THREE|ముగ్గురు MINISTERS|మంత్రులకు ఉద్వాసన?
మంత్రుల్లో, ఆశావహుల్లో ఉత్కంఠ
CM|సీఎం, PCC CHIEF|పీసీసీ చీఫ్, రాష్ట్ర ముఖ్య నేతలకు ఢిల్లీ పిలుపు
మంత్రులకు, ముఖ్య నేతలకు CM|సీఎం విందు
అసలు అవుతుందో లేదో అనుకున్న తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు రంగం సిద్ధమైందా? గిల్లి కజ్జాలు, బుజ్జగింపుల తర్వాత అన్ని అవాంతరాలను అధిగమించినట్లేనా? అదే జరిగితే, ఇప్పుడున్న మంత్రుల్లో ముగ్గురికి ఉద్వాసన తప్పదా? ఆ ముగ్గురు ఎవరు? కొత్తగా మంత్రులయ్యేది ఎవరు? పీసీసీ కార్యవర్గంలో చోటు దక్కేదెవరికి? కాంగ్రెస్ మార్క్ రాజకీయంలో అంతా ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ఈ నెల 30 లేదా జూన్ మొదటి వారంలోనే ఉండనుందా? అదే సమయంలో పీసీసీ కార్యవర్గాన్ని కూడా ప్రకటిస్తారా? ఇదే జరిగితే, ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్న ముగ్గురు మంత్రులకు ఉద్వాసన తప్పదా? ఆ ముగ్గురు ఎవరు? కొత్తగా మంత్రులు కానున్నది ఎవరు? పైగా ఈ నెల 30న ఢిల్లీకి ఎఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వస్తున్నారు. ఇదే రోజున ఢిల్లీకి రావాలని సీఎం, పీసీసీ చీఫ్, మంత్రులకు పిలుపు వచ్చినట్లుగా తెలిసింది. మంత్రివర్గ విస్తరణ, కార్యవర్గ కూర్పుపై అధిష్టానం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే, ఇప్పుడు ఇవే అంశాలు రాష్ట్ర కాంగ్రెస్ తోపాటు, మంత్రివర్గ సభ్యులలో ఉత్కంఠ రేపుతున్నాయి. ఇవే అంశాలు చర్చనీయాంశంగా మారాయి.
విందు రాజకీయం
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో మంత్రులకు విందు ఇచ్చారు. ఈ విందుకు డిప్యూటీ సీఎం సహా, రాష్ట్ర మంత్రులు, పీసీసీ చీఫ్, కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరయ్యారు. అంతా ఒక చోట కలిసి పిచ్చా పాటి ముచ్చటించుకుంటున్న సమయంలో మంత్రి వర్గ విస్తరణ అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. రెండు రోజుల క్రితమే రెండు రోజులపాటు అధిష్ఠానం పిలుపు మేరకు ఢిల్లీలో మకాం వేసి, సుదీర్ఘంగా చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. పీసీసీ కార్యవర్గం తుది జాబితా ఖరారు, మంత్రి వర్గ విస్తరణపైనే కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఎఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులతో భేటీలు జరిపారు. చర్చించారు. అయితే ఎఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఢిల్లీలో అందుబాటులో లేని కారణంగా ఆయన వచ్చిన వెంటనే మళ్ళీ మరోసారి భేటీ అయ్యేందుకు, తుది జాబితాలు సిద్ధం చేసేందుకు నిర్ణయించారు. 30న ఖర్గే ఢిల్లీలో అందుబాటులో ఉంటారని తెలిసింది. దీంతో విందులో చర్చంతా పీసీసీ కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణపైనే జరిగినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఖర్గే ఆమోదం కోసం ఢిల్లీకి 30న కాంగ్రెస్ ముఖ్య నేతలు వెళ్ళనున్నట్లు చర్చ వచ్చింది. ఇదే సమయంలో ముగ్గురు మంత్రులకు ఉద్వాసన తప్పదన్న విషయం చర్చకు వచ్చింది. ఆ ముగ్గురు ఎవరన్న దానిపై విందులోనే ఉత్కంఠగా చర్చ జరిగినట్లు తెలిసింది. మంత్రుల్లో అప్పుడే గుబులు మొదలైంది. పైకి గంభీరంగా కనిపించినప్పటికీ దాదాపు మంత్రులందరిలోనూ ఏయే కారణాలతో ఎవరిని పక్కన పెడతారోనన్న ఆందోళన కలిగినట్లు తెలిసింది. పైకి నవ్వుతూ ఏదోలా ఆ విందు ముగించుకుని బయట పడ్డారట. అంతేగాక కొత్తగా వచ్చే మంత్రులు ఎవరై ఉంటారన్నదానిపై కూడా కొందరు చర్చించుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే బహిరంగంగా చర్చకు వచ్చిన పేర్లను వారు ఉటంకించినట్లు తెలిసింది.
