-
ఇంటా బయట చర్చ!
-
పూలతో స్వాగతించడంపై రచ్చ!!
-
జరుగుతున్నది 3వ అసెంబ్లీ, 5వ సమావేశం
-
సారొచ్చింది ముచ్చటగా మూడోసారి!
-
సార్… సభకు రావాలని డిమాండ్లు!
-
సభకు వచ్చేలా ఆదేశించాలని కేసులు!
-
జీతం నిలిపివేయాలని ఫిర్యాదులు!
-
సార్… హాజరుతో అంతా సద్దుమణిగేనా?
పాజిటివా? నెగెటివా? పక్కన పెడితే, నిత్యం చర్చల్లో ఉండటమే రాజకీయం! ఏదో విధంగా జనం నాలుకలపై నానాలి. మనం ఏం? ఎలా? చేస్తున్నామన్నది ముఖ్యం కానేకాదు. ఏం చేసినా, చేయకపోయినా ఏ మేరకు జనంలో చర్చ అవుతున్నామన్నదే ప్రధానం. చర్చ అయినా, రచ్చ అయినా ఫర్వాలేదు. నిజానికి పాలిటిక్స్ మైండ్ గేమ్.. ఈ పొలిటికల్ గేమ్ లో మైలేజీయే మైలు రాయి. వచ్చామా? వెళ్ళామా? కాదు… వచ్చినా, పోయినా సరే, ప్రజలు మన గురించే మాట్లాడుకోవాలి. మన గురించే చర్చించుకోవాలి. లేదంటే అలా చూసుకోవాలి. చేసుకోవాలి. లేదంటే జనం మనల్ని మరచిపోతారు. ఆతర్వాత పొలిటికల్ లైఫ్ క్లోజ్. నిత్యం జనంలో ఉంటేనే కదా పదవో పవరో దక్కేది? ఎవరు ఏమనుకున్నా, నమ్మినా, నమ్మకపోయినా… సమకాలీన రాజకీయాల్లో కేసీఆర్ ను మించిన రాజకీయ చాతుర్యాన్ని మరెవ్వరిలోనూ చూడలేం. గనుకే ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోంది. రాజకీయాల్లో ‘తాజా’ కాకతాళీయం, ‘మాజీ’ శాశ్వతం. కానీ, సీఎం పదవి పోయాక మాజీ సీఎం అనడాన్ని కూడా జీర్ణించుకోలేని కేసీఆర్, తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి అనిపించుకుంటున్నారంటేనే ఆయన మానసిక స్థితిని అర్థం చేసుకోవచ్చు. అలాంటి కేసీఆరే అసెంబ్లీకి రావాలంటే మాటలా? రాకపోతే? ఈ మాత్రం రచ్చ జరగదా? ఆయన రాకకోసం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, నేతలంతా పట్టుపట్టి అసెంబ్లీకి రమ్మంటే, సీఎం పిల్లకాయలా, మంత్రులు మరుగుజ్జుల్లా, ప్రజలు పిచ్చోళ్ళలా కనిపిస్తే తప్పు కేసీఆర్ ది కానే కాదు. పక్క రాష్ట్రంలో చంద్రబాబు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వెళ్ళారు కదా? అంటే… మరి జగన్మోహన్ రెడ్డి వెళ్ళట్లేదు కదా? అనే లాజిక్ లు పక్కపక్కనే ఉంటాయి. లాజిక్ ఓ మ్యాజిక్! వాడుకునే తెలివిని బట్టి ఉంటుంది. కేసీఆర్ శాసనసభకు వచ్చిన తీరు చూస్తే, ఆయన స్వయంగా వచ్చినట్లు లేదు. ఆయన్ని తీసుకువచ్చినట్లు కనిపిస్తున్నది. ఓ మాజీ సీఎం, సుదీర్ఘ రాజకీయానుభవం ఉన్న కేసీఆర్ చట్టసభలను గౌరవించకపోతే ఎలా? ఎవరో నచ్చలేదని రానంటే ఎలా!?
