కాలం కలిసి వచ్చినా NO|నో ఓబీడియన్స్|OBEDIENCE
తారా స్థాయికి చేరిన విభేదాలు|DIFFERENCES
బాహాటంగానే విమర్శలు, పరస్పరం ఫిర్యాదులు
నేరుగా HIGHCOMMAND|అధిష్టానానికి చేరుతున్న పంచాయతీలు
PARTY|పార్టీలో తలో దారేనా?
CM|సీఎం, DCM|డీసీఎంల మధ్యా విభేదాలేనా?
MINISTERS|మంత్రుల మధ్యా మనస్పర్థలేనా?
MLAS|ఎమ్మెల్యేలు ఎవరికి వారేనా!?
CADRE|కార్యకర్తలు యమునా తీరేనా!?
సంయమనం లేనిదేనా?
CO ORDINATION|సమన్వయం కానిదేనా?
మనసు విప్పి మాట్లాడుకునేది లేదాయెనా?
కలిసి ప్రయాణించేది కాదాయెనా?
కాంగ్రెస్ లో TROUBLE SHOOTERS|ట్రబుల్ షూటర్స్ ఏరి?
అంతా TROUBLE CREATORS|ట్రబుల్ క్రియేటర్సే అయితే ఎట్లా?
అంతా గడబిడ…మారితేనే మనుగడ!
కాంగ్రెస్ లో కలహాలపై నేడు క్రమశిక్షణా సంఘం భేటీ
రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ లోని విభేదాలపై ‘అడుగు’ ప్రత్యేక కథనం

కాంగ్రెస్ లో అంతే! కలహాల తంతే!! మారితేనే వింత? పవర్ పాలిటిక్స్ కి కేరాఫ్ కాంగ్రెస్. పవర్ ఉంటే ప్రభుత్వ పదవుల కోసం, లేకపోతే పార్టీ పదవుల కోసం పాకులాట. విభేదాలు, భేదాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు, కీసులాటలు కొట్లాటలు, ధర్నాలు, ఆందోళనలు, ఆవేదనలు కాంగ్రెస్ అంటే సకల సమ్మిళితం. అందుకేనేమో కాంగ్రెస్ ని మహాసముద్రం అంటుంటారు. అన్నీ అందులోనే ఇమిడి ఉంటాయి. కాంగ్రెస్ కి వేరే శత్రువులు ఉండరంటారు. వారికి వారే శత్రువులు, మిత్రులు. కాంగ్రెస్ గతమంతా కనిపించకపోయినా, ప్రస్తుతం గతానికి కొనసాగింపుగానే ఉంది. శతాబ్దం పైబడిన ఆ పార్టీకి అర్థ శతాబ్దం పాటు అధికారం చెలాయించిన చరిత్ర ఉంది. పదేళ్ళ విరామం తర్వాత ప్రజలు అధికారం అప్పగిస్తే, దాన్ని నిలుపుకునే నిలకడ, ఓపిక, సంయమనం, పరస్పర సహకారం వంటివేవీ కాంగ్రెస్ లో కనుచూపు మేరలో కనిపించడం లేదు.
అంతా కలిసి ఉన్నట్లుగానే కనిపిస్తారు. కానీ కనీసం ఒకరినొకరు కలవరు. కలిసినా కలహాలే. కలవకపోయినా కలతలే. కాంగ్రెస్ కల్చరే అంత. అన్నంతగా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలకురాలు, పీసీసీ, సీఎంకు, సీఎం, డీసీఎంకు, డీసీఎంకు కొందరు మంత్రులకు, మంత్రులకు మంత్రులకు మధ్య, మంత్రులకు ఎమ్మెల్యేలకు మధ్య, ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలకు మధ్య, ఎమ్మెల్యేలకు, పార్టీ నేతలు, నేతలు కార్యకర్తల మధ్య… ఎక్కడికక్కడ విభేదాలే కనిపిస్తున్నాయి. అవన్నీ బహిర్గతం అవుతున్నాయి.
కాంగ్రెస్ లో విచిత్రమేంటంటే అతి ప్రజాస్వామ్యం ఉంటుంది. అధిష్టానం ఉంటుంది. ఏ నిర్ణయాలు సొంతంగా తీసుకోలేరు. కానీ, ఇష్టారీతిన ప్రవర్తిస్తారు. బాహాటంగా మాట్లాడతారు. బహిరంగంగా విమర్శించుకుంటారు. బాహాబాహీకి దిగుతారు.
మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి ఎమ్మెల్యేలను తూలనాడటమే కాదు, రాజీనామా చేసి మళ్ళీ గెలవాలన్నాడు. ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే అట్టెసరు మెజార్టీతో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుందా? ఆ కొండను భరించలేం బాబో! అటో ఇటో తేల్చాయాల్సిందేనటంటూ ఆ ఎమ్మెల్యేలు గాంధీ భవన్ కు చేరారు.
