స్పెషల్ స్టోరీ…
ఏప్రిల్ 3న ముహూర్తం?
ఆ శాఖల మార్పులు తథ్యం!
నలుగురితోనే ప్రమాణ మంత్రం!?
మరో రెండు బెర్తులకి ఇప్పట్లో లేనట్లే?
ఆ ఇద్దరికి అవకాశం దొరికేనా?
ఈ ఇద్దరిని మార్చే వీలుందా?
సు‘రేఖ’ను మార్చగలరా?
జూపల్లి మార్పు సాధ్యమేనా?
కొందరి శాఖల మార్పు అనివార్యమా?
ముహూర్తం ముంచుకొచ్చింది. మంత్రివర్గ విస్తరణకు వేళైంది. ఏప్రిల్ 3వ తేదీ ఖరారైంది. బెర్తుల భర్తీకి చర్చలు జరిగాయి. ఇంకా పేర్లే ఖరారు కాలేదు. హామీల జాబితా నుంచి అర్హులైన అదృష్టవంతులను అధిష్ఠానమే ఫైనల్ చేయనుంది. ఈ లోగా ఆశిస్తున్నవారు హస్తినకు క్యూ కట్టారు. ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ మంత్రివర్గ విస్తరణం ఆసక్తిగా మారింది.
ఎట్టకేలకు మంత్రి వర్గ విస్తరణకు వేళ అయింది. కొత్త మంత్రుల ఆగమనానికి ముహూర్తం కుదిరింది. ఏప్రిల్ 3న కొత్త మంత్రులు ప్రమాణం చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన 16 నెలల తరువాత మంత్రివర్గ విస్తరణ జరుగనుంది. వీటితో పాటు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, విప్ పదవులను కూడా భర్తీ చేసేందుకు అధిష్ఠానం అనుమతి లభించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ప్రస్తుతం ఆయనతో సహా 12 మంది మంత్రులు ఉన్నారు. మరో ఆరు బెర్త్ లు ఖాళీగా ఉండగా, వాటి భర్తీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్నది. ఢిల్లీ పెద్దల పిలుపు మేరకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ ఢిల్లీకి వెళ్లారు. పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సుదీర్ఘంగా చర్చించారు.
అనేక హామీలు..! ఆశల పల్లకీలో ఆశావహులు!!
అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్ పెద్దలు ఎన్నికలకు ముందు అనేక హామీలిచ్చారు. బలాన్ని, బలగాన్ని పెంచుకునేందుకు ప్రజలతోపాటు, నేతలకు కూడా ఎన్నో ఆశలు చూపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే జీ వివేక్ కు, ఉమ్మడి నల్లగొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు వారు పార్టీలో చేరే సమయంలో మంత్రి పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలోనే ఉమ్మడి నిజాబాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్రెడ్డికి, ఎన్నికల సభలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి ముదిరాజ్ ల కోటాలో అవకాశమిస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అనేక మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవులు ఆశిస్తున్నారు.
చర్చకు వచ్చింది వీరేనా?
హామీలు పొందిన వివేక్, రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి శ్రీహరిలతోపాటు బీసీల కోటా నుంచి ప్రస్తుతం విప్ గా ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మరో విప్ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, వాకిటి శ్రీహరి, విజయశాంతి పేర్లు కూడా చర్చకు వచ్చాయని ప్రచారం జరుగుతున్నది.
హామీలు సరే, మరి ఈ సమీకరణల సంగతేంటి?
హామీల పరంగా చూస్తే, వివేక్, రాజగోపాల్ రెడ్డిలకు మంత్రి పదవులు ఇస్తారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. వివేక్ సోదరుడు వినోద్ బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. వివేక్ కొడుకు వంశీ పెద్దపల్లి ఎంపీ గా ఉన్నారు. ఇప్పటికే ఒకే కుటుంబం మూడు పదవుల్లో ఉంది. ఇప్పుడు వీరిలో ఒకరికి మంత్రి పదవి కట్టబెట్టగలదా? అలాగే కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ ఎమ్మెల్యేలేగాక, వెంకట్ రెడ్డి ఆల్రెడీ మంత్రిగా ఉన్నారు. రాజగోపాల్ రెడ్డికి కూడా మంత్రి పదవి ఇస్తే ఆ కుటుంబంలో ఇద్దరికీ మంత్రి పదవులు ఇచ్చినట్లవుతుంది. అదీగాక ఉమ్మడి నల్లగొండ జిల్లా (హుజూర్ నగర్) నుంచే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉత్తమ్ సతీమణి పద్మావతి కోదాడ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డిని మంత్రిని చేస్తే, ఒకే జిల్లా నుంచి ముగ్గురు రెడ్లు మంత్రులవుతారు. దీన్ని కాంగ్రెస్ ఏవిధంగా సమర్థించుకుంటుంది? పైగా కాంగ్రెస్ లో రెడ్ల ఆధిపత్యం ఎక్కువని పేరుంది. ఇక ఇప్పటికే మంత్రి వర్గంలో రెడ్ల సంఖ్యను బట్టి మరో రెడ్డికి అవకాశం లేదని, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డికి చేయి ఇచ్చారని ప్రచారం జరుగుతున్నది.
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మొండి చేయేనా!?
