దేశంలో ప్రతి ఏటా కోటిన్నర మంది విద్యార్థులు పది, ఇంటర్ వంటి కీలక పరీక్షలకు హాజరవుతున్నారు. వీళ్ళంతా ర్యాంకుల పోటీలో చిక్కుకుని తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికల ప్రకారం, 2022లోనే దేశవ్యాప్తంగా 13 వేలకు పైగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రోజుకు సగటున 35 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారనే దారుణ వాస్తవాన్ని తెలియజేస్తోంది. ఇటీవల పరీక్షల ఫలితాల తరువాత ఒక్క రోజులోనే తెలంగాణలో 7గురు, ఆంధ్రప్రదేశ్లో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి!*
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
నేటి విద్యా వ్యవస్థలో బట్టీలతో చదువులు సట్టుబండలై ర్యాంకుల గోలే రాజ్యమేలుతోంది. టీవీలు, పత్రికలు, సోషల్ మీడియా ర్యాంకుల ప్రచారంతో నిండిపోతున్నాయి. ఒకటి ఒకటి ఒకటి, రెండు రెండు రెండు, మూడు మూడు మూడు “మా విద్యార్థులు టాప్ ర్యాంకులు సాధించారు” అనే ప్రకటనలు విద్యాసంస్థల ప్రతిష్ఠకు ప్రమాణంగా నిలుస్తున్నాయి. అయితే ఈ మెరుపు ప్రచారం వెనుక విద్యార్థులపై పెరుగుతున్న మానసిక ఒత్తిడి, సృజనాత్మకత నాశనం, ఆర్థిక దోపిడీ వంటి రుగ్మతలను పిల్లల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం, ప్రభుత్వం కూడా గమనించాల్సి ఉంది.
భారతదేశంలో ప్రతి ఏటా కోటిన్నర మంది విద్యార్థులు పదో తరగతి, ఇంటర్ వంటి కీలక పరీక్షలకు హాజరవుతున్నారు. వీరిలో అత్యధికులు ర్యాంకుల పోటీలో చిక్కుకుని తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికల ప్రకారం, 2022లోనే దేశవ్యాప్తంగా 13 వేలకు పైగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇది రోజుకు సగటున 35 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారనే దారుణ వాస్తవాన్ని తెలియజేస్తోంది. ఇటీవల రాష్ట్రాల వారీగా చూస్తే, పరీక్షల ఫలితాల తరువాత ఒక్క రోజులోనే తెలంగాణలో 7గురు, ఆంధ్రప్రదేశ్లో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
ఇది కేవలం వ్యక్తిగత వైఫల్యాల ఫలితం కాదు. ఇది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం, కుటుంబం, విద్యా వ్యవస్థలోని లోపాల సమ్మిళిత ప్రతిఫలం. తల్లిదండ్రులు తమ పిల్లలపై అధిక అంచనాలు, అలవిగాని ఆశలు పెట్టడం, ఇతరులతో పోల్చడం, “ర్యాంక్ సాధించాలి” అనే ఒత్తిడి పెంచుతున్నారు. మరోవైపు, కార్పొరేట్ విద్యాసంస్థలు ర్యాంకులను ఒక వ్యాపార సాధనంగా మార్చి, లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఒక ఇంటర్ విద్యార్థి చదువుకు ఏడాదికి రూ.1 లక్ష నుండి రూ.3 లక్షల వరకు ఖర్చు అవుతున్న పరిస్థితి ఉంది. ఇది మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారుతోంది.
ఇంకా, ప్రభుత్వ విద్యా వ్యవస్థ వైఫల్యాలు కూడా ఈ సమస్యను మరింత తీవ్రం చేస్తున్నాయి. అనేక ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, మౌలిక సదుపాయాల లోపం, హాస్టళ్లలో నాణ్యమైన ఆహారం లేకపోవడం వంటి సమస్యలు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు కూడా చోటుచేసుకోవడం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలియజేస్తోంది. ఫలితంగా, పేదలు కూడా ప్రైవేట్ విద్యాసంస్థల వైపు మళ్లుతున్నారు.
