ప్రభుత్వాలకు పరిశ్రమల పరివ్యాప్తిపై ఉన్న యావ, పర్యావరణంపై ఉండటం లేదు. పెట్టుబడుల కోసం పట్టువిడుపులు లేకుండా ప్రపంచమంతా తిరిగి వస్తున్నారు. కనబడ్డ ప్రతి కంపెనీని నిస్సిగ్గుగా బిచ్చమెత్తుకుంటున్నారు. పెట్టుబడులు పెడితే, మీక్కావల్సిన వన్నీ ఇచ్చేస్తా మంటున్నారు. ఇందుకు పారిశ్రామిక ప్రోత్సాహక విధానాలు అనుసరిస్తున్నారు. మార్గం-అడుగు, డా.మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్
ప్రభుత్వాలకు పరిశ్రమల పరివ్యాప్తిపై ఉన్న యావ, పర్యావరణంపై ఉండటం లేదు. పెట్టుబడుల కోసం పట్టువిడుపులు లేకుండా ప్రపంచమంతా తిరిగి వస్తున్నారు. కనబడ్డ ప్రతి కంపెనీని బిచ్చమెత్తుకుంటున్నారు. పెట్టుబడులు పెట్టండి. మీక్కావల్సినవన్నీ ఇచ్చేస్తామంటున్నారు. ఇందుకు పారిశ్రామిక ప్రోత్సాహక విధానాలు అనుసరిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం మూడు కీలక పారిశ్రామిక విధానాలను అమలులోకి తెచ్చింది. ఇండస్ట్రీయల్ డెవలప్ మెంట్ పాలసీ 4.0, ఎంఎస్ఎంఇ ఎంట్రప్రిన్యూరీ డెవలప్ మెంట్ పాలసీ 4.0, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 విధానాలకు మార్గదర్శకాలను వెలువరించింది. అదేవిధంగా, రాష్ట్రంలో 45వేల ఎకరాల పారిశ్రమల కోసం సిద్ధంగా ఉంచింది. ఈ విధానాల ద్వారా ఉద్యోగాల కల్పన, పెట్టుబడి ఆకర్షణ వంటివి వీటి లక్ష్యాలు.
తెలంగాణలో కూడా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ ల కొరకు రూ. 45 వేల కోట్లు పెట్టుబడి అంచనాతో ఉంది. ఇందుకవసరమైన భూ సేకరణకు కూడా చేపడుతున్నది. ఇప్పటికే తెలంగాణలోని 2,180 పరిశ్రమలలో 2,179కి ఈ ట్రీట్ మెంట్ ప్లాంట్లు ఉన్నాయి. ఈ పరిశ్రమల వ్యర్థాలు ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి.
పరిశ్రమల చుట్టుముట్టు ప్రాంతాల్లో పీల్చే గాలి, తాగే నీరు ప్రమాదకరంగా మారాయి. ప్రాణాంతక వ్యాధులకు అవి కేంద్రంగా వున్నాయి. పర్యావరణ పరిరక్షణ బాధ్యతను అటు ప్రభుత్వమూ, ఇటు పరిశ్రమాధిపతులు పూర్తిగా వదిలేశారు. కోట్ల విలువైన రాయితీలు, సదుపాయాలు కల్పించి పరిశ్రమాధిపతులకు లాభాలు సమకూర్చడం పైనే ప్రభుత్వాలు శ్రద్ధ చూపుతున్నాయి. ఆ పరిశ్రమలకు భూములిచ్చిన రైతులు, ఉపాధి కోల్పోయిన పేదలు, వృత్తిదారులను విస్మరించాయి. ఇప్పటికే ఉప్పాడ కార్మికులు సముద్రంలో కలుస్తున్న కాలుష్యాన్ని నిలిపివేయాలంటూ పాలకులను నిలదీసారు. తాజాగా అనకాపల్లి సెజ్ ఏర్పాటుపై మత్స్యకారులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ఉంది ప్రజల ప్రాణాలను కాపాడడానికే గానీ తీయడానికి కాదని వారు అంటున్నారు. అనకాపల్లి జిల్లాలోని సక్కపల్లి మండలంలో బల్క్ డ్రగ్ పార్క్ ను వ్యతిరేకిస్తూ మత్స్యకారులు చేపట్టిన దీక్ష 39వ రోజుకి చేరుకుంది.
