ప్రాణాలకు తెగించి రావాలని సందేశాలు
ప్రాణత్యాగాలు చేసిన వారిని గుర్తుంచుకుంటాం
సీక్రెట్ యాప్తో పరస్పరం సందేశాలు చేరవేత
సంసద్ యాత్రపై కూపీ లాగుతున్న పోలీసులు|SAMSAD
న్యూఢిల్లీ, జూలై 21 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం చేపట్టిన చలో సంసద్ నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. అయితే, ఆ ఆందోళనల వెనక ఏదైనా కుట్ర దాగుందా? ఆ ఆందోళనల వెనుక ఉంది సీజీపీయేనా? మరెవ్వరైనానా? ఈ ఆందోళనకు ముందు ఏదైనా సీక్రెట్ యాప్ ద్వారా స్టూడెంట్స్ మొబిలైజేషన్ జరిగిందా? ఆ యాప్ లో ప్రాణాలకు తెగించాలని, ఎలాంటి ప్రాణ త్యాగాలకైనా సిద్ధం కావాలనే సందేశాలు వెళ్ళాయా? వాటిని పంపిందెవరు? ఈ మొత్తం ఆందోళనల వెనుకు దాగి ఉన్నదేంటి? ఏమైనా కుట్ర కోణం ఉందా? ఇది ప్రభుత్వ అస్థిరతకు, జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తుందా? అన్న కోణాల్లో ఢిల్లీ పోలీసులు, జాతీయ అత్యున్నత నిఘా విభాగాలు విచారిస్తున్నట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ఈ ఆందోళన వెనుక ఏమైనా కుట్ర కోణాలున్నాయా? అని కూపీ లాగుతున్నారు.
నీట్ పేపర్ లీకేజీ తర్వాత సీజేపీ ఆవిర్భావం, ఆ ఉద్యమంలో విద్యార్థుల భాగస్వామ్యం, ఆ తర్వాత ఆ ఉద్యమాలకు రాజకీయ పార్టీల మద్దతు వంటి అంశాలు సహజంగానే జరిగిపోయాయి. అయితే, సోమవారం ఛలో సంసద్ పేరుతో నిర్వహించిన కార్యక్రమం ప్రభుత్వం, పోలీసులు, నిఘా విభాగాలకు అంతుచిక్కని రీతిలో జరిగింది. అనూహ్యంగా విద్యార్థులు పోటెత్తడం కూడా ప్రభుత్వానికి విస్మయం కలిగిస్తోంది. దానికి తోడు కాంగ్రెస్ ఈ ఉద్యమాన్ని ఆసరా చేసుకోవడం, ప్రధాని ఇంటి ముందే మెరుపు ధర్నాకు దిగడం, రోజురోజుకు పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతుండటం, దేశ యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతుండటం, ఇది భవిష్యత్తులో ప్రభుత్వంపై వ్యరేకతకు దారితీస్తుందా? అనే దాకా వెళ్ళింది. దీంతో ఈ విషయం వెనుక ఉన్నదేంటి? ఏమైనా కుట్ర జరుగుతోందా? అన్న అనుమానాలు సహజంగా ప్రభుత్వ పెద్దలకు కలిగినట్లుగా తెలుస్తోంది.
అయితే, సోమవారం నాటి చలో సంసద్ ఆందోళన సందర్భంగా, నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటనలో పలువురు నిరసనకారులు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం కూడా పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి. దీంతో రాజధానిలో హై టెన్షన్ నెలకొంది. మరోవైపు విపక్ష పార్టీలు ప్రధాని మోదీ నివాసం ఎదుట నిరసనకు దిగారు. ఇదే సమయంలో మరోసారి జంతర్ మంతర్ కు విద్యార్థులు చేరుకోవడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. సర్వత్రా టెన్షన్.. టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంటోంది.