ఇలా ఇలాంటి సమస్యలు ఒక్క వరంగల్ లోనే కాదు కేంద్రం నుంచి రాష్ట్రం, రాష్ట్రం నుంచి గ్రామం దాకా పేరుకుపోయి ఉన్నాయి. వీటిని పరిష్కరించడం కాంగ్రెస్ పెద్దల నుంచి అవుతుందా? నేడు భేటీ అవుతున్న క్రమశిక్షణ సంఘం వాటిని తేలుస్తుందా?
హైదరాబాద్, జూన్ 23 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
నియోజకవర్గాల్లో కొత్తపాతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. వేరే పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కేడర్, లీడర్లతో పొసగడంలేదు. కొత్త పాతల మధ్య సమన్వయాన్ని గాలికి వదిలేశారు. పాతవాళ్ళ మధ్యా పొసగడం లేదు. పై నుంచి కింది దాకా, కింది నుంచి పై దాకా కాంగ్రెస్ ను కలహాలు కలచి వేస్తున్నాయి. ఆ దడబిడలే ఆ పార్టీని దహించివేసేట్లున్నాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లా: మంత్రి కొండా సురేఖ దంపతులకు పార్టీలోని ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యానారాయణ, డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణలకు మధ్య పచ్చగడ్డి లేకున్నా మంటలు పుడుతున్నాయి. రాహూల్ గాంధీ పుట్టిన రోజు వేడుకల వేదికగా కండా మురళి కడియంను, రేవూరిలను కడిగేశారు. వాళ్ళంతా మీటింగ్ పెట్టుకుని మురళికి వార్నింగ్ ఇచ్చారు. పీసీసీకి, పరిశీలకురాలికి, క్రమశిక్షణా సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలనడం తారా స్థాయికి చేరిన కాంగ్రెస్ విభాదాలకు పరాకాష్టగా చెప్పుకోవచ్చు.
ఇక నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఏకంగా సీఎం రేవంత్ రెడ్డితోనే విభేదిస్తున్నారు. మరోవైపు సీతక్క, సురేఖల మధ్య కూడా పడటం లేదట. పరకాలలో మంత్రి కొండా సురేఖ అతి జోక్యం, ఎమ్మెల్యే రేవూరికి ఇబ్బందీగా మారింది. వరంగల్ తూర్పులో ఎమ్మెల్యే, మంత్రి కొండా సురేఖ, ఎర్రబెల్లి స్వర్ణ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యల మధ్య తారాస్థాయి విభేదాలున్నాయి. వరంగల్ పశ్చిమలో ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి జోక్యంతో తమకు ఇబ్బందులున్నాయని, పాలకుర్తి, వరంగల్ పశ్చిమ, వర్దన్నపేట ఎమ్మెల్యేలు పీసీసీకి, సీఎంకి ఫిర్యాదు చేశారు. స్టేషన్ ఘన్ పూర్ లో సింగపూర్ ఇందిర, కడియం శ్రీహరి, జనగామలో పాత కాంగ్రెస్ కొమ్మూరి మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. పాలకుర్తిలో అత్తాకోడళ్ళు, వారి కుటుంబ సభ్యుడు, తొర్రూరు మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమాండ్ల తిరుపతిరెడ్డిల మధ్య, డోర్నకల్, మహబూబాబాద్ లలో కొత్త పాతల మధ్య విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా : సీఎం రేవంత్ రెడ్డికే చెందిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల క్రుష్ణమోహన్ రెడ్డిల మధ్య మంత్రి పొంగులేటి సమక్షంలోనే తాము ప్రయాణిస్తున్న కారులో కాలర్ పట్టుకుని కొట్టుకునే దాకా వెళ్లింది. జోగులాంబ గద్వాల జిల్లా తాజా మాజీ జెడ్పీ చైర్మన్ సరితా తిరుపతయ్య గత ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరగా ఆమెకు గద్వాల ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆమె క్రుష్ణమోహన్ మీద ఓడిపోయింది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యే, సరితా తిరుపతయ్య, వారి అనుచరుల మీద కేసులు బనాయించి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వనపర్తిలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ శివసేనారెడ్డి మధ్య వివాదం అంతర్లీనంగా ఉంది. ఇప్పటికే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి బహిరంగంగానే ప్రభుత్వాన్ని విమర్శించారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా: టీపీసీసీ చీఫ్ సొంత జిల్లాలో సీనియర్లను కాదని జూనియర్లకే పదవులు కట్టబెడుతున్నారని గొడవలు జరుగుతున్నాయి. బాన్స్ వాడలో బీఆర్ఎస్ నుంచి వచ్చిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి రావడంతో కాంగ్రెస్ ఇన్ చార్జీగా ఉన్న ఏనుగు రవీందర్ రెడ్డిల మధ్య గొడవలు మొదలయ్యాయి. జుక్కల్ లో ఎమ్మెల్యే లక్ష్మీకాంత రావు తమను పట్టించకోవడం లేదని పాత కాంగ్రెస్ వాళ్లు ఏకంగా గాంధీ భవన్ ఎదుటే ధర్నా చేశారు. ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, సీఎం వర్గంగా పేరున్న సుభాష్ రెడ్డిల మధ్య కుమ్ములాట నడుస్తోంది. బాల్కొండలో సునీల్ రెడ్డికి, మానాల మోహన్ రెడ్డిల మధ్య, ఆర్మూర్ లో పాత, కొత్తల మధ్య విభేదాలున్నాయి. నిజామాబాద్ అర్బన్ లో షబ్బీర్ అలీ పీసీసీ చీఫ్ ల వర్గాల మధ్య పడటం లేదు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా: నిర్మల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆ జిల్లా డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావుల మధ్య అస్సలు పడటం లేదు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ ల మధ్య మంత్రి పదవి విషయంలో విభేదాలు రాజుకున్నాయి. అసీఫాబాద్ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్, నియోజకవర్గ ఇన్చార్జీ రేఖా ఆజ్మీరా శ్యాం నాయక్ ల మధ్య పడటం లేదు. ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జీ కంది శ్రీనివాస్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డిల మధ్య తేడాలున్నాయి. బోథ్ లో ఆడె గజేందర్, మాజీ ఎంపీ సోయం బాపూరావుల మధ్య, ఖానాపూర్ లో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ఆత్రం సుగుణల మధ్య, నరేశ్ జాదవ్ ల మధ్య గొడవలున్నాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా: జగిత్యాల నియోజకవర్గంలో సీనియర్ నేత జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ మధ్య పచ్చగడ్డి లేకుండానే మంటలు చెల రేగుతున్నాయి. వీళ్ళ సమస్య ఎఐసీసీ వరకు వెళ్ళింది. నేటికీ పరిష్కారం మాత్రం కాలేదు. కరీంనగర్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కంభంపల్లి సత్యనారాయణ, మంత్రి పొన్నం ప్రభాకర్ లు ఒక గ్రూపుగా, పురుమల్ల శ్రీనివాస్ కు పొసగడం లేదు. సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జీ కెకె మహేందర్ రెడ్డి, చీటి ఉమేశ్ రావుల మధ్య వివాదాలున్నాయి. పెద్దపల్లి ఎంపీ వంశీ, ఆ పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేల మధ్య అనేక సమస్యలున్నాయి.
ఉమ్మడి మెదక్ జిల్లా: పటాన్ చెరువులో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కాట శ్రీనివాస్ గౌడ్, ఎంపీ ఎన్నికలకు ముందు వచ్చి మెదక్ ఎంపీగా పోటీ చేసిన నీలం మధు, ఆతర్వాత వచ్చిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ వర్గాలుగా పార్టీ వీడిపోయింది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా: ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లో చేరిన చేవెళ్ళ ఎమ్మెల్యే కాలె యాదయ్య పాత కాంగ్రెస్, మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన భీంభరత్ ల మధ్య గొడవలున్నాయి. మేడ్చెల్ లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన వజ్రేశ్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డిల మధ్య పడటం లేదు. మహేశ్వరంలో మాజీ ఎమ్మెల్యేలు తీగల క్రుష్ణారెడ్డి, కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిల మధ్య అస్సలు పడటం లేదు. రాజేంద్రనగర్ లో పాత, కొత్తల మధ్య కుదరడం లేదు. గత ఎంపీ ఎన్నికల్లో చేవెళ్ళ, మల్కాజీగిరి స్థానాల విషయంలో మాజీ ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్, మండలిలో కాంగ్రెస్ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డిల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.
ఉమ్మడి నల్లగొండ జిల్లా: తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మందుల సామెల్, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి వర్గాల మధ్య విభేదాలు బహిరంగమయ్యాయి. సూర్యాపేటలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డిల మధ్య విభేదాలు తారా స్థాయిలో ఉన్నాయి. మాజీ మంత్రి జానారెడ్డి, అతని కుమారులు నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జయవీర్ రెడ్డిల వల్లే తనకు మంత్రి పదవి రావడంలేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపిస్తున్నారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అతని కుమారుడు గుత్తా అమిత్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిల మధ్య కూడా విభేదాలున్నాయి. అభివ్రుద్ధి నిధుల విషయంలో వారి మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లా: ముగ్గురు మంత్రుల మధ్య ఆధిపత్యం కోసం మూడు ముక్కలాట జరుగుతోంది. జిల్లాలోని ఎమ్మెల్యేలు సైతం డీసీఎం భట్టీ, మంత్రులు తుమ్మల, పొంగులేటి వర్గాలుగా విడిపోయారు. ఎక్కువ సీట్లు గెలిచిన జిల్లాలో సమస్యలు కూడా ఎక్కువే.

