బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్రానికి కొత్త బిజెపి అధ్యక్షుడి నియామకం త్వరలోనే పూర్తవుతుందన్న ఆ పార్టీ ఎమ్మెల్యే రాజసింగ్, అదే నియామకంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎవరుండాలి? ఎవరిని ఎవరు ఫైనల్ చేస్తున్నారు? స్టేట్ కమిటా?లేక సెంట్రల్ కమిటా? అంటూ హాట్ హాట్ గా నిలదీశారు. ఒకవేళ స్టేట్ కమిటీ డిసైడ్ చేస్తే ఆ అధ్యక్షుడు రబ్బర్ స్టాంప్ గానే మిగిలిపోతాడని, సెంటర్ కమిటీ డిసైడ్ చేస్తే చాలా మంచిదని కుండ బద్దలు కొట్టారు. ఈ సమాచారాన్ని ఆయన మీడియా కు విడుదల చేశారు.
గతంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎవరు అయినా, సొంత గ్రూపులు కట్టి పార్టీకి నష్టం చేశారు. సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ కోసం జైళ్ళకెళ్లిన కార్యకర్తలని గతంలో పక్కన పెట్టారు. ఒకవేళ కొత్త అధ్యక్షుడు కూడా గ్రూపిజం చేస్తే పార్టీకి చాలా నష్టం జరుగుతుంది. అని వ్యాఖ్యానించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీలో మంచి నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ వాళ్ళ కాళ్ళు చేతులు కట్టి పక్కన పడేశారన్నారు. అయితే, వీళ్ళల్లో ఎవరినైనా నియమించి స్వేచ్ఛనిస్తే ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. అలాగే పార్టీ కొత్త అధ్యక్షుడు సిఎం లతో బాక్ డోర్ లో సీక్రెట్ మీటింగులు పెట్టొద్దని సూచించారు. హిందుత్వ పార్టీ గా చెప్పుకునే బీజేపీ, అలాంటి కార్యకర్తలను తొక్కడం కాకుండా, వాళ్ళకి వెన్నుదన్నుగా నిలవాలన్నారు.
తాను చెప్పిన మాటలు ఎవరికి నచ్చుతవో, ఎవరికీ నచ్చవో తనకు తెలియదని కానీ, తను మాత్రం పార్టీ సగటు కార్యకర్త, నాయకుడి మనోభావాల్ని బయట పెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. తాను పార్టీ అంతర్గత విషయాలను పార్టీలో చర్చించకుండా, మీడియాకి లీకులిస్తున్నట్లు కొందరు నన్ను నిందిస్తున్నారు. కానీ, నేను మొదటగా పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్ళినా, వాళ్ళు వినకపోవడం వల్లే ప్రజలు ముందు పెడుతున్నానన్నారు. మొత్తానికి రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు అటు స్టేట్, సెంట్రల్ పార్టీలో, ఇటు కేడర్ లో, రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

