విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన 35వ పుస్తక మహోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి కృష్ణారావు రాసిన పీవీ నరసింహారావు జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన పుస్తక పఠనంపై తన అనుభవాలను, అభిప్రాయాలను గురించి చెప్పారు.
తన వ్యక్తిత్వాన్ని, ధైర్యాన్ని పుస్తకాలు రూపుదిద్దాయని పవన్ కల్యాణ్ చెప్పారు. ఐదో తరగతి నుంచే పుస్తక పఠనం అలవాటు వుందని, తన తల్లిదండ్రులే ఈ ప్రేరణ ఇచ్చారని గుర్తుచేశారు. కొత్త పుస్తకాలు చదవడం తనకు ఒక మక్కువగా మారిందని, వాటి సువాసన తనను ఎంతో ఆకర్షిస్తుందని తెలిపారు. తన విద్యా జీవితం ఇంటర్మీడియేట్ వద్దనే ఆగిపోయినా, పుస్తక పఠనాన్ని ఎప్పటికీ మానలేదన్నారు. ‘‘పుస్తకాలు నా మానసిక శక్తిని బలంగా నిలబెట్టాయి’’ అని ఉద్ఘాటించారు.
పవన్ కల్యాణ్ సాహిత్యాన్నీ, కవిత్వాన్నీ ఎంతో ప్రేరణాత్మకంగా చూశాను అన్నారు. విశ్వనాథ సత్యనారాయణ రచనలు, గుర్రం జాషువా కవిత్వం, గోపీచంద్ రచనలు తనపై అపార ప్రభావం చూపాయని చెప్పారు. ‘‘అమృతం కురిసిన రాత్రి’’ మొదటగా కొనుగోలు చేసిన పుస్తకం అని, అప్పటి నుంచి తన పుస్తకాల పట్ల ఆసక్తి పెరిగిందని వివరించారు.
తెలుగు భాష, సాహిత్యంపై గౌరవం వుందని చెప్తూ విద్యార్థులు తమ మాతృభాషపై పట్టు సాధించాలన్నారు. ‘‘ఇంగ్లీషు తప్పనిసరి అయినా, సృజనాత్మకత మాతృభాష ద్వారానే వస్తుంది’’ అని పేర్కొన్నారు. తెలుగులో వ్యాకరణంపై దృష్టి పెట్టడం ఎంతైనా అవసరమని సూచించారు. రచయితలు, కవుల కృషిని అర్థం చేసుకుంటే వారి పట్ల గౌరవం పెరుగుతుందని ఆయన అన్నారు.
పుస్తక ప్రదర్శనకు మున్సిపల్ స్టేడియం ఇవ్వడం లేదని తెలిసిన వెంటనే సమస్యను పరిష్కరించినట్లు వెల్లడించారు. ‘‘పుస్తకాలు మన మెదడుకు శిక్షణ ఇస్తాయి’’ అని అన్నారు. పుస్తక ప్రదర్శనలు, గ్రంథాలయాల స్థాపన ఉద్యమంగా మారాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. పుస్తక రచయితల ఇళ్లను టూరిజంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో మా ప్రభుత్వం వుందన్నారు. ‘‘మన దేశంలో రచయితలకు, కవులకు ప్రత్యేక గుర్తింపు రావాలి’’ అని పేర్కొంటూ, సాహిత్యానికి మరింత ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించారు.