అయితే, ఈ మొత్తం వ్యవహారంలో తాజాగా పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయిని తెలిసింది. సీజేపీ నిరసన హింసాత్మకంగా మారడానికి భారీ కుట్ర జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సోమవారం ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిపేసినప్పటికీ, పెద్ద ఎత్తున నిరసనకారులు ఎలా రాగలిగారు? అన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఈ సందర్భంగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయిట!? నిరసనకారులు పరస్పరం సందేశాలు పంపించుకున్నట్లు కొన్ని చాట్ సందేశాలు వెలుగులోకి వచ్చాయి. ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయినా, పరస్పరం సంప్రదింపులు కొనసాగించేందుకు బ్లూటూత్ ఆధారిత ‘సీక్రెట్ యాప్’ వినియోగించినట్లుగా తేటతెల్లమైంది. అంతేకాకుండా కొంతమంది ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉండాలని సందేశాలు పంపించుకున్నారు. ప్రస్తుతం ఈ సందేశాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చాట్ల వెనుక ఉన్న రహస్యం, వాటిని పంపిన వ్యక్తుల గుర్తింపును ధృవీకరించే పక్రియ కొనసాగుతోంది. అన్ని ఆధారాలను పరిశీలించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా బయటకు వచ్చిన చాట్లలో.. నిరసన ప్రాంతానికి చేరుకున్న తర్వాత మొబైల్ నెట్వర్క్ అందుబాటులో లేకపోవచ్చని ముందే హెచ్చరికలు ఉన్నట్లు సమాచారం. గతంలో కూడా పోలీసులు నెట్వర్క్ జామర్లు ఉపయోగించారని, ఈసారి కూడా అదే జరిగే అవకాశం ఉందని పేర్కొంటూ ప్రత్యామ్నాయ కమ్యూనికేషన్ మార్గాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఒక సందేశంలో.. ‘నిరసన ప్రాంతానికి వెళ్లాక ఫోన్ నెట్వర్క్ ఉండకపోవచ్చు. అందుకే ముందుగానే అందరూ ఒకే యాప్ను ఇన్స్టాల్ చేసుకుని కనెక్ట్ అవ్వాల’ని సూచించినట్లు పోలీసులు గుర్తించారు. బ్లూటూత్ సిగ్నల్ ఆధారంగా పనిచేసే కొన్ని యాప్ల లింకులను కూడా అదే గ్రూపులో షేర్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆ యాప్లపై సైబర్ నిపుణులు సాంకేతిక విశ్లేషణ చేస్తున్నారు. చాట్ల్లో తీవ్ర రాజకీయ హెచ్చరికలు కూడా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఒక సందేశంలో ‘రేపే మోదీ ప్రభుత్వానికి చివరి రోజు’ అని ఉంది. మరోవైపు కొందరు నిరసనకారులు ‘ఉద్యమం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉండాల’ని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఒక సందేశంలో.. ‘ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నవారు గుర్తుంచుకోండి.. మీ త్యాగాన్ని భావితరాలు గుర్తుంచుకుంటాయి.’ అని ఉండగా.. మరో సందేశంలో ‘ఎవరైనా చనిపోతే ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరుగుతుంద’ని పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు వ్యక్తిగత అభిప్రాయాలేనా? లేక నిరసనలను హింసాత్మకంగా మార్చేందుకు ముందస్తు వ్యూహంలో భాగమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చాట్ సందేశాలతో పాటు సీసీటీవీ ఫుటేజ్, డ్రోన్ వీడియోలు, మొబైల్ ఫోన్ వీడియోలు, ఇతర డిజిటల్ ఆధారాలను కూడా ఫోరెన్సిక్ పరీక్షలకు పంపినట్లు అధికారులు తెలిపారు. పోలీసుల ప్రకారం.. ప్రతి డిజిటల్ సందేశాన్ని సాంకేతికంగా ధృవీకరించిన తర్వాతే సాక్ష్యంగా పరిగణిస్తామని, దర్యాప్తులో లభించే ఆధారాల ఆధారంగానే తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

