హైదరాబాద్లో గాంధీభవన్ వేదికగా మీడియాతో చిట్చాట్ చేసిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాన్ ఇండియా నాయకుడిగా ఎదిగారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాన్ ఇండియా స్టార్ పుష్ప (అల్లు అర్జున్) అరెస్టు తర్వాత రేవంత్ రెడ్డి తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చాయని తెలిపారు. కొందరు ముఖ్యమంత్రులు అవినీతి ఆరోపణలతో పేరు పొందితే, రేవంత్ రెడ్డి ప్రజా ప్రయోజనాల కోసం పోరాడుతూ ప్రాచుర్యం పొందారని ప్రశంసించారు.
అలాగే ఫార్ములా ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ వివిధ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని చామల కిరణ్ విమర్శించారు. కేటీఆర్ నిర్దోషిగా తేలాలని కోరుకుంటున్నప్పటికీ, ఆయన తప్పు చేసినట్లు ఆధారాలు బయటపడ్డాయన్నారు. తన మాటలకు పదేపదే మార్పులు చేయడం ద్వారా ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని విమర్శించారు.
ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టుపై కూడా ఎంపీ చామల మాట్లాడారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.7 వేల కోట్ల ఖర్చు అంచనా వేసినప్పటికీ, అదనంగా రూ.12 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ప్రాజెక్టును కేంద్రం చేపట్టాలని కోరామన్నారు. ల్యాండ్ సేకరణపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సూచనలు ఇచ్చారని వివరించారు.
రైతు భరోసా పథకంపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని, కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలతో రైతు బంధు నిధులు అనర్హులకు పంపిణీ చేశారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నాయకత్వం బాధ్యతగల ప్రతిపక్షంగా మారాలని సూచించారు. 2025 నాటికి బీఆర్ఎస్ నేతలకు జ్ఞానోదయం కావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.

