బంగ్లాదేశ్లో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు దక్షిణాసియాలో శాంతి, భద్రతలపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. షేక్ హసీనా పదవీచ్యుతి అనంతరం ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వ హయాంలో దేశం రాజకీయ అరాచకంలోకి జారిపోయినట్లుగా కనిపిస్తోంది. ఈ అస్థిరతలోనే ఆదేశంలోని హిందూ మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న వరుస దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇవి రాజకీయ ఘర్షణలలో భాగమా? లేక అక్కడి హిందూ సముదాయాన్ని భయభ్రాంతులకు గురిచేసే ఉద్దేశపూర్వక ప్రయత్నమా? అన్న సందేహాలు కలుగుతున్నాయి.
హసీనా భారత్లో ఆశ్రయం పొందిన తరువాతే హిందువులపై దాడులు తీవ్రమయ్యాయన్న వాదన విస్తృతంగా వినిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు మూకలు రెచ్చిపోయి హత్యలు, దహనాలు, ఆలయాల ధ్వంసం, భూ కబ్జాలు చేస్తున్నాయని స్వతంత్ర నివేదికలు వెల్లడిస్తున్నాయి. తాత్కాలిక ప్రభుత్వం వీటిని ‘రాజకీయ హింస’గా కొట్టిపారేయాలని ప్రయత్నిస్తున్నా, బాధితులలో అధికశాతం హిందువులే కావడం ఈ వాదనను బలహీనపరుస్తోంది.
దీపూ చంద్రదాస్, అమృత్ మండల్ వంటి వారి క్రూరమైన, కిరాకతక హత్యలు ఆ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ ఘటనలను మతపరమైనవి కావని బంగ్లాదేశ్ ప్రభుత్వం బుకాయిస్తున్నప్పటికీ, వరుసగా అదే సముదాయానికి చెందినవారు బలవుతున్న పరిస్థితి యాదృచ్ఛికంగా కనిపించడం లేదు. తాత్కాలిక ప్రభుత్వ హయాంలోనే సుమారు 2,900కుపైగా హింసాత్మక ఘటనలు మైనారిటీలపై జరిగాయని స్వతంత్ర సంస్థల అధ్యయనాలు పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
ఈ పరిణామాలపై భారత్ స్పందించక తప్పలేదు. బంగ్లాలో మైనారిటీలపై జరుగుతున్న దాడులను విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇవి విస్మరించదగిన ఘటనలు కాదని, బాధ్యులను చట్టం ముందు నిలబెట్టాలని స్పష్టం చేసింది. భారత్–బంగ్లా సరిహద్దు పొడవునా జరుగుతున్న పరిణామాలను న్యూఢిల్లీ సునిశితంగా గమనిస్తోందని అధికార ప్రతినిధులు తెలిపారు. ఇది కేవలం ద్వైపాక్షిక అంశం మాత్రమే కాదు, దేశీయ స్థిరత్వానికి సంబంధించిన విషయం అన్న సంకేతాన్ని భారత్ స్పష్టంగా ఇచ్చింది.
అయితే ఇంత జరుగుతున్నా, అంతర్జాతీయ సమాజం ఎందుకు నిశ్శబ్దంగా ఉంది? గాజా, ఉక్రెయిన్ వంటి ప్రాంతాల్లో మానవహక్కుల ఉల్లంఘనలపై పెద్ద ఎత్తున స్పందించిన ప్రపంచం, పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో జరుగుతున్న మైనారిటీల ఊచకోతపై ఎందుకు అంతగా స్పందించడం లేదు? ఈ ద్వంద్వ వైఖరి మానవహక్కుల పరిరక్షణలోని రాజకీయ స్వార్థాలను బహిర్గతం చేస్తోంది.
భారత్లో సినీ ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ నేతలు ఈ దాడులను ఖండిస్తున్నారు. ‘పక్కనే జరుగుతున్న అన్యాయంపై మౌనం నేరంతో సమానం’ అన్న భావన సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యక్తమవుతోంది. పశ్చిమ బెంగాల్లోని రాజకీయ నాయకులు బంగ్లాదేశ్ అధికారులకు నేరుగా హెచ్చరికలు చేయడం పెల్లుబికుతోన్న ఆగ్రహానికి ప్రతిబింబం.
గత కొంతకాలంగా అంతగా కనిపించని, వినిపించని మతతత్వ రాజకీయాలు బంగ్లాలో పునరుజ్జీవం పోసుకుంటున్నాయి. కొందరు నేతలు మతతత్వాన్ని తిరిగి ప్రోత్సహిస్తూ, మైనారిటీలను బలిపశువులను చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది కేవలం దేశీయ సమస్యగా కాకుండా, భారత్ను రెచ్చగొట్టే వ్యూహంలో భాగమేనన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దక్షిణాసియాలో మతతత్వ అశాంతి సరిహద్దులు దాటుతుందన్న చరిత్రను మరచిపోలేం.
బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పష్టమైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మాటలతో కాకుండా, చర్యలతో మైనారిటీల భద్రతకు భరోసానివ్వాలి. దోషులను శిక్షించి, బాధితులకు రక్షణ కల్పించడం, ప్రజాస్వామిక మానవీయ, న్యాయబద్ధమైన, సుపరిపాలనను పునరుద్ధరించడం అత్యవసరం. ఇలాంటి ఘటనలు ఇప్పటికే అంతర్గత అత్యవసర సమస్యలతో సతమతమవుతోన్న దేశాన్ని మరింత సంక్షోభంలోకి నెడుతుంది. దేశ భద్రతకే ముప్పుగా మారుతుంది.

