‘అడుగు’ ఎక్స్ క్లూజివ్ స్టోరీ
తెలంగాణ కమల దళపతి ఎవరు?
బీజేపీ అధ్యక్ష రేసులో ఆ నలుగురు!?
కొట్టుడు పోయిన ఆ ఇద్దరు!?
ఉగాదిలోపే ఖరారుకు తకరారు?
గెలుపు గుర్రాలపైనే మోడీ, షాల నజరు!
తెలంగాణ కమల దళపతి వేటలో బీజేపీ పడింది. అనేకానేక పారామీటర్లలో పార్టీ అధ్యక్షుడిని ఎంచుకునే పనిలో ఉంది. సామాజిక సమీకరణల సమతూకాన్ని పాటిస్తూనే, బీసీ సీఎం కు కట్టుబడే ఈ నియామకం జరగాల్సి ఉంది. సమన్వయంతో సమర్థత, సత్తా కలిగిన నాయకత్వం కోసం పార్టీ ఎదురు చూస్తున్నది. ఇందుకు మిగతా రాష్ట్రాల్లో అనుసరించిన సక్సెస్ సూత్రాన్నే తెలంగాణలో అమలు చేస్తుందా? కొత్త పాతల పట్టింపుల్లేని పక్కా ప్లాన్ ని అమలు చేస్తుందా?! పవరే పరమావధిగా సంఘ్ పరివార ఆదేశాలను సైతం పక్కన పెడుతుందా? ఉగాదిలోపే పార్టీ అధ్యక్షుడిని ఖరారు చేసే తకరారులో ఉన్న బీజేపీ వైఖరి ఏంటి? అయితే, ఇప్పటికే మున్నూరు కాపులకు రెండు సార్లు అవకాశాలు దక్కాయి. మరో ఛాన్స్ కష్టమే కావచ్చు. కానీ, ప్రధాని మోడీ, అమిత్ షాల కనుసన్నల్లో, పార్టీ విధానాలను అనుసరించి, వారి మనోభావాలకనుగుణంగా, వేగంగా, సమర్థంగా పని చేయగల నేర్పరితనం ఉన్న నేతలకే బీజేపీ రాష్ట్ర పగ్గాలు దక్కుతాయి. అందులో ఈ నలుగురులో ఒకరు, ఆ ఇద్దరిలలో ఒకరు లేదా మరెవ్వరైనా కావచ్చు!?
తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి నియామకాన్ని బీజేపీ సీరియస్ గా తీసుకుంది. గెలుపే గీటురాయిగా, సక్సెస్ రేటే సమర్థతగా ఆలోచిస్తున్నది. సంప్రదాయ సమీకరణలను పక్కన పెట్టి, కొత్త పాతల పట్టింపులను సైతం లెక్క చేయకుండా సక్సెస్ మంత్రని జపిస్తున్నది.
బీసీ సీఎం కు కట్టుబడే!
బీజేపీ గతంలో బీసీ పీఎం నినాదాన్ని ఎత్తుకున్న మొదటిసారే విజయాన్ని ముద్దాడింది. నరేంద్ర మోడీని ఎన్నికలకు ముందే ప్రధాని పదవికి బీసీ అభ్యర్థిగా ప్రకటించింది. అదే తరహాలో తెలంగాణలోనూ బీసీని సీఎం ని చేస్తామని ముందే చెప్పింది. ఆ నినాదానికి కట్టుబడే ఇప్పుడు రాష్ట్ర బీజేపీ పగ్గాలు ఎవరికి అప్పగించాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నది. బీసీకి సీఎం ఇవ్వాలన్న కట్టుబాటు ప్రకారం పార్టీ పగ్గాలు బీసీకే ఇవ్వాలని గానీ, సీఎం కాగలిగే అభ్యర్థికే ఇవ్వాలని కానీ లేదు. పార్టీ అధ్యక్షుడిగా ఏ సామాజిక వర్గం నేత ఉన్నప్పటికీ, పార్టీ అధికారంలోకి వచ్చే నాటికి బీసీని సీఎం చేయడానికి అన్ని విధాలుగా పార్టీ సంసిద్ధంగా ఉంది.
సామాజిక సమీకరణలా? సమర్థతా?