ప్రస్తుతం విద్యా వ్యవస్థలో “మార్కులు = ప్రతిభ” అనే తప్పుడు సమీకరణ ఏర్పడింది. కానీ ఇది వాస్తవ దూరం. ప్రతి విద్యార్థికి వేర్వేరు ప్రతిభ, ఆసక్తులు ఉంటాయి. కళలు, క్రీడలు, సాంకేతిక నైపుణ్యాలు వంటి అనేక రంగాల్లో ప్రతిభ కనబరచే అవకాశం ఉంది. కానీ ర్యాంకుల వేటలో ఇవన్నీ పక్కన పడిపోతున్నాయి. తరగతి గదిలో వెనుకబడిన విద్యార్థులు జీవితంలో గొప్ప విజయాలు సాధించిన ఉదాహరణలు చరిత్రలో అనేకం ఉన్నాయి.
విద్యార్థుల మానసిక ఆరోగ్యం ప్రస్తుతం అత్యంత ముఖ్యమైన అంశంగా మారింది. పరీక్షల సమయంలో కలిగే ఆందోళన, భయం, నిరాశ వంటి భావాలు తీవ్ర మానసిక సమస్యలకు దారి తీస్తున్నాయి. కౌన్సెలింగ్ వ్యవస్థలు చాలా చోట్ల లేవు లేదా సరైన విధంగా పనిచేయడం లేదు. ఒక విద్యార్థి ఫెయిలైతే జీవితం ముగిసినట్లే అన్న భావన పెరుగుతోంది. ఇది అత్యంత ప్రమాదకర దృక్పథం.
ఈ పరిస్థితిని మార్చేందుకు తక్షణ చర్యలు అవసరం. తల్లిదండ్రుల దృక్పథంలో మార్పు రావాలి. పిల్లలను ఇతరులతో పోల్చడం ఆపాలి. వారి ఆసక్తులను గుర్తించి ప్రోత్సహించాలి. మార్కులు మాత్రమే విజయానికి ప్రమాణం కాదని వారికి అర్థమయ్యేలా చేయాలి. విద్యా వ్యవస్థలో సంస్కరణలు చేపట్టాలి. ర్యాంక్ ఆధారిత పోటీని తగ్గించి, నైపుణ్యాల ఆధారిత విద్యను ప్రోత్సహించాలి. ఒకే విధమైన, సమాన విద్య అందరికీ అందేలా చూడాలి. ఫిన్లాండ్ వంటి దేశాల్లో పరీక్షల ఒత్తిడి తక్కువగా ఉండి, విద్యార్థుల సృజనాత్మకతకు ప్రాధాన్యత ఇస్తారు. అలాంటి నమూనాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి. ఉపాధ్యాయ నియామకాలు పెంచాలి, మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి. ఇలా చేస్తే ప్రైవేట్ విద్యాసంస్థలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజులపై నియంత్రణ అవసరం. అధిక ఫీజుల వసూళ్లను అరికట్టేందుకు కఠిన చట్టాలు అమలు చేయాలి.
విద్యార్థులకు మానసిక బలం కల్పించడం అత్యంత అవసరం. స్కూల్స్, కాలేజీల్లో కౌన్సెలింగ్ తప్పనిసరి చేయాలి. ఫెయిల్యూర్ అనేది అంతం కాదని, జీవితంలో అనేక అవకాశాలు ఉన్నాయని వారికి తెలియజేయాలి.
విద్య పరమార్థం మార్కులు, ర్యాంకులు సాధించడమే కాదు. అది వ్యక్తిత్వ వికాసానికి, సమాజానికి ఉపయోగపడే నైపుణ్యాల అభివృద్ధికి దోహదపడాలి. ఈ నిజాన్ని గుర్తించినప్పుడే విద్యా వ్యవస్థలో నిజమైన మార్పు సాధ్యమవుతుంది.

