అడుగు ఎక్స్ క్లూజివ్
కొండా దంపతుల కొత్త పార్టీ?
పాత పార్టీల్లో పొసగడం కష్టమే!
కొత్త పార్టీతో ప్రయాణం స్పష్టమే!
లక్ష్యం బీసీ సామాజిక న్యాయమే!
ఇప్పటికే ప్రధాన పార్టీల్లో0చి బయటకు
కాంగ్రెస్ కాదంటే బీజేపీ ఛాన్స్?
సిద్ధాంత రీత్యా కమలంలోనూ కష్టమే
ఇప్పటికే పలు బీసీ పార్టీలు
వాటిని కలుపుతూ ఐక్యవేదిక సాధ్యమే?
రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు కూడా సన్నాహాలు
అంతరంగికంగా సాగుతున్న చర్చలు
తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించనుందా? అందుకు అడుగులు పడుతున్నాయా? ఆలోచనలు సాగుతున్నాయా? సాధ్యాసాధ్యాలపై చర్చలు జరుగుతున్నాయా? అదీ బీసీ సామాజిక న్యాయమే ప్రధాన అజెండాగా రానుందా? పాత పార్టీల్లో పొసగక కొత్త పార్టీ ఆలోచనలు కొండా దంపతులు చేస్తున్నారా? కాంగ్రెస్ కాదంటే బీజేపీనా? లేక సొంత గూడేనా? మొత్తానికి అంతర్గత చర్చలైతే జరుగుతున్నాయి. బీసీ శక్తులను ఏకతాటిపైకి తెచ్చే వ్యూహం పన్నుతున్నట్లుగా సమాచారం. అసంతృప్త నేతలకు ప్రత్యామ్నాయ వేదికను తయారు చేసే యోచన జరుగుతున్నది. అంతేకాక రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు కూడా సన్నాహాలపై చర్చ జరుగుతున్నది. అడుగుకు అత్యంత విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు కొండా దంపతులు కొత్త పార్టీ దిశగా కూడా ఆలోచనలు చేస్తున్నట్టు వారి ఆ0తరంగికులు చెప్పుకుంటున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త రాజకీయ ప్రయోగ0 జరగనుందా? ఇప్పటికే ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలతో సుదీర్ఘ ప్రయాణం సాగించిన తెలంగాణ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు దంపతులు ఇక సొంత రాజకీయ వేదిక వైపు అడుగులు వేయనున్నారా? బీసీ సామాజిక న్యాయం, ఆత్మగౌరవాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని కొత్త పార్టీ ఏర్పాటు చేయాలన్న ఆలోచనపై అంతర్గతంగా విస్తృత మంతనాలు సాగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అధికారిక ప్రకటన వెలువడకపోయినా.. కొండా దంపతుల రాజకీయ భవిష్యత్ అడుగులపై జరుగుతున్న ఈ చర్చ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది.
దాదాపు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం, వరంగల్ సహా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉన్న రాజకీయ పరిచయాలు, అనుచరగణం, వ్యక్తిగత ప్రభావం తమకు బలంగా ఉన్నాయని కొండా దంపతులు, వారి అనుచరులు అంచనా వేస్తున్నారు. ప్రధాన పార్టీల్లో ఉంటూ రాజకీయ అనుభవాన్ని సంపాదించిన తాము, ఆయా పార్టీల్లో పొసగె పరిస్థితులు లేవని వారు భావిస్తున్నారు. ఇక స్వతంత్రంగా ముందుకు వెళితే మరింత విస్తృతమైన రాజకీయ స్థానం లభిస్తుందన్న అభిప్రాయం వారి సన్నిహిత వర్గాల్లో వ్యక్తమవుతున్నట్లు సమాచారం.
బీసీ ఆత్మగౌరవమే అస్త్రం!
తెలంగాణలో బీసీ వర్గాలు జనాభాలో సగానికి పైగా ఉన్నప్పటికీ.. రాజకీయ ప్రాతినిధ్యం, అధికార భాగస్వామ్యం, నిర్ణయాత్మక పదవుల్లో తమకు తగిన వాటా దక్కడం లేదన్న అసంతృప్తి ఆ వర్గాల్లో చాలాకాలంగా ఉంది. ఈ అసంతృప్తిని రాజకీయ శక్తిగా మలచడమే కొత్త పార్టీ లక్ష్యంగా ఉండవచ్చన్నది సమాచారం. ‘జనాభాలో మెజారిటీ.. అధికారంలోనూ మెజారిటీ ఎందుకు ఉండకూడదు?’ ఇదే ప్రధాన రాజకీయ నినాదంగా మలచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
బీసీలను కేవలం ఎన్నికల ఓటు బ్యాంకుగా కాకుండా.. పాలనలో నిర్ణయాత్మక భాగస్వాములుగా నిలబెట్టాలన్న నినాదంతో ముందుకు వెళ్లే వ్యూహంపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. బీసీ మేధావులు, సామాజిక ఉద్యమకారులు, రాజకీయ విశ్లేషకులు, శ్రేయోభిలాషులతో సంప్రదింపులు సాగుతున్నట్లు తెలుస్తోంది.