ఈ లాజిక్ ప్రామాణికాన్ని బట్టి ప్రస్తుతం బీసీకే పార్టీ పగ్గాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీలో ఉన్న సమర్థులైన నేతల కోసం బీజేపీ జాతీయ నాయకత్వం ఆరా తీస్తున్నది. పార్టీని నడిపించగల నాయకుడెవ్వరని దుర్భిణీ పెట్టి మరీ వెతుకుతున్నది. ప్రత్యర్థి పార్టీల ఎత్తుగడలను తట్టుకుని, రాష్ట్రమంతా కలియ తిరిగి, మంచి వాగ్ధాటి, ప్రజల్లో పలుకుబడి వంటి వన్నీ కలగలిపి చరిష్మా ఉన్న నేతనే బీజేపీ అధ్యక్షుడిగా చేయాలని అధినాయకత్వం ఆలోచిస్తున్నది.
సమన్వయమే సమస్య!
తెలంగాణ బీజేపీలో పైకి కనిపించని విభజన రేఖ అధినాయకత్వాన్ని కలవరపెడుతున్నది. అంతర్గత విభేదాల వల్ల ఒకరికి ఇస్తే మరొకరు కలిసి పని చేసే పరిస్థితులు కనిపించడంలేదు. అలా కలుపుకుని పోగలిగే నేత కావాల్సిఉంది. పార్టీని సమన్వయం చేయాల్సి ఉంది. ఇలా వంగని నేతలను ఎలా వంచాలో కూడా తెలిసిన బీజేపీ కేంద్ర నాయకత్వం సమయం కోసం వేచి చూస్తున్నది.
మిగతా రాష్ట్రాల్లోలా…
మిగతా రాష్ట్రాల్లో అనుసరించిన పద్ధతిని తెలంగాణకు కూడా అన్వయించే ఆలోచనలో బీజేపీ అధిష్ఠానం ఉంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీసీని సీఎంను చేసి, ఓసీని పార్టీ అధ్యక్షులుగా నియమించారు. చత్తీస్ ఘడ్ లో ఎస్టీని సీఎంని చేసి, ఓసిని పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. అదే తరహాలో ఇప్పటికే తెలంగాణకు బీసీని సిఎం చేస్తామని ప్రకటించిన బీజేపీ, బీసిని కాకపోతే, ఓసిని పార్టీ అధ్యక్షుడిగా నియమించినా ఆశ్చర్యం లేదు. పార్టీకి అధ్యక్షుడు ఇప్పుడు ఎవరనేదానికంటే, రేపటి సీఎం ఎవరనేదే ముఖ్యం. కాబట్టి ప్రస్తుతం పార్టీని నడిపే నాయకుడి అన్వేషణలో మాత్రమే బీజేపీ ఉంది.
బెంగాల్, తెలంగాణల పైనే !
ఇప్పటికే దేశంలో మెజార్టీగా సొంతంగా, భాగస్వామ్య పార్టీలతో కలుపుకుని 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, ఇక ఇప్పుడు బెంగాల్, తెలంగాణలపైనే దృష్టి సారించింది. మోడీ, అమిత్ షాలకు ఈ రెండు రాష్ట్రాలే కొరకరాని కొయ్యగా మారాయి. ఒకవైపు ప్రజల్లో సానుకూలతను సంపాదిస్తున్నప్పటికీ, నాయకత్వంలో సమర్థత కొరవడుతున్నది. కేంద్రంలో అధికారంలో లేని సమయంలోనూ తెలంగాణలో మంచి ఓట్లు, సీట్లు బీజేపీ సాధించింది. దేశంలో అధికారంలో ఉన్న ప్రస్తుత తరుణంలో ఆ వైభవమే కనుచూపు మేరలో కనిపించడం లేదు. దీంతో పార్టీకి కావాల్సిన అన్ని వనరులు, జవసత్వాలు కేంద్ర నాయకత్వమే అందించడానికి సిద్ధంగా ఉంది. వాటిని అందిపుచ్చుకుని ప్రజాబాహుళ్యంలో చొచ్చుకుపోగలిగిన నాయకత్వం కోసం అధిష్ఠానం ఎదురు చూస్తున్నది.
కొత్త పాతల పట్టింపుల్లేనే లేవ్!
