ప్రభుత్వం ఒక్కటే అన్నీ చేయగలదనే భావన నుంచి ప్రజలు కూడా బయటపడాలి. “నా ఊరు–నా బాధ్యత” అనే భావన ప్రతి పౌరుడిలో పెంపొందాలి. గ్రామ పంచాయతీలు, సర్పంచ్లు, వార్డు సభ్యులు, రైతు, మహిళా, యువజన సంఘాలు కలిసి గ్రామాభివృద్ధి కార్యాచరణ రూపొందించాలి. గ్రామస్థుల భాగస్వామ్యం ఉన్న చోట అభివృద్ధి ఫలితాలు కూడా మెరుగ్గా ఉంటాయని అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
అభివృద్ధి గురించి గొప్ప లక్ష్యాలు ప్రకటించడం ఒక్కటే సరిపోదు. ఆ అభివృద్ధి గ్రామాలకు చేరినప్పుడే అది నిజమైన అభివృద్ధి. కానీ నేడు గ్రామీణ భారతంలో కనిపిస్తున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాగునీటి కోసం ప్రజలు, సాగునీటి కోసం రైతులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్షాభావం, అడుగంటిన భూగర్భ జలాలు, చెరువుల దురాక్రమణలు, పూడికతీతలు, సంరక్షణపై నిర్లక్ష్యం, గ్రామీణ మౌలిక సదుపాయాల లోపం గ్రామాల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి.
తెలంగాణ ఏర్పడిన తర్వాత చెరువుల పునరుద్ధరణకు “మిషన్ కాకతీయ” వంటి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ, అనేక ప్రాంతాల్లో ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. చెరువులు పూర్తిస్థాయిలో పునరుద్ధరించబడి ఉంటే, ప్రతి ఏడాది తాగునీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడాల్సిన దుస్థితి ఉండేది కాదు. చెరువులు, కుంటలు, కాలువలు, వాగులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. ఇవి బలహీనపడితే వ్యవసాయం మాత్రమే కాదు, పశుసంవర్థకం, గ్రామీణ ఉపాధి, భూగర్భ జలాలన్నీ ప్రభావితమవుతాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ప్రారంభ దశలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. కొన్ని జిల్లాల్లో 20 శాతానికి పైగా వర్షపాతం లోటు కనిపించింది. ఎల్నినో ప్రభావం, వాతావరణ మార్పులు వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. రైతులు విత్తనాలు వేసేందుకు కూడా వెనుకాడుతున్నారు. ముందుగానే విత్తితే వర్షాలు కురవక పెట్టుబడులు నష్టపోతాయనే భయం వారిని వెంటాడుతోంది.
దేశ జనాభాలో 65 శాతం మంది ఇప్పటికీ గ్రామాల్లోనే నివసిస్తున్నారు. తెలంగాణలో కూడా గణనీయమైన జనాభా గ్రామీణ ప్రాంతాల్లోనే జీవిస్తోంది. వ్యవసాయం, పశుసంవర్థకం, అనుబంధ రంగాలే వారి ప్రధాన జీవనాధారం. అయినప్పటికీ గ్రామాల్లో తాగునీరు, విద్య, వైద్యం, పారిశుధ్యం, అంతర్గత రహదారులు, మురుగునీటి నిర్వహణ వంటి మౌలిక సదుపాయాలు ఇప్పటికీ అనేక చోట్ల అందుబాటులో లేవు. ఈ పరిస్థితుల్లో గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు పెరగడం సహజం.
హైదరాబాద్ దేశంలో ప్రముఖ ఐటీ, ఫార్మా, సేవారంగ కేంద్రంగా ఎదిగింది. అయితే రాష్ట్రాభివృద్ధి మొత్తం నగరాలకే పరిమితమైతే సమాన అభివృద్ధి సాధ్యం కాదు. గ్రామాలు బలపడితేనే పట్టణాలపై ఒత్తిడి తగ్గుతుంది. గ్రామాల్లోనే ఉపాధి అవకాశాలు పెరిగితే యువత నగరాలకు వలస వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. వ్యవసాయాధారిత పరిశ్రమలు, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, పాల ఉత్పత్తుల పరిశ్రమలు, చేతివృత్తులు, గ్రామీణ పర్యాటకం వంటి రంగాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయవచ్చు.
