పాగాకై పాకులాటా?
కస్సుమన్న కాంగ్రెస్!|CONGRESS
భగ్గుమన్న బీఆర్ఎస్!!|BRS
ఆత్మరక్షణలో బీజేపీ!!!|BJP
వివాదానికి నేపథ్యమేంటి?
ఇప్పుడు సూర్య, గతంలో మోదీ!
చారిత్రక అంశాల వక్రీకరణా?
రాజకీయ మైలేజీ వ్యూహమా?
కాంగ్రెస్ను టార్గెట్ చేయడమా?
పునర్విభజన – దక్షిణాది భయమా?
లోక్సభలో పునర్విభజన బిల్లుపై చర్చను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు లంకె వేసి, కర్ణాటక దక్షిణ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ రాజకీయ దుమారం రేపుతున్నాయి. పైగా రాష్ట్ర విభజనను నాటి ఇండియా-పాకిస్తాన్ విభజనతో పోల్చడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. సందర్భ శుద్ధిలేకపోతే అవి అసందర్భ ప్రేలాపణలుగా మిగులుతాయి. ఆయా అంశాలతో సంబంధం ఉన్న వాళ్ళ ఆత్మగౌరవాన్ని అవమానిస్తాయి. పరువు నష్టానికి దారి తీస్తాయి. పరిపరి విధాల సమస్యలకు దారులు తెరుస్తాయి. ఇప్పుడు తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు సరిగ్గా ఈ సంక్షోభాన్నే కలగించాయి.
-డా.మార్గం లక్ష్మీనారాయణ
నిన్న అంటే, ఏప్రిల్ 16, 2026న లోక్సభలో నియోజకవర్గాల పునర్విభజన-2026 బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనను బ్రిటీష్ వారు చేసిన భారత-పాకిస్థాన్ విభజనతో పోల్చడం రాజకీయంగా, సామాజికంగా పెద్ద చర్చకు దారితీసింది. అసలు ఆయన చేసిన వ్యాఖ్యలు, వాటి వెనుక ఉన్న రాజకీయ కోణాలు, ప్రతిపక్షాల స్పందనపై విశ్లేషిద్దాం.
తేజస్వి సూర్య ఏమన్నారు?
లోక్సభలో నియోజకవర్గాల పునర్విభజనపై ప్రసంగిస్తూ తేజస్వీ సూర్య, ఆంధ్రప్రదేశ్ విభజనను అత్యంత దారుణంగా అభివర్ణించారు. బ్రిటిష్ వారు దేశాన్ని ఇండియా-పాకిస్తాన్ లా విడగొట్టారన్నారు. ఏపీని అశాస్త్రీయంగా, ఘోరంగా చీల్చిన వారసత్వం కాంగ్రెస్ దన్నారు.
గతంలో మోదీ ఇలాగే…
గతంలో ప్రధాని మోదీ పార్లమెంటులో ఇలాగే వ్యాఖ్యానించారు. ‘తల్లిని చంపి బిడ్డను వేరు చేశార’ని నోరు పారేసుకున్నారు. పార్లమెంట్ తలుపులు వేసి, చీకట్లో బిల్లును పాస్ చేశారని ఆరోపించారు.
కస్సుమన్న కాంగ్రెస్
తేజస్వి వ్యాఖ్యలపై కాంగ్రెస్ కస్సుమంది. తెలివితక్కువవాళ్లు సభలోకి రాడంతో, తప్పుడు మాటలతో, తెలంగాణ తల్లి తల్లడిల్లుతోందని మంత్రి పొన్నం అన్నారు. తెలంగాణ అంటేనే బీజేపీకి కడుపు మంట అని జూపల్లి చెప్పారు. వెంటనే క్షమాపణ చెప్పాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. చరిత్రను వక్రీకరించే ప్రయత్నంగా అభివర్ణించారు. తెలంగాణ బిల్లు ఆమోదంలో బీజేపీ కూడా మద్దతు ఇచ్చిందని, ఇప్పుడు ఇలా మాట్లాడటం వారి ద్వంద్వ నీతికి నిదర్శనమని విమర్శించారు.
భగ్గుమన్న బీఆర్ఎస్
గతంలో ప్రధాని మోదీ, ఇప్పుడు ఈ ఎంపీ అంతకంటే ఘోరంగా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ విమర్శించింది. వందలాది మంది బలిదానాలతో, దశాబ్దాల పోరాటంతో సిద్ధించిన తెలంగాణను బ్రిటిష్ విభజనతో పోల్చడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని కేటీఆర్, హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.