ఈ సారి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మంత్రివర్గ విస్తరణలో మొండి చేయే అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆరు ఖాళీల్లో ప్రస్తుతానికి నాలుగు స్థానాలను మాత్రమే నింపేందుకు కసరత్తు జరుగుతున్నది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించిన రెండు బెర్త్ లను ఖాళీగా ఉంచే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే బాలూ నాయక్కు చోటు దక్కవచ్చన్న ప్రచారం ఉన్నప్పటికీ, అది సాధ్యం కాకపోతే, డిప్యూటీ స్పీకర్తో సరిపెట్టి, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ను క్యాబినెట్లోకి తీసుకోవచ్చంటున్నారు. ఇక మైనార్టీల నుంచి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా, అమేర్ అలీఖాన్ కే సీఎం మొగ్గుచూపుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. మరికొందరు కూడా ఈ వర్గాల నుంచి ఆవిస్తున్నందున తాత్కాలికంగా ఈ మూడు సామాజిక వర్గాలకు సంబంధించి రెండు మంత్రి బెర్తులను ఇప్పుడప్పుడే భర్తీ చేయకపోవచ్చని విశ్వసనీయ సమాచారం.
తొలగింపు తలవంపవుతుందా!?
ఇద్దరి మంత్రులను తొలగిస్తారన్న ప్రచారం అంతగా నమ్మదగినదిగా లేదు. అందుకు తగిన కారణాలు సరిపోవడం లేదు. వారు తొలగితే తమకు అవకాశం వస్తుందనుకునే కొందరి తాత్కాలిన ఆనందమే తప్ప ఈ ప్రచారంలో పస లేదని కొందరి వాదన. ఉమ్మడి వరంగల్ జిల్లా వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి కొండా సురేఖ పద్మశాలి. ఆమె భర్త కొండా మురళి మున్నూరు కాపు. సురేఖ రెండు కులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళగా ఉన్నారు. ఆమెకు ఫైర్ బ్రాండ్ గా పేరుంది. ఆమె మాటలు మంటలు పుట్టించడం సహజం. కాంగ్రెస్ అధికారంలోకి రావాలని, రేవంత్ సీఎం కావాలని కొండా దంపతులు ప్రగాఢంగా కోరుకున్నారు. అందుకు తగిన శక్తిని, వనరులను వినియోగించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే మంత్రి జూపల్లి క్రుష్ణారావు మరో మంత్రి పొంగులేటితో కలిసి కాంగ్రెస్ విజయంలో కీలకంగా ఉన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా తన నియోజకవర్గంలో గెలుస్తూ వస్తున్నారు. వెలమ సామాజిక వర్గం నుంచి మంత్రి వర్గంలో ఏకైక మంత్రి. అటు సురేఖ, ఇటు జూపల్లి ఇద్దరూ నమ్మకంగా నిలవటమేగాక, తేడా వస్తే నిలదీసిన అనుభవాలు వారికి ఉన్నాయి. కారణాలేవైనా ఇప్పుడు వాళ్ళని పక్కనపెట్టి, ప్రభుత్వాన్ని నడపడం అంత సులువేమీ కాదని పరిశీలకులు భావిస్తున్నారు.
విజయశాంతికి అవకాశం?
ఈ మధ్యే ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన విజయశాంతికి అవకాశం ఇస్తే, విజయశాంతికంటే కాంగ్రెస్ కే ఎక్కువ ప్రయోజనం. లేడీ అమితాబ్ గా పేరున్న ఆమె సినీ గ్లామర్ ని రాష్ట్రంలోనేగాక, దక్షిణ భారత దేశంలో ఎక్కడైనా వినియోగించుకోవచ్చు. ఆమె వాగ్ధాటి అదనపు ఆకర్షణ. విజయశాంతికి బెర్త్ ఖాయం చేస్తే, అత్యంత వెనుకబడిన కులాల్లో కళావంతుల సామాజిక వర్గానికి, మహిళకు అరుదైన చాన్స్ ఇచ్చినట్లవుతుంది.
ముగ్గురి శాఖల్లో కోతలు!?
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిల శాఖలకు కోతలు తప్పవని వినిపిస్తున్నది. వారి కొన్ని శాఖలను తొలగించి, కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చేవారికి ఇవ్వాలనే నిర్ణయం ఢిల్లీలోనే జరిగిందనే ప్రచారం జోరందుకుంది. అందుకే ఢిల్లీ మీటింగ్ కి ఆలస్యంగా వచ్చిన ఉత్తమ్, అందరికంటే ముందుగానే బయటకు వెళ్ళిపోయారని తెలుస్తున్నది. పెండింగ్ బిల్లుల చెల్లింపుల్లో కమీషన్ల కక్కుర్తి కారణంగా, ఆయన నుంచి ఆర్థిక శాఖను తప్పించాలని అధిష్ఠానం ఆదేశించినట్లు ప్రచారం జరుగుతున్నది. అయితే ఆశాఖను తనకివ్వాలని ఉత్తమ్ పట్టుపడుతున్నారని సమాచారం. ఉత్తమ్ నిర్వహిస్తున్న నీటి పారుదల, పౌర సరఫరాల శాఖల్లో ఒకటే మిగిలే అవకాశం కనిపిస్తున్నది. ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వద్ద రెవెన్యూతో పాటు గృహ నిర్మాణం, సమాచార శాఖలున్నాయి. ఆయనను రెవిన్యూకే పరిమితం చేయనున్నట్లు తెలుస్తున్నది. ఐటీ మంత్రి శ్రీధర్ బాబు నుంచి పరిశ్రమల శాఖను తప్పించే సూచనలున్నాయి. జూపల్లి నుంచి ఎక్సైజ్ శాఖను తప్పించే ప్రమాదం కనిపిస్తున్నది. ఇక సీఎం తన వద్దే పెట్టుకున్న కొన్ని శాఖలు కూడా మారనున్నాయి.

