ప్రతిపక్షం బలహీనంగా ఉంటే ప్రజాస్వామ్యం కూడా బలహీనపడుతుంది. అధికార పక్షం తప్పులను ఎత్తిచూపే శక్తి లేకపోతే ప్రభుత్వ జవాబుదారీతనం తగ్గుతుంది. అందుకే, కాంగ్రెస్ బలపడటం కేవలం ఆ పార్టీ అవసరం మాత్రమే కాదు. భారత ప్రజాస్వామ్యానికి అనివార్యం కూడా. అయితే ఆ బలం నినాదాలతో రాదు. ప్రజల మధ్య నిరంతర పోరాటం, వాస్తవాధారాలతో కూడిన విమర్శలు, ప్రత్యామ్నాయ విధానాలు, అంతర్గత సంస్కరణలు, కొత్త నాయకత్వానికి అవకాశం కల్పించడం ద్వారా మాత్రమే వస్తుంది.
కాంగ్రెస్ ఇప్పటికైనా సంఘటనలు, ఎలుగెత్తిన ఉద్యమాల వెంటపడి పోకుండా, ప్రజా భాగస్వామ్యంతో తామే ఉద్యమాలను తేగలగాలి. ముందుగానే సమస్యలను గుర్తించి ప్రజలకు నాయకత్వం వహించే ప్రతిపక్షంగా మారాలి. లేకపోతే 2024లో కొంత మేర తిరిగి వచ్చిన రాజకీయ ఊపు కూడా తాత్కాలికంగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఎంత బలంగా ఉండాలో, ప్రతిపక్షం అంతకంటే సమర్థంగా పని చేయాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రజల సమస్యలను చర్చలోకి తేవడం, విధానపరమైన ప్రత్యామ్నాయాలను సూచించడం, ప్రజల్లో చైతన్యం కల్పించడం ప్రతిపక్షం ప్రధాన బాధ్యత. అయితే, భారత రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించడంలో విఫలమవుతోందా? సఫలమవుతోందా?
2014 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు కేవలం 44 సీట్లు, 2019లో 52 సీట్లు మాత్రమే వచ్చాయి. 2024 ఎన్నికల్లో 99 సీట్లను గెలిచినప్పటికీ, అధికార పక్షాన్ని ప్రశ్నించి, నిలదీసి, నిగ్గదీసి, సవాల్ చేసే స్థాయిలో ప్రజల విశ్వాసాన్ని సంపాదించలేకపోయింది. ఇది కేవలం ఎన్నికల పరాజయం మాత్రమే కాదు. ప్రధాన ప్రతిపక్షంగా, ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నిలవడంలో కాంగ్రెస్ ఎదుర్కొంటున్న నిర్మాణాత్మక వైఫల్యానికి సూచిక.
యూపీఏ పదేళ్ల పాలన (2004–2014) చివరి దశలో 2జీ స్పెక్ట్రం, కామన్వెల్త్ క్రీడలు, బొగ్గు కేటాయింపులు, హెలికాప్టర్ కొనుగోలు వంటి అవినీతి ఆరోపణలు కాంగ్రెస్ ప్రతిష్ఠను తీవ్రంగా దెబ్బతీశాయి. ఆ తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసి ప్రజలకు నమ్మకమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుందని ఆశించినప్పటికీ, గత దశాబ్దంలో అలాంటి మార్పు పెద్దగా కనిపించడంలేదు.
ప్రతిపక్షం కేవలం నిరసనలకు పరిమితం కాకుండా, ప్రజా సమస్యలను ముందుగానే గుర్తించి ప్రభుత్వాన్ని జవాబుదారీగా నిలబెట్టాలి. కానీ, కాంగ్రెస్ ఎక్కువ సందర్భాల్లో ప్రజా ఉద్యమాలు బలపడిన తర్వాతే వాటికి రాజకీయ మద్దతు ప్రకటిస్తున్నదనే విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ ధోరణి పార్టీని ఉద్యమాలకు నాయకత్వం వహించే శక్తిగా కాకుండా, వాటిని అనుసరించే పార్టీగా మారుస్తోంది.
ఇటీవలి నీట్ పరీక్షల ప్రశ్నాపత్రాల లీక్ ఘటనలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఆందోళన తర్వాతే కాంగ్రెస్ చురుకుగా స్పందించింది. పరీక్షలు రద్దు కావడం, విద్యార్థుల్లో ఆందోళన పెరగడం వంటి పరిణామాలు జరిగినప్పటికీ, మొదటి నుంచే ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి తీసుకురావడంలో కాంగ్రెస్ విఫలమైంది. ఉద్యమం దేశవ్యాప్తంగా బలపడిన తర్వాత మాత్రమే రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నాయకత్వం తీవ్ర నిరసనలకు దిగింది.
