దేశ ఆర్థిక వ్యవస్థకు రైతే వెన్నెముక అని చెప్పడం సులువు. కానీ రైతు పండించిన ధాన్యాన్ని గౌరవంగా కొనుగోలు చేసి, సమయానికి చెల్లింపులు చేయడం ద్వారానే ఆ మాటలకు అర్థం వస్తుంది. రైతుకు తన ధాన్యం అమ్ముకోవడం కష్టంగా మారితే, అది కేవలం పరిపాలనా వైఫల్యం మాత్రమే కాదు. రైతు పట్ల సమాజం చూపుతున్న నిర్లక్ష్యానికి కూడా నిదర్శనం.!
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో యాసంగి ధాన్యం కొనుగోళ్లు మళ్లీ రైతుల ప్రాణాల మీదకే తెచ్చాయి. కష్టాలకు, కన్నీళ్ళకు ప్రతీకలుగా మారాయి. పంట పండించడమే కాదు, దాన్ని అమ్ముకోవడమే ఇప్పుడు రైతులకు అగ్నిపరీక్షగా మారింది. కొనుగోలు కేంద్రాల వద్ద రోజులు గడుపుతున్న రైతుల ఆవేదన ప్రతి ఏడాది కనిపిస్తున్నా, ప్రభుత్వాల వ్యవహారశైలిలో మాత్రం పెద్దగా మార్పు కనిపించడం లేదు. రైతు సంక్షేమం పేరుతో సభల్లో గొప్పలు చెప్పుకునే పాలకులు, క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న బాధలను మాత్రం గమనించడం లేదు.
తెలంగాణలో ఈ యాసంగి సీజన్లో 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో కూడా లక్షల టన్నుల సేకరణ జరుగుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి చూస్తే గణాంకాలు ఒకలా, వాస్తవాలు మరోలా ఉన్నాయి. కొనుగోలు కేంద్రాల వద్ద గన్నీ సంచుల కొరత, లారీల సమస్య, హమాలీల లేమి, తూకం యంత్రాల కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
అకాల వర్షాలు రైతుల కష్టాలను మరింత పెంచాయి. పలుచోట్ల కల్లాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసి మొలకెత్తే పరిస్థితి ఏర్పడింది. వర్షం పడుతుందేమోనన్న భయంతో రైతులు రాత్రింబవళ్లు ధాన్యానికి కాపలా కాస్తున్నారు. కొందరు రోడ్లపైనే వడ్లను ఆరబెడుతుంటే, మరికొందరు టార్పాలిన్ కప్పి వర్షం నుంచి రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రభుత్వాలు చెబుతుంటే, వాటిని కొనుగోలు కేంద్రాల్లో అధికారులు తిరస్కరిస్తున్నారు.
రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ప్రభుత్వాలు ప్రకటిస్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం “తాలు ఎక్కువ”, “తేమ శాతం అధికం”, “ధాన్యం నాణ్యత సరిగా లేదు” అంటూ కొర్రీలు పెట్టడం సాధారణంగా మారింది. ఫలితంగా రైతులు మిల్లర్ల దయాధీనంగా మారుతున్నారు. చాలాచోట్ల రైస్ మిల్లర్లు నాలుగైదు కిలోల తరుగు పేరిట రైతులను దోచుకుంటున్నారు.
ధాన్యం కొనుగోళ్లలో ప్రధాన సమస్య రవాణా. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం రోజుల తరబడి నిల్వ ఉండిపోతోంది. లారీలు అందుబాటులో లేకపోవడం, రవాణా కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో లారీ యజమానులు ఒక్కో సంచికి అదనంగా రూ.3 నుంచి రూ.5 వరకు వసూలు చేస్తున్నారు. మరోవైపు హమాలీల కొరత కూడా పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తోంది.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలే లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాగునీరు, షెడ్లు, విద్యుత్, తూకం యంత్రాలు, నిల్వ సదుపాయాలు సరిగా లేక రైతులు ఎండలోనే రోజులు గడపాల్సి వస్తోంది. కొన్ని చోట్ల రైతులు సీరియల్ నంబర్ల కోసం గొడవలు పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. రైతు సమస్యను పరిపాలనా అంశంగా కాకుండా, జీవన్మరణ సమస్యగా చూడాల్సిన అవసరం ఉంది.
ఇక రాజకీయ పార్టీల వ్యవహారం కూడా విమర్శలకు తావిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో విధంగా వ్యవహరించడం కొత్తేమీ కాదు. గతంలో “వరేస్తే ఉరే” అంటూ వరి సాగును నిరుత్సాహపరిచిన బీఆర్ఎస్ నాయకత్వం ఇప్పుడు రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని విమర్శిస్తోంది. అదే సమయంలో ప్రస్తుత ప్రభుత్వం కూడా పరిస్థితిని పూర్తిగా నియంత్రించలేకపోతోంది. రైతుల పక్షాన నిలబడాల్సిన ప్రతిపక్షాలు క్షేత్రస్థాయిలో పత్తా లేకుండా పోయాయి.
ధాన్యం కొనుగోళ్లలో ప్రతి ఏడాది ఒకే సమస్యలు పునరావృతమవుతున్నాయంటే, ప్రభుత్వాల వద్ద దీర్ఘకాలిక ప్రణాళికల లోపం స్పష్టంగా కనిపిస్తోంది. వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతున్నా, నిల్వ సామర్థ్యాలు, రవాణా వ్యవస్థ, మిల్లింగ్ సామర్థ్యాలను అదే స్థాయిలో పెంచకపోవడం ప్రధాన కారణం. రైతు నుంచి ధాన్యం సేకరణ మొదలుకొని మిల్లులకు తరలింపు వరకు సమన్వయం లేకపోవడంతో సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయి.
ఈ పరిస్థితికి తక్షణ పరిష్కారం అవసరం. కొనుగోలు కేంద్రాల వద్ద అదనపు లారీలు, హమాలీలను ఏర్పాటు చేయాలి. గన్నీ సంచుల కొరతను వెంటనే నివారించాలి. తడిసిన ధాన్యాన్ని కూడా నిర్దిష్ట ప్రమాణాలతో కొనుగోలు చేసే విధానాన్ని అమలు చేయాలి. కలెక్టర్లు, ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను పరిష్కరించాలి. రైతులను మిల్లర్లు, మధ్యవర్తుల దోపిడీ నుంచి కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకోవాలి.
దేశ ఆర్థిక వ్యవస్థకు రైతే వెన్నెముక అని చెప్పడం సులువు. కానీ రైతు పండించిన ధాన్యాన్ని గౌరవంగా కొనుగోలు చేసి, సమయానికి చెల్లింపులు చేయడం ద్వారానే ఆ మాటలకు అర్థం వస్తుంది. రైతుకు తన ధాన్యం అమ్ముకోవడం కష్టంగా మారితే, అది కేవలం పరిపాలనా వైఫల్యం మాత్రమే కాదు. రైతు పట్ల సమాజం చూపుతున్న నిర్లక్ష్యానికి కూడా నిదర్శనం.