నిజానికి ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలను కాపాడాలి అంతేగానీ తీయకూడదు. రాష్ట్రంలో లక్షల కోట్ల పెట్టుబడులతో వచ్చే పరిశ్రమల్లో వేలాది మందికి ఉపాధి కలగనుందని ప్రభుత్వం చెబుతున్న మాటలను ప్రజలు విశ్వసించడం లేదు. పైగా ఆ పరిశ్రమల ఏర్పాటు కోసం జరిగే ప్రజాభిప్రాయ సేకరణను రద్దు చేయాలన్న డిమాండ్పై ఏకమవడం నూతన పరిణామం.
ఉపాధి పేరుతో మోసగించి కార్పొరేట్లు, పెట్టుబడిదారులకు లబ్ది చేకూర్చాలన్న ప్రభుత్వ పెద్దల ఆరాటానికి ప్రజా పోరాటాలు బ్రేకులు వేస్తున్నాయి. పోలీసు బలగాలతో ప్రజలను భయపెట్టేందుకు యత్నించినా చాలా ప్రాంతాల్లో తిరగబడుతున్నారు. బల్క్ డ్రగ్ ఒక్కటే కాదు ఎక్కడ భూ సేకరణ జరిగినా రైతులు తిరగబడుతున్నారు. పరిశ్రమలకు ఒకనాడు భూములిచ్చిన రైతులు ఇపుడు అడుక్కు తింటున్నారు. తెలంగాణ, ఆంధ్రా అన్న తేడా లేకుండా పరిశ్రములు, రోడ్లు, ప్రాజెక్టులకు రైతుల భూములు లాక్కోవడం వారిని వదిలివేయడం ప్రభుత్వాలకు అలవాటుగా మారింది. పోలవం బాధితులు, మల్లన్నసాగర్ బాధితులు ఇదే కోవలోకి వస్తారు.
కొద్ది రోజుల క్రితం బల్క్ డ్రగ్ ప్రాజెక్టును ఆపాలంటూ, ఆ ప్రాంత పర్యటనకు వెళ్లిన మంత్రి వాహనం ముందు తాటిచెట్టు అడ్డంపెట్టి మరీ పోరాడారు. దీంతో తాత్కాలికంగా పనులు నిలిపివేస్తున్నట్టు మంత్రి ప్రకటించాల్సి వచ్చింది. ఆదానీకి చెందిన గంగవరం పోర్టు ధూళి, దుమ్ముతో భరించలేని కాలుష్యంతో బాధపడుతున్న ప్రజల్లో అంబూజా సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుపై ఆగ్రహం వెల్లువెత్తింది. విశాఖ పోర్టు ట్రస్ట్, గంగవరం పోర్టును పర్యావరణ ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవడం లేదు. ఎన్టీపిసి కాలుష్యంతో మూల స్వయంవరం, సోమినాయుడుపాలెం ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు. పరవాడ ఫార్మా సిటీకి అనుకొనివున్న గ్రామాలు వాయు కాలుష్యంతో తల్లడిల్లుతున్నాయి. పరిశ్రమలు వ్యర్థ రసాయన జలాలను శుద్ధి చేయకుండా చెరువుల్లోకి విడిచిపెడుతున్నాయి. రాంకీ యాజమాన్యానికి కాలుష్య నియంత్రణ అధికారులు నోటీసులు జారీ చేసినా? చర్యలేవిూ తీసుకోలేదు. ముత్యాలమ్మపాలెం ఉప్పుటేరు కాలుష్యమయమైంది. అచ్యుతాపురం సెజ్ లోని వ్యర్థాలను శుద్ధి చేయకుండా పూడిమడక వాగులోకి వదిలేయడంతో చేపలు చనిపోయి మత్స్యకారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారు. ప్రజలకు హానికరంగా నిబంధనలు సవరించి కార్పొరేట్లకు ప్రయోజనం చేకూర్చడానికి ప్రభుత్వం, అధికారులు సిద్ధంగా ఉంటున్నారు.
ప్రజల ఆరోగ్యాలు దెబ్బ తినకుండా వుండాలంటే పర్యావరణ ప్రమాణాలను పరిశ్రమలు పాటించేలా నిబంధనలు కఠినతరం చేయాలి. అలాగే కాలుష్యకారక పరిశ్రమలతో పర్యావరణాన్ని దెబ్బతీసే పరిశ్రమలను దూరం పెట్టడమే మంచిది.

