-ఆదికవి పాల్కురికి సోమనాథుడి సాహిత్యం విశ్వవ్యాప్తం
-ఘనంగా సోమనాథ కళా పీఠం పురస్కార ప్రదానోత్సవం

పాలకుర్తి, డిసెంబర్ 31(అడుగు న్యూస్):తెలంగాణ ఆదికవి, బహుభాషా కోవిదుడు. పాల్కురికి సోమనాథుడు రచించిన ‘బసవపురాణం’ బహుజనుల జీవన తత్వాన్ని ప్రతిబింబించే మహత్తర పురాణమని శ్రీలేఖ సాహితీ సంస్థ అధ్యక్షుడు డా. టి. శ్రీరంగ స్వామి అన్నారు. సోమనాథ కళా పీఠం ఆధ్వర్యంలో పాలకుర్తి సిద్ధార్థ విద్యాలయంలో బుధవారం నిర్వహించిన పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. కన్నుల పండువగా జరిగిన ఈ కార్యక్రమానికి పీఠం అధ్యక్షుడు డా. రాపోలు సత్యనారాయణ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా శ్రీరంగ స్వామి మాట్లాడుతూ, 12వ శతాబ్దానికి చెందిన గొప్ప తెలుగు కవిగా, విప్లవాత్మక రచయితగా పాల్కురికి సోమనాథుడు చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. తెలుగు, కన్నడ, సంస్కృతం, మరాఠీ, తమిళ భాషల్లో అపార పాండిత్యం సంపాదించిన సోమనాథుడు ‘బసవపురాణం’, ‘పండితారాధ్య చరిత్ర’ వంటి తన రచనల ద్వారా వీరశైవ మత వ్యాప్తికి విశేషంగా కృషి చేశారన్నారు. ప్రజల భాషలో రచనలు చేసి తెలుగు సాహిత్యంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని కొనియాడారు. వర్ణ వ్యవస్థను, కఠిన ఆచారాలను వ్యతిరేకిస్తూ భక్తి మార్గం ద్వారా సమానత్వాన్ని బోధించిన కవిగా సోమనాథుడు నిలిచారని చెప్పారు. భక్తిని సామాజిక సమానత్వంతో మేళవించి ప్రజల హృదయాలకు చేరువ చేసిన విప్లవ కవి, రచయితగా ఆయన పాత్ర అపూర్వమని అన్నారు. ఈ ప్రాంత మట్టి పరిమళంలోనే సోమనాథుడి తత్వం నిండి ఉందని, ఆ తత్వాన్ని అందిపుచ్చుకుంటూ యువత సాహిత్య రంగంలో ముందుకు సాగుతోందని ఆనందం వ్యక్తం చేశారు. పాలకుర్తి ప్రాంతంలో సోమనాథుడి స్పూర్తితో ఎన్నో బహుజన, సామాజిక, సమానత్వ పోరాటాలు జరిగాయని గుర్తు చేశారు.

పురస్కారాల ప్రదానం
అనంతరం సోమనాథ కళా పీఠం పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. సోమనాథ సాహిత్య పురస్కారాన్ని డా. దివాకర్ల రాజేశ్వరికి, సోమనాథ సామాజిక శోధన పురస్కారాన్ని డా. పండితారాధ్యుల సీతకు, సోమనాథ రంగస్థల పురస్కారాన్ని మోహన్ సేనాపతికి అందించారు. పందిళ్ల శేఖర్ బాబు రాజయ్య శాస్త్రి స్వచ్ఛంద భాషా సేవా పురస్కారాన్ని కోడిహల్లి మురళీమోహన్కు, వీరమనేని చలపతిరావు సాహిత్య పురస్కారాన్ని డా. చెన్నమనేని పద్మకు, బండారు తమ్మయ్య సాహిత్య పురస్కారాన్ని డా. దామెర వెంకట సూర్యారావుకు ప్రదానం చేశారు. అలాగే డా. రాపోలు సోమయ్య ప్రతిభా పురస్కారాన్ని బొడిగె సూర్య ప్రకాష్కు, ‘పద్య ప్రవాహ’ బిరుదును డా. కె. బాలస్వామికి అందించి ఘనంగా సన్మానించారు.

పలు గ్రంథాల ఆవిష్కరణ
ఈ కార్యక్రమంలో భాగంగా డా. సత్తెనపల్లి బాబు రచించిన ‘వీరశైవ సాహిత్యం–సామాజిక దృక్పథం’, డా. కె. బాలస్వామి రచించిన ‘ఓం నమః శివాయ’ గ్రంథాలని ప్రముఖులు ఆవిష్కరించి సాహితీ వేత్తలకు అందజేశారు. ఈ గ్రంథాలు వీరశైవ సాహిత్యాన్ని సామాజిక కోణంలో విశ్లేషిస్తూ నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయని వక్తలు పేర్కొన్నారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
సాంస్కృతిక కార్యక్రమాలు సభకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాలకుర్తి మండలం గూడూరుకు చెందిన కీ.శే. వైట్ల లక్ష్మీపతి మనుమరాలు కుమారి స్నిషిక వైట్ల, సిద్ధార్థ విద్యాలయ విద్యార్థిని పెందోట శ్రేష్టల కూచిపూడి స్వాగత నృత్యం సభికులను అలరించాయి. విద్యార్థినులు పఠించిన సోమనాథుని పద్యాలు, వారు ప్రదర్శించిన జానపద నృత్యాలు సభను ఉత్సాహభరితంగా మార్చాయి.

ఈ కార్యక్రమంలో బసవకృప పత్రిక సంపాదకుడు ప్రొఫెసర్ ఆవుటి జగదీష్, తెలంగాణ హైకోర్టు న్యాయవాది హేరూర్ విజయకుమార్, శోభ దంపతులు, దేవస్థాన ఈఓ భాగం లక్ష్మీ ప్రసన్న, వీరశైవ లింగాయత్ రాష్ట్ర నాయకుడు సంకటాల సోమేశ్వర్, పోతన సాహిత్య కళా వేదిక అధ్యక్షుడు మాన్యపు భుజేందర్, దేవస్థానం మాజీ చైర్మన్ ఎ. సోమేశ్వర్ రావు పాల్గొన్నారు. అలాగే సోమనాథ కళా పీఠం ఉపాధ్యక్షుడు, ‘అడుగు’ డిజిటల్ మీడియా చీఫ్ ఎడిటర్ డా. మార్గం లక్ష్మీనారాయణ, కార్యదర్శి ఇమ్మడి దామోదర్, వీరమనేని వేంకటేశ్వర రావు, సంయుక్త కార్యదర్శులు జక్కుల రవీందర్, మామిండ్ల రమేష్ రాజా, కోశాధికారి రాపాక విజయ్, కార్యవర్గ సభ్యులు రాపాక రమేష్, బజ్జూరి వేణుగోపాల్, డా. రాపోలు వెంకటేశ్వర్లు, గుమ్మడిరాజుల సాంబయ్య, మెరుగు మధుసూదన్, గూడూరు లెనిన్, మార్గం సాయి సందేశ్ తేజ పాల్గొన్నారు. సిద్ధార్థ విద్యాలయం కరస్పాండెంట్ జక్కుల ఊర్మిళ, ఉపాధ్యాయులు జీవంజి దామోదర్, బుర్రి జయలక్ష్మి, విద్యార్థినీ విద్యార్థులు, సాహిత్యాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

