ప్రపంచ ఆర్థిక, రాజకీయ పరిణామాలు భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల, రూపాయి మారకం విలువ పతనం, వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు మన దేశమేగాక, ప్రపంచ ఆర్థిక ప్రగతికి ప్రధాన అడ్డంకులుగా మారుతున్నాయి. ఈ విపరిణామాలు ద్రవ్యోల్బణాన్ని ఆందోళనకరంగా మారున్నాయి.
పశ్చిమాసియా ప్రపంచ ఇంధన సరఫరాకు కీలక కేంద్రం. అక్కడ ఉత్పత్తి అయ్యే ముడి చమురు, సహజ వాయువుల దిగుమతులపైనే ప్రపంచ దేశాల మనుగడ కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్న యుద్ధం చమురు ఉత్పత్తి, సరఫరాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. దెబ్బతీశాయి. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయటం వల్ల అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు ఒక్కసారిగా ఎగసాయి. ఈ ప్రభావం భారత్పై మరింత తీవ్రంగా పడుతోంది. దేశ ఇంధన అవసరాల్లో 90 శాతం దిగుమతులపైనే ఆధారపడి ఉంది.
చమురు ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ఈ ప్రభావం అన్ని రంగాలపై కనిపిస్తోంది. వ్యవసాయం నుండి పరిశ్రమల వరకు, వినియోగ వస్తువుల నుండి సేవల వరకు ప్రతి రంగంలో ధరలు పెరుగుతున్నాయి. ఫలితంగా ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతోంది. ఇటీవలి అంచనాల ప్రకారం ద్రవ్యోల్బణం 3.9% నుంచి 4.6% చేరుకునే అవకాశం ఉంది.
ఇంకా రూపాయి మారకం విలువ పతనం అత్యంత కీలకం. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ఈ ఏడాది ప్రారంభం నుండి 4% వరకు పడిపోయింది. రూపాయి విలువ చరిత్రలోనే కనిష్ఠ స్థాయికి చేరి 94 మార్కును దాటడం గమనార్హం. రూపాయి విలువ పడిపోవడం వల్ల దిగుమతులు మరింత ఖరీదవుతాయి. చమురు వంటి కీలక వస్తువుల దిగుమతులు ఖరీదవడం ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచుతుంది.
ఈ పరిస్థితుల్లో దేశ ఆర్థిక వృద్ధి రేటు కూడా ప్రభావితం అవుతోంది. అంతర్జాతీయ ఆర్థిక సంస్థ గోల్డ్ మ్యాన్ సాచ్స్ ఇటీవల భారత జీడీపీ వృద్ధి అంచనాలను వరుసగా తగ్గించింది. 2026లో మొదట 7 శాతంగా అంచనా వేసిన వృద్ధిని, ఈ నెల 13న 6.5 శాతానికి, ఆ తర్వాత 5.9 శాతానికి తగ్గించడం పరిస్థితి తీవ్రతను ప్రతిబింబిస్తోంది. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే పడిన కోతలు ఆర్థిక అస్థిరతను సూచిస్తున్నాయి.
ద్రవ్యోల్బణం పెరిగితే, వడ్డీ రేట్ల పెంపు కూడా అనివార్యమవుతుంది. రిజర్వు బ్యాంకు ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు కఠిన ద్రవ్య విధానాన్ని అనుసరించాల్సి వస్తుంది. రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. వడ్డీ రేట్లు పెరిగితే రుణాల ఖర్చు పెరుగుతుంది. దీని వల్ల వ్యాపారాలు, పెట్టుబడులు తగ్గి, ఆర్థిక కార్యకలాపాలు మందగిస్తాయి.
ఇక గ్యాస్ కొరత కూడా మరో పెద్ద సమస్యగా మారుతోంది. గ్యాస్ సరఫరా తగ్గిపోవడంతో హోటళ్లు, చిన్న వ్యాపారాలు, పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఎరువుల తయారీపై కూడా ప్రభావం పడుతోంది. ఇది వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావాన్ని చూపే ప్రమాదం. తద్వారా ఆహార ధరలు పెరిగే అవకాశమూ ఉంది.
కరెంట్ అకౌంట్ లోటు కూడా పెరుగుతున్నది. ఇది జీడీపీలో 2 శాతానికి చేరుకునే అవకాశం ఉందని అంచనా. దీని వల్ల విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతుంది. విదేశీ రుణభారం కూడా అధికమవుతుంది. దీని ప్రభావం దీర్ఘకాలికంగా ఆర్థిక స్థిరత్వంపై పడుతుంది.
మొత్తంగా ప్రస్తుత పరిస్థితి సంక్లిష్ట ఆర్థిక సంక్షోభానికి సంకేతం. యుద్ధ ఉద్రిక్తతలు, ఇంధన కొరత, ధరల పెరుగుదల, రూపాయి పతనం పరస్పరం అనుసంధాన అంశాలు. ఈ పరిణామాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి పెట్టాలి. దిగుమతులపై ఆధారాన్ని తగ్గించుకోవాలి. దేశీయ ఉత్పత్తిని పెంచితేనే, ఈ సంక్షోభాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం, ఆర్థిక వృద్ధిని కొనసాగించడమే ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ ముందున్న అతిపెద్ద సవాల్!