విస్తరణ పూర్తి స్థాయిలోనేనా?
అయితే ఈ సారి మంత్రి వర్గ విస్తరణ పూర్తి స్థాయిలో ఉంటుందా? లేక ఇద్దరు ముగ్గురిని తప్పించి, మరో ఇద్దరు ముగ్గురిని తీసుకుని వివాదాస్పదంగా ఉన్న మిగతా ఒకటి రెండు జిల్లాలను పక్కన పెడతారా? అన్న సందిగ్ధం కూడా నెలకొంది. ముఖ్యంగా అదిలాబాద్ జిల్లాలో సామాజిక వర్గాల సమీకరణలు కుదరడం లేదు. ఒకటి రెండు సామాజిక వర్గాల మధ్య పడటం లేదు. నల్లగొండలోనూ ఒకే సామాజిక వర్గం, ఒకే కుటుంబానికి చెందిన వారికి మంత్రి పదవులు దక్కుతాయా? అన్నది ఉత్కంఠగానే ఉంది. అధిష్టానం నిర్ణయం ఏమై ఉంటుంది? ఏ మేరకు సీఎం, రాష్ట్ర నేతలు ఎఐసీసీని ఒప్పించగలరన్నదానిపై ఈ సమీకరణలు ఆధారపడి ఉన్నాయి.
మీనాక్షి కీలక పాత్ర
ఇక పీపీసీతోపాటు, మంత్రి వర్గ కూర్పులోనూ ఎఐసీసీ వ్యవహారాల ఇన్ చార్జీ మీనాక్షి నటరాజన్ కీలక పాత్ర వహిస్తున్నట్లు తెలిసింది. గతానికి భిన్నంగా కొన్ని నిబంధనలు పెట్టి, దరఖాస్తులు స్వీకరించి, పరిశీలించి, వడపోసి, నిర్ణయించే ప్రక్రియను ఆమె మొదలు పెట్టారు. ఎట్టకేలకు ఒక జాబితాను ఎఐసీసీకి పంపించారు. పీసీసీ మాత్రమేగాకుండా, మరోవైపు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల పనితీరును సైతం మీనాక్షి మదింపు వేసి, ఎఐసీసీకి పంపించినట్లుగా విశ్వసనీయంగా తెలిసింది. దీంతో ఎవరేంటి? వారి పనితీరేంటి? పార్టీకి వారు పనికొచ్చే తీరేంటి? వంటి అంశాల్లో ఒక నిర్ధారణకు రావడానికి ఎఐసీసీకి సులువైనట్లుగా చెబుతున్నారు.
మొత్తానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన18 నెలలు తర్వాత కూడా అసలు పీసీసీ విస్తరణ ఉంటుందా? మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందా? అనే అనుమానాలు బలపడి, విస్తారంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ రెండు నియామకాలు ఒక కొలిక్కి రావడం ఆ పార్టీలో కొందరికి ఇబ్బందీగా ఉన్నప్పటికీ, అనేక మందికి ఆనందాన్ని కలిగిస్తున్నది.

