హిడ్మా ఎన్ కౌంటర్ తర్వాత మెయిన్ స్ర్టీమ్ మీడియా, సోషల్ మీడియాల్లో ఆయనకు మద్దతుగా వస్తున్న కథనాలు, పోస్టింగ్ లు చూస్తే ఒక అజ్ఞాత నక్సలైట్ నాయకుడు మరణిస్తే, ఇంత స్పందనా!? బహుశా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాళ్ల కేశవరావు అలియాస్ బస్వరాజ్ ఎన్ కౌంటర్ అప్పుడు కూడా ఇంత స్పందన రాలేదేమో!
హిడ్మా బయటి ప్రపంచానికి పెద్దగా తెలిసిన వ్యక్తి కాదు. ఆయన పుట్టింది ఛత్తీస్ గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలోని పువ్వర్తి అనే చిన్న గూడెంలో. కానీ, విప్లవ బీజాలు నాటిన చెగువేరా ప్రపంచ విప్లవోద్యమ చరిత్రలో ఎంతటి ఐకాన్ గా నిలిచాడో, కొందరి గుండెల్లో నిద్రించిన యోధుడుగా మాడవి హిడ్మా భారత విప్లవోద్యమ చరిత్రలో మరో చెగువేరాగా నిలిచిపోతాడు.
సీనియర్ జర్నలిస్టు ఎఆర్కే రాసిన ప్రత్యేక వ్యాసం
కలల స్వప్నం కళ్లముందే కరిగిపోతున్నట్టుగా… హిమాలయ పర్వతమంతటి ఆశయం ద్రవీభవించి సముద్రంలో నీరై కలుస్తున్నట్టుగా…మహోన్నత లక్ష్యం కోసం కలలు కన్న వారు ఒక్కొక్కరుగా నేలకొరుగుతున్నారు. భారత దేశంలో ఎన్నటికైనా విప్లవం రాకపోతుందా? అని ఆశించిన, లక్షలాది మంది హ్రుదయాలు బరువెక్కిపోతున్నాయి. ఎముకలు కొరికే చలిలో శవాల నెత్తురు గడ్డకు కూడా ఏకే 47 తుపాకులతో కాపలాలు. తాము కర్కశంగా హతమార్చిన వారు మళ్లీ జీవం పోసుకొని వస్తారమో అన్నంత భయం.
ఆ నెత్తురు గడ్డ మడావి హిడ్మా. హిడ్మా చదివింది 5వ తరగతే. కానీ, అకడమిక్ క్వాలిఫికేషన్ కన్నా మహోన్నత ఆశయం కోసం, దోపిడీ, పీడన, అణచివేత, వివక్ష లేని, మనుషులను మనుషులుగా గౌరవించే సమాజం కోసం ఆయన స్వప్నించాడు. ఎంచుకున్న మార్గాన్ని అచరించాడు. రెండున్న దశబ్దాలుగా ఆయన ఆదివాసీలకు ఆరాధ్యదైవం అయితే, దోపిడీ పాలకవర్గాలకు సింహ స్వప్నం.
హిడ్మా ప్రయాణించిన మార్గం మీద చాలా మందికి భేదాభిప్రాయాలు ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ మందికి ఆయన మార్గం సరైందేననే అభిప్రాయమూ ఉంది. పరిస్థితులు మారాయి, పోరాట పంథాను కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉందని లోతుగా చర్చలు సాగుతున్న సమయంలో మాడవి హిడ్మా ఎన్ కౌంటర్ తీవ్ర చర్చనీయాంశం అయింది. తన కంటే ముందు లొంగిపోయిన నాయకుల్లాగే తాను కూడా అదే మార్గంలో పయనిద్దామని వచ్చిన ఆయనను పోలీసులు నిరాయుధుని చేసి, కాల్చిచంపారనే విమర్శలు గట్టిగానే వస్తున్నాయి. ఆయన చేతిలో, ఆయన రక్షణకవచ దళసభ్యుల చేతుల్లో ఆయుధాలు ఉండి ఉంటే హిడ్మాను హతమార్చడం సాధ్యం కాదని, పోలీసు శాఖలో అత్యున్నత కరుడుగట్టిన విభాగాల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులకు కూడా తెలుసు. అది నిజమైన ఎన్ కౌంటర్ కాదు, బూటకపు ఎన్ కౌంటర్ అని చాలా బలంగా ప్రజా సంఘాలు, పౌరహక్కుల నేతలు ఆరోపిస్తున్నారు.
