సారయ్య ఫిర్యాదు సారమేంటి?
బస్వరాజు రాజకీయ బలమేంటి?
ASSEMBLY|అసెంబ్లీ జరుగుతండగానే తెగువేంటి?
సారయ్య సాహసం వెనుక ఉన్నదెవరు?
ఆ ‘ఆదృశ్య ‘హస్తం’ ఎవరిది?
అధిష్టాన పెద్దల ప్రాపకమా?
WARANGAL EAST|‘తూర్పు’లో తన పూర్వ వైభవ పాకులాటా?
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తప్పుడు అట్రాసిటీ కేసుల్లో రాజకీయ ప్రమేయం, కొందరు పోలీసుల దాష్టీకంపై మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య నేరుగా డీజీపీకే ఫిర్యాదు చేయడం సంచలనమైంది. అయితే, సాదాసీదా నేత సారయ్య ఈ సాహసం వెనుక ఎవరున్నారు? ఆ ’ఆదృశ్య ‘హస్తం’ ఎవరిది? అధిష్టానం పెద్దల ఆశీస్సులేమైనా ఉన్నాయా? లేక ‘తూర్పు’లో తన పూర్వ వైభవం కోసం పాకులాడుతున్నారా? రాజకీయ ‘ఎత్తు’ పల్లాల్లో సారయ్య తన ‘తూర్పు’ సీటును కోల్పోయారు. ఇప్పుడు దాన్ని తిగిరి పొందే ‘ఎత్తు’గడల్లో ఉన్నారా? అందుకే ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, అమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి దంపతులను అంటే ‘కొండ’లను ఢీ కొంటున్నారా?
వరంగల్, జనవరి 3 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
తెలంగాణ రాజకీయాల్లో సామాజిక, రాజకీయ, అధికార సమీకరణలు మారుతున్నాయి. పోలీసు, రాజకీయ సంబంధాలు ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. పోలీసు పోస్టింగుల్లో రాజకీయ ప్రమేయంలాగే, పోలీసింగ్ లోనూ రాజకీయ క్రీ(నీ)డ అనివార్యమైంది. గత ప్రభుత్వం నుండే ఇది తీవ్రమైంది. రాజకీయ నేతల సిఫారుసులతో పోస్టింగుకొచ్చిన పోలీసులు, వారికనుకూలంగా పని చేయడం ‘మామూలైంది’. మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య డీజీపీకి చేసిన ఫిర్యాదులోనూ అదే చేశారు. ‘గతంలో వరంగల్ తూర్పులో పనిచేసిన ఒక ఏసీపీ, మట్వాడా స్టేషన్ లో పనిచేసిన ఒక సీఐపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో వారిని సస్పెండ్ చేశారు. తాజాగా ఇదే తరహాలో ఇదే నియోజకవర్గంలోని ఏజే మిల్స్ కాలనీ, ఇంతేజార్గంజ్, మట్వాడా అనే మూడు పోలీస్ స్టేషన్లలో నమోదైన అట్రాసిటీ కేసులు కూడా ఇదే కోవలోకి వస్తాయ’ని సారయ్య డీజీపీకిచ్చిన వినతి పత్రంలో ఆరోపించారు. పైగా ఒక ఉన్నత పోలీసు అధికారితో తిరిగి విచారణ జరిపించాలని అభ్యర్థించారు. కొండా దంపతుల రాజకీయ ఆధిపత్యం కోసం, వారి ప్రోద్బలంతో అట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నారనేది సారయ్య ఫిర్యాదు సారాంశం. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా, అదీ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ నేరుగా డీజీపీకే ఫిర్యాదు చేయడం ద్వారా, జిల్లా స్థాయి శాఖాపరమైన సమస్యను, రాష్ట్ర స్థాయిలో చర్చగా మార్చారు.
అయితే సాదాసీదా నాయకుడైన సారయ్య ఫిర్యాదుతో ‘కొండ’ను ఢీ కొంటున్నారా? రాజకీయంగా అమీతుమీకి సిద్ధపడ్డారా? అసలు కారణాలేంటి? దీనికి వెనుక శక్తులెవరు? ఈ చర్యల పర్యవసనాలు ఎలా ఉండబోతున్నాయి? అనే ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమవుతున్నాయి.
ఫిర్యాదు సారయ్య వ్యక్తిగతమైనా, ఒక్క నియోజకవర్గానికే పరిమితమైన గొడవగా మాత్రమే చూడలేం. కాంగ్రెస్లో అంతర్గతంగా కొనసాగుతున్న నాయకత్వ పోటీ. పాత, కొత్తల మధ్య కొట్లాట. పోలీసు, రాజకీయ జోక్యాలతో అడుగంటుతున్న ప్రజాస్వామిక విలువలు, సామాన్య ప్రజల సమస్యలుగా పరిగణించాల్సి ఉంటుంది.
