రాష్ట్రపతి, గవర్నర్ల దగ్గర బిల్లుల పెండింగ్ వ్యవహారంలో సుప్రీం కోర్టు వ్యాఖ్యలు సంచలనంగా ఉన్నా, తీర్పు మాత్రం రాజ్యాంగానికి లోబడే కనిపిస్తున్నాయి. నిర్ణీత గడువులోగా ఆమోదించకపోతే అవి ఆమోదం పొందినట్లేనన్న వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్లే. అయితే గడువు ఉండాలన్న నిర్ణయం తీసుకోవాలన్నా, రాజ్యాంగాన్ని సవరించాలన్నా, అది పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. రాష్ట్రపతి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా తేలింది కూడా ఏమీ లేదు. ఫైనల్ గా బంతి పార్లమెంటులోనే పడింది. గవర్నర్ల బిల్లు పెండింగ్ వ్యవహారం పెండింగులోనే పడింది.
మార్గం-అడుగు, డా. మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్
రాష్ట్రపతి, గవర్నర్ల దగ్గర బిల్లుల పెండింగ్ వ్యవహారంలో సుప్రీం కోర్టు వ్యాఖ్యలు సంచలనంగా ఉన్నా, తీర్పు మాత్రం రాజ్యాంగానికి లోబడే కనిపిస్తున్నాయి. నిర్ణీత గడువులోగా ఆమోదించకపోతే అవి ఆమోదం పొందినట్లేనన్న వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్లే. అయితే గడువు ఉండాలన్న నిర్ణయం తీసుకోవాలన్నా, రాజ్యాంగాన్ని సవరించాలన్నా, అది పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. రాష్ట్రపతి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా తేలింది కూడా ఏమీ లేదు. ఫైనల్ గా బంతి పార్లమెంటులోనే పడింది. గవర్నర్ల బిల్లు పెండింగ్ వ్యవహారం పెండింగులోనే పడింది.
పదవీ విరమణ పొందుతున్న సమయంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ బుధ, గురు వారాల్లో రెండు రాజ్యాంగ ధర్మాసనాలకు నేతృత్వం వహించి సంచలన తీర్పులిచ్చారు. రాష్ట్రపతి న్యాయ సలహా కోరిన అంశంపై గురువారం ఏకాభిప్రాయంతో ఇచ్చిన తీర్పూ సంచలనమే. తమిళనాడులో గవర్నర్, పలు బిల్లులను ఆమోదించకుండా తొక్కిపెడుతుండటంతో అక్కడి ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. సహేతుకమైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు గవర్నర్ను ఆదేశించింది. బిల్లులను తొక్కిపట్టే విధానాన్ని తప్పుబట్టింది. అయినా సరే, గవర్నర్ మాత్రం బిల్లులను ఆమోదించలేదు. దీంతో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ద్విసభ్య బెంచ్ ఈ ఏడాది ఏప్రిల్ 8న గవర్నర్ రాజ్యాంగ విధుల్లో విఫలయ్యారని మండిపడింది. బిల్లులు తిప్పిపంపకుండా దగ్గర పెట్టుకోవడం కుదరదని చెప్పింది. మళ్లీ శాసనసభ ఆమోదిస్తే గవర్నర్ ఆమోదించాల్సిందేనని స్పష్టం చేసింది. నిర్ణీత గడువులో గవర్నర్ బిల్లులను ఆమోదించకపోతే, అవి ఆమోదం పొందినట్లుగా పరిగణిస్తున్నట్లు తెలిపింది.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మే 13న రాష్ట్రపతి ద్వారా సుప్రీంకోర్టును 14 ప్రశ్నలతో న్యాయ సలహా కోరింది. వాటికి సుప్రీంకోర్టు గురువారం సమాధానం ఇచ్చింది. వాదనల సమయంలో ఏప్రిల్ 8 నాటి తీర్పును తోసిపుచ్చే ఉద్దేశం లేదని ప్రధాన న్యాయమూర్తి పదేపదే చెప్పారు. మరో తీర్పును తోసిపుచ్చేందుకు రాష్ట్రపతి ఆర్టికల్ 143 కింద సలహా కోరడాన్ని ఉపకరణంగా వాడటం కుదరదని పేర్కొంది. ప్రధానంగా బెంగాల్, తమిళనాడు, తెలంగాణల్లో ఇలాంటి పరిస్థితులను చూశాం.
