Tuesday, April 14, 2026
28.7 C
Hyderabad

రైతన్నను ఆదుకుంటేనే మనకు అన్నం!|EDITORIAL

తల్లి కంటే భూమి తల్లిని ఎక్కువగా పూజిస్తాడు. విత్తనాన్ని సజీవంగా చూస్తాడు. వానకు ఎదురేగుతాడు. చేను, చెలకా, మొలకలను తన సొంత పిల్లలకంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. అందరికీ అన్నం పెడతాడు. ఆ అన్నం కోసమే ఇప్పుడు పరితపిస్తున్నాడు. అందరినీ ఆదుకునేది ఆయనే, కానీ, ఆయన్నే ఆదుకునే వారు లేకుండా పోతున్నారు. అందరికీ జీవం పోసేది ఆయనే, కానీ, ఆయనే తన ప్రాణం తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోంది? ఎప్పుడూ అనావృష్టి. అయితే, అతివృష్టి, మొత్తానికి రైతుది వ్యష్టి కష్టం.
మన దేశం వ్యవసాయక దేశం. ఇప్పటికీ అత్యధిక ప్రజానీకం వ్యవసాయాధారంగానే జీవనం సాగిస్తున్నారు. అతి పెద్ద ఆర్థిక రంగం ఈ ఆహార రంగమే. మన వ్యవసాయం వర్షాధారితం. వర్షాలు సమయానికి, సమతౌల్యంగా పడితేనే రైతులకు ప్రయోజనం. పాడి, పసిడి పంటలు, ధాన్యాగారంతో, సాగుతో సశ్యశ్యామల దేశం శోభాయమానంగా వర్ధిల్లేది. అది ఒకప్పుడు. కానీ, ఇటీవలి కాలంలో పర్యావరణ సమతూకం దెబ్బతిని, వాతావరణ మార్పుల ప్రభావంతో అనేక ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడం, మరికొన్ని ప్రాంతాల్లో అతి ఎక్కువగా పడటం మనం చూస్తున్నాం. లేదంటే కరువు కాటకాలతో అన్నీ రైతులకు ప్రకృతి విపత్తులుగా మారాయి. ఇందులో భాగమే క్లౌడ్ బరస్టులు, అనువర్తనాలు, ఆవర్తనాలు ఆవహించి తుపాన్లు, ఊళ్ళకు ఊళ్ళే నీళ్ళతో నిండిపోవడాలు, మునిగిపోవడాలు, కొట్టుకుపోవడాలు, పంటల నష్టాలు వెరసి తీరని కష్టాలు, నష్టాలు కలిగించే విపరీత వైపరీత్యాలు.
ఈ మధ్య కాలంలో దేశంలో విచిత్ర వాతావరణ పరిస్థితులను మనం చవి చూస్తున్నాం. కాల మాన ప్రాంతాలకు అతీతంగా కాలం కావడం, ఒకే ప్రాంతంలో ఒక చోట కుండపోత, మరోవైపు ఎండిపోతూన్న వాతావరణాలను మనం మన కళ్ళతోనే చూస్తున్నాం. ఈ వర్షాకాలంలో మేఘాలయ, అస్సాం వంటి రాష్ట్రాల్లో వరదల కారణంగా పంటలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరోవైపు వర్షాభావం వల్ల విత్తనాలు మొలకెత్తని దీన స్థితిని చూశాం. మరోవైపు అతివృష్టి వల్ల మొలకలు మురిగి, ఎర్రబారి బతికే అవకాశమే లేకుండా పోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతు నిస్సహాయతను చూసి జాలిపడటం తప్ప చేయగలగింది లేకుండా పోతోంది.
వానలు తగ్గినా, పెరిగినా, ఆ ప్రభావం నేరుగా పంటలపై పడుతుంది. విత్తనాల పెట్టుబడి, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయి. కానీ, నేటికీ రైతులకు తగిన సాగునీరు, విద్యుత్ సదుపాయం, పంటల పెట్టుబడులు, పంట నష్టాలకు బీమా, పండిన పంటలకు ధరలు, మిగిలిన పంటలకు నిలువ గోదాములు లేని దైన్యంలో అన్నదాత ఉన్నాడు. ప్రకృతి వైపరీత్యాలకు ప్రభుత్వాలు ప్రకటించే పంట నష్ట పరిహారాలు ఏ మూలకూ సరిపోవడం లేదు. ప్రాక్టికల్‌గా రైతుకు లభించే పరిహారం నష్టంలో పది శాతం కూడా ఉండదు. పైగా, ప్రభుత్వ అధికారులు అప్పుడప్పుడు పంట నష్టం సర్వేలు చేయడంలో ఆలస్యం చేయడం, తప్పుల తడకగా నివేదికలు, అందీ అందని అత్తెసరు ఆర్థిక సహాయం రైతులకు కనీసం ఉపశమనాన్ని కూడా కలిగించడం లేదు.

భూమికి నీళ్లు పెట్టాలంటే బోర్లు, ఆ బోర్లు నడవాలంటే మోటార్లు, కరెంటు, ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు వంటి వాటన్నింటికీ డబ్బులే కావాలి. వాణిజ్య బ్యాంకులు అప్పు ఇవ్వడానికి కఠిన నిబంధనలు విధిస్తే, రైతులు దారుణంగా నష్టపోయి, చేసేది లేక బ్యాంకులను నమ్మలేక గొర్రె కసాయిని నమ్మనట్లుగా రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఏటేటా దిగుబుడులు తరిగి, అప్పులు పెరిగి, ఆ అప్పులు తీర్చే మార్గం లేక రైతులు కుటుంబాలను వదిలేసి, ప్రాణాలను త్యాగం చేస్తున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇది మన దేశ వ్యవసాయ రంగంలో అత్యంత విషాదకరమైన దుష్టాంతం.