మొత్తానికి సార్ అసెంబ్లీకి వచ్చారు. అనేక చర్చోపచర్చలకు తెరదించారు. సార్ ఏం చేసినా చర్చే. చేయకపోయినా సరే, చర్చే. అసెంబ్లీకి వచ్చినా… రాకపోయినా, ప్రజలకు కనిపించినా… కనిపించకపోయినా, నేతలకు అపాయింట్ మెంట్లు ఇచ్చినా… ఇవ్వకపోయినా, ఫాం హౌస్ కు పరిమితమైనా… కాకపోయినా, నోరు విప్పినా… విప్పకపోయినా, మాట మాట్లాడినా… మాట్లాడకపోయినా, అంతెందుకు సార్ సైలెన్స్ కూడా తుఫాన్ ముందు ప్రశాంతతలా, విస్ఫోటనానికి ముందు విచిత్ర పరిస్థిలా ఉంటుంది. అలా ఉండేలా పరిస్థితులను చూసుకోవడం, చేసుకోవడం ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. ఆయన ప్రవర్తన చాలా మందికి చాలా సార్లు విచిత్రంగా అనిపించవచ్చు కానీ, ఆయన వ్యూహం ఆయనకు ఉంటుంది. ఏ రకంగా చూసినా అనూహ్యంగానే ఉంటారు. అంచనాలకు అందితే ఆయన కేసీఆర్ ఎందుకవుతారు? అంత పెద్ద ఉద్యమానికి నాయకత్వం ఎలా వహిస్తారు? అందుకే ఆయన అసెంబ్లీకి రాకపోవడం ఇంటా (అసెంబ్లీలో), బయటా పెద్ద చర్చే అయింది. అసెంబ్లీలో చర్చలు, కోర్టుల్లో కేసు(పిల్)లు, స్పీకర్ కు ఫిర్యాదులు, ఆయన కాకపోతే, మరో నేతను ప్రతిపక్ష నేతగా నియమించాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కు విజ్నప్తులు, ప్రజాప్రతినిధిగా ఆయన తన విధులు సరిగ్గా నిర్వర్తించడం లేదని ఆరోపణలు, కనుక అర్హుడిగా ప్రకటించాలని, జీతం ఆపాలని అభ్యర్థనలు… ఇలా అనేకానేక డిమాండ్ల సారాంశం కేసీఆర్ ను అసెంబ్లీకి రప్పించడమే. అందుకే… ఇన్ని ఆహ్వానాలు, డిమాండ్లు, అనేకానేక వాదనలు, ప్రతివాదనల మధ్య చర్చల్లో నిలిచిన కేసీఆర్, చివరకు 3వ అసెంబ్లీ, 5వ సెషన్ కు హాజరయ్యారు. అసెంబ్లీకి హాజరవడాన్ని కూడా ఆయన మరో చర్చకు దారి తీసేలా జాగ్రత్త పడ్డారా? లేక పార్టీ నేతలు అలా వ్యూహం పన్నారా? ప్రజా నేతగా ఎదిగిన ఆయన్ని ఎవరైనా ప్రజలకు దూరం చేస్తున్నారా? ఆయనే దూరం అవుతున్నారా? ఇప్పుడప్పుడే ఓటర్లతో పనేంటని అనుకుంటున్నారా? అసెంబ్లీకి బయలుదేరిన ఆయనకు తిరిగి వెళ్ళే వరకు లభించిన ఘన స్వాగతం మరో చర్చకు దారితీసింది. ఆయన తన బాధ్యతగా, ప్రజాప్రతినిధిగా సభకు వచ్చారా? లేక అందరి కోరిక మేరకు ఏదో అలా ఏతెంచారా? కేసీఆరే అసెంబ్లీలో చెప్పినట్లు ప్రజాసమస్యలు చర్చించే దేవాలయం లాంటి అసెంబ్లీకి ప్రజల మనిషి కేసీఆర్ రావడానికి అంత సీన్మా అవసరమా? అసలు ఆయన్ని షో కేసు బొమ్మలా, మానవాతీత శక్తిగా చూపించే ప్రయత్నం పార్టీ చేస్తోందా? లేక పార్టీని నడుపుతున్నవారు చేశారో తెలియదు. గౌరవించుకోవడం పార్టీగా వారిష్టం. కానీ ప్రదర్శించడంపై చర్చ ప్రజాభీష్టం.
