జన గణనతో పాటు కులగణనపై కేంద్రం తీసుకున్న అనూహ్య నిర్ణయం రాజకీయ ఎత్తుగడే. ఇంకా చెప్పాలంటే ఎత్తుకుపై ఎత్తు. కాంగ్రెస్ గత ఎన్నికల నాటి నుంచి కుల గణనపై అదే పనిగా మాట్లాడుతోంది. కుల గణనను ఎజెండాగా చేసి, బీజేపీని ఇరుకున పెట్టాలనుకున్న కాంగ్రెస్ ఎత్తుకు పై ఎత్తుగా కుల గణనకు కేంద్రం నిర్ణయించడంతో ఇప్పుడు కాంగ్రస్ ను బీజేపీ కార్నర్ చేసినట్లయింది. స్వతంత్ర దేశంలో మొట్టమొదటి సారి తెలంగాణలో కుల గుణన చేపట్టామని చెప్పడం కేవలం క్రెడిట్ కొట్టేయడానికే తప్ప, అందులో పెద్దగా పసేమీ లేదు. పదేళ్ళ క్రితమే కర్ణాటకలో అప్పటి సిద్ధ రామయ్య ప్రభుత్వ హయాంలో వందకోట్ల రూపాయలకు పైగా ఖర్చుపెట్టి చేసిన కులగణనపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఆ నివేదిక బయటకు రాలేదు. అలాగే 2011 లో ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చుపెట్టి చేసిన కులలెక్కల చిక్కులు తేలక చివరకు కేంద్రం చేతులేత్తేసింది. కుల గణనపై ఏ పార్టీ మాట్లాడినా రాజకీయ లబ్ది పొందడమే తప్ప, అందులో ప్రజా ప్రయోజన కోణం చాలా తక్కువ.
అయితే, పహల్గాం సంఘటనకు ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వం అసాధారణ రీతిలో ప్రతిస్పందించే అవకాశాలు ఉన్నాయని అందరూ భావిస్తున్న తరుణంలో అనూహ్యంగా కేబినేట్ కులగణన నిర్ణయం తీసుకుంటుందని ఎవ్వరూ ఊహించలేదు. కాంగ్రెస్ అస్సలు ఊహించలేదు. కాకపోతే, తెలంగాణ సీఎం మాత్రం కుల గణనకు వెళ్ళడం తప్ప కేంద్రంలో బీజేపీకీ వేరే ఆప్షన్ లేదన్నారు. అదే నిజమైంది.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు అత్యధిక కాలం అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే. మరి అధికారంలో ఉన్నన్నాళ్ళూ పట్టించుకోని కాంగ్రెస్ ఇప్పుడు కుల గణన గురించి ఎందుకు మాట్లాడుతున్నదని బీజేపీ విమర్శిస్తున్నది. పదేళ్ల యూపిఎ పాలనలో కూడా కాంగ్రెస్ కు ఈ ధ్యాసే రాలేదు. అందుకే కులగణనకు నెహ్రూ వ్యతిరేకమంటూ, రిజర్వేషన్లను రాజీవ్గాంధీ లోక్సభలోనే వ్యతిరేకించారంటూ బీజేపీ కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నది. మండల్ కమిషన్ సిఫార్సులను ఇందిరాగాంధీయే తొక్కిపట్టారని ఆరోపణలూ చేసింది. దేశంలో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎప్పుడూ కులగణన గురించి ఆలోచన చేయలేదని బీజేపీ అంటోంది. నిజానికి బీజేపీ ప్రశ్నలకు కాంగ్రెస్ వద్ద జవాబు లేదు.
దేశంలోనే మొట్టమొదటి సారిగా, ఎంతో పకడ్బందీగా తెలంగాణలో కులగణనను విజయవంతంగా పూర్తిచేశామనీ, దేశానికి తామే రోల్ మోడల్ అని రేవంత్రెడ్డి పదేపదే చెబుతున్నారు. కాంగ్రెస్ కు ఆ రోల్ లేకుండా చేయడమే బీజేపీ ఎత్తుగడ. కాంగ్రెస్ బీజేపీపై ఎక్కుపెట్టిన కులగణన అస్త్రాన్ని తిరిగి ఆ పార్టీకే బీజేపీ ఎక్కుపెట్టింది.
