ఉద్యోగార్థులకు ఏఐ గణాంకాలు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. డిగ్రీ లేదా అనుభవం ఒక్కటే భవిష్యత్తుకు భద్రత ఇవ్వవు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా నిరంతరం కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, ఉన్న నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం తప్పనిసరి. సంస్థలకూ ఇదే సవాల్. సరైన నైపుణ్యాలను గుర్తించి, వాటిలో పెట్టుబడి పెట్టినప్పుడే ఉత్పాదకత పెరుగుతుంది. ఏఐ యుగంలో చివరకు గెలిచేది సాంకేతికత మాత్రమే కాదు, దాన్ని సమర్థంగా వినియోగించగల మానవ నైపుణ్యమే.!
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) భవిష్యత్తు సాంకేతికతగా మాత్రమే కాక, వర్తమాన వ్యాపార ప్రపంచానికి కీలక సాధనంగా మారింది. సంస్థల నిర్ణయ ప్రక్రియల నుంచి ఉత్పత్తి, సేవలు, సైబర్ భద్రత వరకు ఏఐ వినియోగం విస్తరిస్తున్న కొద్దీ, దానికి అనుగుణమైన నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులకు డిమాండ్ కూడా వేగంగా పెరుగుతోంది. ఈ పరిణామం ఉద్యోగాల సంఖ్యపైనే కాదు. వేతనాల నిర్మాణంపైనా స్పష్టమైన ప్రభావం చూపుతోంది. నైపుణ్యం ఉన్నవాళ్ళకి అధిక వేతనాలు, సంప్రదాయ సాంకేతిక ఉద్యోగాల్లో మాత్రం స్థిరత్వం లేదా తగ్గుదల కనిపించడం కొత్త ఉద్యోగ మార్కెట్కు సంకేతం.
జాబ్స్ ప్లాట్ఫామ్ ఫౌండిట్ నివేదిక ప్రకారం, భారత్లో 2024-2026 మధ్య ఏఐ సంబంధిత ఉద్యోగాల వేతనాలు ఏకంగా 23% పెరిగాయి. గత ఏడాది మాత్రమే ఏఐ రంగం 12% వేతన వృద్ధిని నమోదు చేసింది. పరిశీలించిన విభాగాల్లో ఇదే అత్యధిక వార్షిక వృద్ధి. కంప్యూటర్ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ, సెమీకండక్టర్స్ రంగాలు చెరో 9% వేతన వృద్ధితో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఈ గణాంకాలు కంపెనీల ప్రాధాన్యతలు ఏ దిశగా మారుతున్నాయో స్పష్టం చేస్తున్నాయి.
అయితే, సాంకేతిక రంగం మొత్తం ఒకే రీతిలో వృద్ధి చెందడం లేదు. కంప్యూటర్ హార్డ్ వేర్, ఈ-కామర్స్ వంటి విభాగాల్లో గత రెండేళ్లుగా వేతనాలు తగ్గుముఖం పట్టాయి. ఐటీ సర్వీసెస్ రంగంలోనూ జీతాలు దాదాపు స్తబ్ధంగా ఉండటమే కాకుండా, గత ఏడాదితో పోలిస్తే 1% తగ్గుదల నమోదైంది. అంటే ‘టెక్నాలజీ ఉద్యోగం’ అన్న ఒక్క కారణంతో అధిక వేతనం లభించే రోజులు క్రమంగా ముగుస్తున్నాయన్నమాట. ఏ సాంకేతికత వ్యాపారానికి ఎంత విలువను సృష్టిస్తుందన్నదే ఇప్పుడు వేతనాలను నిర్ణయించే ప్రధాన ప్రమాణంగా మారుతోంది.
ఏఐ నిపుణుల వేతనాల్లో అనుభవంతో పాటు నైపుణ్యానికి ఉన్న విలువను గణాంకాలు మరింత స్పష్టంగా చూపుతున్నాయి. 0-3 ఏళ్ళ అనుభవం ఉన్న ఎంట్రీ-లెవల్ ఏఐ నిపుణులు ఏడాదికి రూ.8.87 లక్షల నుంచి రూ.15.41 లక్షల వరకు సంపాదిస్తున్నారు. 15 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న సీనియర్ నిపుణుల వేతనాలు రూ.70.99 లక్షల నుంచి రూ.89.24 లక్షల వరకు చేరుతున్నాయి. సాధారణ ఐటీ-ఐటీ సర్వీసెస్ రంగంలో మాత్రం ప్రారంభ వేతనాలు రూ.2.68 లక్షల నుంచి రూ.5.08 లక్షల వరకు ఉండగా, 15 ఏళ్లకు పైగా అనుభవం ఉన్నవారికి రూ.57.55 లక్షల నుంచి రూ.72.13 లక్షల వరకు ఉన్నాయి.