సభలోనే సీఎం డిమాండ్
కేసీఆర్ అసెంబ్లీకి రావాలన్న డిమాండ్ ను స్వయంగా ముఖ్యమంత్రి సభలోనే చేశారు. ఆయన అంతరంగమేదైనా కేసీఆర్ సభకు వచ్చి ఆయన అనుభవాన్ని రంగరించి తమ ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను కేసీఆర్ బయట ఎంగడట్టినప్పుల్లా సభలోనే చర్చిద్దామని రమ్మని పిలవడం నుంచి సవాల్ విసిరేదాకా వెళ్ళింది. మంత్రులు కూడా ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు కేసీఆర్ ను ఆహ్వానించారు. స్వయంగా మంత్రి పొన్నం ఆయన ఇంటికి వెళ్ళి కూడా ఆహ్వానం పలికారు. కానీ, కేసీఆర్ రావాలనుకోలేదు.
జీతం ఆపాలని ఫిర్యాదులు
కేసీఆర్ సభకు రావాలన్న డిమాండ్లు ఫిర్యాదుల దాకా వెళ్ళాయి. ఈ అసెంబ్లీ సమావేశాలకు ఒక రోజుముందు నిన్ననే కొందరు కాంగ్రెస్ నేతలు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. కేసీఆర్ ను సభకు హాజరయ్యేలా చూడాలని, లేదంటే ప్రజాప్రతినిధిగా ఆయన తన ధర్మాన్ని నిర్వర్వించలేకపోతే ఆయన జీతాన్ని ఆపాలని కూడా డిమాండ్ చేశారు.
కోర్టులో కేసులు
కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడాన్ని సవాలు చేస్తూ గురువారం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యేలా తగిన చర్యలు తీసుకునేలా స్పీకర్, శాసన సభాపతి కార్యాలయానికి ఆదేశాలివ్వాలని కోరుతూ… తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.విజయ్పాల్రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. 2023 డిసెంబరు 16న ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్, అసెంబ్లీకి రాకున్నా శాసన సభాపతి, స్పీకర్ కార్యాలయం తగిన ప్రొసీడింగ్స్ చేపట్టలేదన్నారు. ప్రజల గళాన్ని అసెంబ్లీలో వినిపించడానికి ఎమ్మెల్యేలకు వేతనాలను కూడా పెంచారని చెప్పారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ విధులు నిర్వహించలేకపోతే ఆ బాధ్యతల నుంచి తప్పించి, కొత్త వారిని ఎంపిక చేసేందుకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరారు. కోర్టు ముందుకు మొదటిసారి ఇలాంటి పిటిషన్ వచ్చిందని, శాసన వ్యవస్థ, అధికారులు తీసుకునే రాజకీయ, ఆర్థిక నిర్ణయాలను సమీక్షించే విస్తృతాధికారం న్యాయ వ్యవస్థకు ఉందని పేర్కొన్నారు. ఇందులో ప్రతివాదులుగా స్పీకర్, శాసన సభాపతి కార్యాలయంతోపాటు కేసీఆర్, కేటీఆర్లను పేర్కొన్నారు. ఈ విషయంలో కోర్టు శాసనసభ కార్యదర్శికి నోటీసులిచ్చింది. సమాధానమేదైనా, కేసీఆర్ సభకు వచ్చారు కాబట్టి అవన్నీ ఇప్పుడు చర్చల్లో లేనట్లే.