పోలీసులు ఎప్పుడూ చెప్పే పిట్టకథే వల్లెవేశారు. హిడ్మా ఎంత మంది పోలీసులను చంపాడు? హిడ్మాను చంపడం కోసం వెళ్లిన వందలాది మంది పోలీసులు దండకారణ్యంలో ఎంతమంది ఆదివాసీ మహిళలు, చిన్న పిల్లలను అత్యంత క్రూరంగా హతమార్చారు? హిడ్మా పోలీసులను చంపడం ముందా? నక్సలైట్ల పేరుతో పోలీసులు అమాయకులైన అదివాసీలను ఎన్ కౌంటర్ల పేరుతో కాల్చి చంపడం ముందా? అనే చర్చ ఇప్పుడనవసరం.
కానీ హిడ్మా ఎన్ కౌంటర్ తర్వాత మెయిన్ స్ర్టీమ్ మీడియా, సోషల్ మీడియాల్లో ఆయనకు మద్దతుగా గత రెండు రోజులుగా వస్తున్న కథనాలు, పోస్టింగ్ లను చూస్తే ఒక అజ్ఞాత నక్సలైట్ నాయకుడు మరణిస్తే, ఇంత స్పందనా!? బహుశా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాళ్ల కేశవరావు అలియాస్ బస్వరాజ్ ఎన్ కౌంటర్ అప్పుడు కూడా ఇంత స్పందన రాలేదేమో!
హిడ్మా బయటి ప్రపంచానికి పెద్దగా తెలిసిన వ్యక్తి కాదు. ఆయన పుట్టింది ఛత్తీస్ గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలోని పువ్వర్తి అనే చిన్న గూడెంలో. యవ్వనంలోనే హిడ్మా మావోయిస్టుల్లో కలిశాడు. 25 ఏళ్లుగా ఆయన సాయుధుడై పోరాడుతున్నాడు. ఆదివాసీల గుండెల్లో హిడ్మాకు వెలకట్టలేని స్థానం ఉంది. కాబట్టే ఇంత కాలం వేలాది మంది పోలీసు బలగాలు అడవిని జల్లెడ పట్టి గాలించినా దొరకలేదు. ఎన్ కౌంటర్ తర్వాత హిడ్మాకు మద్దతుగా స్పందిస్తున్న వారు కానీ, ఆయన ఆశయాన్ని సమర్థిస్తున్నవారు కానీ ఆయనను ఎన్నడూ చూసి ఎరుగరు. మాట్లాడి ఉండరు. అయినా వాళ్ళంతా హిడ్మాను ఆకాశానికి ఎత్తి జోహార్లు ప్రకటిస్తున్నారు. ఒక విప్లవోద్యమ నాయకుడిగా హిడ్మా ఈ ప్రపంచానికి సుపరిచితుడు. అందుకే హిడ్మా మరణం తర్వాత ఆయన ఆచరించిన సిద్ధాంత ఆశయాలను ఆకాంక్షించిన వాళ్ళంతా ఆయనకు మద్ధతుగా మాట్లాడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లోని ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ వంటి పేజీల్లో హిడ్మాకు మద్దతుగా పోస్టింగ్ లు మారుమోగిపోతున్నాయి. హిడ్మా బతికుంటే బాగుండు అని వేల గొంతులు నినదిస్తున్నాయి. ఆయనను అభిమానించి, ఆదరించి, గుండెల్లో దాచుకున్న ఆదివాసీలకు అక్షర జ్ఞానం ఉండి, సోషల్ మీడియాను వాడుకోవడం తెలిసి ఉంటే, ఇంకెంతగా మారుమోగిపోయోవో! విప్లవోద్యమంలో ఒక ఆదివాసీ బిడ్డ, ఇంతగా ఆదరాభిమానాలను కూడగట్టుకోవడం మామూలు విషయం కాదు.