భౌగోళికంగా కూడా ఈ వ్యత్యాసం గణనీయంగానే ఉంది. ఉత్పత్తి సంస్థలు, ఏఐ ఆధారిత స్టార్టప్లు, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (జీసీసీలు) అధికంగా కేంద్రీకృతమై ఉండటంతో బెంగళూరు అత్యధిక వేతనాలు అందించే మార్కెట్గా నిలిచింది. అక్కడ సీనియర్ ఏఐ నిపుణులు ఏడాదికి రూ.61.70 లక్షల నుంచి రూ.91.25 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఇది ఎన్సీఆర్, ముంబై కంటే 10%-15% అధికం. చెన్నైతో పోలిస్తే సీనియర్ స్థాయిలో 40% వరకు ఎక్కువ. జీసీసీలు, ఉత్పత్తి ఇంజినీరింగ్ పెట్టుబడులు పెరుగుతుండటంతో హైదరాబాద్ కూడా ఈ పోటీలో వేగంగా ముందుకొస్తోంది.
మరోవైపు సైబర్ సెక్యూరిటీ రంగం కూడా అధిక విలువ కలిగిన నైపుణ్యాలకు మార్కెట్ ఎంత ప్రాధాన్యం ఇస్తోందో చూపిస్తోంది. ఈ విభాగంలో గరిష్ట వార్షిక వేతనం రూ.97.81 లక్షలకు చేరుకుంది. పరిశీలించిన రంగాలన్నింటిలో ఇదే అత్యధిక గరిష్ట వేతనం. డిజిటల్ మౌలిక సదుపాయాలు విస్తరిస్తున్న నేపథ్యంలో సైబర్ దాడుల ముప్పు పెరగడం, డేటా రక్షణకు ప్రాధాన్యం పెరగడం ఇందుకు ప్రధాన కారణాలు.
టెక్నాలజీకి వెలుపల కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. సెమీకండక్టర్స్ రంగంలో రెండేళ్లలో మొత్తం 17% వేతన వృద్ధి నమోదైంది. ఇండస్ట్రియల్ ఆటోమేషన్లో 13% పెరిగింది. ఈ రంగాల్లో సీనియర్ ఉద్యోగుల వార్షిక ప్యాకేజీలు వరుసగా రూ.48.49 లక్షలు, రూ.58.90 లక్షలకు చేరాయి. గత ఏడాది ఆటోమోటివ్ రంగంలో 6%, మెడికల్ ప్రాక్టీస్లో 8%, మెడికల్ డివైసెస్లో 6%, ఫార్మాస్యూటికల్స్ లో 4% వేతన వృద్ధి నమోదైంది.
ఈ పరిణామాలను కేవలం ‘ఏఐ ఉద్యోగాలకు ఎక్కువ జీతాలు’ అనే కోణంలో చూడటం సరిపోదు. వాస్తవానికి భారత ఉద్యోగ మార్కెట్ ఒక కీలకమైన మార్పు దశలో ఉంది. కంపెనీలు ఇప్పుడు అనుభవానికి మాత్రమే కాకుండా, తమ వ్యాపార అవసరాలను తీర్చగల నైపుణ్యాలకు ధర నిర్ణయిస్తున్నాయి. ఏఐ వ్యవస్థలను నిర్మించడం, మౌలిక సదుపాయాలను భద్రపరచడం, పారిశ్రామిక ప్రక్రియలను ఆటోమేట్ చేయడం, ఆరోగ్య రంగంలో ప్రత్యేక పరిష్కారాలను అందించడం వంటి సామర్థ్యాలు ఉన్నవారికి డిమాండ్ పెరుగుతోంది.
అందువల్ల ఉద్యోగార్థులకు ఈ గణాంకాలు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. డిగ్రీ లేదా అనుభవం ఒక్కటే భవిష్యత్తుకు భద్రత ఇవ్వవు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా నిరంతరం కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, ఉన్న నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం తప్పనిసరి. సంస్థలకూ ఇదే సవాల్. సరైన నైపుణ్యాలను గుర్తించి, వాటిలో పెట్టుబడి పెట్టినప్పుడే ఉత్పాదకత పెరుగుతుంది. ఏఐ యుగంలో చివరకు గెలిచేది సాంకేతికత మాత్రమే కాదు.. దాన్ని సమర్థంగా వినియోగించగల మానవ నైపుణ్యమే.

