ముప్పు పర్వత ప్రాంతాలకే పరిమితం కాదు. సిక్కిం లేదా నేపాల్ హిమాలయాల్లో పెద్ద స్థాయిలో జీఎల్ఓఎఫ్ సంభవిస్తే కోసి, గండక్, తీస్తా వంటి నదుల ద్వారా వరదనీరు దిగువ మైదాన ప్రాంతాలకు చేరే అవకాశం ఉంది. ఉత్తర బీహార్లోని సుపాల్, సహర్సా, మధుబని, చంపారన్ వంటి ప్రాంతాలతో పాటు ఉత్తర బెంగాల్లోని జల్పైగురి, సిలిగురి, డార్జిలింగ్ టెరాయ్ ప్రాంతాలు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అంటే హిమాలయాల్లో జరిగే పరిణామాల ప్రభావం వందల కిలోమీటర్ల దూరంలోని జనావాసాలపై పడవచ్చు.
హిమాలయాలను కేవలం నీటి వనరుల నిలయంగా కాకుండా, అత్యంత సున్నితమైన పర్యావరణ వ్యవస్థగా చూడాల్సిన సమయం వచ్చింది. వేలాది సరస్సుల్లో ప్రతి ఒక్కటి ‘వాటర్ బాంబ్’ కాదు. కానీ ప్రమాదకరమైన కొన్ని సరస్సులు విస్ఫోటనం చెందితే దాని ప్రభావం ఊహించలేనంతగా ఉంటుంది. అందుకే అభివృద్ధి, పర్యావరణ భద్రత మధ్య సమతౌల్యాన్ని పాటించడం, శాస్త్రీయ పర్యవేక్షణను విస్తరించడం, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయడం ఆవశ్యం. ప్రాణాలు, ఆస్తులు, భవిష్యత్ తరాల భద్రత కోసం తప్పనిసరి బాధ్యత.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
హిమాలయాలు భారత ఉపఖండానికి జీవనాడి. గంగా, యమునా, బ్రహ్మపుత్ర, కోసి, గండక్, తీస్తా వంటి అనేక నదులకు ఈ పర్వత శ్రేణులే ఆధారం. అయితే వాతావరణ మార్పులు, హిమానీనదాల వేగవంతమైన కరుగుదల, భారీ వర్షాలు, కొండచరియలు, భూకంపాలు వంటి పరిణామాలు ఇప్పుడు హిమాలయాలను ప్రకృతి విపత్తుల కేంద్రంగా మార్చుతున్నాయి. ముఖ్యంగా హిమానీనదాల కరుగుదలతో ఏర్పడే సరస్సులు (గ్లేషియల్ లేక్లు) భవిష్యత్తులో భారీ వరదలకు కారణమయ్యే ‘వాటర్ బాంబ్స్’గా మారే ప్రమాదం ఆందోళన కలిగిస్తోంది.
హిమానీనదం వెనక్కి తగ్గే క్రమంలో దాని ముందు లేదా చుట్టుపక్కల నీరు చేరి సరస్సుగా మారుతుంది. సాధారణ పరిస్థితుల్లో మంచు, రాళ్లు, మట్టి వంటి సహజ అడ్డంకులు ఆ నీటిని నిలువరిస్తాయి. అయితే ఆ అడ్డంకులు బలహీనపడినా, తెగిపోయినా, సరస్సులోని నీరు ఒక్కసారిగా దిగువకు దూసుకుపోతుంది. దీనినే గ్లేషియల్ లేక్ అవుట్బస్ట్ ఫ్లడ్ (జీఎల్ఓఎఫ్) అంటారు. అప్పుడు నీటితో పాటు బురద, రాళ్లు, మట్టి భారీ వేగంతో దిగువ ప్రాంతాలను ముంచెత్తుతాయి. కొద్ది గంటల్లోనే నదుల ప్రవాహ స్వరూపం మారిపోవచ్చు.
ఇటీవల నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో హిమానీనద సంబంధిత పరిణామాలతో భోటేకోశి, త్రిశూలి నదుల్లో వరదలు సంభవించినట్లు వచ్చిన సమాచారం ఈ ముప్పును మరోసారి గుర్తుచేస్తోంది. భారీ వర్షాలకు తోడు టిబెట్లో నదీ మూల ప్రాంతానికి సమీపంలో తాత్కాలిక సరస్సు ఏర్పడటం భోటేకోశి నదిలో నీటిమట్టం పెరగడానికి కారణమైనట్లు తెలుస్తోంది. ఈ పరిణామంతో మధ్య నేపాల్లోని పలు ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తత ప్రకటించాల్సి వచ్చింది. ప్రకృతి విపత్తు ఒక్కటే సమస్య కాదు. పర్వత ప్రాంతాల్లో విచక్షణారహిత నిర్మాణాలు, నదీ ప్రవాహ మార్గాల్లో నివాసాలు, రహదారులు, మౌలిక వసతుల నిర్మాణం నష్టాన్ని మరింత పెంచుతున్నాయి.