చాలా మంది ఈ మద్య కాలంలో ఒక విమర్శ చేస్తున్నారు. పట్టణాల్లో అన్ని సౌకర్యాలతో జీవిస్తున్న వారు, తమ బదులు వేరెవరో అడవుల్లో తుపాకులు పట్టి పోరాటం చేయాలని భాస్తున్నారని. తాము చేయలేని పనిని తమ నాయకుడు, ఒక హీరోగా చేయాలని ప్రజలు కోరుకుంటారు. అందువల్లే వీళ్లు అభిమానులు మాత్రమే అవుతారు. వాళ్లు చరిత్రలో హీరోలు అవుతారు.
సుక్మా అడవుల్లో హిడ్మా అంత్యక్రియల దృశ్యాలను చూస్తే ఆయనకు ఆదివాసీల్లో ఎంతటి ఆదరణ ఉందో అర్థమవుతుంది. జాతీయ, అంతర్జాతీయ, స్థానిక మీడియా సంస్థల ప్రతినిధులతో పూవర్తి కిక్కిరిసిపోయింది. తమ నాయకున్ని విగత జీవిగా చూసి ఆదివాసీలు బోరున విలపిస్తూ కన్నీరు పెట్టుకున్న దృశ్యాలు, శవాన్ని గుండెలకు హత్తుకొని ముద్దాడిన సన్నివేశాలు ఆదివాసీల గుండెల్లో హిడ్మా పదిల పర్చుకున్న స్థానానికి నిదర్శనం. చరిత్రలో కొమురం భీం, రాంజీ గోండు, అల్లూరి సీతారామరాజుల వారసుడిగా హిడ్మాకు ఆదివాసీల ఉద్యమ నాయకుడిగా స్థానం దక్కుతుంది.
అర్జెంటీనాలో పుట్టి, క్యూబా విప్లవంలో ఫెడల్ కాస్ట్రోతో పాటు పనిచేసి, క్యూబా విప్లవం విజయవంతం అయిన తర్వాత, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలో కూడా విప్లవ బీజాలు నాటిన చెగువేరా ప్రపంచ విప్లవోద్యమ చరిత్రలో ఎంతటి ఐకాన్ గా నిలిచాడో, భారత విప్లవోద్యమ చరిత్రలో హిడ్మా కూడా అంతే ఐకాన్ గా నిలుస్తాడు. చత్తీస్ ఘడ్ దండకారణ్యం, మహారాష్ట్రలోని గడ్చిరోలి, ఒరిస్సా, ఏఓబి ప్రాంతాల్లో విప్లవోద్యమ జ్వాలను రగిలించిన నేతగానే కాదు, విప్లవోద్యమ ప్రస్థానంలో కొందరి గుండెల్లో నిద్రించిన యోధుడుగా మాడవి హిడ్మా భారత విప్లవోద్యమ చరిత్రలో మరో చెగువేరాగా నిలిచిపోతాడు.
చెగువేరా ఎంతటి పాపులారిటి పొందాడంటే, ఆయన ఫోటోతో ఉన్న టి-షర్ట్ లను నేటి తరం కాలేజీ కుర్రాళ్లు ఫ్యాషన్ తో వేసుకుంటున్నారు. అందులో అనేకమందికి చెగువేరా తెలియదు. ఆయన సిద్దాంతం ఏమిటో తెలియదు. కానీ చెగువేరా ఫోటో ఉన్న టి-షర్ట్ ను వేసుకోవడం ఒక ఫ్యాషన్ గా, డిగ్నిటీగా ఫీల్ అవుతున్నారు. అలాగే రాబోయే రోజుల్లో హిడ్మా ఫోటోతో ఉన్న టి షర్ట్ లను నేటి, రాబోయే తరం కుర్రాళ్లు తప్పక వేసుకుంటారేమో!?

