బైకు బస్సు ఢీ, చెలరేగిన మంటలు
20 మంది మృతి, పలువురికి గాయాలు
మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం
విషాదాన్ని మిగిల్చిన చిన్న టేకూరు అగ్నిప్రమాదం
తక్షణ చర్యలకు ఆదేశాలు: ఎపీ సీఎం, డిప్యూటీ సీఎం
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జగన్, శర్మిల తదితరులు
సహాయక చర్యల్లో పాల్గొనండి
గద్వాల కలెక్టర్ కు తెలంగాణ సీఎం ఆదేశం
కర్నూలు బస్సు ప్రమాదంపై విచారం
కర్నూల్, అక్టోబర్ 24 (అడుగు న్యూస్):
ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు జిల్లా, కల్లూరు మండలం చిన్నటేకూరు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని కుదిపేసింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు ఒక బైక్ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి క్షణాల్లోనే బస్సు మొత్తం అగ్నికి ఆహుతైంది. ఈ దారుణ ఘటనలో 20 మంది వరకు దుర్మరణం పాలవ్వగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో చాలామంది నిద్రలో ఉండగా మంటలు వ్యాపించడంతో బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కొందరు ఎమర్జెన్సీ డోర్లు బద్దలు కొట్టి బయటపడ్డారు. అయితే మంటలు మరింత వేగంగా వ్యాపించడంతో చాలామంది బయటకు రాకుండానే మృతిచెందారు.
అగ్నిప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ, ఇది ఒక తీవ్ర విషాదం. మొదట చిన్న ప్రమాదమని భావించిన డ్రైవర్లు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ మంటలు ఒక్కసారిగా విస్తరించడంతో ప్రమాదం ఘోరరూపం దాల్చింది. డ్రైవర్లిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని తెలిపారు.
బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. వీరిలో చాలా మంది హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారున్నారు. అశ్విన్రెడ్డి (బీరంగూడ), సుబ్రమణ్యం (బహదూర్పల్లి), ప్రశాంత్, గుణసాయి (సూరారం), అర్గ బందోపాధ్యాయ్ (మియాపూర్), నవీన్కుమార్ (వనస్థలిపురం), వేణు (చింతల్), శ్రీహర్ష (నిజాంపేట్), శివ (గచ్చిబౌలి), గ్లోరియా శ్యామ్ (గచ్చిబౌలి), యువన్ శంకర్ రాజ్ (ఎల్బీనగర్), ధాత్రి, రామారెడ్డి, అమృత్కుమార్, మంగా చందన, సూర్య, ఉమాపతి, పంకజ్ తదితరుల వివరాలు లభించాయి. వీరిలో పలువురు పరారైనట్లు కొందరు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ప్రమాదం నుంచి బయటపడ్డ జయసూర్య, రామిరెడ్డి, అకీరా, వేణుగోపాల్ రెడ్డి, హారిక, సత్యనారాయణ, శ్రీలక్ష్మీ, నవీన్ కుమార్, అఖిల్, జస్మత, రమేష్, సుబ్రహ్మణ్యం తదితరులు తీవ్ర షాక్లో ఉన్నారు. ఆసుపత్రిలో ప్రస్తుతం 20 మంది చికిత్స పొందుతున్నారు. బస్సు పటాన్చెరువు నుంచి బయలుదేరి బెంగళూరుకు వెళ్తుండగా ఉల్లిందకొండ క్రాస్ వద్ద బైక్ను ఢీకొట్టింది. ఆ బైక్ బస్సు కిందకి చేరస్థి మంటలు ఒక్కసారిగా చెలరేగి బస్సు మొత్తాన్ని చుట్టేసినట్లు అధికారులు తెలిపారు.
జిల్లా కలెక్టర్ సిరి స్వయంగా ప్రమాదస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ, ఇది చాలా దారుణమైన ఘటన. బైక్ బస్సు కింద చిక్కుకోవడంతో మంటలు చెలరేగాయి. డోర్ ఓపెన్ కేబుల్ తెగిపోవడంతో ప్రయాణికులు బయటపడలేకపోయారు. ఇప్పటి వరకు 11 మృతదేహాలను వెలికితీశాం. 20 మంది సురక్షితంగా బయటపడ్డారని వివరించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయ్ పర్యటనలో ఉన్నప్పటికీ ప్రమాదం వివరాలను తెలుసుకున్న వెంటనే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి ప్రకటించి, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ, మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి నివేదిక సమర్పించాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశాం. సహాయక చర్యలు వేగంగా కొనసాగాలి అని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తంచేసి అధికారులకు తక్షణ సహాయక చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు.
వైయస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్నటేకూరు వద్ద జరిగిన ఈ బస్సు ప్రమాదం మనసు పగలగొట్టింది. చాలామంది ప్రయాణికులు సజీవదహనం కావడం అత్యంత దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు తీవ్ర సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యం అందించాలనే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రమాదానికి గల కారణాలపై ఉన్నత స్థాయి విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిలా కూడా తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం రాష్ట్ర ప్రజలను విషాదంలో ముంచేసింది. మృతుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. భద్రతా ప్రమాణాలను మరోసారి తనిఖీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పలువురు మంత్రులు, కర్నూలు జిల్లా ప్రజలు, నాయకులు, సామాజిక కార్యకర్తలు ఈ ప్రమాదాన్ని తీవ్రంగా ఖండిస్తూ, బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమాదానికి కారణమైన నిర్లక్ష్యం ఏదైనా ఉంటే దానిపై నిష్పక్షపాత విచారణ జరపాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
కర్నూలు బస్ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం
కర్నూలు జిల్లా బస్ ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతులైన వారిపై ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ, వారి కుటుంబాలకు ధైర్యం నింపాలని ప్రార్థించారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న వెంటనే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయ చర్యలు తక్షణమే చేపట్టాలని తెలంగాణ అధికారులకు సీఎం ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించిన ఆయన, ప్రమాద బాధితులకు సహాయం అందించేందుకు ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే గద్వాల్ జిల్లా కలెక్టర్, ఎస్పీ సంఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఆదేశించారు. బాధితుల చికిత్స, రక్షణ చర్యల్లో ఎలాంటి లోపం ఉండకూడదని ముఖ్యమంత్రి స్పష్టంగా తెలిపారు.