సారయ్య వ్యక్తిగతంగానూ, పార్టీగతంగానూ వ్యూహాత్మకంగానే ఈ ఎత్తుగడ వేసినట్లుగా అర్థమవుతోంది. నియోజకవర్గంలో తన ఉనికిని చాటుకోవడం, పూర్వ వైభవాన్ని తిరిగి పొందడం ఆయనకు అనివార్యం. ఆయన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ తోనే మొదలు పెట్టారు. వరంగల్ నుండే 2009 వరకు వరసగా మూడుసార్లు గెలిచారు. దక్షిణ భారత దేశంలో మొట్టమొదటి రజక ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. 2010-14 మధ్య బీసీ సంక్షేమ మంత్రిగా పని చేశారు. 2014లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కొండా సురేఖ చేతిలో ఓడిపోయారు. 2016 ఫిబ్రవరి 23న బీఆర్ఎస్ లో చేరారు. 2020 నవంబర్ 18న ఎమ్మెల్సీ అయ్యారు. అయితే మారిన రాజకీయ సమీకరణల్లో కొండా సురేఖ కాంగ్రెస్ లో చేరి, తూర్పు నుండే 2023లో ఎమ్మెల్యే గా గెలిచి మంత్రి అయ్యారు. అయితే, 2024 జులై 5న సారయ్య తిరిగి కాంగ్రెస్ లో చేరారు.
సారయ్యకు ఇదే వరంగల్ తూర్పు నియోజకవర్గం కార్యక్షేత్రం కావడంతో తన ఉనికి కోసం, పూర్వ వైభవం కోసం పని చేయాల్సిన అనివార్యతలో పడ్డారు. తనపై, తన వర్గంపై పెరుగుతున్న కేసులు రాజకీయంగా తనను అణిచివేయాలనే ప్రయత్నమేనని సారయ్య భావిస్తున్నారని ఆయన చర్యలు సూచిస్తున్నాయి. అలాగే కొండా దంపతుల రాజకీయ ఆధిపత్యానికి బ్రేకులు వేయడం. స్థానికంగా పోలీసు వ్యవస్థ కొండా చెప్పినట్లే చేస్తోందన్న భావనను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా, వారిపై తన నైతిక ఆధిక్యతను చాటుకోవడం. తన వర్గానికి తానున్నాననే భరోసానివ్వడం, నియోజకవర్గంలోని పరిస్థితులను పట్టించుకోకపోతే ఆ సమస్యలు పెద్దవవుతాయనే సంకేతాలివ్వడం వంటి ప్రయోజనాల ఎత్తుగడలు సారయ్య ఫిర్యాదులో కనిపిస్తున్నాయి.
ఈ వివాదాల వల్ల రాజకీయంగా, కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు బహిర్గతమవుతున్నాయి. పార్టీ బలహీనపడి, విపక్షాలకు ఆయుధంగా మారి అవి బలపడవచ్చు. పోలీసు వ్యవస్థపై రాజకీయ ఒత్తిళ్లు, ఆరోపణలు పెరిగితే క్షేత్రస్థాయిలో అధికారుల పనితీరు మీద ప్రభావం పడే అవకాశం ఉంది. అట్రాసిటీ కేసుల తప్పుడు నమోదు, దర్యాప్తు, వాటి విశ్వసనీయతపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉంది. ఇది పార్టీలో రెండు వర్గాల వైషమ్యాలకు దారితీస్తుంది. కాబట్టి, బస్వరాజు సారయ్య ఫిర్యాదులో నిజాలుంటే, వాటిపై నిష్పక్షపాత విచారణ జరగాలి. అదే విధంగా, రాజకీయ ఆధిపత్యం కోసం పరిపాలనా యంత్రాంగాన్ని వాడుకున్నారన్న ఆరోపణలు రుజువైతే, బాధ్యత వహించాల్సింది కూడా రాజకీయ నాయకులే. ఇదే సమయంలో సారయ్య కూడా సంయమనం పాటించాల్సింది. నియోజకవర్గం, పార్టీ, ప్రభుత్వ అంతర్గత వివాదాలను అంతర్గతంగానే పరిష్కరించుకునే ప్రయత్నం చేసి ఉండాల్సింది. రచ్చకెక్కడం రాజకీయ ప్రయోజనాలకు బాగుంటుందేమోకానీ, ప్రజాప్రయోజనాలను దెబ్బ తీస్తుంది.
ఇక బస్వరాజు సారయ్య నేరుగా డీజీపీకే ఫిర్యాదు చేయడం వ్యక్తిగత నిరసన మాత్రమే కాదు, అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ పాలన, పోలీసుల పనితీరు వైఫల్యాలకు హెచ్చరిక.
ఇది ఎక్కడికి దారి తీస్తుందన్నది ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, పార్టీ చూపే పరిపక్వతపై, ఇరువర్గాల సంయమనంపై ఆధారపడి ఉంటుంది.