పవరే పరమావధిగా పని చేస్తున్న బీజేపీకి కొత్తపాతల పట్టింపుల్లేవు. ఫక్తు సంప్రదాయబద్ధంగా పాత తరానికే పార్టీ పగ్గాలు ఇవ్వాలన్న నిబంధనలకు బీజేపీ నీళ్లొదిలింది. 2018, 2023లోనే తెలంగాణలో పవర్ లోకి రావాల్సి ఉండే. ఇక వచ్చే టర్మ్ నాటికి రాకపోతే ఇంకెప్పటికీ రాదు. అంటే చావో రేవోలా పని చేస్తే తప్ప సాధ్యం కాదు. ఈ దశలో పాత మూస పద్ధతిన పార్టీ అధ్యక్షులను నియమిస్తే, అధికారంలోకి రావడంమెలా? అందుకే కొత్త, పాతల పట్టింపులను పార్టీ పక్కన పెట్టింది. ఏపీలో పార్టీలోకి మధ్యలో వచ్చిన పురంధరేశ్వరికి ఆ రాష్ట్ర పగ్గాలు అప్పగించారు. అవసరమైతే అనామకులకైనా అవకాశం ఇవ్వడానికి కూడా బీజేపీ వెనుకాడని పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదు.
ఆ ఇద్దరు!

ఈ సమీకరణల నేపథ్యంలోనే సంఘ్ పరివారం నుంచి వచ్చిన ఇద్దరు నేతలను అధ్యక్ష పదవికి పరిశీలించి పక్కన పెట్టినట్లుగా పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. అందులో ఒకరు కేంద్రమంత్రి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, కాగా మరొకరు మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు. గతంలో అవకాశం ఇచ్చి, తప్పించిన సంజయ్ విషయంలో తిరిగి నియమించే ఆలోచనలో అధిష్ఠానం లేనట్లుగా తెలుస్తున్నది. ప్రయత్నం మీద జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన సంజయ్ సహా కిషన్ రెడ్డిలు పాత కేడర్ ను నిలుపుకోవాలంటే, పరివారానికే మంత్రి పదవులు దక్కాలన్న సంఘ్ సూచనల మేరకే మంత్రులయ్యారని బీజేపీ పెద్దలు అంటున్నారు. సంఘ్ సూచించినప్పటికీ, బీజేపీ రామచంద్రరావు అభ్యర్థిత్వాన్ని తాత్కాలికంగా పక్కనపెట్టినట్లు తెలుస్తున్నది.
ఆ నలుగురు!
ఈ మొత్తం సమీకరణల్లో బీజేపీ ఫైనలిస్టుల లిస్టులో నలుగురు బీజేపీ నేతల పేర్లు రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవికి పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తున్నది. ఆ నలుగురికి సంబంధించిన వివరాలు, మెరిట్స్ డీ మెరిట్స్ ఈ విధంగా ఉన్నాయి.
ఈటల రాజేందర్

1964లో జన్మించారు. ఉస్మానియా నుంచి బీఎస్సీ చదివారు. ప్రస్తుతం మల్కాజీగిరి బీజేపీ లోక్ సభ సభ్యుడు. బీసీ నేత. బీసీల్లో పెద్దదిగా పేరున్న ముదిరాజ్ సామాజిక వర్గం.
మెరిట్స్
2003లో బీఆర్ఎస్ లో చేరారు. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం. 7సార్లు ఎమ్మెల్యే. ప్రస్తుతం లోక్సభ సభ్యుడు. ఆంధ్రప్రదేశ్ శాసన సభలో టిఆర్ఎస్ ఎల్ పీ లీడర్గా పనిచేశారు. 2014 నుండి 2018 వరకు తెలంగాణ మొదటి ఆర్థిక మంత్రిగా, 2019 నుండి 2021 వరకు ఆరోగ్య మంత్రి. రాష్ట్రమంతా తిరిగిన అనుభవం. రాష్ట్ర స్థాయి నేతగా గుర్తింపు. బిజెపి జాతీయ, రాష్ట్ర కార్యవర్గ ప్రత్యేక ఆహ్వానితులు.
డీమెరిట్స్
వామపక్ష భావజాలం కలిగిన విద్యార్థి నాయకుడిగా పని చేశారు. ఆర్ఎస్ఎస్, ఎబీవీపీ వంటి బ్యాక్ గ్రౌండ్ లేదు. 2021లో బీజేపీలో చేరారు. మెదక్ జిల్లాలోని అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో భూ ఆక్రమణల ఆరోపణలు.