ఆత్మరక్షణలో బీజేపీ
బీజేపీ ఆత్మరక్షణలో పడింది. తేజస్వి అవమానకరంగా మాట్లాడలేదు. ఒకవేళ అలా అనిపిస్తే ఆ మాటలను వెనక్కి తీసుకుంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరణ ఇచ్చారు. తన మాటలన్ని వక్రీకరిస్తున్నారని తేజస్వి సూర్య అంటున్నారు.
బీజేపీ స్టాండ్ ఏంటి?:
పార్టీ అధిష్టానం ఇప్పటివరకు అధికారికంగా స్పందించనప్పటికీ, లోకల్ బీజేపీ నేతలు మాత్రం ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తూ, కాంగ్రెస్ విభజనను అశాస్త్రీయంగా చేసిందని, ఆ ఉద్దేశంతోనే ఆయన అలా అన్నారని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
వివాదానికి నేపథ్యమిదీ…
పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో, దక్షిణాది రాష్ట్రాలకు జరగబోయే అన్యాయంపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన “హైబ్రిడ్ మోడల్” (ఆర్థిక పనితీరు ఆధారంగా సీట్ల కేటాయింపు) గురించి ప్రస్తావిస్తూ తేజస్వి సూర్య తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ గతంలో ఆంధ్రప్రదేశ్ విభజనను నిర్వహించిన తీరును తప్పుపడుతూ, “కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను విడగొట్టిన తీరు, బ్రిటీష్ వారు దేశాన్ని విభజించిన దానికంటే దారుణంగా ఉంది” అని వ్యాఖ్యానించారు.
వ్యాఖ్యల అంతరార్థం మరియు ప్రభావం
1. చారిత్రక అంశాల వక్రీకరణ: తేజస్వి సూర్య చేసిన పోలికను తెలంగాణ వాదులు, మేధావులు, రాజకీయ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. భారత-పాక్ విభజనకు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజనకు పోలికే లేదు. కొన్ని లక్షల మంది ప్రాణనష్టం, భారీ వలసలు, రక్తపాతంతో కూడిన విషాదకర ఘటన. దానికి భిన్నమైంది తెలంగాణ ఏర్పాటు. విలీనం నుంచే విడిపోయే వ్యతిరేకత మొదలైన దశాబ్దాల కాలం పాటు జరిగిన ప్రజాస్వామ్య పోరాటం, ప్రజల ఆకాంక్ష. ఈ రెండింటినీ ఒకే విధంగా పోల్చడం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, తెలంగాణ అమరుల బలిదానాలను అవమానించడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
2. రాజకీయ వ్యూహం – కాంగ్రెస్ను టార్గెట్ చేయడం: బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఉద్దేశం విభజనను వ్యతిరేకించడం కంటే, ఆ ప్రక్రియను కాంగ్రెస్ సరిగ్గా నిర్వహించలేదని చెప్పడమే కావచ్చు. కానీ, విభజన సమయంలో తలెత్తిన ఆస్తుల పంపిణీ, నీటి వివాదాలు, రాజధాని సమస్యలను సాకుగా చూపి కాంగ్రెస్ “విఫల విభజన” చేసిందని విమర్శించడం బీజేపీ రాజకీయ వ్యూహంలో భాగంగా కనిపిస్తున్నది. అయితే, ఈ ప్రక్రియలో ఆ ఎంపీ వాడిన పదజాలం తెలంగాణ అస్తిత్వాన్ని, ఏర్పాటును కించపరిచేలా, ఆత్మగౌరవాన్ని అవమానించేలా ఉందని భావించడం వల్ల బీజేపీకి దేశ, ఏపీ వ్యాప్తంగా వచ్చే ప్రయోజనాల కన్నా, తెలంగాణలో రాజకీయంగా కలిగే నష్టమే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
3. పునర్విభజన – దక్షిణాది భయం: నిజానికి ఈ చర్చ డీలిమిటేషన్ గురించి జరుగుతోంది. జనాభా నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలకు లోక్సభలో సీట్లు తగ్గుతాయన్న భయం ఉంది. దీనిని డైవర్ట్ చేయడానికే తేజస్వి సూర్య ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే వాదన కూడా ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదనను “ఫూలిష్ ఐడియా” అని కొట్టిపారేయడం ద్వారా ఆయన కేవలం రాజ్యాంగ సూత్రాలను ఒక వ్యక్తి – ఒక ఓటు కాపాడాలని చూస్తున్నారా లేక దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారా అన్నది చర్చనీయాంశంగా మారింది.