కేసీఆర్ ను కించపరిచే అవకాశం
కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఆయనను కించపరిచే అవకాశం ఉంది కాబట్టే ఆయన అసెంబ్లీకి రావడం లేదని బీఆర్ఎస్ నేతల వాదన. అయితే, పది ఏళ్ళు సీఎంగా చేసిన వ్యక్తిగా ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం, మర్యాద ఇస్తామని, కేసీఆర్ ఇచ్చే సూచనలు, సలహాలు తీసుకుంటామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
అయితే కేసీఆర్ బుధవారం బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి సభలో హాజరయ్యారు. గత ఏడాది డిసెంబర్ లో కొలువైన సభ, ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశం, జూలైలో వన్ డే స్పెషల్ సెషన్ చేసుకుని, 3వ అసెంబ్లీ, 5వ సమావేశం జరుగుతోంది. ప్రతి ఆరు నెలల లోపు సభ తప్పనిసరిగా సమావేశం కావాలి. సాంకేతికంగా ఒక సభ్యుడి హాజరు, అనర్హతలను పరిశీలిస్తే, సభ జరిగే చివరి సమావేశం చివరి తేదీ నుంచి తాజాగా నిర్వహించే సభ మొదటి తేదీల మధ్య ఆరు నెలలు దాట కూడదు. 60 వర్కింగ్ డేస్ లో హౌజ్ కి అటెండ్ కాకపోతే సదరు సభ్యుడిని అనర్హుడిగా ప్రకటించే అధికారం స్పీకర్ కు ఉంది. ఏటా బడ్జెట్, వర్షాకాల, శీతాకాల(బిఎండబ్ల్యు) సమావేశాలు జరుగుతూ ఉంటాయి. అయితే కేసీఆర్ తేదీ : 01-02-2024న ఈ సభలో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. తేదీ: 25-07-2024న ఆతర్వాత ఒక రోజు హాజరయ్యారు. తాజాగా ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా తేదీ:12-03-2025న హాజరయ్యారు. కాబట్టి ఆయన అనర్హత వంటి ప్రశ్నలకు తావేలేదు.
బాబు వెళ్ళలేదా?
నిజానికి అప్పటి ఉమ్మడి, ఇప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు శాసన సభలకు వెళ్ళారు. పార్లమెంటు ఉదాహరణలెన్నో. కానీ ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ లు మాత్రమే సభకు హాజరవడానికి ఎందుకో ఇబ్బందీ పడుతున్నారు.
చింతమడక నుంచి వయా కేంద్ర మంత్రి.. సీఎం దాకా ఎదిగిన కేసీఆర్ రాజకీయ జీవితం కాంగ్రెస్ తోనే మొదలైంది. కేసీఆర్ తెలంగాణ ఉద్యమ నేతగా ప్రజల్లో నిరంతరం ఉండి, పల్లె నిద్రలు, తండా నిద్రలతో ప్రజలతో మమేకమయ్యారు. ఇప్పుడు అదే ప్రజలకు దూరమవుతున్నారని, పదవి ముగిసే సరికి ఫాం హౌస్ కే పరిమితయ్యారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ దశలో సభకు హాజరైన తీరు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. ఆయన ఇంటిదగ్గర బయలుదేరిన దగ్గర గులాబీ పూలు చల్లి, అసెంబ్లీ వద్ద అత్యంత వైభవంగా స్వాగతించిన తీరు, ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఒక ప్రజాప్రతినిధిగా, ప్రతిపక్ష నేతగా ఆయన ఆ గౌరవమర్యాదలు కోరుకున్నారా? ఆపాదించారా? ప్రజల మనిషి, ఉద్యమ నేపథ్యం, రాష్ట్ర సాధకుడు, పదేండ్లు సీఎంగా ఉన్న కెసిఆర్ ను పార్టీ, షో కేసు బొమ్మను చేయాలనుకుంటున్నదా? . ప్రజలకు దూరం చేయాలని చూస్తోందా? బహుషా కష్ట పడకుండానే ఫలితాలను ఆశిస్తున్న వైనానికిది నిదర్శనమా? మానవాతీత శక్తిగా ప్రజలకు చూపించే ప్రయత్నమా? ఏమైనా ప్రజలు మాత్రం పాత కెసిఆర్ ని కోరుకుంటున్నారు. తప్పితే ఇలాంటి కేసీఆర్ ను మాత్రం కాదు. మరి కేసీఆర్ ఏమనుకుంటున్నారో!?