ప్రపంచ బ్యాంకు, నీతి ఆయోగ్ వంటి సంస్థలు కూడా గ్రామీణ మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెడితే పేదరికం తగ్గడమే కాకుండా స్థిరమైన ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందని పలుమార్లు సూచించాయి. గ్రామాల్లో రహదారులు, సాగునీటి వనరులు, డిజిటల్ కనెక్టివిటీ, ఆరోగ్య కేంద్రాలు, నాణ్యమైన ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో ఉంటే గ్రామీణ జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడతాయి.
పర్యావరణ పరిరక్షణ కూడా గ్రామాభివృద్ధిలో కీలక అంశమే. విచ్చలవిడిగా ప్లాస్టిక్ వినియోగం, చెట్ల నరికివేత, వర్షపు నీటి సంరక్షణలో నిర్లక్ష్యం, భూగర్భ జలాల అధిక వినియోగం భవిష్యత్తులో తీవ్రమైన నీటి సంక్షోభానికి దారితీస్తాయి. ప్రతి గ్రామంలో చెరువుల పూడికతీత, వర్షపు నీటి సంరక్షణ, మొక్కల పెంపకం, వ్యర్థాల నిర్వహణ వంటి కార్యక్రమాలను ప్రజల భాగస్వామ్యంతో చేపట్టాలి.
ప్రభుత్వం ఒక్కటే అన్నీ చేయగలదనే భావన నుంచి ప్రజలు కూడా బయటపడాలి. “నా ఊరు–నా బాధ్యత” అనే భావన ప్రతి పౌరుడిలో పెంపొందాలి. గ్రామ పంచాయతీలు, సర్పంచ్లు, వార్డు సభ్యులు, రైతు, మహిళా, యువజన సంఘాలు కలిసి గ్రామాభివృద్ధి కార్యాచరణ రూపొందించాలి. గ్రామస్థుల భాగస్వామ్యం ఉన్న చోట అభివృద్ధి ఫలితాలు కూడా మెరుగ్గా ఉంటాయని అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం 2047 నాటికి భారీ ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకుంది. ఈ లక్ష్యాలు సాధించాలంటే సేవారంగం, పారిశ్రామిక రంగంతో పాటు వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సమానంగా బలోపేతం చేయాల్సిందే. వ్యవసాయాన్ని ఆధునికీకరించడం, నీటి వనరులను శాశ్వతంగా అభివృద్ధి చేయడం, చిన్న రైతులకు మార్కెట్ సౌకర్యాలు కల్పించడం, విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించడం అత్యవసరం.
చైనా, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్ వంటి దేశాల అభివృద్ధి వెనుక ‘ప్రాంతాల సమాన అభివృద్ధి’ ప్రధాన కారణంగా నిలిచింది. నగరాలతో పాటు గ్రామాలను కూడా ఆర్థిక కార్యకలాపాల కేంద్రాలుగా తీర్చిదిద్దినందువల్లే అవి వేగంగా అభివృద్ధి చెందాయి. తెలంగాణ కూడా అదే దిశగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది.
గ్రామాలను నిర్లక్ష్యం చేస్తూ రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడటం అసంపూర్ణ ఆలోచనే. చెరువు నిండితేనే బావులు, బోర్లు నిండుతాయి. గ్రామం బలపడితేనే రాష్ట్రం, రాష్ట్రంతో దేశం బలపడుతుంది. అందుకే గ్రామీణాభివృద్ధిని రాజకీయ నినాదంగా కాకుండా ప్రభుత్వాల దీర్ఘకాలిక అభివృద్ధి వ్యూహంగా మలచాలి. ‘పల్లె ప్రగతే రాష్ట్ర-దేశ ప్రగతికి పునాది’

