వాస్తవికంగా చూస్తే వచ్చే రెండేళ్లలో పూర్తి స్థాయి “ఫ్యూచర్ సిటీ” రూపుదిద్దుకోవడం అసాధ్యం. గరిష్టంగా భూసేకరణ, ప్రధాన రహదారుల నిర్మాణం, కొన్ని పరిశ్రమలకు శంకుస్థాపనలు, ప్రారంభ మౌలిక వసతుల ఏర్పాట్లకే ప్రభుత్వం పరిమితం కావచ్చు. ఈ ప్రాజెక్టు నిజమైన విజయాన్ని నిర్ణయించేది ఎన్నికల ప్రచారాలు కాదు. దశాబ్ద కాలం పాటు కొనసాగే స్థిరమైన విధానాలు, ఆర్థిక సామర్థ్యం, పరిపాలనా కట్టుదిట్టతే. లేకపోతే “ఫ్యూచర్ సిటీ” కూడా భారత రాజకీయాల్లో మరో అసంపూర్తి కలగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త!
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన “ఫ్యూచర్ సిటీ” ప్రాజెక్టు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో, పరిపాలనా వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, నెట్-జీరో అర్బన్ మోడల్, డేటా సిటీ, హెల్త్ క్లస్టర్, బుల్లెట్ ట్రెయిన్ కనెక్టివిటీ వంటి అంశాలతో ఈ ప్రాజెక్టును ప్రభుత్వం భవిష్యత్ తెలంగాణకు ప్రతీకగా ప్రదర్శిస్తోంది. అయితే ఈ విజన్ ఎంత ఆకర్షణీయంగా ఉన్నా, వాస్తవ పరిస్థితులు మాత్రం అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. నిధుల లభ్యత, అమలు సామర్థ్యం, రాజకీయ స్థిరత్వం, పరిపాలనా ప్రాధాన్యతలు వంటి అంశాలు ఈ ప్రాజెక్టు భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.
ఒక నగరాన్ని నిర్మించడం అనేది కేవలం భూములు కేటాయించడం లేదా పెట్టుబడిదారుల సమావేశాలు నిర్వహించడం ద్వారా సాధ్యమయ్యే పని కాదు. ప్రపంచంలోని విజయవంతమైన నగరాలన్నీ దశాబ్దాల పాటు జరిగిన నిరంతర ప్రణాళిక, భారీ ప్రజా పెట్టుబడులు, ప్రైవేట్ భాగస్వామ్యం, రాజకీయ స్థిరత్వం వల్లే రూపుదిద్దుకున్నాయి. హైదరాబాద్ అభివృద్ధి కూడా అలాంటి దీర్ఘకాలిక ప్రక్రియ ఫలితమే. 1998లో అప్పటి సీఎం చంద్రబాబు సైబరాబాద్కు బీజం వేసిన తర్వాత, హైటెక్ సిటీ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు నగరం విస్తరించడానికి 25 ఏళ్లు పట్టింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైలు, ఐటీ కారిడార్లు, ప్రైవేట్ రియల్ ఎస్టేట్ విస్తరణ ఇవన్నీ కలిసి హైదరాబాద్ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాయి.
ఇప్పుడు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఫ్యూచర్ సిటీకి కూడా ఇదే స్థాయి దీర్ఘకాలిక కట్టుబాటు అవసరం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ఆర్థిక స్థితి పెద్ద సవాలుగా మారింది. రాష్ట్ర అప్పులు లక్షల కోట్లకు చేరువయ్యాయని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. సంక్షేమ పథకాల అమలుకు ప్రతి ఏడాది భారీగా నిధులు వెచ్చించాల్సి వస్తోంది. రైతు భరోసా, ఉచిత బియ్యం, విద్యుత్ సబ్సిడీలు, మహిళా సంక్షేమ పథకాలు వంటి కార్యక్రమాలు ప్రభుత్వ వ్యయాన్ని గణనీయంగా పెంచుతున్నాయి. సంక్షేమం అవసరమే అయినా, అదే సమయంలో భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులకు అవసరమైన మూలధన వ్యయం తగ్గిపోతున్నదన్న విమర్శలు ఉన్నాయి.
ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో కనీస మౌలిక వసతులే పూర్తిస్థాయిలో లేవు. రోడ్లు, తాగునీరు, విద్యుత్, కాలువ వ్యవస్థ, ప్రజా రవాణా, నివాస వసతులు, విద్యా సంస్థలు, హాస్పిటల్స్ ఇవి లేకుండా పెద్ద కంపెనీలు లేదా ప్రజలు అక్కడికి వెళ్లే పరిస్థితి ఉండదు. కేవలం 500 ఎకరాలు జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు, అధికారులకు కేటాయించడం ద్వారా నగరం రూపుదిద్దుకోదు. ప్రభుత్వం ప్రకటించిన 1,500 ఎకరాల డేటా సిటీ, హెల్త్ క్లస్టర్, ఇండస్ట్రియల్ పార్క్ వంటి ప్రతిపాదనలు ఆకర్షణీయంగానే ఉన్నా, వాటి అమలుకు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అవసరం.
ఇక్కడ మరో కీలక అంశం రాజకీయ స్థిరత్వం. భారతదేశంలో అనేక మెగా ప్రాజెక్టులు ప్రభుత్వ మార్పులతో నిలిచిపోయిన ఉదాహరణలు ఉన్నాయి. అమరావతే దీనికి స్పష్టమైన ఉదాహరణ. అమరావతి నిర్మాణానికి కేంద్ర సహాయం, ప్రపంచ బ్యాంక్ ఆసక్తి, విస్తృత భూసేకరణ ఉన్నప్పటికీ, ప్రభుత్వ మార్పు తర్వాత ప్రాజెక్టు దాదాపు ఆగిపొయింది. అలాగే పోలవరం పూర్తి కావడానికి 15 ఏళ్లు పట్టింది. ఈ అనుభవాలు పెట్టుబడిదారుల్లో సహజంగానే అప్రమత్తత పెంచుతాయి. “2029 తర్వాత కూడా ఇదే విధానాలు కొనసాగుతాయా?” అన్న సందేహం ఉంటే పెద్ద పరిశ్రమలు త్వరగా ముందుకు రావు.
ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని ప్రకటించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పార్టీ సంప్రదాయం ప్రకారం ముఖ్యమంత్రి ఎంపికను అధిష్ఠానం నిర్ణయిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ముందుగానే నాయకత్వంపై ధీమా వ్యక్తం చేయడం పార్టీలోని ఇతర వర్గాలకు అసౌకర్యం కలిగించే అవకాశం ఉంది. అంతేకాక, ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరగకుండా పరిపాలనలో స్పష్టమైన ఫలితాలు చూపించడం కూడా కీలకం. ప్రస్తుతం కొంతమంది మంత్రులు సమన్వయం లేకుండా పనిచేస్తున్నారన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మెగా ప్రాజెక్టులను సమర్థంగా ముందుకు తీసుకెళ్లడం అంత సులభం కాదు. ఈ విషయాలేవీ సీఎం రేవంత్ రెడ్డికి తెలియదనుకోలేం.
అయితే ఫ్యూచర్ సిటీ ఆలోచనను పూర్తిగా కొట్టిపారేయలేం. భవిష్యత్ పట్టణీకరణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్కు ప్రత్యామ్నాయ విస్తరణ కేంద్రాన్ని సృష్టించాల్సిన అవసరం నిజంగానే ఉంది. ఐటీ, డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, హెల్త్ టెక్నాలజీ రంగాల్లో తెలంగాణకు అవకాశాలు ఉన్నాయి. సరైన ప్రణాళిక, దశలవారీ అమలు, పారదర్శక పెట్టుబడి విధానాలు, కేంద్ర సహకారం ఉంటే ఈ ప్రాజెక్టు విజయవంతమయ్యే అవకాశం ఉంది.
అయితే వాస్తవికంగా చూస్తే వచ్చే రెండేళ్లలో పూర్తి స్థాయి “ఫ్యూచర్ సిటీ” రూపుదిద్దుకోవడం అసాధ్యం. గరిష్టంగా భూసేకరణ, ప్రధాన రహదారుల నిర్మాణం, కొద్ది పరిశ్రమలకు శంకుస్థాపనలు, ప్రారంభ మౌలిక వసతుల ఏర్పాట్లతో ప్రభుత్వం పరిమితం కావచ్చు. ఈ ప్రాజెక్టు నిజమైన విజయాన్ని నిర్ణయించేది ఎన్నికల ప్రచారాలు కాదు. దశాబ్ద కాలం పాటు కొనసాగే స్థిరమైన విధానాలు, ఆర్థిక సామర్థ్యం, పరిపాలనా కట్టుదిట్టతే. లేకపోతే “ఫ్యూచర్ సిటీ” కూడా భారత రాజకీయాల్లో మరో అసంపూర్తి కలగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త!