రాజకీయాల్లో క్రీడాస్ఫూర్తితోపాటు సమయస్ఫూర్తి అత్యంత కీలకం. ఆలస్యంగా స్పందించడం వల్ల ప్రజల్లో ‘రాజకీయ అవకాశవాదం’ అనే భావన ఏర్పడుతుంది. ఇదే కాంగ్రెస్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.
పార్లమెంట్లోనూ కాంగ్రెస్ పనితీరు ప్రశ్నార్థకంగానే ఉంది. సభలో నిరసనలు, వెల్లోకి వెళ్లడం, ప్లకార్డులు ప్రదర్శించడం వంటి చర్యలు తరచూ కనిపిస్తున్నప్పటికీ, ప్రత్యామ్నాయ విధానాలను వివరించడం, ప్రభుత్వాన్ని వాస్తవాధారాలతో నిలదీయడం, చర్చలను ప్రజలకు ఉపయోగపడేలా మలచడం వంటి అంశాల్లో పార్టీ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోంది.
జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీకి హోంమంత్రా? లేక ఎవరు ఆదేశాలిచ్చారు? అని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. అయితే, భారత పోలీసు వ్యవస్థలో శాంతిభద్రతల నిర్వహణ, జనసమూహ నియంత్రణ వంటి అంశాలు దాదాపు పోలీసు అధికారుల నిర్ణయాల ప్రకారమే అమలవుతాయి. ఎంతో కీలకమైన అంశాల్లో తప్పితే? మరైతే కాంగ్రెస్ నేతలకు ఈ విషయమై అవగాహన కొరవడిందా? రాజకీయ విమర్శలు వాస్తవాలపై ఆధారపడినప్పుడే ప్రజల్లో విశ్వసనీయత పెరుగుతుంది.
కాంగ్రెస్ మరో ప్రధాన బలహీనత అంతర్గతంగా అతి ప్రజాస్వామ్యం లేదా ప్రజాస్వామ్య లేమి. పార్టీ అధ్యక్ష పదవి నుంచి ముఖ్యమైన నిర్ణయాల వరకు గాంధీ కుటుంబందే అతిమ నిర్ణయమనే భావన చాలాకాలంగా కొనసాగుతున్నది. దేశవ్యాప్తంగా కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడం, రాష్ట్ర నాయకులకు స్వేచ్ఛ ఇవ్వడం, సంస్థాగత పునర్నిర్మాణం చేపట్టడం వంటి అంశాల్లో కాంగ్రెస్ ఆశించిన పురోగతి సాధించలేకపోయింది. ఫలితంగా అనేక రాష్ట్రాల్లో పార్టీ క్రమంగా బలహీనపడింది.
ఇదే సమయంలో ప్రాంతీయ పార్టీలు లేదా సామాజిక ఉద్యమాలు కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ కంటే వేగంగా ప్రజా సమస్యలను అందిపుచ్చుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాగలిగాయి. ప్రజల విశ్వాసం సంపాదించాలంటే కేవలం చారిత్రక వారసత్వం సరిపోదు. నిరంతర ప్రజా ఉద్యమాలు, సమర్థవంతమైన సంస్థాగత నిర్మాణం, విశ్వసనీయ నాయకత్వం అవసరం.
ప్రతిపక్షం బలహీనంగా ఉంటే ప్రజాస్వామ్యం కూడా బలహీనపడుతుంది. అధికార పక్షం తప్పులను ఎత్తిచూపే శక్తి లేకపోతే ప్రభుత్వ జవాబుదారీతనం తగ్గుతుంది. అందుకే కాంగ్రెస్ బలపడటం కేవలం ఆ పార్టీ అవసరం మాత్రమే కాదు. భారత ప్రజాస్వామ్యానికి అనివార్యం కూడా. అయితే ఆ బలం నినాదాలతో రాదు. ప్రజల మధ్య నిరంతర పోరాటం, వాస్తవాధారాలతో కూడిన విమర్శలు, ప్రత్యామ్నాయ విధానాలు, అంతర్గత సంస్కరణలు, కొత్త నాయకత్వానికి అవకాశం కల్పించడం ద్వారా మాత్రమే వస్తుంది.
కాంగ్రెస్ ఇప్పటికైనా సంఘటనలు, ఎలుగెత్తిన ఉద్యమాల వెంటపడి పోకుండా, ప్రజా భాగస్వామ్యంతో తామే ఉద్యమాలను తేగలగాలి. ముందుగానే సమస్యలను గుర్తించి ప్రజలకు నాయకత్వం వహించే ప్రతిపక్షంగా మారాలి. లేకపోతే 2024లో కొంత మేర తిరిగి వచ్చిన రాజకీయ ఊపు కూడా తాత్కాలికంగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది.

