డిజిటల్ యుగంలో రాజకీయాలను విశ్లేషించే తీరు పూర్తిగా మారిపోయింది. గతంలో సిద్ధాంతాలు, ఉద్యమాలు, బంద్ లు, ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు, పోరాటాలు ప్రధానమైతే, ఇప్పుడు వైరల్ వీడియోలు, ట్రెండింగ్ హ్యాష్ట్యాగ్లు, మీమ్స్ రాజకీయ ప్రభావాన్ని నిర్ణయిస్తున్నాయి. “కాక్రోచ్ జనతా పార్టీ” కూడా ఈ డిజిటల్ రాజకీయ సంస్కృతిలో భాగమే. అయితే అది నిజంగా వ్యవస్థలోని లోపాలను ఎండగట్టే వేదికగా నిలవాలంటే అన్ని పార్టీల అవకాశవాదాన్ని సమానంగా ప్రశ్నించాలి. ఒక రాజకీయ వర్గానికి అనుకూలంగా, మరొక వర్గానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే అది ప్రజా ఉద్యమం కాకుండా రాజకీయ ప్రయోగంగా మిగిలిపోతుంది.!
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద యువజన శక్తి కలిగిన దేశం. 145 కోట్ల జనాభాలో 65 శాతానికి పైగా ప్రజలు 35 ఏళ్ల లోపు వారే. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే సామర్థ్యం, రాజకీయాలను మార్చే శక్తి, వ్యవస్థను ప్రశ్నించే ధైర్యం ఉండాల్సిన వాళ్ళు. స్వాతంత్ర్యోద్యమం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు ప్రతి కీలక చారిత్రక దశలో యువతే మార్పునకు చోదకశక్తిగా నిలిచింది. అయితే, డిజిటల్ యుగంలో యువత రాజకీయ చైతన్యం కొత్త రూపం దాల్చింది. వీధి పోరాటాలు, విద్యార్థి ఉద్యమాల స్థానంలో ఇప్పుడు సోషల్ మీడియా క్యాంపెయిన్లు, మీమ్స్, ట్రోల్స్, వ్యంగ్య రాజకీయాలే ప్రధాన వేదికలుగా మారాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి వచ్చిన “కాక్రోచ్ జనతా పార్టీ” దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది.
ఇది అధికారిక రాజకీయ పార్టీ కాకపోయినా, యువతలో పెరుగుతున్న రాజకీయ అసంతృప్తిని ప్రతిబింబించే డిజిటల్ ఉద్యమంగా ప్రచారం పొందుతోంది. రాజకీయ అవకాశవాదం, కుటుంబ పాలన, ఫిరాయింపు సంస్కృతి, అవినీతిపై వ్యంగ్యాస్త్రంగా ఇది ముందుకొచ్చింది. కానీ దీని ప్రచార విధానం, ఎంచుకున్న అంశాలు, లక్ష్యాలను పరిశీలిస్తే ఇది పూర్తిగా తటస్థ వేదిక కాదన్న అభిప్రాయం బలపడుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్, ఆప్ రాజకీయ వాదనలను ముందుకు తీసుకెళ్లే విధంగానే దీని ప్రచారం సాగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత ఒక సందర్భంలో ఫేక్ సర్టిఫికెట్లు, తప్పుడు పిటిషన్లతో న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న కొందరిని ఉద్దేశించి “బొద్దింకలు”, “పరాన్నజీవులు” అనే పదాలను ఉపయోగించారు. అయితే ఆ వ్యాఖ్యల అసలు సందర్భాన్ని పక్కనబెట్టి, యువతను అవమానించారన్న రీతిలో సోషల్ మీడియాలో ప్రచారం చేయడం జరిగింది. దానినే ఆధారంగా తీసుకుని “కాక్రోచ్ జనతా పార్టీ” పేరుతో వ్యంగ్య రాజకీయ వేదికను నిర్మించడం జరిగింది. అసలు వ్యాఖ్యల ఉద్దేశం, సందర్భం తెలుసుకోకుండా వైరల్ ప్రచారం చేయడం మన ప్రజాస్వామ్య వ్యవస్థలో దౌర్బల్యం.
యువత నిజంగా ప్రశ్నించాల్సిన సమస్యలు ఎన్నో ఉన్నాయి. దేశంలో నిరుద్యోగం ప్రమాదకర స్థాయికి చేరుతోంది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అంచనాల ప్రకారం యువ నిరుద్యోగం అనేక రాష్ట్రాల్లో 20 శాతానికి మించి నమోదవుతోంది. ప్రతి ఏడాది లక్షలాది మంది డిగ్రీలు పూర్తిచేసినా, వారికి తగిన ఉపాధి అవకాశాలు లభించడం లేదు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలు ఆలస్యం అవుతుండగా, ప్రశ్నాపత్రాల లీకేజీలు విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయి. నీట్, యూజీసీ నెట్ వంటి పరీక్షల లీకేజీలు దేశవ్యాప్తంగా ఆగ్రహానికి దారితీశాయి.
