మునుగోడు నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై 24 గంటలూ ఆలోచిస్తున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాసేవనే తన లక్ష్యమని, రాజకీయాల్లో ఏ పదవి వచ్చినా అది కేవలం బాధ్యతగా భావిస్తానని తెలిపారు.
ఆదివారం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన *”గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు”*లో రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను, 601 గాంధీ విగ్రహాల ప్రదర్శనను, సాంస్కృతిక కార్యక్రమాలను సందర్శించారు.
అనంతరం మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి, పేదలకు అన్యాయం చేసే అవినీతి వ్యక్తులను ఉపేక్షించబోమని హెచ్చరించారు. ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేయడం, పేదల హక్కులను దోచుకోవడం సహించబోమని స్పష్టంచేశారు. మంచి నాయకులు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉంటారని, తన రాజీనామా ద్వారా ఈ ప్రాంత ప్రజలకు మేలు జరిగిందని గుర్తు చేశారు.
తన నియోజకవర్గంలో బెల్ట్ షాపుల సంఖ్య తగ్గించడంలో విజయం సాధించామని, ప్రభుత్వ బడుల ప్రగతికి కృషి చేయడం తన కర్తవ్యం అని తెలిపారు. “ప్రభుత్వ పాఠశాలలు పేదల ఆశాజ్యోతి. వాటి అభివృద్ధి కోసం నిరంతరం పని చేస్తూనే ఉంటా,” అని రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు.

