అధికార కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళు గడిచినా, గత ప్రభుత్వంపై చేసిన అవినీతి ఆరోపణల నిరూపణల్లో జాప్యం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆ అజెండా నుంచి నెమ్మదిగా తప్పుకోవడం రాజకీయ వ్యూహమా? లేక పరిపాలనా లోపమా? పరిమితుల కారణమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
తెలంగాణ రాజకీయాల్లో ఇటీవలి పరిణామాలు అధికార కాంగ్రెస్ను ఆత్మరక్షణలోకి నెట్టుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారంలోకి రావడానికి ముందు భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నాయకత్వం, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళు గడిచినా, గత ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు, అవినీతి నిరూపణలపై స్పష్టమైన పురోగతి కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
బీఆర్ఎస్ హయాంలోని కాళేశ్వరం ప్రాజెక్ట్, ఈ కార్ రేసు, ధరణి వంటి కీలక అంశాలపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశాలు నెమ్మదిగా అజెండా నుంచి తప్పుకోవడం గమనార్హం. ఇది రాజకీయ వ్యూహమా? లేక పరిపాలనా లోపమా? పరిమితుల కారణమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆరోపణలు చేయడం ఒక ఎత్తు. వాటిని నిరూపించడం మరో ఎత్తు. అయితే, అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తాత్సారమే అనేక ప్రశ్నలను సంధిస్తున్నాయి.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది మంత్రులపై కూడా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై వచ్చిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. ఆరోపణలను ఆయన ఖండించినప్పటికీ, ప్రజల్లో నమ్మకం కలిగేలా సమగ్ర విచారణ, అనుమానాలను నివ్రుతి జరగలేదన్న అభిప్రాయం ఉంది. “నిప్పులేనిదే పొగరాదు” అన్న సామెత ఇక్కడ ప్రస్తావనకు వస్తోంది. అధికారంలో ఉన్నవారు పారదర్శకంగా స్పందించకపోతే అనుమానాలు మరింత పెరుగుతాయి.
నాదర్గుల్ ప్రాంతంలో భూములపై నెలకొన్న వివాదం ప్రస్తుతం ప్రధాన సమస్యగా మారింది. దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న భూముల నుంచి రైతులను దూరం చేయడం, ప్రైవేట్ కంపెనీల జోక్యం పెరగడం వంటి అంశాలు తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి. ఆ భూములు ప్రభుత్వానివా? ప్రైవేట్వా? రైతుల హక్కులు ఎమయ్యాయి? ప్రభుత్వం ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదు? జవాబు దొరకని పరిస్థితుల్లో రైతులు భూపోరాటానికి దిగారు. వారు కేవలం నిరసనలకే పరిమితం కాకుండా, ప్రత్యక్ష చర్యలకు దిగడం పరిస్థితి తీవ్రతను చూపిస్తోంది.
రైతులు తమ భూముల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా పోలీసులు, బౌన్సర్లు అడ్డుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. చివరకు పరిస్థితి అదుపుతప్పి, రైతులు గేట్లు దాటి లోపలికి వెళ్లడం, బౌన్సర్లను తరిమికొట్టడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇది కేవలం భూమి వివాదం మాత్రమే కాదు. ప్రభుత్వంపై నమ్మకం కోల్పోతున్న సంకేతం కూడా.
ఈ ఉద్యమానికి బీఆర్ఎస్ తో పాటు వామపక్ష పార్టీలు మద్దతు తెలపడం రాజకీయ రంగును తీసుకువచ్చింది. మరోవైపు కాంగ్రెస్ నేతలు అక్కడికి వెళ్లి కూడా ప్రతిపక్షంపై విమర్శలు చేయడం రైతుల్లో అసహనాన్ని పెంచింది.
రైతులు సమస్య రాజకీయం కావడం కంటే పరిష్కారం కావాలని కోరుకుంటున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేయాలి? భూముల యాజమాన్యంపై స్పష్టత ఇవ్వాలి. స్వతంత్ర విచారణ జరపాలి. రైతుల హక్కులను రక్షించాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. ఇవి చేయకపోతే ప్రజల్లో అవిశ్వాసం మరింత పెరిగే అవకాశం ఉంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఒక కీలక దశలో ఉంది. ప్రతిపక్షాన్ని విమర్శించడం కంటే, పాలనలో పారదర్శకత చూపించడం అత్యవసరం. నాదర్గుల్ వంటి సంఘటనలు కేవలం స్థానిక సమస్యలు కావు. అవి ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని పరీక్షించే సూచికలు.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు వచ్చి స్పష్టమైన సమాధానాలు ఇవ్వడం, చర్యలు తీసుకోవడం అవసరం.