భారతదేశం పరిస్థితి కూడా భిన్నంగా లేదు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు చెందిన నిపుణుల ప్రకారం, భారత హిమాలయ ప్రాంతంలోని 11 నదీ పరీవాహక ప్రాంతాల్లో 28వేల హిమానీనద సరస్సులు ఉన్నట్లు అంచనా. వీటిలో 7,500 సరస్సులు భారత భూభాగంలోనే ఉన్నట్లు సమాచారం. ఒక్క గంగా నదీ పరీవాహక ప్రాంతంలోనే 4,700కు పైగా హిమానీనద సరస్సులు ఉన్నట్లు పేర్కొంటున్నారు. వీటిలో 195–200 సరస్సులను అధిక ప్రమాదకరమైనవిగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ గణాంకాలు సమస్య పరిమాణాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి.
ముప్పు పర్వత ప్రాంతాలకే పరిమితం కాదు. సిక్కిం లేదా నేపాల్ హిమాలయాల్లో పెద్ద స్థాయిలో జీఎల్ఓఎఫ్ సంభవిస్తే కోసి, గండక్, తీస్తా వంటి నదుల ద్వారా వరదనీరు దిగువ మైదాన ప్రాంతాలకు చేరే అవకాశం ఉంది. ఉత్తర బీహార్లోని సుపాల్, సహర్సా, మధుబని, చంపారన్ వంటి ప్రాంతాలతో పాటు ఉత్తర బెంగాల్లోని జల్పైగురి, సిలిగురి, డార్జిలింగ్ టెరాయ్ ప్రాంతాలు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అంటే హిమాలయాల్లో జరిగే పరిణామాల ప్రభావం వందల కిలోమీటర్ల దూరంలోని జనావాసాలపై పడవచ్చు.
అందువల్ల ప్రమాదకర సరస్సుల విషయంలో ‘విపత్తు వచ్చిన తర్వాత స్పందించడం’ అనే విధానం ఇక సరిపోదు. ఉపగ్రహాల ద్వారా సరస్సుల పరిమాణం, నీటిమట్టం, పరిసర భౌగోళిక మార్పులను నిరంతరం పర్యవేక్షించాలి. అధిక ప్రమాదం ఉన్న సరస్సుల వద్ద ఆటోమేటిక్ నీటిమట్టం, ఉష్ణోగ్రత, ఒత్తిడి సెన్సార్లను ఏర్పాటు చేయాలి. చెక్డ్యామ్లు, నియంత్రిత డ్రైనేజీ, నీటి మళ్లింపు వంటి శాస్త్రీయ ఇంజనీరింగ్ చర్యలను పరిస్థితులకు అనుగుణంగా చేపట్టాలి.
అంతకన్నా ముఖ్యంగా ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు స్థానిక ప్రజలకు చేరాలి. సైరన్లు, మొబైల్ అలర్ట్ లు, గ్రామస్థాయి విపత్తు ప్రణాళికలు, ఖాళీ చేయింపు మార్గాలు ముందుగానే సిద్ధంగా ఉండాలి. ప్రమాద ప్రాంతాల్లో కొత్త నిర్మాణాలను కఠినంగా నియంత్రించడం కూడా అత్యవసరం. రాబోయే రెండేళ్లలో అధిక ప్రమాదకర సరస్సుల వద్ద ఆటోమేటిక్ ముందస్తు హెచ్చరిక సెన్సార్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలన్న లక్ష్యం వేగంగా అమలు కావాలి.
హిమాలయాలను కేవలం నీటి వనరుల నిలయంగా కాకుండా, అత్యంత సున్నితమైన పర్యావరణ వ్యవస్థగా చూడాల్సిన సమయం వచ్చింది. వేలాది సరస్సుల్లో ప్రతి ఒక్కటి ‘వాటర్ బాంబ్’ కాదు. కానీ ప్రమాదకరమైన కొన్ని సరస్సులు విస్ఫోటనం చెందితే దాని ప్రభావం ఊహించలేనంతగా ఉంటుంది. అందుకే అభివృద్ధి, పర్యావరణ భద్రత మధ్య సమతౌల్యాన్ని పాటించడం, శాస్త్రీయ పర్యవేక్షణను విస్తరించడం, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయడం ఆవశ్యం. ప్రాణాలు, ఆస్తులు, భవిష్యత్ తరాల భద్రత కోసం తప్పనిసరి బాధ్యత.