అన్ని పార్టీల అసంతృప్తులకు ప్రత్యామ్నాయ గూడు
కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల్లో టికెట్లు, పదవులు, రాజకీయ ప్రాధాన్యం కోసం ఎదురుచూస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకుల సంఖ్య తక్కువేమీ కాదు. ఎన్నికల సమయానికి ఆశావహులందరికీ టికెట్లు ఇవ్వడం ఏ పార్టీకీ సాధ్యం కాదు. దీంతో టికెట్ దక్కని బలమైన అభ్యర్థులు, స్థానికంగా ప్రభావం ఉన్న నాయకులకు కొత్త పార్టీ ప్రత్యామ్నాయ వేదికగా మారవచ్చన్న అంచనాలు ఉన్నాయి.
అయితే, నాయకులను చేర్చుకోవడం కంటే వారిని ఒకే రాజకీయ సిద్ధాంతం కింద నడపడమే పెద్ద సవాల్. వ్యక్తిగత ప్రయోజనాలు, స్థానిక సమీకరణాలు, నియోజకవర్గాల వారీగా మారే సామాజిక రాజకీయాలు కొత్త పార్టీకి పరీక్షగా నిలవనున్నాయి.
కాంగ్రెస్ తర్వాత బీజేపీనా?
ప్రస్తుతం కొండా సురేఖ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నేపథ్యంలో.. కొత్త పార్టీపై జరుగుతున్న చర్చ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్తో రాజకీయంగా విభేదాలు పెరిగితే, బీజేపీ వైపు వెళ్లే అవకాశాలపైనా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే బీసీ సామాజిక న్యాయమే ప్రధాన అజెండాగా స్వతంత్ర రాజకీయ శక్తిని నిర్మించాలనుకుంటే మరో జాతీయ పార్టీలో చేరడం కంటే సొంత పార్టీ ఏర్పాటు చేయడమే సరైన మార్గమన్న వాదన కూడా వినిపిస్తోంది.
కాగా, బీజేపీతో సిద్ధాంతపరమైన అనుసంధానం ఎంతవరకు సాధ్యమన్నది కూడా ప్రశ్నార్థకమే. అందుకే ‘కాంగ్రెస్ కాదంటే బీజేపీ’ అనే సాదాసీదా రాజకీయ సమీకరణం కంటే ‘సొంత రాజకీయ గూటి’ వైపే అడుగులు పడే అవకాశాలపై చర్చ సాగుతోంది.
ఇప్పటికే పలు బీసీ పార్టీలు.. ఐక్యవేదిక సాధ్యమేనా?
తెలంగాణలో బీసీ హక్కులు, సామాజిక న్యాయం, రాజకీయ ప్రాతినిధ్యం కోసం పలు సంస్థలు, రాజకీయ వేదికలు ఇప్పటికే పనిచేస్తున్నాయి. వాటిని ఒకే గొడుగు కిందకు తీసుకురాగలిగితే కొత్త రాజకీయ శక్తికి విస్తృతమైన సామాజిక పునాది ఏర్పడుతుందన్నది కొండా వర్గాల అంచనాగా చెబుతున్నారు.
కోదండరామ్, కవిత, తీన్మార్ మల్లన్న వంటి నేతలు తమతమ రాజకీయ వేదికలతో ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేపథ్యంలో.. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న తాము కూడా స్వతంత్ర రాజకీయ ప్రయోగం ఎందుకు చేయకూడదన్న ఆలోచన కొండా దంపతుల అనుచరుల్లో చర్చనీయాంశంగా మారింది.
పాదయాత్రతో ప్రజల్లోకి!
కొత్త పార్టీపై నిర్ణయం ఖరారైతే.. ముందుగా రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి ప్రజలతో నేరుగా మమేకం కావాలన్న ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం. బీసీల సమస్యలు మాత్రమే కాకుండా రైతులు, నిరుద్యోగులు, యువత, మహిళలు, కార్మికులు, చిన్న వ్యాపారుల సమస్యలపై పార్టీ విధాన పత్రాన్ని రూపొందించాలన్న ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది.
‘కింగ్మేకర్’ వ్యూహమా?
తెలంగాణ అసెంబ్లీలో 119 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 60 స్థానాలు అవసరం. రాబోయే ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య పోటీ తీవ్రంగా మారి ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోతే.. కొన్ని స్థానాల్లో గెలిచే కొత్త రాజకీయ శక్తి కూడా అధికార సమీకరణాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. అదే ‘కింగ్మేకర్’ వ్యూహానికి పునాది కావచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
అయితే, బీసీ ఓటు బ్యాంకును ఏకీకృతం చేయడం అంత సులభం కాదు. ప్రాంతీయ, కుల, వర్గ, వ్యక్తిగత సమీకరణాలు తెలంగాణ రాజకీయాల్లో బలంగా ఉన్నాయి. వాటన్నింటినీ అధిగమించి రాష్ట్రవ్యాప్తంగా కేడర్ నిర్మించగలిగితేనే కొత్త పార్టీ నిలదొక్కుకోగలదు.
మొత్తానికి కొండా దంపతుల రాజకీయ అడుగులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. పాత పార్టీల్లో కొనసాగడమా? మరో జాతీయ పార్టీలో చేరడమా? లేక బీసీ ఆత్మగౌరవ నినాదంతో సొంత రాజకీయ జెండా ఎగురవేయడమా? అన్నదే అసలు ప్రశ్న. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇది రాజకీయ వర్గాల్లో సాగుతున్న చర్చే అయినా.. ఆ ప్రకటన వెలువడితే మాత్రం తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు నాంది పలికే అవకాశాన్ని కొట్టిపారేయలేం.

