పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మూడు దశాబ్దాలకుపైగా కొనసాగిన వామపక్ష పాలనకు ముగింపు పలికి, 2011లో అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా మార్చేశారు. గత పదిహేనేళ్లుగా బెంగాల్ రాజకీయాల్లో కేంద్రబిందువుగా నిలిచారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, అనంతరం రాజకీయ పరిణామాలు పార్టీలోపలా, బయటా మమత ఆధిపత్యానికి సవాళ్లుగా నిలుస్తున్నాయి. 58 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేసి, వేరు కుంపటి పెట్టిన తాజా పరిణామం మమతల కోవెలలో కలతలు పెంచాయి.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మూడు దశాబ్దాలకుపైగా కొనసాగిన వామపక్ష పాలనకు ముగింపు పలికి, 2011లో అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా మార్చేశారు. సామాన్య ప్రజల సమస్యలను ప్రధాన అజెండాగా తీసుకుని ఉద్యమ నాయకురాలిగా ఎదిగిన ఆమె, గత పదిహేనేళ్లుగా బెంగాల్ రాజకీయాల్లో కేంద్రబిందువుగా నిలిచారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, అనంతరం చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు పార్టీలోపలా, బయటా మమత ఆధిపత్యానికి సవాళ్లుగా నిలుస్తున్నాయి. 58 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేసి, వేరు కుంపటి పెట్టిన తాజా పరిణామం మమతల కోవెలలో కలతలు తెచ్చాయి.
బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఒకప్పుడు తిరుగులేని శక్తిగా కనిపించింది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు విస్తృత స్థాయిలో పార్టీకి మద్దతు ఉండేది. కానీ దీర్ఘకాల అధికార పాలనలో ఏర్పడిన వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు, నాయకత్వ కేంద్రీకరణ, కుటుంబ ఆధిపత్యంపై వస్తున్న విమర్శలు పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టాయి. ముఖ్యంగా ఉపాధ్యాయ నియామక కుంభకోణం, పశువుల అక్రమ రవాణా కేసులు, పార్టీ స్థానిక నేతలపై వచ్చిన ఆరోపణలు ప్రజల్లో అసంతృప్తిని పెంచాయి.
ఇటీవలి ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు సాధించలేకపోవడం పార్టీ అంతర్గత పరిస్థితులను మరింత సంక్లిష్టం చేసింది. ఎన్నికల అనంతరం కొంతమంది ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ సమావేశాలకు హాజరు తగ్గడం, కొన్ని కీలక నిర్ణయాలపై విభిన్న అభిప్రాయాలు వెలువడటం, అంతర్గత విభేదాల సంకేతాలుగా గత కొంత కాలంగా వినిపిస్తున్నాయి.
తృణమూల్ కాంగ్రెస్లో ప్రస్తుతం ఎదురవుతున్న ప్రధాన సవాల్ నాయకత్వంపై పెరుగుతున్న ప్రశ్నలు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ పాత్ర, నిర్ణయాధికార కేంద్రీకరణ, సీనియర్ నాయకులకు తగిన ప్రాధాన్యం లభించడం లేదనే విమర్శలు బలంగా మారాయి. అధికారంలో ఉన్నప్పుడు ఈ అసంతృప్తులు బహిర్గతం కాకపోయినా, ఎన్నికల ఫలితాల తర్వాత అవి స్పష్టంగా బయటపడుతున్నట్లు కనిపిస్తోంది.
మరోవైపు, భారతీయ జనతా పార్టీ బెంగాల్లో తన రాజకీయ విస్తరణకు అనుకూల పరిస్థితులను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తోంది. గత దశాబ్దంలో బెంగాల్లో బీజేపీ ఓటు శాతం గణనీయంగా పెరిగింది. 2014 లోక్సభ ఎన్నికల్లో 17 శాతం ఓట్లు సాధించిన పార్టీ, 2019 ఎన్నికల్లో 40 శాతం ఓట్ల వరకు చేరుకుంది. ఈ పెరుగుదల రాష్ట్ర రాజకీయాల్లో ద్విముఖ పోటీకి దారితీసింది. ప్రస్తుతం కూడా ప్రతిపక్షంగా బీజేపీ తన ప్రభావాన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది.
బెంగాల్ రాజకీయాల్లో సరిహద్దు భద్రత, అక్రమ వలసలు, పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర నమోదు వంటి అంశాలు తరచుగా చర్చకు వస్తుంటాయి. ఈ విషయాలపై తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర రాజకీయ పోటీ కొనసాగుతోంది. అయితే ఈ అంశాలపై రాజకీయ ఆరోపణల కంటే అధికారిక గణాంకాలు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నివేదికల ఆధారంగానే నిర్ణయాలకు రావాల్సిన అవసరం ఉంది.
పార్టీలోని విభేదాలు మరింత ముదిరితే తృణమూల్ కాంగ్రెస్కు రాజకీయంగా నష్టం కలిగే అవకాశం ఉంది. భారత రాజకీయ చరిత్రలో అధికార పార్టీలు అంతర్గత సంక్షోభాల కారణంగా బలహీనపడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మహారాష్ట్రలో శివసేన, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్, ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ వంటివెన్నో. బెంగాల్లో కూడా అలాంటి పరిస్థితులు ఏర్పడతాయా లేదా అనేది రానున్న నెలల్లో స్పష్టమవుతుంది.
అయితే మమతా బెనర్జీ రాజకీయ ప్రస్థానాన్ని తక్కువగా అంచనా వేయడం కూడా సరైంది కాదు. గతంలో ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొని ఆమె పార్టీని విజయపథంలో నడిపించారు. ప్రజల్లో వ్యక్తిగతంగా ఆమెకు ఉన్న గుర్తింపు ఇప్పటికీ తృణమూల్ కాంగ్రెస్కు ప్రధాన బలంగా ఉంది. అదే సమయంలో యువత, మధ్యతరగతి వర్గాలు, పట్టణ ఓటర్లలో ఏర్పడుతున్న కొత్త రాజకీయ ధోరణులు పార్టీకి సవాలుగా మారుతున్నాయి.
ప్రస్తుతం బెంగాల్ రాజకీయాలు కీలక మలుపులో ఉన్నాయి. ఒకవైపు అధికార పార్టీ అంతర్గత ఐక్యతను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు ప్రతిపక్షం ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడానికి ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ తన సంస్థాగత బలాన్ని పునర్నిర్మించుకుంటుందా? లేక విభేదాలు మరింత తీవ్రరూపం దాల్చుతాయా? అనే ప్రశ్నలకు సమాధానం రానున్న కాలమే చెప్పాలి.
బెంగాల్ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు కేవలం ఒక పార్టీ భవిష్యత్తుకు సంబంధించినవి మాత్రమే కావు. అవి దేశ రాజకీయ సమీకరణాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. అందువల్ల అక్కడి రాజకీయ పరిణామాలను అన్ని రాజకీయ పక్షాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