అయితే రాష్ట్రపతి, గవర్నర్లకు బిల్లుల ఆమోదంలో గడువు విధించడం తగదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇటీవలే తేల్చిచెప్పింది. విచక్షణతో వ్యవహరించవచ్చంది. అటువంటి సమయంలో సహేతుకమైన సమయంలో నిర్ణయం తీసుకోవా లని గవర్నర్ను న్యాయస్థానం ఆదేశించవచ్చని చెప్పింది.ఈ తీర్పుతో ఇప్పుడు గవర్నర్ల వద్ద బిల్లులు పెండింగ్లో ఉన్నా ప్రశ్నించే అవకాశం లేకుండా పోయింది. అలాగే బిల్లులను సకాలంలో పంపాలన్న నిబంధన లేకపోతే వారు రాష్ట్ర ప్రభుత్వాలపై పెత్తనం చెలాయిస్తారని తమిళనాడు, బెంగాల్ తదితర రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సుప్రీం తీర్పుపై తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. గవర్నర్లకు గడువు ఉండాలని, అభిప్రాయపడ్డారు. అవసరమైతే రాజ్యాంగ సవరణ చేయాలన్నారు.
గవర్నర్కు రాజ్యాంగపరంగా మూడు ఆప్షన్లు ఉంటాయని సుప్రీంకోర్టు తెలిపింది. ఆమోదించడం లేదా సహేతుక కారణం చెప్పి బిల్లును రిజర్వులో పెట్టడం లేదా రాష్ట్రపతికి పంపడం చేయాలి. ఒకవేళ బిల్లును తిరస్కరించి తిరిగి అసెంబ్లీకి పంపాలి. అప్పుడు శాసనసభ తిరిగి అదే బిల్లును పంపితే, ఆమోదించాలి. కానీ చాలా సందర్భాల్లో అలా జరగడం లేదు. తమిళనాడు గవర్నర్ రవి నిబంధనలను పట్టించుకోలేదు. అయితే, రాజ్యాంగంలోని 200 నిబంధన కింద గవర్నర్ విచక్షణాధికారాన్ని ఉపయోగిస్తారన్నది ధర్మాసనం అభిప్రాయం. అలాంటి సమయాల్లో మంత్రి మండలి సలహా ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం లేదు. 361 అధికరణ కింద వారికి రక్షణ కవచం ఉన్నప్పటికీ సుదీర్ఘమైన ఆలస్యం జరిగినప్పుడు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయవచ్చని తెలిపింది.
తన పరిశీలనకు వచ్చిన ప్రతి బిల్లుపై రాష్ట్రపతి రాజ్యాగంలోని 143వ అధికరణం కింద సుప్రీంకోర్టు సలహా కోరనవసరం లేదు. గవర్నర్లు నిరవధికంగా ఒక బిల్లును తమ వద్ద ఉంచుకోరాదనేదే ప్రధానం. అందువల్ల పరిమితమైన న్యాయ సవిూక్ష ఉండవచ్చని రాజ్యాంగ ధర్మాసనం తన ఏకగ్రీవ తీర్పులో అభిప్రాయపడింది. డెడ్లైన్ పెట్టి, ఆలోగా ఆమోదం ఇవ్వకపోతే లభించినట్లుగానే భావించడం రాజ్యాంగంలోని అధికారాల విభజన సూత్రానికి భంగం కలిగిస్తుందని తెలిపింది.
ఇకిప్పుడు గవర్నర్ల వద్ద బిల్లుల పెండింగ్ ఎంతకాలమనేదే సమస్య. దానికి కూడా పరిమిత కాలం ఉండకపోతే ఎలా? అందుకే పార్లమెంట్ చర్చించాలి. అవసరమైతే రాజ్యాంగాన్ని సవరించాలి.