అసలు ప్రజలే కాదు రాజకీయ పార్టీలు కూడా సిగ్గు పడాల్సిన అంశాలేంటంటే… 1931 తర్వాత కులాల లెక్కలే జరగకపోవడం. స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్ళవుతున్నది. కానీ, విస్మరించలేని కుల వ్యవస్థలో ఉన్న మన దేశ జనాభాలో ఏయే కులాల జనాభా ఎంత? వారి సామాజిక, ఆర్థిక వివరాలేవీ లేకుండానే పరిపాలన సాగుతుండటం. అభివ్రుద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతుండటం. బడ్జెట్ లెక్కలు వేసుకుని ఖర్చు చేస్తుండటం, అప్పులు చేస్తుండటం. విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించుకుంటుండటం. రిజర్వేష్లను అమలు చేసుకోవడం. ఎన్నికలు నిర్వహించుకుని, ప్రభుత్వాలను ఏలడం. మరి ఇంతకాలంగా అన్ని రకాల అవకాశాలు ఎవరి పరం అవుతున్నాయి? ఏ అటవిక న్యాయం అమలవుతున్నది? ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ మేడి పండు రూపం ఇదేనా? ఎంత సిగ్గు చేటు. ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే భవిష్యత్ తరాల పరిస్థితి ఏంటి?
జనాభా. కుల గణనతోపాటు, విద్య, ఉద్యోగ, ఆస్తుల వివరాలను కూడా పక్కాగా సేకరిస్తే, ఇంతకాలంగా ఏయే కులాలు ఏ మేరకు లాభపడ్డాయనేది బయట పడుతుంది. సామాజిక, ఆర్థిక స్థితిగతులు కూడా తెలిసి వస్తాయి. కేవలం కుల జనాభాను బట్టి కాకుండా, వారి ఆర్థిక, సామాజిక స్థితి గతులను బట్టి ఉద్యోగాలు, రాజకీయ అవకాశాలు, పదవులు ఇవ్వాలన్న దానిపై కూడా స్పష్టత ఏర్పడుతుంది. కేవలం కులం, కుల జనాభా ఆధారంగానే అయితే విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్లే తప్ప రాజకీయ అవకాశాలు వస్తాయనుకోలేం. రాజకీయ అవకాశాలు కూడా కల్పిస్తే ముందుగా ఇప్పుడున్న రాజకీయ పార్టీల నాయకుల పదవులే ఊడుతాయి. రాజకీయంగా సంక్షోభాలు, ప్రకంపనలు తప్పవేమో? ఇంత కాలంగా పదవులు అనుభవిస్తున్న కులాల మూలాలను పెకిలించక తప్పని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కుల గణనకు పచ్చ జెండా ఊపుతున్న నేతలు రేపు తమ స్థానాలను, అవకాశాలను కోల్పోవడానికి సిద్ధపడతారా?
కుల గణన తర్వాత అటు రిజర్వేషన్లపైనే గాక రాజకీయంగా కూడా ఏకాభిప్రాయాన్ని సాధించాల్సి ఉంటుంది. నిజానికి రాజకీయ రిజర్వేషన్లు లేకుండా, రాకుండా విద్యా, ఉద్యోగ, ఉపాధి రిజర్వేషన్లకు అర్థం లేదు. సమస్యలు వస్తాయని పరిష్కారాలు మానేయడం కూడా సరికాదు. ఎక్కడో ఓ దగ్గర మొదలు కావాల్సిందే. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కాదు. ఒకసారి కుల గణన చేపడితే, దాన్ని కొనసాగించాల్సి రావడం వల్ల భవిష్యత్ తరాల వారికి కూడా ఆ ఫలాలు సమంగా, సమానంగా అందే అవకాశం ఉంటుంది.

