గానికి చెందిన వరంగల్ జిల్లా మరో బి ఆర్ ఎస్ నాయకులు బిల్లా సుధీర్ రెడ్డి, ఆకుల సురేందర్ పార్టీకి రాజీనామా చేసి, తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరారు. గాంధీ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో టి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజహరుద్దీన్, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పి ఆయనకు ఆహ్వానం పలికారు. ఈ చేరికతో బిఆర్ఎస్ కు దెబ్బ మీద దెబ్బ తగిలినట్లు అయింది.
ఈ సందర్భంగా టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజహరుద్దీన్ మాట్లాడుతూ, అవినీతిలో కూరుకుపోయిన బిఆర్ఎస్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, ఇప్పుడు ఆ పార్టీ నేతలు కూడా వీడుతూ గుణపాఠం చెబుతున్నారన్నారు. వీరితో పాటు మరికొందరు కూడా చేరనున్నారని, ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి, ఝాన్సీరెడ్డి ల నాయకత్వంలో పాలకుర్తిలో కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందని అన్నారు.
ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేస్తున్నది. పార్టీ పాలన నచ్చి వీళ్లంతా వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పని చేసిన ప్రతి కార్యకర్తను కాపాడుకుంటామని, రాబోయే స్థానిక ఎన్నికల్లో బి ఆర్ ఎస్ డిపాజిట్లు కోల్పోయి, కాంగ్రెస్ విజయం సాధిస్తుందని తెలిపారు. పార్టీ బలోపేతం కోసం కొత్త పాత ల మేలు కలయికతో సమన్వయంగా పని చేస్తామని చెప్పారు.
బిల్లా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గంలో బిఆర్ఎస్ నాయకత్వం అవినీతిలో కూరుకుపోయి, ప్రజలను మోసం చేస్తూ, అనుచరులనే వెన్నుపోటు పొడుస్తున్నారన్నారు. త్వరలోనే బి ఆర్ ఎస్ ఖాళీ అవడం ఖాయం అన్నారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఇన్చార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులు చూసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయపర్తి మండల నాయకులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, యువజన నాయకులు, సోషల్ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