అలాగే విద్యా, వైద్య రంగాల ప్రైవేటీకరణ కూడా తీవ్రమైన సమస్యగా మారింది. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలలు, వైద్యశాలలు బలహీనపడుతుండగా, మరోవైపు కార్పొరేట్ వ్యవస్థలు సామాన్య ప్రజలపై భారీ భారం మోపుతున్నాయి. గ్రామీణ యువతకు నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలు అందుబాటులో లేకపోవడం సామాజిక అసమానతలను పెంచుతోంది. ఇలాంటి అనేకానేక వ్యవ్థలపై సమీక్ష, చర్చ, పరిష్కారాలు జరగాల్సిన అవసరం ఉంది. ఇదే సమయంలో సోషల్ మీడియా వ్యంగ్య రాజకీయాలే ప్రధాన చర్చగా మారడం విస్మరించలేనిది. పైగా ఆలోచించాల్సిన విషయం.
భారత రాజకీయాల్లో కుటుంబ పాలన కూడా యువత ప్రశ్నించాల్సిన ముఖ్య అంశమే. జాతీయ స్థాయిలో కాంగ్రెస్లో నెహ్రూ–గాంధీ కుటుంబ ఆధిపత్యం కొనసాగుతుండగా, బీజేపీ సహా ఇతర పార్టీల్లోనూ వారసత్వ రాజకీయాలు పెరుగుతున్నాయి. రాష్ట్రాల్లో ఈ పరిస్థితి మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కుటుంబం, తెలంగాణలో కేసీఆర్ కుటుంబం, ఇతర రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీల కుటుంబ రాజకీయాలు ప్రజాస్వామ్య అవకాశాలను పరిమితం చేస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో పదవులు కొన్ని కుటుంబాలకే పరిమితం కావడం ఆరోగ్యకర రాజకీయ సంస్కృతి కాదు.
తెలంగాణ ఉద్యమం, అస్సాం విద్యార్థి ఉద్యమం, స్వాతంత్ర్య పోరాటాలు యువ శక్తి ఎంత ప్రభావవంతమో నిరూపించాయి. తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది విద్యార్థులు బలిదానాలు చేశారు. కానీ ఉద్యమ ఫలితాలను కొన్ని కుటుంబాలు, కొందరు రాజకీయ నాయకులే అనుభవిస్తూ ఉన్నారు. ఇదే పరిస్థితి దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాల్లో కనిపించింది.
డిజిటల్ యుగంలో రాజకీయాలను విశ్లేషించే తీరు పూర్తిగా మారిపోయింది. గతంలో సిద్ధాంతాలు, ఉద్యమాలు, సమస్యలపై బంద్ లు, ధర్నాలు, ఆందోళనలు, పోరాటాలు ప్రధానమైతే, ఇప్పుడు వైరల్ వీడియోలు, ట్రెండింగ్ హ్యాష్ట్యాగ్లు, మీమ్స్ రాజకీయ ప్రభావాన్ని నిర్ణయిస్తున్నాయి. “కాక్రోచ్ జనతా పార్టీ” కూడా ఈ డిజిటల్ రాజకీయ సంస్కృతిలో భాగమే. అయితే అది నిజంగా వ్యవస్థలోని లోపాలను ఎండగట్టే వేదికగా నిలవాలంటే అన్ని పార్టీల అవకాశవాదాన్ని సమానంగా ప్రశ్నించాలి. ఒక రాజకీయ వర్గానికి అనుకూలంగా, మరొక వర్గానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే అది ప్రజా ఉద్యమం కాకుండా రాజకీయ ప్రయోగంగా మిగిలిపోతుంది.
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం అత్యంత అవసరం. ప్రశ్నించని సమాజం క్రమంగా బలహీనపడుతుంది. యువత నిజంగా దేశ భవిష్యత్తు కోసం నిలబడాలంటే నిరుద్యోగం, అవినీతి, విద్యా సంక్షోభం, కుటుంబ పాలన, నేర రాజకీయాలు, ఫిరాయింపులు వంటి సామాజిక సమస్యలపై పాలకులను నిలదీయాలి. రాజకీయ పార్టీలకు డిజిటల్ సైన్యాలుగా కాకుండా ప్రజల తరఫున మాట్లాడే శక్తిగా ఎదిగినప్పుడే భారత ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది.