వర్షాలు పడ్డా, పడకపోయినా రైతులకు బిగిలేది ఆందోళనే. కనీస మద్దతు ధర లేదు. పెట్టుబడి రుణాల భారం. మార్కెట్‌లో అమానవీయ వ్యాపారం. తరుగులు, తూనికలు, కొలతల్లో మోసాలు. ఇవన్నీ జరుగుతున్నా, ప్రభుత్వం గానీ, ప్రాథమిక రైతు సహకార సొసైటీలు గానీ రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నాయి. కుటుంబ బాధ్యతలు, పిల్లల భవిష్యత్తు, నిత్యజీవిత అవసరాలు అన్నీ కలిసి రైతులను తీవ్ర ఒత్తిడిలోకి నెడుతున్నాయి. ఆత్మహత్యలకు పురికొల్పుతున్నాయి. ఇలాంటి ఒత్తిడే మన దేశంలో వేలాదిమంది రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణమవుతోంది. రైతుల ఆత్మహత్యలన చదివే మనం, వాటి వెనుక ఉన్న ఆవేదనను, ఆత్మగౌరవాన్ని మనం గమనించటం లేదు.

ప్రభుత్వాల వద్ద రైతు విధానాలే లేకపోవడం, ఉన్నా అవి అత్యంత లోపభూయిష్టమైనవిగా ఉండటం, వాటి అమలులో చిత్త శుద్ధి, నిజానియితీ లోపించడం, ప్రభుత్వాలకు ఆదాయ మార్గాల అన్వేషించే వ్యాపారాల లావాదేవీల మీద ఉన్న ఆలోచన, రైతుల మీద లేకపోడం, వంటి వెన్నో సమస్యలుగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న వ్యవసాయ విధానాలు పెద్దపెద్ద కంపెనీలకు, మార్కెట్లలో వ్యాపారులకు, దళారులకు దోచి పెట్టేవిగా ఉండి, చిన్న రైతుల పట్ల విరోధంగా తయారవుతున్నాయి. మద్దతు ధరలు సమర్థవంతంగా అమలు కావడం లేదు. పంట బీమా పథకాలు ప్రభుత్వ ప్రకటనలకు మాత్రమే పరిమితమైపోతున్నాయి. సకాలంలో మద్దతు ధరలు నిర్ణయించకపోవడం, కొనుగోలు కేంద్రాల లోపాలు, మధ్యవర్తుల దందాలకు బలైపోతున్నారు.
రైతు సమస్యల పరిష్కారం కోసం ‘వికేంద్రీకృత వ్యవసాయ విధానం’ అవసరం. ప్రతి రాష్ట్రం తన ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ విధానాలు రూపొందించాలి. కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను ప్రకటించి, అందించాలి. అంతేకాదు, వానలపై ఆధారపడే వ్యవసాయ విధానాలను తగ్గించాలి. నీటి సమర్థ వినియోగ పద్ధతులు, మైక్రో ఐరిగేషన్ పథకాలు మరింత విస్తరించాలి. రైతులకు వ్యవసాయ విద్య, మార్కెట్ సలహాలు డిజిటల్‌ ప్లాట్‌ఫారాల ద్వారా అందించాలి. వ్యవసాయాధారిత పరిశ్రమలను ప్రోత్సహించాలి.
రైతు బలంగా ఉంటేనే దేశం బలపడుతుంది. వర్షం రైతుకి వరమవ్వాలి కానీ శాపంగా మారకూడదు. అతివృష్టి – అనావృష్టి అనేవి ప్రకృతి నియమాలే అయినా, వాటిని క్రమ పద్ధతిగా మార్చుకునే పర్యావరణ పద్ధతులను మనం అనుసరించాలి. ఒకవేళ అప్పటికీ వైపరీత్యాలు ఎదురైతే, వాటిని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలను పెంపొందించాలి. అలాంటి ధైర్యం, భరోసాని రైతుకి కలిగించాలి. కల్పించాలి. ఆది ప్రభుత్వాల కనీస బాధ్యత.

Latest News

వాడి పడేసిన డబ్బల్ని వాడే ఇకమతు!?|ADUGU TRENDS

ఉపాయం లేనోన్ని ఊల్లెనే ఉండనీయొద్దట! ఉపాయం ఉంటే ఊరేగొచ్చట!! వాడి పడేసే డబ్బాల్ని గిట్ల వాడే ఇకమతు శేస్తున్న గీ అక్క ఉపాయం సూత్తే మీరే పరేషాన్ అయితరు! మనం పండ్లు కొంటే గ...

శాంతి చర్చలు-సజీవంగా ఆశలు!?|EDITORIAL

ప్రపంచంలో యుద్ధోన్మాద ఉద్రిక్తతలు మళ్లీ ముదురుతున్నాయి. పశ్చిమాసియా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికా–ఇరాన్ మధ్య చర్చలు విఫలమవడం, ఇజ్రాయెల్ పాత్ర, చమురు సరఫరాలో ప్రతిష్టంభన, అంతరాయం ప్రపంచాన్ని అస్థిరత వైపు నెడుతున్నాయి. శాంతి...

15-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ త్రయోదశి రాత్రి 08.17 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం పూర్వాభాద్ర మధ్యాహ్నం 01.10 వరకు ఉత్తరాభాద్ర యోగం బ్రహ్మ ఉదయం 11.27 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం 08.41 వరకు ఉపరి...

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

14-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి రాత్రి 09.05 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 01.08 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 01.02 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ ఉదయం 09.15...

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News