డీకే (ధర్మవరపు కొట్టం) అరుణ

1960లో జన్మించారు. ఇంటర్మీడియట్ చదివారు. ప్రస్తుతం మహబూబ్ నగర్ నుంచి బీజేపీ లోకసభ సభ్యురాలు. రెడ్డి సామాజిక వర్గం.
మెరిట్స్
పేరున్న రాజకీయ కుటుంబం. తండ్రి చిట్టెం నర్సిరెడ్డి, మామ సత్యారెడ్డి, బావ డికె సమరసింహారెడ్డి, భర్త భరత్ సింహారెడ్డి, సోదరులు అంతా ఎమ్మెల్యేలు, మంత్రులుగా పని చేసినవారే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ మంత్రివర్గంలో 2004-2009 వరకు సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రిగా, రోశయ్య మంత్రివర్గంలో 2009-2010 వరకు చిన్న తరహా పరిశ్రమలు, చక్కెర, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మంత్రిగా పనిచేశారు. 2019 లో బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా 2020 సెప్టెంబరు 27 నుంచి ఉన్నారు. రాష్ట్ర కార్యవర్గ ప్రత్యేక ఆహ్వానితులు
డీమెరిట్స్
టీడీపీ, కాంగ్రెస్, సమాజ్ వాదీ, కాంగ్రెస్ పార్టీలు మారారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచిన కృష్ణమోహన్రెడ్డి తప్పుడు అఫిడవిట్ సమర్పించారంటూ డీకే అరుణ హైకోర్టులో కేసు వేసి గెలిచారు.
మాధవనేని రఘునందన్ రావు

1968లో జన్మించారు. లా, బీఇడి, పీజీ డిప్లొమా చేశారు. ప్రస్తుతం మెదక్ నుంచి బీజేపీ లోకసభ సభ్యుడిగా ఉన్నారు. వెలమ సామాజిక వర్గం.
మెరిట్స్
గతంలో కేసీఆర్, ప్రస్తుతం హరీశ్ రావులు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేటకు చెందిన వారు. జర్నలిస్టు, న్యాయవాది. ఇంతకుముందు దుబ్బాక ఎమ్మెల్యే. తెలంగాణ ఉద్యమంలో పని చేశారు. బీఆర్ఎస్ లో సుదీర్ఘ కాలం పని చేసి, 2013లో బహిష్కరణకు గురయ్యారు. కొద్ది రోజులు కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ బీజేపీలో చేరారు. పార్టీ కార్యదర్శిగా ఉన్నారు.
డీ మెరిట్స్
ఒక కేసులో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కి బెయిల్ పిటిషన్ను ఇప్పించడంతో ఆయనకు మంచి పేరు వచ్చింది. 2007లో అత్యాచార ఆరోపణలు.
అరవింద్ ధర్మపురి

1976లో జన్మించారు. పీజీ చేశారు. ప్రస్తుతం నిజామాబాద్ బీజేపీ పార్లమెంట్ సభ్యుడు.
మెరిట్స్
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం నుండి రెండో సారి గెలిచాడు. మొదటిసారి కెసిఆర్ బిడ్డ కవిత మీద గెలిచి సంచలనంగా నిలిచారు. మున్నూరు కాపు సామాజిక వర్గం. రాష్ట్ర కార్యవర్గ ప్రత్యేక ఆహ్వానితులు.
డీమెరిట్స్
2017లో బీజేపీలో చేరారు. నియోజకవర్గం దాటి పెద్దగా తిరిగిన అనుభవం లేదు.
అయితే, ప్రధాని మోడీ, అమిత్ షాల విధానాలను అనుసరించి, మనోభావాలకనుగుణంగా, వేగంగా, సమర్థంగా పని చేయగల నేర్పరితనం ఉన్న నేతలకే బీజేపీ రాష్ట్ర పగ్గాలు దక్కుతాయి. ఇప్పటికే మున్నూరు కాపులకు రెండు సార్లు అవకాశాలు దక్కాయి. మరో ఛాన్స్ కష్టమే కావచ్చు. అందులో ఈ నలుగురిలో ఒకరు, ఆ ఇద్దరిలలో ఒకరు లేదా మరెవ్వరైనా కావచ్చు!