తేజస్వి సూర్య వ్యాఖ్యలు కేవలం ఒక రాజకీయ విమర్శగా కాకుండా, రాష్ట్రాల మధ్య ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టేలా ఉన్నాయి. ఒక జాతీయ స్థాయి నాయకుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా సున్నితమైన అంశాలపై మాట్లాడేటప్పుడు చారిత్రక స్పృహ, ప్రాంతీయ ఆకాంక్షల పట్ల గౌరవం కలిగి ఉండాలి. ఇలాంటి వ్యాఖ్యలు భవిష్యత్తులో ఉత్తర-దక్షిణ రాష్ట్రాల మధ్య దూరాన్ని పెంచే ప్రమాదం ఉంది. విభజన సమస్యలపై విమర్శలు చేయవచ్చు కానీ, వాటిని దేశ విభజన వంటి విషాదకర సంఘటనలతో పోల్చడం హర్షణీయం కాదు.
వివాదాల సూర్య..
సూర్యకు వివాదాలు కొత్తేమీ కాదు. వివాదాస్పంగా ప్రవర్తించడం, మాట్లాడటం, లేదా ఏదైనా చేసేయేడం, తర్వాత వాటిని దిద్దుకోవడం ఆయనకు అలవాటే.
అరబ్ మహిళలపై తారెక్ ఫతా చేసిన లైంగిక వ్యాఖ్యలను ఉటంకిస్తూ సూర్య 2015లో చేసిన ట్వీట్ను ఏప్రిల్ 2020లో సంజయ్ ఝా సహా అరబ్ దేశాల పౌరులు విమర్శించారు.
2019లో సూర్య తనను దూషించాడని ఆరోపించిన ఒక మహిళ పోస్ట్ చేసిన ట్వీట్ల స్క్రీన్షాట్లను కాంగ్రెస్ పార్టీ పంచుకుంది. తన లోక్సభ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన ఆ సమయంలో తనకు పరువు నష్టం కలగే విధంగా వార్తలు రాయొద్దని సూర్య, 49 మీడియా, సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లపై కోర్టు నుండి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు.
ఏప్రిల్ 2019లో, మహిళలకు రిజర్వేషన్లపై ఒక మహిళను దూషిస్తూ చేసిన ట్వీట్ పై కర్ణాటక మహిళా కాంగ్రెస్ ఫిర్యాదు మేరకు, కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ సూర్యను పిలిపించి ప్రశ్నించింది.
2021 మే 5న, సూర్య తన మామ ఎల్. ఎ. రవి సుబ్రహ్మణ్యతో కలిసి, కోవిడ్-19 రోగుల కోసం బీబీఎంపీ హాస్పిటల్ పడకల కేటాయింపులో ఒక కుంభకోణాన్ని వెలికితీసినట్లు ప్రకటించాడు. 204 మంది ఉద్యోగులలో కేవలం 17 మంది పేర్లను మాత్రమే చదివడమేగాక, అతను పేర్కొన్న ఉద్యోగులందరూ ముస్లింలు కావడంతో, సూర్య ఈ విషయాన్ని మతపరంగా మారుస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. మే 10 నాటికి, ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్న మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో సూర్య పేర్కొన్న ఉద్యోగులు ఎవరూ లేరు. దీంతో సూర్య, ముస్లీం సమాజానికి క్షమాపణలు కోరాల్సివచ్చింది.
2023లో, క్యాబిన్ సిబ్బంది ప్రయాణీకుల భద్రత గురించి వివరిస్తుండగా, సూర్య ఇండిగో విమానం అత్యవసర ద్వారాన్ని తెరిచాడని వార్తా మాధ్యమాలు నివేదించాయి. ఆ చర్యకు అతనిచేత క్షమాపణ చెప్పించారు. ప్రామాణికాల ప్రకారం ఈ సంఘటనను నమోదు చేయడమేగాక, విమానానికి తప్పనిసరి ఇంజనీరింగ్ తనిఖీలు నిర్వహించారు, దీనివల్ల విమానం బయలుదేరడంలో ఆలస్యం జరిగింది.
2024లో, ఒక రైతు ఆత్మహత్యకు, వక్ఫ్ బోర్డుతో భూ వివాదాలకు సంబంధం ఉందని తప్పుడు వార్తలు వ్యాప్తి చేసినందుకు, అతనిపై కొన్ని కన్నడ వార్తా పోర్టల్స్ సంపాదకులతో పాటు కేసు నమోదు చేశారు. హవేరి జిల్లా ఎస్సీ ఆ వార్తా కథనాన్ని నకిలీదని తేల్చడంతో ఆ పోస్టుని సూర్య తొలగించారు.

