అభివృద్ధి పథకాలు ప్రజావసరాలు తీర్చడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయా? అసలా పథకాలు ప్రజల కోసమే అమలవుతున్నాయా? పేదలు, అట్టడుగు వర్గాలు నివసించే ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులు తరచూ నిర్వాసిత సమస్యలకు దారితీస్తున్నాయి. నగరాల సుందరీకరణ, పెట్టుబడులు, పర్యాటకం వంటి లక్ష్యాలు ఎలా ఉన్నా, ప్రజల కనీస నివాస హక్కులు, జీవనోపాధి ప్రశ్నార్థకం అవుతున్నాయి.
ఎనిమిది దశాబ్దాల స్వతంత్ర పాలనలో కూడా దేశంలో పేదరికం తొలగిపోలేదు. పాలకుల్లో నిజాయితీ, నిబద్ధత, దూరదృష్టి, చిత్తశుద్ధి లోపించడమే ఇందుక్కారణం. ప్రజలు కట్టే పన్నులను, వనరులను సమర్థంగా వినియోగించగలిగినా, సమాజంలో కనీస అభివృద్ధి సాధ్యమే. కానీ, పాలకులు సంక్షేమం పేరుతో తాత్కాలిక ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తూ, దీర్ఘకాలిక ప్రణాళికలను విస్మరిస్తున్నారు. పేదరికం నిర్మూలాంశం కాకుండా, నిరపేక్ష రాజకీయాంశంగా మారింది.
ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ప్రజలు తెలంగాణ రాష్ట్రం కోసం పరితపించారు. నీళ్ళు, నిధులు, ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూశారు. తెలంగాణను తెచ్చామంటున్న కేసీఆర్ పాలనలో భారీ ప్రాజెక్టులు చేపట్టినా, వాటి అమలు అధ్వాన్నంగా మారింది. మల్లన్న సాగర్, కొండ పోచమ్మసాగర్ రిజర్వాయర్ల కోసం గ్రామాలను ఖాళీ చేయించాల్సి వచ్చింది. వేలాది ఎకరాల భూములు సేకరించబడ్డాయి. కానీ ఆ ప్రాజెక్టుల నిర్వాసితులకు సరైన పునరావాసం, స్థిరమైన జీవనోపాధి కల్పించడంలో విఫలమయ్యారు. పైగా ఆ నిర్వాసితులు గూడు విడిచిన పక్షుల్లా కకావికలమయ్యారు.
మూసీ నదిని శుద్ధి చేసి, సబర్మతి తరహాలో సుందరీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టింది. మొదటి దశలో, రూ.4,100 కోట్ల ఏడీబ్లోన్ రుణంతో, హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ నుండి బాపూఘాట్ వరకు 20 కి.మీ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా గాంధీ సరోవర్, పర్యాటక ప్రాంతాలు, అమ్యూజ్మెంట్ పార్కులు, వాటర్ స్పోర్ట్స్, గ్రీన్స్పేస్లు ఏర్పాటు చేస్తారు. 55 కి.మీ. మేర నది ప్రక్షాళన జరుగుతుంది, రూ.3,100 కోట్లతో ట్రంక్ ఇంటర్సెప్టర్ సీవర్ పైప్లైన్ పనులు కూడా చేపడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం 50 మీటర్ల బఫర్ జోన్తో సహా 3,279 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం డీపీఆర్ పూర్తి చేసి, పనులను వేగం చేస్తోంది. అయితే, భూసేకరణ, ప్రజల తరలింపు, పర్యావరణం, పునరావాసం వంటి వివాదాలు, అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
అయితే, ఈ ప్రాజెక్టు అమలుపైనే అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మూసీ పరివాహకంలో నివసిస్తున్న వేలాది కుటుంబాలను తరలించక తప్పదన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కబ్జాలను పక్కన పెడితే, మరి నిర్వాసితులకి పునరావాసం ఎక్కడ కల్పిస్తారు? భూమి కోల్పోయిన వారికి భూమి ఇస్తారా? ఇళ్లు కోల్పోయిన వారికి సముచిత గృహాలు కట్టిస్తారా?
మూసీ ప్రక్షాళన జరగాల్సిందే. అదే సమయంలో ఆ పరివాహకంలో నివసించే వారికి నివాసం, విద్య, వైద్యం, ఉపాధి, రవాణా వంటి సౌకర్యాలు అందేలా చూడాలి. అప్పుడు మాత్రమే ఆ పరివాహక ప్రజలు కూడా ఈ మార్పును స్వాగతిస్తారు. లేకపోతే తిరగబడతారు. ప్రతిపక్షాల ఈ అవకాశం కోసమే కాచుక్కూచుకున్నాయన్నది మరవరాదు.
మూసీ ప్రక్షాళన, పర్యావరణ పునరుద్ధరణ, పర్యాటకాభివృద్ధి నగర భవిష్యత్తుకు అవసరమైన లక్ష్యాలే. కానీ వాటిని సాధించే ప్రక్రియలో ప్రజల జీవన హక్కులు దెబ్బతినకూడదు. మూసీ అభివృద్ధి ప్రాజెక్టు కేవలం మౌలిక వసతుల ప్రణాళికగా కాకుండా, సమగ్ర సామాజిక పునరావాస ప్రణాళికగా మారాలి.
అభివృద్ధి విజయవంతం కావాలంటే ప్రజల విశ్వాసం, భాగస్వామ్యం అవసరం. పారదర్శకంగా సాగితేనే మూసీ ప్రాజెక్టు హైదరాబాద్ నగరానికి గర్వకారణంగా నిలుస్తుంది. లేకపోతే అది మరో వివాదాస్పద ప్రాజెక్టుగా మిగిలిపోతుంది. అభివృద్ధి ప్రజల కోసం అయితేనే దానికి అర్థం ఉంటుంది. ప్రజలే ప్రథమం అనే సూత్రాన్ని గుర్తుంచుకుంటేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది.

